
క్యాబ్ డ్రైవర్లకు అవార్డులు అందజేస్తున్న మంత్రి ఈటెల రాజేందర్,ఎంపీ జితేందర్రెడ్డి తదితరులు
గచ్చిబౌలి: వెయ్యి మంది నిరుద్యోగులకు క్యాబ్లు ఇప్పిస్తామని, ప్రతి ఒక్కరు వృత్తిని ప్రేమించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ క్యాబ్ డ్రైవర్లకు సూచించారు. గురువారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్లో ఉబెర్ అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెయ్యి మంది చదువుకున్న నిరుద్యోగులకు డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద క్యాబ్లు ఇప్పిస్తామని చెప్పారు. వాహనం కొనుగోలుకు రూ.5 లక్షలు బ్యాంక్ రుణం ఇస్తే 60 శాతం సబ్సిడీ, ఐదు లక్షలకు పైగా లోన్ ఇస్తే 50 శాతం సబ్సిడీ అందిస్తామని వెల్లడించారు. రూ.2 లక్షల లోన్ ఇస్తే 70 శాతం సబ్సిడీ అందజేస్తామని తెలిపారు.
ఉబెర్ క్యాబ్ సహకారంతో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఎంపీ జితేందర్రెడ్డి మాట్లాడుతూ వృత్తిని సామాజిక సేవగా భావించాలని అన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో ఉబెర్ క్యాబ్ ప్రయాణికులకు చేరువగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, బీసీ సంక్షేమ ప్రత్యేక కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ ఉబెర్ క్యాబ్లో పనిచేస్తున్న వారు నెలకు రూ.50 వేల నుంచి లక్షకు పైగా సంపాదిస్తున్నారని తెలిపారు.
డ్రైవర్ కమ్ ఓనర్ స్కీంతో క్యాబ్ డ్రైవర్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. తెలంగాణ జిల్లాలోని చదువుకున్న నిరుద్యోగులకు వెయ్యి మందికి గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల ద్వారా వాహనాలు అందజేస్తామని తెలిపారు. ఉబెర్ క్యాబ్ జనరల్ మేనేజర్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ 2014 జనవరిలో హైదరాబద్లో ఉబెర్ క్యాబ్ ప్రారంభమైందని, రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే ప్రయాణికులకు చెరువయ్యిందని అన్నారు. ఉత్తమ సేవలందించిన 13 మంది డ్రైవర్లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉబెర్క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు.