హైదరాబాద్: కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎమ్మార్వోపై దాడి అమానుషమని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు అన్నారు. గురువారం హైదరాబాద్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం స్వేచ్ఛగా విధులు నిర్వహించే వాతావరణం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సంఘటనపై ఇప్పటి వరకు సీఎం, డిప్యూటీ సీఎంలు స్పందించకపోవడం దారుణమన్నారు. ఎమ్మార్వో వనజాక్షికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలుపుతోందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ దాడికి కారణమైన ఎమ్మెల్యే సహా బాధ్యలందరిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు... చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.