
‘గురుకుల’ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పులు
షెడ్యూలులో మార్పులు చేసిన టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెయిన్ పరీక్షల తేదీల్లో టీఎస్పీఎస్సీ మార్పులు చేసింది. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీ టీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పరీక్షలు ఈ నెల 29, 30 తేదీల్లో, వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను వచ్చే నెల 18 నుంచి నిర్వహిం చనున్నట్లు ప్రకటించింది. గత నెల 31న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ఫైనల్ కీలను ఇటీవల ప్రకటించి మెయిన్ పరీక్ష తేదీల ను కూడా ప్రకటించింది.
అయితే ఇంత త్వరగా మెయిన్ పరీక్షలకు సిద్ధం కావడం కష్టమని, కొంత గడువు ఇవ్వాలని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు టీఎస్పీఎస్సీకి విజ్ఞప్తి చేశాయి. దీంతో మరో 15 రోజులు గడువు ఇవ్వాలని కమిషన్ నిర్ణయించింది. పీజీటీ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 18, 19 తేదీల్లో, టీజీటీ మెయిన్ పరీక్షలను 20 నుంచి 22 వరకు, పీడీ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 18న నిర్వహిస్తామని ప్రకటించింది. (ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్–1 పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు–2 పరీక్షలు ఉంటాయి. ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు పేపరు–1 ఒకటే ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది).