
'కాల్ మనీ - సెక్స్ రాకెట్ పై అసెంబ్లీలో నిలదీస్తాం'
కాల్ మనీ - సెక్స్ రాకెట్ అంశంపై తమ పార్టీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్ధసారథి స్పష్టం చేశారు.
హైదరాబాద్ : కాల్ మనీ - సెక్స్ రాకెట్ అంశంపై తమ పార్టీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్ధసారథి తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో కె.పార్థసారథి విలేకర్లతో మాట్లాడుతూ.... కాల్ మనీతో సంబంధమున్న వారిని ప్రభుత్వ పెద్దలు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాల్ మనీ నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కాల్ మనీ వ్యవహారానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కె. పార్థసారథి స్పష్టం చేశారు.
ప్రభుత్వం ముందుగానే మేల్కొని ఉంటే ఇలాంటివి జరిగేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. కాల్ మనీ వ్యవహారంపై నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు హామీల వల్లే బ్యాంకులు మహిళలకు రుణాలివ్వడం లేదని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు గత్యంతరం లేక డబ్బులు కోసం కాల్ మనీ వంటి సంస్థలను ఆశ్రయిస్తున్నారని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. బాక్సైట్ తవ్వకాలపై గిరిజనుల మనోభావాలను తెలియజేసిన తమ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని గుర్తు చేశారు. ఇదేనా మహిళలు, గిరిజనుల మీద ఉన్న ప్రేమా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.