
ప్రమాదం: ఎస్సై, మహిళా కానిస్టేబుల్ దుర్మరణం
చెట్టుకు కారు ఢీకొన్న ఘటనలో అందులో ప్రయాణిస్తున్న స్పెషల్ బ్రాంచ్ ఎస్సై తో పాటు ఓ మహిళా ట్రైనీ కానిస్టేబుల్ మృతి చెందారు.
► హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఘటన
హైదరాబాద్: చెట్టుకు కారు ఢీకొన్న ఘటనలో అందులో ప్రయాణిస్తున్న స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ఎస్సై తో పాటు ఓ మహిళా ట్రైనీ కానిస్టేబుల్ మృతి చెందారు. మరో మహిళా ట్రైనీ కానిస్టే బుల్కు తీవ్ర గాయాలయ్యాయి. శని వారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి మండలంలోని కాళీ మందిర్లో ఉండే మహ్మద్ ఖలీల్ పాషా వికారాబా ద్లో ఎస్బీ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు.
శని వారం రాత్రి 8 గంటల సమయంలో అప్పాలో శిక్షణ పొందుతున్న మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లు మమత, కీర్తిలను ఖలీల్ తన కారులో ఎక్కించుకున్నారు. హిమాయత్సాగర్ వెళ్లే దారిలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద చెట్టును ఢీకొంది. దీంతో కారు నడుపుతున్న పాషా అక్కడికక్కడే మృతిచెందారు. మమత, కీర్తిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పోలీసులు చికిత్సకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా కీర్తి చికిత్స పొందుతూ మృతి చెందింది. మమత పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.