
మచ్చ ఉందని జాబిల్లి దాక్కుందా!
పాట నాతో మాట్లాడుతుందిత
డా॥సుద్దాల అశోక్తేజ, పాటల రచయిత
జీవితంలో అద్భుతమైన మలుపు ఏ నిమిషంలో వస్తుందో తెలియదు. ‘‘తేజా! సితారలో రిపోర్టర్గా ఉన్న నా తండ్రి సినీ గీతరచనా తారగా సినీ సిరా సితారగా మారి సౌందర్యం, సామర్థ్యం కవల జలపాతాలుగా కలబోసుకున్న - అనితర సాధ్య చరిత్ర సింహాసనాధీశ్ - మహేష్బాబు సినిమాకు సోలో గీతరచయితగా ప్రతిష్ఠా విశిష్టుడుగావడం ఎవరైనా ఏ నిమిషంలోనైనా ఊహించామా? అంతెందుకు... నీ పాట మురారి సినిమాలో ‘బంగారుకళ్ల బుచ్చమ్మ’ గీతాన్ని - మీతో ఇంటర్వ్యూ చేసి సితారలో అద్భుతంగా విశ్లేషించినప్పుడైనా మీరు తను కాబోయే గీతరచయిత అని ఊహించావా?’’
సుదీర్ఘమైన ఆమె మాటలను వింటూండగానే... గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ నా తండ్రి’ అందా పాట. మళ్లీ తనే... నేను ‘మనసారా’ చిత్రంలో ‘పర్వాలేదు’ పాటను. సంగీతం శేఖర్ చంద్ర. దర్శకులు రవిబాబు. సన్నివేశం చెప్పారు ‘హీరో - తన అందంపై తనకు చిన్నచూపుతో కథానాయికపై అభిమానాన్ని, అనురాగాన్ని చూపుతాడు. ముఖం చూపకుండా ‘మాస్క్’తో కనిపిస్తుంటాడు. ఒకరోజు ‘ఎందుకిలా’ అంటే, ‘నేను అంత బాగుండను’ అని వాపోతాడు. ‘నువ్వెలా ఉన్న నాకిష్టమే’ అనే భావంతో కథానాయిక అలతి మాటలతో పాడాలి రవీ’’ అని దర్శక రవి చెప్పారు. ఇక మొదలైంది నా తండ్రిలో మేధోమథనం.ఆలోచనా తపస్సులో ఉన్న నా తండ్రితో ‘‘తండ్రీ! పాటకోసం దిగులుపడుతున్నావా?’’ అన్నాను.
‘‘ఫర్లేదు. నువ్వెళ్లు’’ అన్నాడు.
కరెక్ట్... తండ్రీ! ‘‘ఫరవాలేదు. నువ్వెలా ఉన్నా ఫరవాలేదు అని పల్లవి చేయకూడదూ’’ అన్నాను అంతే.
‘‘ఫరవాలేదు. ఫరవాలేదూ
చూడచక్కగున్నా లేకున్నా ఏం ఫరవాలేదు
నువ్వెలా వున్నా పర్లేదూ
ఊరూ పేరు వున్నా లేకున్నా పరవాలేదు
ముఖమే కాదు... నీకు గొప్ప పేరు నీదో ప్రసిద్ధమైన ఊరు గాకున్నా లేకున్నా ఫర్లేదు అనే భావాన్ని అద్భుత సహజ సుందరంగా - అలవోకగా... మాట్లాడినట్టు పల్లవి పూర్తిచేశాడు.
అనుపల్లవిని ఇలా అల్లుకున్నాడు.
పల్లవి ఆధారంగా... అనుసంధానంగా...
‘‘నువ్వు ఎవ్వరైనా పర్లేదు.
నీకు నాకు స్నేహం లేదు. నువ్వంటే కోపం లేదు.
ఎందుకీ దాగుడు మూతలు అర్థం లేదూ
మచ్చేదో ఉన్నదని మబ్బులో జాబిల్లి దాగుండిపోదు.
దర్శకుడు చెప్పినట్టు రాస్తూనే తను ఎక్కడ ఎలా ఫిరంగి లాంటి భావాన్ని సన్నివేశ సొరంగంలో దూర్చాలో తెలిసిన కవితాపద్య యుద్ధ విద్య తెలిసిన పదభావ సైనిక యోధుడు భాస్కరభట్ల కనుకనే...
‘‘మచ్చతనకుందని మబ్బులో దాగుంటుందా జాబిల్లి’’ అనే కొసమెరుపు చేర్చి రసైక శ్రోతలను, ప్రేక్షక రసజ్ఞులను ‘ఔరా’ అనిపించడం సినీకవికి నిత్యకృత్యం దివారాత్రుల వ్యవసాయం... తరువాత తొలిచరణం - ‘మగాడ్ని వర్ణించే జాబితా తీసుకొని - మళ్లీ ఓ కొసమెరుపివ్వు తండ్రీ!’ అన్నాను.
‘‘ఉంగరాల జుట్టే లేదా - నాకు పర్లేదు
రంగు కాస్త తక్కువ అయినా - మరి పర్లేదు’’
రాయగానే రంగు తక్కువ గురించి చెప్పారుగా. పై రెండు లైన్లకు కొసమెరుపుగా ఏ రంగులేని రాతిరి గురించి చెప్పు తండ్రీ! అనగానే,
‘‘మసిలాగా ఉంటుందని తిడతామా రాతిరినీ
తనలోనే కనలేమా మెరిసేటి సొగసులని.
అందంగా లేనూ అని - నిన్నెవరూ చూడరనీ
నువ్వెవ్వరు నచ్చరనీ నీకెవ్వరు చెప్పేరూ
ఎంతమంచి మనసో నీది - దానికన్న గొప్పది లేదూ
అందగాళ్లునాకెవ్వరూ ఇంత నచ్చలేదూ
నల్లగా వున్నానని కొమ్మల్లో దాగుండిపోదూ
అని ముగించాడు.
స్త్రీలు అందం, పర్సనాలిటీ - ఎత్తు కన్నా ప్రేమించే హృదయాన్ని - తన పట్ల గల బాధ్యతను, తనకు ఇవ్వబోయే భద్రతను చూస్తారని తెలియని చాలామంది యువకులకు చిన్న లెస్సన్ కూడా పనిలో పనిగా పూరించాడు భాస్కరభట్ల. ఇంక రెండో చరణాన్ని కొనసాగిస్తూ...
‘‘పోతన పద్యం’’ పడ్మనయనమ్మిలవాడు గుర్తుచేస్తే రివర్స్గా...
అంతలేసి కళ్లుండకున్నా - కోరమీసం లేకున్నా
పరదాలెందుకు అని మది నిన్నడగని సరదా
పడుతుందంటూ ఎవ్వరేం అన్నా సరే నీ
చేయి వదిలేది లేదంటూ పూర్తించాడు
తేజా నా తండ్రి నన్ను’’ అంటూ భాస్కరభట్ల ఐపాడ్లోకెళ్లి కూచుంది.