మూసీ నది కార్యాచరణ ప్రణాళికను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కార్యాచరణ ప్రణాళికను
కోర్టు ముందుంచండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కాలుష్యం బారి నుంచి మూసీ నదిని కాపాడి... దాని నిర్వహణ, సుందరీకరణకు సంబంధించి ఏం చర్యలు తీసుకోబోతున్నారో కార్యాచరణ ప్రణాళికను తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. మూసీని శుభ్రపరిచి, నది నిర్వహణకు సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరహాలో ఓ సంస్థను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపించగా.. వాటర్ బోర్డు, హెచ్ఎండీఏ తరఫున న్యాయవాదులు సుధాకర్రెడ్డి, హెచ్రామారావు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకోర్టు పై విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.