ములాయం, మాయ, కాంగ్రెస్ ల కొంప ముంచిన యూపీ ఫలితాలు | Mulayam, Mayavathi, Congress in dolldrums in UP | Sakshi
Sakshi News home page

ములాయం, మాయ, కాంగ్రెస్ ల కొంప ముంచిన యూపీ ఫలితాలు

Published Thu, May 22 2014 4:57 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ములాయం, మాయ, కాంగ్రెస్ ల కొంప ముంచిన యూపీ ఫలితాలు - Sakshi

తాజా ఎన్నికల ఫలితాలతో ములాయం, మాయావతిలు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇరు పార్టీలు, వీటితో పాటు కాంగ్రెస్ పూర్తిగా యూపీలో తుడిచిపెట్టుకుపోయాయి. మొత్తం 80 లోకసభ స్థానాల్లో 71 స్థానాలను బిజెపి గెలుచుకుంది.
కులాల ఆధారంగా ఏర్పడ్డ ప్రాంతీయ పార్టీలు ఒక్కసారిగా లెక్కలో లేకుండా పోయాయి. మాయావతి ఆధ్వర్యంలోని బిఎస్ పీకి ఒక్క సీటు కూడా రాలేదు. అంటే ఈ సారి లోకసభలో బిఎస్ పీ సభ్యులు ఒక్కరు కూడా ఉండరు. కాంగ్రెస్ తరఫున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మినహా మరెవరూ గెలవలేదు. అయిదుగురు మంత్రులు సహా మొత్తం 14 మంది సిట్టింగ్ ఎంపీలు మట్టి కరిచారు.

ఇక ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి అయిదు సీట్లు వచ్చాయి. అయితే ఈ అయిదుగురు ములాయం కుటుంబ సభ్యులే. ములాయం రెండు సీట్లనుంచి, ఆయన అల్లుళ్లు అక్షయ్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, కోడలు డింపుల్ యాదవ్ లు మాత్రమే గెలవగలిగారు.

లోకసభ ఎన్నికల ఫలితాల ప్రకారం బిజెపికి 335 అసెంబ్లీ స్థానాలు రావచ్చు. సమాజ్ వాదీ పార్టీ కేవలం 37 సీట్లలో తొలి స్థానంలో ఉంది. ఇక బిఎస్ పీ కేవలం 9 మంది ఎమ్మెల్యేలను గెలుచుకునే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కి 13 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. కుర్మీ కులస్తుల్లో బలంగా ఉన్న అప్నా దళ్ బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ పార్టీ దాదాపు 11 సీట్లు గెలుచుకోవచ్చు.
బిజెపి అన్ని కులాల్లో బలాన్ని పెంచుకుంది. ముఖ్యంగా ఓబీసీలు పార్టీ పైపు భారీ సంఖ్యలో వచ్చారు. బిజెపి తరఫున గెలిచిన వారిలో అయిదుగురు లోధాలు, ఆరుగురు కుర్మీలు, ఇద్దరు గుజ్జర్లు, అయిదుగురు జాట్లు ఉన్నారు. యాదవ ఓట్లలోనూ భారీ ఎత్తున చీలిక వచ్చింది. దీంతో ములాయం పార్టీ మట్టి కరిచింది.

ఇప్పుడు ఫలితాల తరువాత ములాయం సిగ్ పార్టీ యూపీ యూనిట్ ను రద్దు చేశారు.

బీఎస్ పీ కూడా మొత్తం తన పార్టీ రాష్ట్ర స్థాయి యూనిట్టన్నిటినీ రద్దు చేసింది. ఆరుగురు జోనల్ సంయోజకులను కూడా తొలగించింది.
ఎస్ పీ, బీఎస్ పీ, కాంగ్రెస్ లు ఇప్పుడు మోడీ సునామీని రాబోయే రోజుల్లో ఎలా తట్టుకోవాలన్న విషయంపై తర్జన భర్జనలు పడుతున్నాయి. మరో మూడేళ్లలో ఎన్నికలు వస్తూండటంతో దానికి తగిన వ్యూహాలను పదును పెట్టుకునే పనిలో పడ్డాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement