Employment
-
నిరుద్యోగులకు తీపి కబురు..
రానున్న త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) నియామకాలు బలంగా ఉండనున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే, భారత కంపెనీలు ఈ ఏడాది క్యూ2లో అధిక నియామకాలను చేపట్టే ఉద్దేశంతో ఉన్నట్టు మ్యాన్పవర్ గ్రూప్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ సర్వే’లో తెలిసింది. నికర నియామక ఉద్దేశం (ఎన్ఈవో) 43 శాతానికి చేరింది. అంతర్జాతీయంగా చూస్తే వచ్చే త్రైమాసికానికి ఇది సగటున 18 శాతమే ఉంది. 42 దేశాలకు చెందిన 40,413 కంపెనీల అభిప్రాయాలను ఈ సర్వే కోసం మ్యాన్పవర్ గ్రూప్ పరిగణనలోకి తీసుకుంది. జనవరి 2 నుంచి 31 వరకు సర్వే జరిగింది.సర్వే ఫలితాలు.. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కొత్త నియామకాలు చేపడతామని 55 శాతం కంపెనీలు తెలిపాయి. జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చితే నియామకాలు తగ్గుతాయని 12 శాతం కంపెనీలు చెప్పగా, తమ సిబ్బందిలో ఎలాంటి మార్పులు ఉండవని 29 శాతం కంపెనీలు సంకేతమిచ్చాయి. మరో 4 శాతం కంపెనీలు ఏమీ చెప్పలేమని పేర్కొన్నాయి.ఐటీ రంగంలో 55 శాతం, ఇండ్రస్టియల్ అండ్ మెటీరియల్స్ రంగంలో 48 శాతం, హెల్త్కేర్ అండ్ లైఫ్ సైన్సెస్లో 42 శాతం, రవాణా, లాజిస్టిక్స్, ఆటోమోటివ్లో 40 శాతం, కమ్యూనికేషన్ సర్వీసెస్లో 38 శాతం చొప్పున నియామకాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంతో పోల్చి చూస్తే పెరగనున్నట్టు సర్వే ఫలితాల ఆధారంగా తెలుస్తోంది.ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో 43 శాతం మేర నియామకాలు పెరగనున్నాయి. కానీ, జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చితే ఒక శాతం తక్కువ. ఎనర్జీ అండ్ యుటిలిటీస్లో 32 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో 32 శాతం, చొప్పున నియామకాల ఉద్దేశ్యం కనిపించింది. క్యూ1 కంటే 6 పాయింట్లు, 8 పాయింట్ల మేర తగ్గడం గమనార్హం. దక్షిణాదిన 39 శాతం, ఉత్తరం, తూర్పు భారత్లో 47 శాతం, పశ్చిమాదిలో 47 శాతం మేర అధిక నియామకాలు వచ్చే క్వార్టర్లో చోటుచేసుకోనున్నాయి. సిబ్బందిని పెంచుకోవడానికి కార్యకలాపాల విస్తరణ ప్రధాన కారణంగా ఉంది.ఇదీ చదవండి: స్టార్లింక్కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్.. కాసేపటికే డిలీట్వ్యాపార సంస్థల్లో విశ్వాసం..నియామకాల ఉద్దేశ్యం జనవరి–మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్–జూన్ క్వార్టర్కు బలపడింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనటంలో భారత వ్యాపార సంస్థల విశ్వాసాన్ని ఇది తెలియజేస్తోంది. టెక్నాలజీ, ఇండ్రస్టియల్, ఫైనాన్షియల్ రంగంలో బలమైన నియామకాల ధోరణి కొనసాగుతుంది. – సందీప్ గులాటి, మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా ఎండీ -
హైదరాబాద్ చేరుకున్న సైబర్ కేఫే బందీలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి కోసం విదేశాలకు పోయి, సైబర్ కేఫేలో బందీలుగా చిక్కుకుపోయిన 540 మంది భారతీయులు మంగళవారం ఢిల్లీకి చేరుకోగా, వారిలో బుధవా రం రాత్రి తెలంగాణకు చెందిన 24 మంది బాధితులు హైదరాబాద్కు చేరుకున్నారు. వారికి సంబంధించిన పర్వవేక్షణ బాధ్యతలను ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ఉప్పల్కు అప్పగించారు. వారిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా హైదరాబాద్కు తరలించారు. దీంతో వారి బంధువులు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అయితే అధికారులు రెగ్యులర్ ఎగ్జిట్ నుంచి కాకుండా రహస్య ప్రాంతానికి తరలించి వారి నుంచి వివరాలు, స్టేట్మెంట్ తీసుకున్నట్టు సమాచారం. దీంతో ఆందోళనకు గురైన బంధువులు పోలీసులను ఆశ్రయించగా, బాధితుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పంపిస్తామని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు తెలంగాణకు చేరుకున్న 24 మంది బాధితుల గురించి కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ ఆరా తీసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి శ్రీధర్బాబు కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల పేరిట అక్రమ రవాణా చేయడానికి కారణమైన వారిని గుర్తించడానికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, విచారణ అనంతరం మధుకర్రెడ్డిని కుటుంబసభ్యులకు అప్పగించారు.జగిత్యాలలో వెలుగుచూసిన మరో మోసం సైబర్ కేఫేలో చిక్కుకొని బయటపడిన వ్యక్తి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదైంది. జగిత్యాల జిల్లా ఎర్దండి గ్రామానికి చెందిన దేశెట్టి రాకేశ్ విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు మల్లికార్జున మ్యాన్పవర్ కన్సల్టెన్సీని సంప్రదించాడు. నిర్వాహకుడు ఆల్లెపు వెంకటేశ్కు ఫోన్పే, నగదు రూపంలో 2022లో రూ.3.50 లక్షలు అప్పజెప్పాడు. 2023 ఆగస్టులో రాకేశ్ను ఆర్మీనియాకు పంపించాడు. కానీ అక్కడ జాబ్ చూపించకపోవడంతో ఇబ్బందులు పడి, అతి కష్టం మీద నవంబర్ 2023లో స్వదేశానికి చేరుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని వెంకటేశ్ను అడగ్గా 2025 జనవరి 12న రాకేశ్ను థాయిలాండ్కు పంపించాడు. అక్కడ వెంకటేశ్కు సంబంధించిన వ్యక్తులు ఒక సైబర్ క్రైమ్ చేసే ముఠాకు అప్పజెప్పారు. ఇతరుల సహాయంతో ఇండియన్ ఎంబసీనీ సంప్రదించి స్వదేశానికి రాకేశ్ తిరిగి వచ్చాడు. తనను మోసం చేసిన కన్సల్టెన్సీ నిర్వహకుడు ఆల్లెపు వెంకటేశ్పై జగిత్యాలటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసుదర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ చెప్పారు. -
స్వయం ఉపాధికి రూ.6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాన్ని అమల్లోకి తేనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాజీవ్ యువ వికాసం పేరుతో అమలు చేయనున్న ఈ పథకం కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. మంగళవారం కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులను పట్టించుకోలేదని, ఆయా వర్గాల కోసం పెట్టిన ఆర్థిక కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం కొత్త పథకాన్ని తెస్తున్నామని చెప్పారు. ఈ పథకం కింద ఆయా వర్గాలకు చెందిన యువకులకు వ్యక్తిగతంగా రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేస్తామని, ఆ రోజు నుంచే ఆన్లైన్లో రాజీవ్ యువ వికాసం పథకం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వచ్చే నెల 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు ఈ దరఖాస్తులను పరిశీలించి, జిల్లాల కలెక్టర్లు అర్హులను ఎంపిక చేస్తారని వివరించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నిరుద్యోగులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తామని, ఇతర వర్గాలకు కూడా భవిష్యత్తులో అమలు చేసే ఆలోచన ఉందని భట్టి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే నిరుద్యోగులకు బ్యాంకు లింకేజీతో రుణం ఇప్పిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమానంగా ప్రయోజనం చేకూరుస్తామన్నారు. ఐలమ్మ వర్సిటీకి రూ.540 కోట్లు వీర వనిత చాకలి ఐలమ్మ పేరిట ఏర్పాటు చేసిన మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.540 కోట్లు కేటాయించామని, దేశంలోనే ఉత్తమ వర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. ఈ వర్సిటీ ప్రాంగణంలో ఉన్న చారిత్రక కట్టడాలను పునరుద్ధరించేందుకు మాస్టర్ప్లాన్ రూపొందించినట్టు చెప్పారు. వర్సిటీ ప్రధాన ద్వారం మూసీ నదిని ఆనుకుని ఉందని, మూసీ పునరుజ్జీవం తర్వాత ఈ ప్రధాన గేటును తిరిగి ప్రారంభిస్తామన్నారు. వారసత్వ కట్టడాల పునరుద్ధరణ పనుల ప్రారంభానికి తక్షణమే రూ.15.5 కోట్లు, నూతన భవనాల నిర్మాణానికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్టు భట్టి వెల్లడించారు. అనంతరం వర్సిటీ ప్రాంగణంలోని చారిత్రక కట్టడాలను వర్సిటీ వీసీ సూర్య ధనుంజయతో కలిసి భట్టి పరిశీలించారు. భట్టి వెంట ఎంపీ పోరిక బలరాం నాయక్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ హరీశ్ తదితరులు ఉన్నారు. -
తాత్కాలిక ఉద్యోగాలపై పెరుగుతున్న ఆసక్తి
ఫ్లెక్సీ వర్క్ఫోర్స్ (తాత్కాలిక, కాంట్రాక్ట్ ఆధారిత, నిర్ణీత పనివేళలు లేని... ఉద్యోగశ్రేణి) వృద్ధికి ఫార్మల్ స్టాఫింగ్ కంపెనీలు మార్గం సుగమం చేస్తున్నాయి. రెగ్యులర్ ఉద్యోగేతర.. తాత్కాలిక ఉద్యోగాల స్థితిగతుల గురించి ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) వారి ఫ్లెక్సీ ఎంప్లాయ్మెంట్ సోషల్ ఇంపాక్ట్ రిపోర్ట్ 2024 వెల్లడించింది.నివేదిక ప్రకారం ఫ్లెక్సీ ఎంప్లాయ్మెంట్ అనేది మహిళలు, యువత తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులతో సహా విభిన్న సమూహాలకు సాధికారత కల్పిస్తోంది. అదే సమయంలో శాశ్వత ఉద్యోగ అవకాశాలకు స్పష్టమైన మార్గాలను అందిస్తుంది.. దాదాపు 23% తాత్కాలిక కార్మికులు ఫార్మల్ స్టాఫింగ్ ఇండస్ట్రీ ద్వారా శాశ్వత ఉద్యోగాలకు మళ్లారు.ఫ్లెక్సీ వర్కర్లలో 79% మంది మూడు నెలల పాటు అసైన్మెంట్లలో ఉన్నారని, 6–12 నెలలు పొడిగించిన కాంట్రాక్టులలో సంవత్సరానికి 40% పెరుగుదల ఉందని నివేదిక వెల్లడించింది. ఈ మార్పు అనువైన ఉపాధిలో ఎక్కువ స్థిరత్వాన్ని సూచిస్తుంది, ఎందుకంటే ఎక్కువ మంది కార్మికులు దీర్ఘకాలిక అసైన్మెంట్లను పొందుతారు.అదనంగా, ఫ్లెక్సీ వర్క్ఫోర్స్లో 78% మంది ఆరు నెలలకు మించి కాంట్రాక్ట్లలో పాల్గొంటున్నారు. ఇది ఫ్లెక్సీ పనుల దీర్ఘకాలిక ప్రయోజనాలపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తుందని నివేదిక తెలిపింది. 60% తాత్కాలిక కార్మికులు సామాజిక భద్రత, సకాలంలో వేతనాలు, వైద్య కవరేజీ వంటి ప్రయోజనాల ద్వారా ఆకర్షితులవుతారని తేల్చింది. ఈ కార్మికులలో 78% మంది తమ ఉద్యోగ పరిస్థితుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. -
ఉద్యోగానికి ‘ఇంటర్న్’ బాట
సాక్షి, ఎడ్యుకేషన్: దేశంలోని యువతకు ఉద్యోగ సాధన కోసం అవసరమయ్యే క్షేత్రస్థాయి నైపుణ్యాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అమల్లోకి తెచ్చిన ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ (పీఎంఐఎస్)కు ఆదరణ లభిస్తోంది. పదో తరగతి, ఇంటర్మిడియెట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అవకాశం కల్పించడంతోపాటు నెలకు రూ.5 వేలు చొప్పున స్టైపెండ్ కూడా అందించడం ఈ పథకం ప్రత్యేకత. ఏడాది పాటు ఉండే ఈ ఇంటర్న్షిప్ను పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లోనూ పూర్తి చేసే అవకాశం ఉండటం గమనార్హం. దీనివల్ల తగిన నైపుణ్యాలు సమకూరి, మంచి ఉద్యోగంలో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది.28,141 మందికి శిక్షణ కేంద్రం గతేడాది బడ్జెట్లో ఆమోదం లభించి, అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ తొలి దశలో 28,141 మందికి ఇంటర్న్షిప్ అవకాశాలు లభించాయి. ఈ స్కీమ్ కింద దేశంలో ఏటా 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా భాగస్వామ్య సంస్థల నుంచి 1.27 లక్షల ఆఫర్లు వచ్చాయి. వాటి కోసం 6.21 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 82,077 మందిని కంపెనీలు ఎంపిక చేసుకుని ఇంటర్న్షిప్ ఆఫర్ చేశాయి. అయితే 28,141 మంది మాత్రమే ఆఫర్లను తీసుకుని ఆయా సంస్థల్లో శిక్షణకు హాజరయ్యారు.24 రంగాల సంస్థల్లో అవకాశాలుపీఎం ఇంటర్న్షిప్ స్కీమ్లో భాగంగా 24 రంగాలకు చెందిన సంస్థలు అభ్యర్థులకు ఇంటర్న్షిప్ను అందిస్తున్నాయి. బీఎఫ్ఎస్ఐ, హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, ఎఫ్ఎంసీజీ, మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలతోపాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంకింగ్ రంగ సంస్థలు, పలు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉండటం గమనార్హం.ట్రెయినీలకు స్టైఫండ్ కూడా.. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కింద ఎంపికై వివిధ సంస్థల్లో చేరినవారికి కేంద్ర ప్రభుత్వం స్టైఫండ్ ఇస్తుంది. తొలి దశలో 28,141 మంది ఇంటర్న్ ట్రైనీల బ్యాంకు ఖాతాల్లో వన్ టైమ్ గ్రాంట్ కింద రూ.4.38 కోట్లు, 2024 డిసెంబర్ వరకు రూ.1.3 కోట్ల స్టైఫండ్ను జమ చేసినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రకటించింది.పీఎంఐఎస్కు అర్హతలివీ.. పీఎం ఇంటర్న్షిప్ పథకం కోసం దరఖాస్తు చేసుకునేవారు 21 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి. వారి కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి. ఎలాంటి ఉద్యోగం లేని యువతకు వారి విద్యార్హతలకు తగినట్టుగా ఏడాది పాటు ఆన్ జాబ్ ఆన్ ట్రైనింగ్/ఇంటర్న్షిప్ కల్పిస్తారు. ఐదేళ్ల వ్యవధిలో కోటి మంది యువతకు దేశంలోని టాప్–500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్న్షిప్కు ఎంపికైనవారికి నెలకు రూ.5 వేలు స్టైపెండ్ ఇస్తారు. ఇందులో రూ.4.5 వేలను కేంద్ర ప్రభుత్వం, మరో రూ.500ను ఆయా సంస్థలు సీఎస్ఆర్ కింద భరిస్తాయి.విస్తృతం చేయాలి.. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ను టాప్–500 సంస్థలకేకాకుండా ఇతర సంస్థలకు కూడా విస్తరింపజేయాలి. దీనివల్ల ఔ త్సాహికులు తమ సమీప ప్రాంతాల్లోని సంస్థల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం మెరుగవుతుంది. సుదూర ప్రాంతాల్లోని సంస్థల్లో ఇంటర్న్ ట్రైనీగా అవకాశం లభించినా.. నివాస ఖర్చులు, ఇతర కోణాల్లో ఆసక్తి చూపని పరిస్థితి ఉంది. మరోవైపు విద్యార్థులు కూడా వ్యక్తిగత హద్దులు ఏర్పరచుకుని మెలగడం కూడా సరికాదని, అవకాశమున్న చోటికి వెళ్లాలని గుర్తించాలి. – టి.మురళీధరన్, టీఎంఐ నెట్వర్క్ చైర్మన్ఏపీలో 4,973, తెలంగాణలో 7,913 మందికి చాన్స్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న ఈ స్కీమ్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 4,973 మందికి, తెలంగాణలో 7,913 మందికి ఇంటర్న్షిప్ ఆఫర్లు వచ్చాయి. మొత్తంగా తమిళనాడుకు చెందినవారికి అత్యధికంగా 14,585 మందికి ఇంటర్న్షిప్ ఆఫర్ లభించింది. మహరాష్ట్ర (13,664 ఆఫర్లు), గుజరాత్ (11,690 ఆఫర్లు), కర్ణాటక (10,022 ఆఫర్లు), ఉత్తరప్రదేశ్ (9,027) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 1,27,508 ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్న కంపెనీలు.. 82,077 మందిని ఇంటర్న్షిప్ కోసం ఎంపిక చేశాయి.రెండో దశకు దరఖాస్తులు షురూ..⇒ పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ రెండో దశ దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో 1,26,557 అవకాశాలు అందుబాటులో ఉంచారు. వీటిలో ఆంధ్రపదేశ్కు 4,715; తెలంగాణకు 5,357 కేటాయించారు. అభ్యర్థులు https://pminternship.mca.gov.in/login/ వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తమ అర్హతలు, ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలి.⇒ఈ స్కీమ్లో అర్హతల వారీగా అవకాశాల సంఖ్యను సైతం పేర్కొన్నారు. డిగ్రీ పూర్తిచేసిన వారికి 36,901, టెన్త్ చదివిన వారికి 24,696, ఐటీఐ ఉత్తీర్ణులకు 23,269, డిప్లొమా ఉత్తీర్ణులకు 18,589; ఇంటర్మిడియెట్ / 12వ తరగతి ఉత్తీర్ణులకు 15,412 అవకాశాలను అందుబాటులో పెట్టారు. రెండో దశలో అభ్యర్థులకు ఇవి అందుబాటులో ఉంటాయి. -
తొలి మహిళా పెట్రోల్ బంక్: 'స్త్రీశక్తి... ఇంధనమై'..
‘పెట్రోల్ బంక్లో మహిళలు ఉద్యోగం చేయగలరా!’ అనే పురుషాధిపత్య అనుమానాన్ని పటాపంచలు చేస్తూ... ‘బ్రహ్మాండంగా చేయగలరు’ అని నిరూపించారు మహిళలు.ఇప్పుడు ఆ దారిలో మరో ముందడుగు... తొలి మహిళా పెట్రోల్ బంక్. ఇద్దరు కలెక్టర్ల చొరవ, కృషితో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో తొలిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు అయింది...నారాయణపేట జిల్లాలో మహిళాసమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయించాలనే ఆలోచన గత కలెక్టర్ కోయ శ్రీహర్షకు వచ్చింది. ‘మీరు ముందుకు వస్తే పెట్రోల్ బంకును ఏర్పాటు చేయిస్తాను’ అని హామీ ఇచ్చారాయన. దీంతో మహిళా సమాఖ్య సభ్యులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. డీఆర్డీఏ కార్యాలయానికి అనుకొని ఉన్న ఆరు గుంటల ప్రభుత్వ భూమిని డీఆర్డీఏ, జడ్ఎంఎస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి బీపీసీఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కలెక్టర్ బదిలీపై వెళ్లడంతో ‘అయ్యో!’ అనుకున్నారు. పెట్రోల్ బంక్ కల సాధ్యం కాదు అనుకున్నారు.అయితే ప్రస్తుత కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఫైల్ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రంలోనే తొలి మహిళ పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. 35 వేల లీటర్ల (పెట్రోల్, డిజిల్) నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంకు 24 గంటలు పనిచేస్తుంది. బంకు నిర్వహణ ద్వారా వచ్చే కమిషన్ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెలా రూ.10 వేలు బీపీసీఎల్ మహిళా సమాఖ్యకు అందిస్తుంది. బంకు నిర్వహణ ద్వారా 10 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభించనుంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చిన ఒకాయన ఇలా అన్నాడు.... ‘ఎంతైనా ఆడవాళ్ల ఓపికే వేరు’ పెట్రోల్ బంక్ను విజయపథంలో నడిపించడంలో ఆ ఓపిక, ఉత్సాహం, శక్తిసామర్థ్యాలు వారికి ఇంధనంగా మారాయి.కలలో కూడా ఊహించలేదునారాయణపేటలో మహిళ సంఘం ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకుంటామని కలలో కూడా ఊహించలేదు. ఇది అయ్యే పని కాదనుకున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహంతో బంకు ఏర్పాటు కావడం, అందులో సేల్స్ ఎగ్జిక్యూటిగా ఉద్యోగంలో చేరడం సంతోషంగా ఉంది. నెలకు రూ.11 వేల జీతం వస్తుంది. కుటుంబానికి ఎంతో అండగా ఉండేందుకు తోడ్పడుతుంది.– జగదీశ్వరి, సెల్స్ ఉమన్ , జడ్.ఎం.ఎస్. పెట్రోల్ బంకు మరింత మందికి ఉపాధినారాయణపేట జడ్ఎంఎస్ అధ్యక్షురాలిగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నా. జడ్ఎంఎస్కు వరి కొనుగోలు కేంద్రాల ద్వారా, స్త్రీనిధి కింద వచ్చే ఆదాయంతో నెట్టుకొచ్చేవాళ్లం. పెట్రోల్ బంక్ రూపంలో అదనపు ఆదాయం రావడంతో మరింత మంది ఉపాధి అవకాశాలకు వీలైంది.– చంద్రకళ, పెట్రోల్ బంకు మేనేజర్– కలాల్ ఆనంద్ కుమార్ గౌడ్, సాక్షి, నారాయణపేట -
సొంత గ్రూపులకే ఉపాధి
-
140 మంది భారతీయులను విడిపిస్తాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి పేరుతో బ్యాంకాక్ వెళ్లి అక్రమంగా మయన్మార్లో చిక్కుకుపోయిన 140 మంది భారతీయ యువకుల కుటుంబాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో విదేశాంగశాఖ స్పందించింది. బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్రమంగా సైబర్ కేఫ్ల నిర్వహణ, అక్కడ యువకులను నిర్బంధించడం, హింసించడం వంటి ప్రతికూల చర్యలతో మయన్మార్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. మాయ్ సాట్ ద్వారా ఇండియాకు.. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లతో మయన్మార్ అధికారు లు భారత దౌత్య కార్యాలయానికి సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈలోపు బాధితులను ఇండియాకు పంపించేందుకు దౌత్య కార్యాలయం కూడా రోడ్మ్యాప్ రూపొందించుకునే పనిలో ఉంది. వాస్తవానికి వీరిని బ్యాంకాక్ నుంచి దాదాపు 505 కి.మీ.ల దూరంలో ఉన్న మయన్మార్లోని మైవాడీ జిల్లాకు బలవంతంగా తరలించారు. తిరిగి వీరిని బ్యాంకాక్ కాకుండా.. మైవాడీలోని మోయే నది దాటి కేవలం 11 కి.మీ.ల దూరంలో ఉన్న థాయ్లాండ్లోని మాయ్సాట్ ప్రావిన్స్ ద్వారా ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం భారత యువకులంతా మైవాడీలోని కేకే2 పార్క్లో బందీలుగా ఉన్నారు.‘సాక్షి’కి మెయిల్మయన్మార్లోని మైవాడీ జిల్లాలో భారతీయ యువకులు చిక్కుకున్న విషయమై ‘సాక్షి’దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ విషయమై సాక్షి మయన్మార్ రాజధాని యంగాన్లోని దౌత్య కార్యాలయాన్ని సంప్రదించింది. బాధితుల పాస్పోర్టులు పంపి వారిని కాపాడాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన దౌత్య కార్యాలయం కాన్సులర్ ఆర్సీ యాదవ్ బందీల విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని మంగళవారం ‘సాక్షి’కి మెయిల్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు స్థానిక అధికారులతో చర్చలు మొదలుపెట్టామని తెలిపారు. -
పీఎమ్ఈజీపీ రుణాలు..: పెన్నుల నుంచి పాలిమర్స్ దాకా...
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ పీఎమ్ఈజీపీ... ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్.పీఎమ్ఈజీపీ... ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. 2008లో మొదలైన ఈ పథకం గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువత, మహిళలకు ఉపాధి కల్పించి వారి ప్రగతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎమ్ఎస్ఎమ్ఈ (MSME) పర్యవేక్షణలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ కేవీఐసీ ద్వారా ఇది అమలవుతోంది. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు రుణసౌకర్యం అందుతోంది. అభ్యర్థులు పది శాతం పెట్టుబడి పెట్టుకుంటే బ్యాంకుల ద్వారా 90 శాతం రుణ సహాయాన్ని పొందవచ్చు. అయితే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ ఆర్మీ సిబ్బంది మాత్రం అయిదు శాతం పెట్టుబడి పెట్టుకుంటే బ్యాంకులు 95 రుణాన్ని అందిస్తాయి. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ఫిజికల్లీ చాలెంజ్డ్, ట్రాన్స్జెండర్స్, గ్రామీణ ప్రాంతం వారికి 35 శాతం రాయితీ కూడా లభిస్తుంది. జనరల్ కేటగిరీలోని వారికేమో పట్టణాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతంలో 25 శాతం సబ్సిడీ కేటాయించారు. ఇలా దరఖాస్తు చేసుకోవాలి... ముందుగా అభ్యర్థులు పీఎమ్ఈజీపీ పోర్టల్లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. అందులో వివరాలను స్పష్టంగా, పూర్తిగా నింపాలి. తర్వాత దాన్ని గ్రామీణప్రాంతాలవారైతే కేవీఐసీకి, పట్టణ ప్రాంతం వారైతే డీఐసీకి అప్లోడ్ చేయాలి. దరఖాస్తు చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో అధికారుల నుంచి స్పందన ఉంటుంది. అధికారుల తనిఖీ అనంతరం వారి సూచన మేరకు.. కేంద్రప్రభుత్వ సంస్థలు ఇస్తున్న ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ శిక్షణ తీసుకోవాలి. ఆ శిక్షణకు సంబంధించిన పరీక్ష కూడా పాసై, సర్టిఫికెట్ పొందాలి. అర్హతలు... 18 ఏళ్లు నిండి, కనీసం ఎనిమిదవ తరగతి పాసై ఉండాలి. స్వయం సహాయక బృందాలు కూడా అర్హులే! ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కావాల్సిన పత్రాలు... 1. వ్యాపారానికి సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్, 2. పాస్పోర్ట్ సైజ్ ఫొటో సహా వివరాలు నమోదు చేసిన అప్లికేషన్ ఫామ్, 3. ఐడీ, అడ్రస్ ప్రూఫ్, ఆధార్, పాన్ కార్డ్, 4. శిక్షణ పొందిన ఆంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ప్రోగ్రామ్ సర్టిఫికెట్. 5. ఎక్స్పీరియెన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్. వ్యాపారాలు... పేపర్ నాప్కిన్స్, పేపర్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్.. అనుబంధ ఉత్పత్తులు, నాన్ ఓవెన్ బ్యాగ్స్, పెన్నుల తయారీ, షాంపూ, డిటర్జెంట్లు, ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ తయారీ, ΄్యాక్డ్ వాటర్, ఎల్ఈడీ లైట్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు వంటి ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ పరికరాలు, రసాయన పాలిమర్లు, టెక్స్టైల్స్, ఫారెస్ట్ ఇండస్ట్రీ వంటివాటికీ ఈ పథకం కింద రుణాలు పొందవచ్చు. గ్రామీణప్రాంతాల్లో వ్యవసాయాధారిత, పాడి, వర్తక విభాగాల్లోనూ దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. 2022– 2025 మధ్య కాలంలో ఈ పథకానికి 13,554.42 కోట్ల రూపాయలను కేటాయించారు.– బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ : ownership.sakshi@gmail.comనిర్వహణ : సరస్వతి రమ -
ప్రకృతి పంట.. ఆదాయం ఇంట
గూడూరు: రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు అటవీ ప్రాంతాల్లో లభించే తునికాకును ప్రకృతి సంపద (పంట)గా భావిస్తారు. ప్రతీ వేసవిలో రెండు నెలల పాటు తునికాకే వారికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరు. ఏటా ఆదివాసీలు ఏప్రిల్లో తునికాకు సేకరణ ప్రారంభిస్తారు. అయితే ఎక్కువగా మే నెలలో సేకరించడం పూర్తి చేస్తారు. తద్వారా రెండు నెలల పాటు ఆదాయం సమకూరుతుంది. విరివిగా లభ్యం.. మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తునికాకు విరివిగా లభిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల గిరిజన కుటుంబాలు ఎండాకాలం రాగానే తునికాకు సేకరణలో నిమగ్నమవుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మహబూబాబాద్, గూడూరు అటవీశాఖ డివిజన్తో పాటు ములుగు, ఏటూరునాగారం, భద్రాద్రి కొత్తగూడెం, గుండాల, బయ్యారం మండలాల్లో ఏప్రిల్, మేలలో తునికాకు సేకరణ జోరందుకుంటుంది. ఒక్కో సంవత్సరం తునికాకు సేకరణ ఎక్కువగా జరిగి ప్రభుత్వ సూచన ప్రకారం ఫారెస్టు అధికారులు ప్రతీ డివిజన్లో టార్గెట్ ఎక్కువగా పెట్టుకుంటున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు వేసవిలో తునికాకు సేకరణను ఉపాధి మార్గంగా ఎంచుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏటా కూలీల ద్వారా ఆకు సేకరించి కట్టలను కొనుగోలు చేస్తోంది. గతేడాది 50 ఆకుల తునికాకు కట్టకు రూ.3 చెల్లించారు. ఈ సంవత్సరం కట్ట ధర పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలి కోడి కూతతో అడవికి పయనం.. తునికాకు సేకరణకు గిరిజనులు తొలికోడి కూతతో మేల్కొని వంటలు చేసుకుంటారు. అంబలి, గంజి తీసుకొని అడవులకు పయనమవుతారు. అడవిలో చెట్టు చెట్టుకు తిరిగి తునికాకు కోసి బస్తాల్లో నింపుకుని ఎత్తుకొస్తారు. కొందరు బస్తాల్లో తీసుకొచ్చిన ఆకులను ఇంటి వద్ద కట్టలు కట్టగా, మరికొందరు అడవిలోనే చెట్ల కింద కూర్చొని 50 ఆకుల చొప్పున కట్ట కడతారు. సాయంత్రం ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన కల్లాల వద్ద వాటిని విక్రయిస్తారు. ప్రతీరోజు ఒక్కో కూలీ రూ.450 నుంచి రూ.500 వరకు సంపాదిస్తారు. గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో.. మహబూబాబాద్ జిల్లా గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో మట్టెవాడ, కొంగరగిద్ద, గోపాలపురం గ్రామాలతో పాటు మరికొన్ని చోట్ల దాదాపు 10 కల్లాలను ఏర్పాటు చేస్తారు. గతేడాది గూడూరు రేంజ్ పరిధిలో 2 వేల స్టాండర్ట్ బ్యాగులు (20 లక్షల) తునికాకు కట్టల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆన్లైన్లో చెల్లింపులు.. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తునికాకు సేకరణపై నిఘా పెడతాం. ఆకుల కట్టలు విక్రయించిన కూలీలకు ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేసి డబ్బులు చెల్లిస్తాం. ఆకులు సేకరించే వారి నుంచి ఆధార్ కార్డు, ఫొటో, బ్యాంకు ఖాతా జిరాక్స్లను సేకరిస్తాం. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో ఆకు సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – బత్తుల విశాల్, డీఎఫ్ఓ, మహబూబాబాద్ రెండు నెలలు ఉపాధి వేసవిలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న మాకు తునికాకు సేకరణ ఉపాధినిస్తుంది. రెండు నెలల పాటు పని దొరుకుతుంది. ప్రతీరోజు తెల్లవారు జామునే అడవికి వెళ్తాం. బస్తాల నిండా ఆకు సేకరించి, ఎండ ముదరకముందే ఇంటికి చేరుకుంటాం. మధ్యాహ్నం కుటుంబం అంతా కలిసి కూర్చొని 50 ఆకులతో కట్టలు కడుతాం. సాయంత్రం కల్లం వద్దకు తీసుకెళ్లి విక్రయిస్తాం. – మేడ సమ్మయ్య, మట్టెవాడ, గూడూరు తునికాకు ఉపాధి కల్పిపస్తుంది మండుటెండా కాలంలో కూలీ పనులు దొరకవు. దీంతో ప్రతీ సంవత్సరం తునికాకు సేకరణ ఉపాధినిస్తుంది. రోజు పొద్దున్నే అడవికి వెళ్లి ఆకు కోసుకొస్తాం. మధ్యాహ్నం కట్టలు కట్టి కల్లంలో అమ్ముతాం. రోజు రూ.450 నుంచి రూ.500 వరకు డబ్బులు వస్తాయి. – ప్రవళిక, మర్రిమిట్ట, గూడూరు వృద్ధులకు సైతం ఆదాయం తునికాకు సేకరణతో విద్యార్థులు, వృద్ధులకు డబ్బులు వస్తాయి. విద్యార్థులు బడులు మొదలయ్యే ముందు కొత్త దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు కొనేందుకు వాడుకుంటారు. వృద్ధులు తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు. – రమ్య, మర్రిమిట్ట, గూడూరు -
ఉపాధికి హామీ పెరగాలి
సాక్షి, హైదరాబాద్: కొత్త బడ్జెట్పై రాష్ట్రంలోని ‘ఉపాధి’కూలీలు కోటి ఆశలు పెట్టుకున్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి కల్పించేందుకు అమలుచేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) వచ్చే బడ్జెట్లో నిధులు భారీగా పెంచాలని కోరుతున్నారు. వ్యవసాయ పనులు లేని కాలంలో కూలీలను ఆదుకుంటున్న ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మరింత ప్రధాన్యం ఇవ్వాలని మేధావులు, ప్రజాసంఘాల నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి దూరంగా నిధుల కేటాయింపు దేశంలోని కోట్ల మంది పేద కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపు జరగటంలేదనే అభిప్రాయాలున్నాయి. దేశంలోని అర్హులైన కూలీలందరికి (యాక్టివ్ హౌస్హోల్డ్స్) పథకంలో పొందుపరిచినట్లుగా ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు ఉపాధి కల్పించాలంటే దాదాపు రూ.3 లక్షల కోట్లు అవసరమని అంచనా. కానీ, కేంద్రం 2024–25 వార్షిక బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.86,000 కోట్లు మాత్రమే. 2023–24లో మరీ తక్కువగా రూ.60 కోట్లే కేటాయించింది. తర్వాత దానిని రూ.86 వేల కోట్లకు సవరించింది. అయితే, ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అయిన మొత్తం వ్యయం రూ.1,05,000 కోట్లుగా తేలింది. బడ్జెట్ కేటాయింపులు తగ్గటంతో ఈ పథకం అమలు పలు రాష్ట్రాల్లో తీవ్రంగా ప్రభావితమైంది. కూలీలందరికి నిర్దేశిత 100 రోజుల పని కల్పించటం సాధ్యం కాలేదు. అయితే తెలంగాణలో మాత్రం లక్ష్యానికి మించి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే దాదాపు రెండుకోట్ల పనిదినాలు అదనంగా చేశారు. ఈ అధిక డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని వచ్చే బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు పెంచాలని కోరుతున్నారు.నిధులు డబుల్ చేయాలి ఉపాధి పథకంలో రాష్ట్రానికి కేంద్రం రూ.4,416 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ మొత్తం ఇక్కడున్న పని డిమాండ్కు ఏమాత్రం సరిపోదు. చురుకుగా పనిచేస్తున్న కూలీలందరికీ పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించాలంటే రూ.9,800 కోట్లు అవసరం. జాతీయ స్థాయిలోని యాక్టివ్ హౌస్ హోల్డ్స్కు పూర్తిస్థాయిలో పని కల్పించాలంటే బడ్జెట్లో రూ.3 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. అందువల్ల 2025–26 కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి భారీగా కేటాయించాలి. తెలంగాణకు నిధులు రెండింతలు చేయాలి. – చక్రధర్ బుద్దా, డైరెక్టర్, లిబ్టెక్ ఇండియా.పని ప్రదేశంలో వసతులు కల్పించాలిఉపాధి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్గా పనులు కల్పించాలి. పనికి దరఖాస్తులు తీసుకోవాలి. కూలీల సంఖ్యకు తగ్గట్టుగా షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ క్రియేట్ చేయాలి. పని వద్ద హక్కుగా నీరు, నీడ, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలి. పనిముట్లు పంపిణీ చేయాలి. వేసవి అలవెన్సు, తాగునీటి చార్జీలను గతంలో మాదిరిగా చెల్లించాలి. ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను మళ్లీ నియమించాలి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖæ మంత్రి ప్రతి నెలా ఈ పథకం అమలు తీరును సమీక్షించాలి. – పి.శంకర్, దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి. -
జీవనోపాధిలో దక్షిణాది మహిళలు అద్భుతః!
సాక్షి, విశాఖపట్నం: జీవనోపాధి రంగంలో దక్షిణాది మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మొదటి 25 నగరాల్లో 16 దక్షిణాదికి చెందినవే ఉండటం విశేషం. అవతార్ అనే ప్రముఖ ఎన్జీవో ఏటా విడుదల చేసే ‘టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా (టీసీడబ్ల్యూఐ)’ సర్వేలో 47.15 శాతం మంది మహిళలు జీవనోపాధి పొందుతున్న బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా.. విశాఖపట్నం 25వ స్థానంలో కొనసాగుతోంది. చీకట్లను చీల్చుకుని.. పితృస్వామ్య భావజాల బంధన వలయాల్ని చీల్చుకుంటూ మహిళలు మరీ ముఖ్యంగా దక్షిణాది మహిళలు ముందడుగు వేస్తున్నారు. భవిష్యత్పై కోటి ఆశల కలల్ని నిజం చేసుకోవాలన్న తపనతో ఉన్నత లక్ష్యాల్ని నిర్దేశించుకుంటూ సరికొత్త ప్రపంచం వైపు పరుగులు తీస్తున్నారు. ఆంక్షల సంకెళ్లు దాటి.. ఆర్థిక పురోభివృద్ధి దిశగా పయనిస్తున్నారు. ఓ వైపు భారతావనికి సేవచేసే బాధ్యతాయుత పదవుల్లోనూ అతివల ప్రాతినిధ్యం పెరుగుతున్న తరుణంలో.. తమ జీవన ప్రమాణాలు పెంపొందించే రంగాల్లోనూ మహిళలు దూకుడు ప్రదర్శిస్తున్నారు.జీవనోపాధిలో ప్రతి మహిళా సాధిస్తున్న విజయం.. మరో మహిళకు స్ఫూర్తిగా నిలుస్తోంది. క్రమంగా స్వసంపాదన దిశగా పయనిస్తూ విజయ శిఖరాల్ని చేరుకుంటున్నారు. కుటుంబ ఆదాయ, వ్యయ అంచనాతో పాటు ప్రణాళికలను వేసుకోవడం, వివిధ పథకాలను ఉపయోగించుకోవడం, ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వంటి విషయాల్లో మహిళల ప్రత్యక్ష పాత్ర పెరుగుతూ వస్తోందని అవతార్ సంస్థ ప్రకటించిన టీసీడబ్ల్యూఐ–2024 నివేదిక స్పష్టం చేసింది. బెంగళూరు బెస్ట్.. చెన్నై, ముంబై నెక్స్ట్టీసీడబ్ల్యూఐ–2024 పేరుతో మిలియన్ ప్లస్ సిటీస్, లెస్ దేన్ మిలియన్ సిటీస్.. అని రెండుగా విభజించి సర్వే చేపట్టారు. సిటీ ఇన్క్లూజన్ స్కోర్ (సీఐఎస్) పరంగా.. మిలియన్ ప్లస్ సిటీస్ జాబితాలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న నగరాల్లో బెంగళూరు 47.15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. 46.31 పాయింట్లతో చెన్నై రెండో ర్యాంకు, 41.11తో ముంబై, 38.89తో హైదరాబాద్, 36.88తో పుణె తరువాత స్థానాల్లో నిలిచాయి. సామాజిక అవకాశాలు (ఎస్ఐఎస్) కల్పించే విషయంలో మాత్రం.. చెన్నై అగ్రస్థానంలో నిలవగా.. పుణె, బెంగళూరు, హైదరాబాద్, ముంబై తర్వాత స్థానాలు పొందాయి. పారిశ్రామిక అవకాశాలు కల్పించే నగరాల్లో మాత్రం బెంగళూరు మొదటి స్థానంలోనూ, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణె తర్వాత స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా మొదటి 25 నగరాల్లో 16 నగరాలు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు చెందినవే ఉండటం విశేషం. ఏపీలో ఒకే ఒక్క నగరం మహిళా స్నేహపూర్వక కెరీర్ అవకాశాలు, మౌలిక సదుపాయాలు, భద్రత, సాధికారత ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్లో దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రభాగంలో ఉంది. తమిళనాడుకు చెందిన 8 నగరాలు టాప్–25లో చోటు దక్కించుకున్నాయి. కేరళలో 3, కర్ణాటకలో 2 నగరాలు జాబితాలో ఉండగా.. తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మాత్రమే ఇందులో నిలిచాయి. మిలియన్ ప్లస్ సిటీస్లో విశాఖపట్నం 17.92 శాతంతో 25వ స్థానంలో నిలిచింది. 2022–2023లో విశాఖ 37వ ర్యాంకులో ఉండేది. రాష్ట్రంలో మహిళా సాధికారతకు గత ప్రభుత్వం పెద్దపీట వేయడంతో 2023–24కి ఏకంగా 12 స్థానాలు ఎగబాకి విశాఖ టాప్–25లో నిలవడం విశేషం. ఇక సామాజిక పరంగా అవకాశాలు కల్పిస్తున్న జాబితాలో విశాఖ 33వ స్థానంలో నిలవగా.. పారిశ్రామిక అవకాశాలు కల్పిస్తున్న జాబితాలో 20వ ర్యాంక్ సాధించింది.120 నగరాల్లో సర్వే దేశ జీడీపీలో ప్రస్తుతం మహిళల పాత్ర 18 శాతమే ఉన్నా.. భవిష్యత్లో మరింత దూసుకుపోయే సత్తా అతివలకు ఉంది. మహిళలు విజయం సాధిస్తే.. భారత్ సాధించినట్టేనని అవతార్ సంస్థ భావిస్తోంది. దేశ జనాభాల్లో 48 శాతం మహిళలు ఉండగా.. ఇందులో 35 శాతం మంది నగరాల్లో జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో నగరాలు ఎంతమేర పాత్ర పోషిస్తున్నాయనే అంశంపై అవతార్ సర్వే ద్వారా పరిశీలిస్తోంది.మహిళల వృత్తిపరమైన వృద్ధి, శ్రేయస్సు, విద్య, ఆరోగ్య సంరక్షణ, మొదలైన వనరులను పొందే నగరాలను గుర్తించింది. ఉపాధిలో లింగ అంతరాన్ని తగ్గించి, జీడీపీలో మహిళా సమానత్వాన్ని పెంపొందించి, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న నగరాలు ఏవి, మహిళలకు స్థిరమైన, సమ్మిళిత ఉపాధిని కల్పించడంలో నగరాలు, సంస్థలు చేపడుతున్న పాత్రపై అవతార్ సర్వే ఫలితాల్ని వెల్లడించింది. 2022 నుంచి మహిళల జీవనోపాధిపై సర్వే నిర్వహిస్తోంది. తొలి ఏడాది 112 నగరాల్లో చేపట్టగా.. ఈ సారి 120 నగరాల్లో మహిళల స్థితిగతులపై ఆరా తీసింది. ప్రతి పరిణామంలో తమదైన పాత్ర సమాజంలో మార్పులకు మహిళలు అంకురార్పణ చేస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి పరిణామంలోనూ తమదైన పాత్రను పోషిస్తూ ప్రతిభ చాటుతున్నారు. అవకాశాలు లేవు అని అనుకోవడం కాకుండా.. నగరాలు, పట్టణాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు. పురుషులతో సమానంగా చదవడమేకాదు.. పోటీపడి పనిచేస్తున్నారు. ఏయే నగరాలు మహిళా సాధికారతకు ఎంతమేర అవకాశాలు కల్పిస్తున్నాయనే అంశంపై సర్వే చేసి నివేదిక అందించడం వల్ల.. ఆ ర్యాంకింగ్స్ ఆధారంగానైనా ప్రభుత్వాలు, సంస్థల తీరులో మార్పులు వస్తాయనే ఆశతోనే అవతార్ సంస్థ పరిశోధనలు చేస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామిక రంగంలోనూ ఎదుగుతూ ప్రతి మహిళ పెదవిపై చిరునవ్వుల వెలుగులు విరజిమ్మాలన్నదే మా సంస్థ ముఖ్య లక్ష్యం. ఆ దిశగా.. ఏటికేడూ విభిన్న రంగాల్లో సర్వేలు నిర్వహించనున్నాం. – డాక్టర్ సౌందర్య రాజేష్, అవతార్ వ్యవస్థాపకురాలు -
‘డీట్’తో మరిన్ని ప్రైవేటు కొలువులు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగుల దరికి చేర్చేందుకు 2019లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత జాబ్ పోర్టల్/ యాప్ ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీట్)ను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విస్తృతపరి చింది. ఇప్పటివరకు కార్మిక, ఉపాధి కల్పన విభాగంతో ‘డీట్’ కలిసి పనిచేస్తుండగా ఇకపై పరిశ్రమలు, వాణిజ్య శాఖతోనూ అనుసంధానం కానుంది. గతంలో కార్మిక శాఖ కింద రిజిస్టర్ అయిన ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారం మాత్రమే కనిపించే పరిస్థితి ఉండగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో పరిశ్రమలు, వాణిజ్య శాఖ కింద రిజిస్టర్ అయిన ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారం కూడా నిరుద్యోగులకు అందుబాటులోకి రానుంది. ఈ యాప్ సేవలు పూర్తిగా ఉచితమని పరిశ్రమలు, వాణిజ్య శాఖ తెలిపింది. ఇటీవలే ‘డీట్’ కొత్త లోగోను ప్రభుత్వం ఆవిష్కరించడం తెలిసిందే.నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సమాచారం కూడా.. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారంతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కూడా ‘డీట్’లో లభిస్తుంది. ఉద్యోగ ఖాళీలు, ఇంటర్వ్యూ తేదీలు, ఇతర సమాచారం దీనిద్వారా లభి స్తుంది. ఉద్యోగాలు అందించే సంస్థ ప్రతినిధితో నేరుగా మాట్లాడటం, ఇంటర్వ్యూలో పాల్గొనడం, ఆ తర్వాత ఎంపిక ప్రక్రియ, చేరిక, నియామకపత్రం అందజేత తదితర పూర్తి ప్రక్రియంతా ఈ యాప్ ద్వారా జరుగుతుంది.రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా.. ⇒ నిరుద్యోగులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డీట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.⇒ పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, తదితర వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.⇒ యాప్లోకి లాగిన్ అయ్యాక ఉద్యోగాలను అన్వేషిస్తూ విద్యార్థతలకు తగిన ఉద్యోగాలను తెలుసుకోవచ్చు. -
‘రోజ్గార్ మేళా’లో పాల్గొననున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు(సోమవారం) యువతకు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వర్చువల్గా జరిగే ‘రోజ్గార్ మేళా’లో ప్రధాని పాల్గొని యువతతో ఆయన సంభాషించనున్నారు.కేంద్ర ప్రభుత్వంలోని పలుశాఖల్లోని విభాగాలలో పలు ఉద్యోగాలకు ఎంపికైన 71 వేల మంది యువతీయువకులకు ప్రధాని మోదీ నియామక పత్రాలను అందజేయనున్నారు. ‘రోజ్గార్ మేళా’లో భాగంగా కార్యక్రమం జరగనుంది. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని వర్చువల్గా పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ఆయా రాష్ట్రాల్లోని కేంద్ర మంత్రులు అభ్యర్థులకు నియామక పత్రాలను స్వయంగా అందజేయనున్నారు.హోమ్శాఖ, తపాలా విభాగం, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం తదితర శాఖల్లో 71 వేల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో వివరించింది. రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇది జాతి నిర్మాణంతో పాటు స్వయం ఉపాధిలో యువత భాగస్వామ్యానికి అవకాశాలను కల్పిస్తుంది. రాష్ట్రస్థాయిల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ రోజ్గార్ మేళాలను నిర్వహిస్తుంటాయి. దేశంలో యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఉపాధి మార్గాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రోజ్గార్ మేళాను నిర్వహిస్తుంటారు. ఇది కూడా చదవండి: ఇంకా ఆందోళనకరంగానే పరిస్థితి! -
2030 నాటికి ఈ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగులు: నితిన్ గడ్కరీ
2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దేశ ఆర్థిక వ్యవస్థ పెంపుకు కావాల్సిన కీలక నిర్ణయాలు, ఆటోమొబైల్ రంగం అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. దేశం అభివృద్ధి చెందాలంటే ఉపాధి కూడా తప్పనిసరి. కాబట్టి యువతకు ఉద్యోగాలు చాలా అవసరం. ఉద్యోగ కల్పనకు ఫుడ్ డెలివరీ సంస్థలు కీలకమని కేంద్రమంత్రి 'నితిన్ గడ్కరీ' అన్నారు.జొమాటో నిర్వహించిన 'సస్టైనబిలిటీ అండ్ ఇన్క్లూజివిటీ - రోల్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎకానమీ' సమావేశంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలో 77 లక్షల మంది డెలివరీ కార్మికులు ఉన్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 2.5 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.దేశంలో ఏకంగా 2.5 కోట్ల మందికి ఉపాధి కల్పించడం చాలా పెద్ద విషయమే. ప్రస్తుతం దేశంలో ఉద్యోగ కల్పన చాలా అవసరం అని గడ్కరీ పేర్కొన్నారు. దేశంలోని చాలా మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నందుకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోను.. మంత్రి అభినందించారు.ఉద్యోగాల కల్పినలో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల సంఖ్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్లు పరిమిత సమయంలో వస్తువులను డెలివరీ చేయవలసి ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.ఇదీ చదవండి: అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక.. భారతదేశంలో గంటకు 45 ప్రమాదాలు, 20 మరణాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలిపారు. ఇందులో 18 నుంచి 45 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ద్విచక్ర వాహనదారుల సంఖ్య 80,000 కాగా.. ఇందులో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణించినవారి సంఖ్య 55,000 కావడం గమనార్హం. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల 10,000 మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. సరైన శిక్షణ అందించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని.. జొమాటో సుమారు 50వేలమంది డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నందుకు అభినందనలు తెలిపారు. -
పది పాసైన మహిళలకు ఎల్ఐసీ ఉపాధి అవకాశం
బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 9న హరియాణాలోని పానిపట్లో ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎల్ఐసీ బీమా సఖీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు నియామక పత్రాలను అందజేశారు. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం ఈ పథకం ప్రాథమిక లక్ష్యమని ఎల్ఐసీ తెలిపింది.The Honorable Prime Minister of India, Shri Narendra Modi will be launching LIC’s BIMA SAKHI yojana at Panipat on 09th December 2024 to celebrate Women as partner in the Nations Progress.#BimaSakhiYojana #LIC@narendramodi @PMOIndia@nsitharaman @DFS_India— LIC India Forever (@LICIndiaForever) December 8, 2024కీలక అంశాలు..అర్హులు: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన 18-70 సంవత్సరాల వయస్సు గల మహిళలు.శిక్షణ, ఉపాధి: బీమా సఖీలుగా పిలువబడే మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇచ్చి ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశం అంతటా లక్ష మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.ఆర్థిక సహాయం: ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీ స్టైఫండ్ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000, రెండో సంవత్సరంలో రూ.6,000, మూడో సంవత్సరంలో రూ.5,000 పొందవచ్చు. అదనంగా రూ.2,100 ప్రోత్సాహకం లభిస్తుంది.బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు. మొదటి సంవత్సరం కమీషన్ రూ.48,000 వరకు ఉంటుంది.ఇదీ చదవండి: నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు! -
ఏడాదిలో 1,895 మందికి లేఆఫ్స్!
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ 2024 ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులను తగ్గించుకుంది. ఏడాదిలో శాశ్వత ఉద్యోగుల్లో 716 మంది పురుషులు, 618 మంది మహిళలను ఉద్యోగం నుంచి తొలగించింది. నాన్ పర్మినెంట్ సిబ్బంది విభాగంలో 531 మంది పురుషులు, 30 మంది మహిళలకు లేఆఫ్స్ ప్రకటించింది. నిర్వహణ అవసరాలకు అనుగుణంగా ఖర్చులను సర్దుబాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.వేతన మార్పులుపర్మినెంట్ ఉద్యోగుల్లో 74% మంది పురుషులు కనీస వేతనం కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు కంపెనీ గుర్తించింది. ఇది గతంలో 61%గా ఉండేది. ఈ కేటగిరీలోని మహిళలు 37% నుంచి 56%కి పెరిగారు. నాన్ పర్మినెంట్ ఉద్యోగుల్లో కనీస వేతనం కంటే ఎక్కువ సంపాదించే పురుషులు 1 శాతం నుంచి 8 శాతానికి, మహిళలు 2 శాతం నుంచి 16 శాతానికి పెరిగారని సంస్థ పేర్కొంది.ఖర్చు తగ్గింపు: ఉద్యోగాల్లో కోతలు, వారికి అందించే ప్రయోజనాలు తగ్గించుకోవడం ద్వారా ఖర్చులు 9% తగ్గి రూ.770.44 కోట్లకు చేరుకున్నాయి.ఛైర్మన్ వేతనం: కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ సగటు ఉద్యోగి వేతనం కంటే 211 రెట్లు అధికంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో వేతనం, ఇతర అలవెన్స్ల రూపంలో ఆయన రూ.5.4 కోట్లు అందుకున్నారు.ఆర్థిక పనితీరుకంపెనీ మొత్తం ఆదాయం గతంతో పోలిస్తే 14 శాతం క్షీణించి రూ.8496.96 కోట్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణలో ఉన్న మొత్తం విమానాల సంఖ్య 76గా ఉండేది. ఇది 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 65కు తగ్గింది. ప్రస్తుతం స్పైస్ జెట్ 60 విమానాలను నడుపుతుండగా, బకాయిలు చెల్లించని కారణంగా కొన్ని విమానాలు నిలిచిపోయాయి.ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!నిధుల సమీకరణక్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా ఇటీవల కంపెనీ రూ.3,000 కోట్లు సమీకరించింది. వీటితో ఇప్పటికే పెండింగ్లో ఉన్న జీఎస్టీ, టీడీఎస్ బకాయిలను చెల్లించి కీలక సెటిల్మెంట్లను పూర్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. స్పైస్ జెట్ 2026 నాటికి 100 విమానాలను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
ఆరు నెలల్లో భారీగా ఉపాధి అవకాశాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో (2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు) ఉపాధి అవకాశాలు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. ఈ కాలంలో సిబ్బందిని పెంచుకోనున్నట్టు 59 శాతం సంస్థలు తెలిపాయి. దీంతో ద్వితీయ ఆరు నెలల్లో 7.1 శాతం మేర సిబ్బంది పెరగనున్నట్టు టీమ్లీజ్ సర్వీసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ రిపోర్ట్’ వెల్లడించింది. ప్రస్తుత స్థాయిలోనే సిబ్బంది సంఖ్యను కొనసాగించనున్నట్టు టీమ్లీజ్ సర్వేలో 22 శాతం కంపెనీలు తెలిపాయి. 23 రంగాల్లోని 1,307 కంపెనీల అభిప్రాయాలను టీమ్లీజ్ సర్వేలో భాగంగా తెలుసుకుంది. లాజిస్టిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), ఈవీ సదుపాయాలు, వ్యవసాయం, ఆగ్రోకెమికల్స్, ఈ–కామర్స్ రంగాల నుంచే ప్రధానంగా ఎక్కువ ఉపాధి అవకాశాలు రానున్నాయని, ఇవి మౌలిక వసతులు, ఆధునిక టెక్నాలజీపై ఎక్కువగా వ్యయం చేస్తున్నట్టు టీమ్లీజ్ నివేదిక తెలిపింది. రంగాల వారీగా..లాజిస్టిక్స్ రంగంలో 14 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా రానున్నాయి. ఉద్యోగులను పెంచుకోనున్నట్టు 69 శాతం లాజిస్టిక్స్ కంపెనీలు వెల్లడించాయి. ఆ తర్వాత అధికంగా ఈవీ, ఈవీ ఇన్ఫ్రా కంపెనీలు 12 శాతం మేర సిబ్బందిని పెంచుకోనున్నాయి. వ్యవసాయం, ఆగ్రో కెమికల్స్ కంపెనీల్లో 10.5 శాతం మేర, ఈ–కామర్స్ రంగంలో 9 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా రానున్నాయి. ఆటోమోటివ్ రంగంలో 8.5 శాతం, రిటైల్ రంగంలో 8.2 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా ఏర్పడనున్నాయి.ఇదీ చదవండి: 30 లక్షల యూనిట్లు ఎగుమతి!ప్రాంతాల వారీగా..కోయింబత్తూర్, గురుగ్రామ్ ఉపాధి కల్పన కేంద్రాలుగా మారుతున్నట్టు టీమ్లీజ్ నివేదిక తెలిపింది. అత్యధికంగా బెంగళూరు 53.1 శాతం, ముంబై 50.2 శాతం, హైదరాబాద్ 48.2 శాతంతో ఉపాధి కల్పన పరంగా ముందున్నాయి. ఉపాధి కోరుకుంటున్న వారికి చిన్న పట్టణాలు ప్రత్యామ్నాయ కేంద్రాలుగా మారుతున్నట్టు టీమ్లీజ్ నివేదిక పేర్కొంది. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) టెక్నాలజీ, ఆర్అండ్డీలో అధిక నైపుణ్య ఉద్యోగాలను సృష్టిస్తున్నట్టు తెలిపింది. జాతీయ పారిశ్రామిక నడవాల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి పరోక్షంగా 30 లక్షల మందికి ఉపాధి కల్పించనుండడం, సెమీకండక్టర్ పాలసీ ద్వారా 2025 నాటికి 80,000 ఉద్యోగాల కల్పన తదితర కీలక విధానాలను ప్రస్తావించింది. -
ఫైబర్ టెక్లో లక్ష కొలువులు..
ముంబై: బ్రాడ్బ్యాండ్, 5జీ నెట్వర్క్ సహా డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఫైబర్ టెక్నాలజీ విభాగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ఫైబర్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, రిపేర్ సెగ్మెంట్లలో కొత్తగా లక్ష ఉద్యోగాలు రానున్నాయి. టీమ్లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ పి. సుబ్బురత్నం ఈ విషయాలు వెల్లడించారు. 2024లో దేశీయంగా టెలికం మార్కెట్ 48.61 బిలియన్ డాలర్లుగా ఉండగా ఏటా 9.40 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2029 నాటికి 76.16 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. 2023 నాటికి దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం పూర్తయిందని, డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తరించడానికి ఇది గణనీయంగా ఉపయోగపడిందని వివరించారు. అసాధారణమైన స్పీడ్, తక్కువ లేటెన్సీ, మరింత మెరుగైన కనెక్టివిటీని అందిస్తూ 2030 నాటికి 5జీ టెక్నాలజీ మరింతగా విస్తరించనుందని సుబ్బురత్నం చెప్పారు. ‘ప్రభుత్వం, టెలికం సంస్థలు ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై దృష్టి పెడుతుండటంతో ఫైబర్ టెక్నీషియన్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొత్తగా సుమారు లక్ష ఉద్యోగావకాశాలు రానున్నాయి‘ అని సుబ్బురత్నం చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ఫైబర్ టెక్నీషియన్ల సంఖ్య సుమారు 5 లక్షల పైగా ఉన్నట్లు అంచనా. ఇంజనీర్లు, టెక్నీషియన్లకు డిమాండ్... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే టెలికం, ఐటీ, నిర్మాణ, తయారీ తదితర రంగాల్లో ఫైబర్ సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుంది. ఫైబర్ ఇంజనీర్లు, ఫైబర్ టెర్మినేషన్ ఎక్విప్మెంట్ టెక్నీషియన్లు, ఇన్స్టాలేషన్.. రిపేరు, ఫాల్ట్ రిజల్యూషన్ టీమ్, ఫైబర్ సెల్సైట్ ఇంజనీర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వర్గాలకు డిమాండ్ నెలకొనవచ్చని సుబ్బురత్నం చెప్పారు. అయితే, అట్రిషన్ రేటు అధిక స్థాయిలో వార్షికంగా 35–40%గా ఉంటోందన్నారు. సుదీర్ఘ పనిగంటలు, వేతనాల పెంపు చాలా తక్కువగా ఉండటం, ఉద్యోగులను ఇతర సంస్థలను ఎగరేసుకు పోతుండటం తదితర అంశాలు కారణమని వివరించారు. -
వ్యవసాయ రంగమే ఉపాధికి ఊతం
నగర ప్రాంతాలకు తరలి వస్తోన్న లక్షలాదిమంది ప్రధానంగా ఉపాధిని పొందుతోంది, నిర్మాణ రంగంలోనే. సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధికి రఘురావ్ు రాజన్ వంటి వారు కూడా సేవారంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు? నేటి ప్రపంచ పరిస్థితులలో సరుకు ఉత్పత్తి రంగం గానీ, సేవా రంగం గానీ కోట్లాది మంది నిరుద్యోగులకు బతుకుతెరువును చూపగల స్థితి లేదు. మిగిలిందల్లా, వ్యవసాయ రంగమే. వ్యవసాయం లాభసాటిగా ఉంటే గ్రామీణులు నగరాలకు రారు. అప్పుడు కారుచవకగా కార్పొరేట్లకు కార్మికులు దొరకరు. అందుకే వ్యవసాయం లాభసాటిగా లేకుండా ‘జాగ్రత్తపడటమే’ ఇప్పటి విధానం.దేశంలోని సుమారు 65% జనాభా 35 ఏళ్ల లోపువారు. వీరికి నిరుద్యోగం, చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం ప్రధాన సమస్యలు. కోవిడ్ అనంతరం సమస్య మరింత జఠిలం అయ్యింది. 2016లో మోదీ తెచ్చిపెట్టిన పెద్ద నోట్ల రద్దు, 2017లో హడావుడిగా ఆరంభమైన జీఎస్టీ వంటివి చిన్న, మధ్యతరహా పరిశ్రమలను దెబ్బతీసి నిరుద్యోగ సమస్యను మరింత పెంచాయి.దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం ఆసరాగా 2014లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇదే నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం సరుకు ఉత్పత్తి రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక ఉపాధి కల్పనా రంగంగా... దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 25% స్థాయికి చేర్చే పేరిట ‘మేకిన్ ఇండియా’ కార్య క్రమాన్ని ఆరంభించింది. దశాబ్ద కాలం తర్వాత, వెనక్కిచూసుకుంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 15– 17 శాతం మధ్య ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలిపోయింది. 2020లో ఆరంభమైన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల’ పథకం కూడా సాధించింది నామ మాత్రమే.మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశాలు లేవంటూ అప్పట్లోనే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురావ్ు రాజన్ చెప్పారు. చైనా ప్రపంచం యావత్తుకూ సరిపోయే స్థాయిలో, చవకగా సరుకులను ఉత్పత్తి చేస్తోంది గనుక ప్రపంచానికి మరో చైనా అవసరం లేదంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈ రచయిత కూడా 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం, అంతర్జాతీయంగా డిమాండ్ పతనం వంటి వివిధ కారణాలను పేర్కొంటూ మేకిన్ ఇండియా, దేశ సమస్య లకు పరిష్కారం కాదంటూ ఒక వ్యాసం రాసివున్నారు.దేశంలో నిరుద్యోగం పరిష్కారానికీ, వృద్ధి రేటు పెంపుదలకూ దారి ఏమిటనే చర్చ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే, ఈ మధ్య రఘురావ్ు రాజన్ ‘బ్రేకింగ్ ద మౌల్డ్: రీ ఇమేజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ పేరిట రోహిత్ లాంబా అనే పెన్సి ల్వేనియా విశ్వవిద్యాలయ ఆచార్యునితో కలిసి ఒక పుస్తకం రాశారు. దీనిలో భాగంగా మేకిన్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానాలు ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువగా తయారయ్యాయని పేర్కొన్నారు. ఈ సరుకు ఉత్పత్తి రంగంపై దృష్టిని కాస్తంత తగ్గించు కొని, భారతదేశం ఇప్పటికే ‘బలంగా’ వున్న సేవా రంగంపై దృష్టి పెట్టాలన్నారు. తద్వారా మెరుగైన ఉపాధి కల్పన, వృద్ధి రేటులను సాధించవచ్చనేది వారి వాదన. దీని కోసమై యువజనుల నిపుణతల స్థాయిని పెంచి వారిని సేవా రంగ ఉపాధికి సిద్ధం చేయాలన్నారు.రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొరియా, జపాన్... అలాగే చైనా వంటి దేశాలు అనుసరించిన ఆర్థిక వృద్ధి నమూనా అయిన మొదటగా వ్యవసాయ రంగం నుంచి సరుకు ఉత్పత్తి రంగం దిశగా సాగడం... అనంతరం మాత్రమే సేవా రంగం వృద్ధి దిశగా పయనించడం అనివార్యం కాదని రాజన్ వాదిస్తున్నారు. అనేక ధనిక దేశాలలో ఇప్పటికే సేవా రంగం వాటా జీడీపీలో 70% మేర ఉందనీ, ఈ రంగంలో జీడీపీ వాటా సుమారు 60% పైన వున్న భారత్ కూడా పాత నమూనాని పక్కన పెట్టి మరింతగా సేవా రంగంలోకి వెళ్ళాలనేది రాజన్ తర్కం. సేవా రంగం వృద్ధి చెందాలంటే యువజనుల విద్యా నిపుణతల స్థాయి సరుకు ఉత్పత్తి రంగంలో కంటే అధికంగా ఉండాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సేవా రంగం తాలూకు సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించగలగడంలో ఎదుర్కొంటున్న సాఫ్ట్ స్కిల్స్ లోటును చూస్తున్నాం. సేవా రంగంలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం అవసరం తెలిసిందే. దేశంలోని ఎంతమంది యువజనులకు ఈ రంగంలో ప్రవేశించగల స్థాయి ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఉంది? దేశంలోని మొత్తం కార్మికులలో 70% మంది మాత్రమే అక్షరాస్యులు. వీరిలో కూడా 25% మంది ప్రాథమిక స్థాయి విద్యలోపే పాఠశాల చదువు మానివేసిన వారు. దేశంలోని 20% సంస్థలు మాత్రమే తమ ఉద్యోగులకు తగిన శిక్షణను ఇచ్చుకునే ఏర్పాట్లను కలిగి వున్నాయి (ప్రపంచ బ్యాంకు పరిశోధన). ఈ స్థితిలో, గ్రామీణ యువజనులను సేవా రంగం దిశగా ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళగలమా? నేడు సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి కోసం రఘురావ్ు రాజన్ వంటి వారు కూడా సేవా రంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు?దీనికి కారణం ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్నెస్’ (మన అస్తిత్వమే మన ఆలోచనలను నిర్ణయిస్తుంది) అనే కార్ల్ మార్క్ ్స ఉద్బోధన. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలో 2003 నుంచి 2007 వరకూ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేసిన రాజన్ కూడా దాటుకుని రాలేని నిజం. ఆయన అస్తిత్వం తాలూకు పరిమి తులే, ఆయనను వాస్తవాన్ని చూడనివ్వడం లేదు. నేటి ప్రపంచ పరిస్థితులలో అటు సరుకు ఉత్పత్తి రంగం గానీ, ఇటు సేవా రంగం గానీ, కోట్లాది మంది నిరుద్యోగ యువతకు బతుకుదెరువును చూప గల స్థితి లేదు. మిగిలిందల్లా, మన వ్యవసాయ రంగమే. ఈ రంగంలో ఇప్పటికే, అవసరాన్ని మించి మానవ వనరులు చిక్కుకు పోయి ఉన్నాయన్నది నిజం. ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ‘సంస్కరణల’ యుగంలో వ్యవసాయ రంగంపై చిన్న చూపు పెరిగింది. గ్రామీణ వ్యవసాయ రంగం, నగర ప్రాంత పారిశ్రామిక రంగాల మధ్యన ఉన్న సమీకరణం గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉంది. వ్యవసాయ రంగ సరుకులను కారు చవుకగా, నగర ప్రాంతాలలో అందుబాటులో ఉంచడమనేది పారిశ్రామిక కార్పొరేట్ వర్గాల అవసరం. గ్రామీణ రైతాంగానికి లాభసాటి ధరలను కల్పిస్తే ఆ సరుకుల ధరలు, నగర ప్రాంత మార్కెట్లలో అధికంగా ఉంటాయి. నగర ప్రాంత కార్మికులు, ఉద్యోగులకు అవి ఖరీదైనవి అవుతాయి. అప్పుడు వేతనాల పెంపుదల కోసం యజమానులపై ఒత్తిడి తెస్తారు. ఇది పారిశ్రామిక అశాంతిగా మారవచ్చు. ఒక మోస్తరు వేతనాలతోనే పని చేయించుకోగలగాలంటే రైతాంగ ఉత్పత్తులకు తక్కువ ధరలు ఉండేలా జాగ్రత్తపడడం కార్పొరేట్లకు అవసరం. గ్రామీణ రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉంటే వారు నగరాలకు రారు. అప్పుడు నగర ప్రాంతాలలో కార్మికుల సరఫరా తగ్గుతుంది. కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది. దీని వలన, పారిశ్రామికవేత్తలు అధిక వేతనాలను చెల్లించి పనిలో పెట్టుకోవలసి వస్తుంది. దీనికి కూడా పరిష్కారమే గ్రామీణ వ్యవసాయం లాభ సాటిగా లేకుండా ‘జాగ్రత్తపడడం’. ఈ కథలో సూత్రధారులు ప్రపంచీకరణ వంటి నయా ఉదారవాద విధానాaలను మన మీద రుద్దుతోన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధులు. ఆ ఆలోచనా విధానం తాలూకు ప్రతినిధిగా రఘురావ్ు రాజన్ వ్యవసాయం ఊసు ఎత్తలేరు. దాన్ని దేశానికీ, ఉపాధి కల్పనకూ దారిగా చూపలేరు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటే అది అతని కొనుగోలు శక్తిని పెంచి తద్వారా నగర ప్రాంత పారిశ్రామిక సరుకులకు డిమాండ్ను కల్పిస్తుంది. దేశ జనాభాలోని 55% పైన ఉన్న రైతాంగం బాగుంటే, విదేశాలలోని డిమాండ్, కొనుగోలు శక్తి, ఎగుమతులతో నిమిత్తం లేకుండా దేశంలోనే డిమాండ్ను సృష్టించవచ్చు. ఈ పరిష్కారాన్ని చెప్పలేని మేధా దుర్బలత్వంతో రఘురావ్ు రాజన్ వంటివారు మిగిలిపోతున్నారు. డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
మన ముత్యానికి మెరుపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకే ప్రత్యేకమైన పలు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ –జీఐ) సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ఆహారం, హస్తకళలు, వంగడాలు తదితర 17 రకాల ఉత్పత్తులకు ఇప్పటికే జీఐ గుర్తింపు లభించింది. ఇప్పుడు మరిన్ని ఉత్పత్తులకు జీఐ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ జాబితాలో హైదరాబాద్ ముత్యాలు, భద్రాచలం కలంకారీ, వరంగల్ మిర్చి తదితర ఉత్పత్తులు ఉన్నాయి. వీటికి జీఐ గుర్తింపు కోసం కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధీనంలోని ‘కం్రప్టోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్మార్క్’విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు సమర్పించింది. 30 ఉత్పత్తులకు జీఐ ట్యాగింగ్ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీఐ ట్యాగింగ్ జాబితాలో తెలంగాణకు చెందిన ఉత్పత్తులకు పెద్దగా చోటు దక్కలేదు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో జీఐ టాగింగ్ జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కనీసం 30 ప్రత్యేక ఉత్పత్తులకు జీఐ టాగింగ్ దక్కేలా చూడాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ ముత్యాలు, భద్రాచలం కళంకారీ, వరంగల్ చపాటా మిర్చీకి గుర్తింపు ఇవ్వాలని దరఖాస్తు చేసింది. వరంగల్ చపాటా మిర్చీ తరహాలోనే ఖమ్మం మిర్చికి కూడా జీఐ టాగింగ్ ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు కోరింది. తెలంగాణకు చెందిన ప్రత్యేక ఉత్పత్తుల జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ పురోగతిలో ఉన్నట్లు జీఐ టాగింగ్ నోడల్ అధికారి శ్రీహారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. – ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 17 ప్రత్యేక ఉత్పత్తులకు జీఐ టాగింగ్ లభించింది. పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ వెండి ఫిలిగ్రీ, నిర్మల్ కొయ్య బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల చీరలు, హైదరాబాద్ హలీమ్, చేర్యాల పెయింటింగ్స్, పెంబర్తి ఇత్తడి కళాకృతులు, సిద్దిపేట గొల్లభామ చీరలు, బంగినపల్లి మామిడి, పోచంపల్లి ఇక్కత్ లోగో, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డర్రీస్, తేలియా రుమాల్, లక్క గాజులకు జీఐ గుర్తింపు లభించింది. – జీఐ చట్టం 1999 ప్రకారం భౌగోళిక ప్రత్యేకత, నాణ్యత, ప్రాముఖ్యత తదితరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వాటికి జీఐ గుర్తింపు ఇస్తారు. వారసత్వ, సాంస్కృతిక సంపదను కాపాడటం, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనను ప్రోత్సహించడం, ఉత్పత్తుల నాణ్యత, ప్రత్యేకతను పరిరక్షించడం, ఉత్పత్తులను నకలు కొట్టకుండా నిరోధించడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడం జీఐ టాగింగ్ లక్ష్యం. -
విదేశాల్లో మారిన పరిస్థితులు.. మనోళ్ల ఆశలు ఆవిరి!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల విదేశీ విద్య ఆశలు ఆవిరైపోతున్నాయి. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా, బ్రిటన్ లాంటి దేశాలకు ఎమ్మెస్కు వెళ్లాలనుకునేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఆర్థిక సంక్షోభంతో అమెరికా తదితర దేశాల్లో ఐటీ రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన వారు కూడా పునరాలోచనలో పడుతున్నారు. కొన్నాళ్లు వేచి చూడటమే మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు. కొందరు ఆయా దేశాల్లో ఉన్న తమతోటి మిత్రులతో అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గురించిన వివరాలు కనుక్కుంటున్నారు. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియాలో పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని ఆయా దేశాల్లో ఉన్నవిద్యార్థులు చెబుతున్నారు. ఆ రోజులు పోయాయ్! విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఎమ్మెస్ చదువు చాలామంది విద్యార్థులకు ఓ కల. ముఖ్యంగా బీటెక్ పూర్తి చేయగానే ఏదో ఒక వర్సిటీలో చదువుకోసం ప్రయతి్నంచేవారు. వీలైనంత త్వరగా ఎమ్మెస్ పూర్తి చేస్తే, ఫుల్టైమ్ జాబ్తో త్వరగా సెటిల్ అవడానికి వీలవుతుందని భావించేవారు. అప్పు చేసి మరీ విమానం ఎక్కేసేవారు. ఎమ్మెస్ చేస్తూనే ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్తో ఎంతోకొంత సంపాదించుకోవడానికి ఆసక్తి చూపేవారు.కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. పరిస్థితి అంత సాను కూలంగా లేదని కన్సల్టెన్సీలు, ఇప్పటికే అక్కడ ఉన్న విద్యార్థులు చెబుతున్నారు. 2021లో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య 6.84 లక్షలుగా ఉంది. 2023లో కూడా పెరుగుదల నమోదైనా 2024కు వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక ప్రస్తుత పరిస్థితిని, విద్యార్థుల నుంచి వస్తున్న ఎంక్వైరీలను బట్టి చూస్తే 2025లో ఈ సంఖ్య మరింత తగ్గే వీలుందని కన్సల్టెన్సీలు అంచనా వేస్తున్నాయి. వెళ్లినవారికి ఉపాధి కష్టాలు ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో విదేశాల్లో స్కిల్డ్ ఉద్యోగం దొరకడం గగనంగా మారుతోందని, అన్ స్కిల్డ్ ఉద్యోగాలకు కూడా విపరీతమైన పోటీ ఉందని అంటున్నారు. ఆర్థిక సంక్షోభంతో అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఉద్యోగాలు తీసివేసే పరిస్థితి నెలకొనడం, మరోవైపు భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చినవారి సంఖ్య ఇప్పటికే గణనీయంగా పెరిగిపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కూడా ప్రభావం చూపిస్తోందని అంటున్నారు. రోజూ పదుల సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నా, ప్రయత్నాలు కొనసాగిస్తున్నా.. ఉద్యోగం రాకపోవడం మాట అలా ఉంచితే కనీసం ఇంటర్వ్యూకు పిలిచే పరిస్థితి కూడా ఉండటం లేదని తెలుస్తోంది. విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఫీజులు ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకు అవసరం. కాగా ఈ మేరకు అప్పు చేసి వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉండేది. ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఖర్చులకు సరిపడా సంపాదించుకోవడంతో పాటు రుణం తీర్చగలమనే ధీమా గతంలో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. చాలా కంపెనీలు ఏడాది క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి అమెరికాలో కొనసాగుతోంది. తాజాగా నాస్కామ్ జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు అమెరికాలో 20 వేల మంది ఉన్నట్టు తేలింది. అస్ట్రేలియాలో ఇచ్చిన ఆఫర్లు వెనక్కు తీసుకుంటున్నట్లు సమాచారం. అప్పు తీర్చలేక, ఇండియా రాలేక, అమెరికాలో ఉద్యోగం లేకుండా ఉండలేక విద్యార్థులు నానా అవస్థలూ పడుతున్నారు. దేశంలో ఐటీ సెక్టార్పైనా ప్రభావం అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఇండియా ఐటీ సెక్టార్పైనా ప్రభావం చూపించింది. పలు కంపెనీలు వరుసగా లే ఆఫ్లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్ నియామకాలు తగ్గాయి. దీంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది. నైపుణ్యం సమస్య! దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే అవసరమైన నైపుణ్యం ఉంటున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వీళ్లే బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నారని పేర్కొంటున్నాయి. స్వల్ప సంఖ్యలో విద్యార్థులు చిన్నాచితకా ఉద్యోగంతో సరిపెట్టుకుంటుండగా, ఎక్కువమంది అన్స్కిల్డ్ ఉద్యోగులుగా లేదా నిరుద్యోగులుగా కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. తాజాగా అమెరికాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పరిస్థితిని మరింత దిగజార్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు వెళ్లినవారి సంఖ్య 2024లో గణనీయంగా తగ్గిందని అంటున్నారు. మంచి ఉద్యోగం మానుకుని అమెరికా వచ్చా బీటెక్ అవ్వగానే ఓ ఎంఎన్సీలో మంచి ఉద్యోగం వచ్చింది. రెండేళ్ళల్లో ప్రమోషన్లు కూడా వచ్చాయి. కానీ అమెరికా వెళ్ళాలనే కోరికతో అప్పు చేసి ఇక్కడికి వచ్చా. ప్రస్తుతం ఎంఎస్ పూర్తి కావొచ్చింది. కానీ జాబ్ దొరికే అవకాశం కని్పంచడం లేదు. ఇప్పటికీ డబ్బుల కోసం ఇంటి వైపే చూడాల్సి వస్తోంది. – మైలవరపు శశాంక్ (అమెరికా వెళ్ళిన ఖమ్మం విద్యారి్థ) రెండేళ్ళ క్రితం వరకూ అమెరికాలో ఎంఎస్ గురించి రోజుకు సగటున 50 మంది వాకబు చేసేవారు. ఇప్పుడు కనీసం పది మంది కూడా ఉండటం లేదు. కెనడాలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుండటం, అమెరికాలో ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం సన్నగిల్లడమే ఈ పరిస్థితికి కారణం. – జాన్సన్, యూఎస్ కన్సల్టింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు అమెరికాలో ఐటీ రంగం పరిస్థితి ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. కొందరు ఉన్న ఉద్యోగాలు కోల్పోతున్నారు. భారతీయ విద్యార్థులు నూటికి కనీసం ఆరుగురు కూడా కొత్తగా స్కిల్డ్ ఉద్యోగాలు పొందడం లేదు. – అమెరికాలోని భారతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎన్వీఎన్అప్పుచేసి అమెరికా వచ్చా. పార్ట్ టైం జాబ్ కూడా ఒక వారం ఉంటే ఇంకో వారం ఉండటం లేదు. కన్సల్టెన్సీలు కూడా చేతులెత్తేస్తున్నాయి. మరోవైపు ఎంఎస్ పూర్తి చేసిన నా స్నేహితులకు స్కిల్డ్ ఉద్యోగాలు దొరకడం లేదు. మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా ఉంటోంది. – సామా నీలేష్ (అమెరికా వెళ్ళిన హైదరాబాద్ విద్యార్థి) -
సైనిక విమాన తయారీకి ఊపు
మూడేళ్ల క్రితం యూరప్ కంపెనీ ‘ఎయిర్బస్’తో 56 సి–295 రవాణా విమానాలను కొనడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 16 స్పెయిన్లో తయారవుతాయి, మిగతా 40 ఇండియాలో ‘టాటా’(టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. సైనిక రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం ఉపాధికి కూడా తోడ్పడుతుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద తొలి సి–295 విమానం 2026లో అందుబాటులోకి రానుంది. మొత్తం 40 విమానాలను 2031కల్లా అందించడం ద్వారా టీఏఎస్ఎల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.భారత వైమానిక దళానికి చెందిన పాత అవ్రో విమానాల స్థానంలో 56 సి–295 రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2021 సెప్టెంబర్ లో రూ. 21,935 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేసింది. ‘ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్’తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం, మొదటి 16 విమానాలను స్పెయిన్లోని సెవిల్లెలో దాని తుది అసెంబ్లింగ్ (విడిభాగాల కూర్పు) కేంద్రం నుంచి సరఫరా చేయాల్సి ఉంది. మిగతా 40 విమానాలను భారత్, స్పెయిన్ కుదుర్చుకున్న పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందం ప్రకారం మన దేశానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. భారత్లో రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. ప్రధాని మోదీ 2022 అక్టోబర్ 30న గుజరాత్లోని వడోదరలో టీఏఎస్ఎల్ చివరి దశ విడిభాగాల కూర్పు సదుపాయానికి శంకు స్థాపన చేశారు. అప్పటి ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధురీకి 2023 సెప్టెంబర్ 13న స్పెయిన్లోని సెవిల్లెలో తొలి విమానాన్ని అందజేశారు. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ విమానం 2023 సెప్టెంబర్ 25న హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరింది. ‘రైనోస్’ అని కూడా పిలిచే ఐఏఎఫ్ 11 స్క్వాడ్రన్ ఇప్పటికే ఆరు సి–295 విమానాలను నడుపుతోంది.తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీసి–295 బహుళ ప్రాయోజక సైనిక రవాణా విమానంగా రుజువు చేసుకుంది. 9.5 టన్నుల పేలోడ్, 70 మంది ప్రయాణికులు లేదా 49 మంది పారాట్రూపర్లను తీసుకెళ్లగల సామర్థ్యంతో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) శక్తిని గణనీయంగా పెంచింది. పగలు, రాత్రి తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ నడిచే సామర్థ్యం ఉన్న ఈ విమానాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ వైమానిక దళాలు ఉప యోగిస్తున్నాయి. ఇంకా పలు సామర్థ్యాలు ఎయిర్బస్ సి–295 సొంతం. సైనిక రవాణా, ఆకాశమార్గంలో రవాణా, పారాట్రూపింగ్, వైద్య సహాయం కోసం తరలింపు, సముద్రప్రాంత గస్తీ, జలాంత ర్గాములను ఎదుర్కొనే యుద్ధ పరికరాలు, పర్యావరణ పర్యవేక్షణ, సరిహద్దు పహారా, వాటర్ బాంబర్, గాలి పరంగా ముందస్తు హెచ్చరి కలు వంటి విస్తృత శ్రేణి మిషన్ లలో ఇది సమర్థంగా పని చేస్తుంది.స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం. మేక్ ఇన్ ఇండియా కింద తయారు చేసే తొలి సి–295 విమానం 2026 సెప్టెంబర్లో అందుబాటులోకి రానుంది. చివరి విమానం 2031 ఆగస్టు నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ దేశంలో విమాన రంగ అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇందులో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక ఎంఎస్ఎంఈలు విమానాల విడి భాగాలను అందిస్తాయి. ఇప్పటికే 33 ఎంఎస్ఎంఈలను ఎయిర్బస్ గుర్తించింది. హైదరాబాద్లోని టీఏఎస్ఎల్ ప్రధాన కేంద్రంలో విమా నాల విడిభాగాల తయారీ ప్రారంభమైంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమి టెడ్ (బీఈఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అందించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థలను ఇప్పటికే విమానంలో అనుసంధానం చేశారు. అయితే, ఒప్పంద చర్చల తుది దశలో ఎక్కువ కాలం జాప్యం కావడంతో వీటిని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. పెరిగే ఉపాధి కల్పనతాజా ప్రయత్నం వైమానిక రంగంలో ఉపాధి కల్పనను పెంచు తుందని రక్షణ శాఖ చెబుతోంది. దేశంలో ఏరోస్పేస్, రక్షణ రంగంలో 42.5 లక్షలకు పైగా పనిగంటలతో ప్రత్యక్షంగా 600 అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు, 3,000కు పైగా పరోక్ష ఉద్యోగాలకు, అదనంగా 3,000 మధ్యతరహా నైపుణ్య ఉపాధి అవకా శాలకు వీలు కలుగుతుంది. ఇతర ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ దారుల (ఓఈఎం) నుంచి ఎయిర్బస్ తెప్పించే ఏరో ఇంజిన్, ఏవి యానిక్స్ మినహా అధిక శాతం నిర్మాణ భాగాలు భారత్లోనే తయారవుతాయి. ఒక విమానంలో ఉపయోగించే 14,000 విడి భాగాలలో 13,000 భాగాలు దేశంలోని ముడిసరుకుతోనే తయారవుతాయి. అయితే టీఏఎస్ఎల్ సకాలంలో 40 విమానాలను తయారు చేయడమే అసలైన పరీక్ష. ఇప్పటివరకు చాలా కార్యకలాపాలు ఎయిర్బస్ ద్వారా జరుగుతున్నాయి. టీఏఎస్ఎల్ కేవలం వాటిని అమలు చేస్తోంది. భారత వైమానిక రంగ సుస్థిర వృద్ధి కోసం స్థానిక ఉత్పత్తి, డీజీ ఏక్యూఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎష్యూరెన్స్) ద్వారా నాణ్యత నియంత్రణ, ‘సెమిలాక్’ ద్వారా భవిష్యత్తు ధ్రువీకరణ, దేశీయ తనిఖీ పరీక్షలు, మూల్యాంకనంపై దృష్టి సారించాలి.రక్షణ రంగం అంచెలంచెలుగా ఎదగడానికి గత పదేళ్లలో భారత ప్రభుత్వం చేసిన కృషి దోహదపడింది. రూ. 43,726 కోట్ల నుంచి రూ. 1,27,265 కోట్లకు పెరిగిన రక్షణ ఉత్పత్తుల్లో 21 శాతం వాటా ప్రైవేటు రంగానిదే. పదేళ్ల క్రితం రూ.1,000 కోట్ల లోపు ఉన్న రక్షణ ఎగుమ తులు గత ఏడాది రూ. 21,000 కోట్లకు పైగా పెరిగాయి. కొన్ని విధాన సంస్కరణలతో పాటు మూలధన పరికరాల కొనుగోలు కోసం డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్స్ – 2020లో స్వదేశీ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఐడీడీఎం) కేటగిరీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఈ గణాంకాలను సాధించడానికి దోహదపడింది. కొత్తగా కేటాయించిన రక్షణ బడ్జెట్లో 75 శాతాన్ని దేశీయ పరిశ్రమల ద్వారా కొనుగోళ్లకు కేటాయించారు. జాయింట్ యాక్షన్ (శ్రీజన్) పోర్టల్ ద్వారా స్వయం సమృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, సానుకూల స్వదేశీకరణ జాబితాలు (పీఐఎల్), ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్లెన్స్ (ఐడీఈఎక్స్) ఏర్పాటు, 2024 సెప్టెంబర్ నాటికి రూ. 50,083 కోట్ల పెట్టుబడి అంచనాతో ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు వంటి అనేక ఇతర చర్యలను ప్రభుత్వం తీసుకుంది. 2013 మేలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) జారీ చేసిన తరువాత ఎయిర్బస్తో ఒప్పందం కుదుర్చు కోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖకు ఆరేళ్ళు పట్టింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడానికి, ఒప్పందం తదుపరి చర్చలకు ఇంకా చాలా చేయాల్సి ఉంది.దేశంలో సి –295 సైనిక రవాణా విమానాల ఉమ్మడి తయారీలో ఎయిర్బస్ – టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) భాగ స్వామ్యం ఇప్పటివరకు సవాళ్లను ఎదుర్కొంటున్న భారత వైమానిక రంగానికి ఆశ, ప్రేరణగా నిలుస్తోంది. అయితే సివిల్ సర్టిఫైడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉన్నందున ఈ ఎయిర్ క్రాఫ్ట్ వెర్షన్లను టీఏఎస్ఎల్ విస్తరిస్తుందో లేదో చూడాలి. ఈ భాగస్వామ్యం పూర్తి ప్రయోజనాలను పొందడానికి దేశంలో ఉత్పత్తి, భవిష్యత్తు ఎగుమ తులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భరత సాధన దిశగా భవిష్యత్ ప్రయాణం క్లిష్టంగా అనిపించినప్పటికీ, ఎయిర్బస్, టీఏ ఎస్ఎల్ మధ్య ఈ భాగస్వామ్యం ద్వారా అడుగులు ముందుకు పడ్డాయి. టీఏఎస్ఎల్ నిర్ణీత సమయానికి 40 విమానాలను తయారు చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఈ తరహా భాగస్వామ్యాల విషయంలో ప్రభుత్వ రంగం ఐఏఎఫ్ అంచనాలను అందుకోలేదన్నది గత అనుభవాలు చెబుతున్న పాఠం. మరి ఈ ఒప్పందం సఫలమైతే దేశంలో ప్రైవేట్ రంగ భాగ స్వామ్యం మరింత ప్రబలమవుతుంది. వాటి సహకారం లేకుండా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కల నెరవేరదు.అనిల్ గోలానిఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్అడిషనల్ డైరెక్టర్ జనరల్ -
అడవే ఆధారం.. అభివృద్ధికి దూరం
చెట్లు చేమలే వారి నేస్తాలు.. బొడ్డు గుడిసెలే నివాసాలు.. ఆకులు, అలములు,కందమూలాలే ఆహారం.. అడవిలో పుట్టి.. అడవిలో పెరిగి.. అడవే సర్వస్వంగా జీవిస్తున్నా ఎదుగూబొదుగూ లేని బతుకులు.. అభ్యున్నతికి నోచక.. అనాగరిక జీవనం సాగిస్తున్న చెంచుల బతుకులపై విశ్లేషణాత్మక కథనమిది. అచ్చంపేట: చెంచుల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం ఏటా బడ్జెట్లో రూ.కోట్లు కేటాయిస్తున్నా.. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉన్నారు. నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవసాయ భూమి లేదు. అటవీ ఉత్ప త్తుల సేకరణతో కాలం వెళ్లదీస్తున్నారు. వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ భూ పంపిణీకి నోచుకోవడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుల అభివృద్ధి గణాంకాలకే పరిమితమైంది. వారికి ఉపాధి కల్పించేందుకు జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతో పాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, వ్యవసాయం, తాగునీటి వసతి వంటివి అమలు కావడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కా ఇళ్లు లేక రాత్రివేళ బొడ్డు గుడిసెల్లో కట్టెల మండల (నెగడి)తో కాలం వెళ్లదీస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను వైద్య, ఆరోగ్యశాఖ, ఐటీడీఏ పట్టించుకోక పోవడంతో చెంచుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీర్ఘకాలిక రోగాలతో పాటు మలేరియా, క్షయ, పక్షపాతం, కడుపులో గడ్డలు, విషజ్వరాలు, రక్తహీనత, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అటవీ లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న చెంచుల జీవితాలు మరింత దుర్భరంగా ఉన్నాయి. వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు అందక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. దుర్భరంగా బతుకులు..మహబూబ్నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని చెంచుల సంక్షేమం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సున్నిపెంట (శ్రీశైలం)లో ఏర్పాటైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రభావితంగానే కొనసాగింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం 2015 మార్చి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూర్లో సమీకృత గిరి జనాభివృద్ధి సంస్థను (ఐటీడీఏ ) ఏర్పాటు చేశారు. దీని పరిధి లో నాగర్కర్నూల్, మహబూబ్ నగర్, నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలున్నాయి. ఆయా జిల్లాల్లోని 25 మండలాల్లో 172 గిరిజన గ్రామాలు, పెంటలు.. 4,041 చెంచు కుటుంబాలున్నాయి. 14,194 మంది గిరిజన జనాభా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో 88 చెంచు పెంటల్లో 2,595 కుటుంబాలుండగా.. 8,784 మంది చెంచులు నివసిస్తున్నారు. వీరిలో 4,341 మంది పురుషులు, 4,449 మంది మహిళలున్నారు. అభయారణ్యం పరిధిలో లింగాల, అమ్రాబాద్, పదర మండలాలుండగా.. 18 చెంచు పెంటలున్నాయి. 12 పెంటల్లో పూర్తిగా చెంచులే నివసిస్తుండగా.. మిగతా పెంటల్లో చెంచులతో పాటు ఎస్పీ, ఎస్టీలున్నారు. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని పర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతబైలు తదితర చెంచు పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏతో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందకుండా పోతున్నాయి. వీరి జీవన స్థితిగతుల మార్పు, సమస్యల పరిష్కారానికి చెంచు సేవా సంఘం ఆ«ధ్వర్యంలో ఎన్నోసార్లు పాదయాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టారు. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, విద్యుత్ సౌకర్యాలతో పాటు ఇళ్లు లేక చెంచులు అంధకారంలో బతుకులు వెళ్లదీస్తున్నారు.ఫలాల సేకరణకు హద్దులు..చెంచులు ప్రధానంగా అటవీ ఉత్పత్తుల సేకరణ, వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. అటవీ ప్రాంతంలో లభించే ఫలాల సేకరణకు హద్దులు ఏర్పాటు చేసుకుంటారు. వారు ఏర్పాటు చేసుకున్న సరిహద్దు ప్రాంతంలోనే ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తున్న హక్కుగా చెబుతున్నారు. చెంచుల ఆచారాలు, ఇంటి పేర్లు.. చెట్లు, వన్యప్రాణుల పేర్లతో కూడి ఉంటాయి.చెట్ల పెంపకం అంతంతే..అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే చెంచుల బతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. క్రమంగా అటవీ ఉత్పత్తులు అంతరించడం.. చెంచుల జీవన ప్రమాణాలు పెంచాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉండటంతో వారికి ఆహార కొరత ఏర్పడింది. నాగరికత ఎరుగని చెంచులు నేటికీ.. ఆహార సేకరణ దశలోనే ఉన్నారు. వీరి అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏ.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఫలాలు ఇచ్చే చెట్ల పెంపకంపై అధికారులు దృష్టి సారించడం లేదు. వేసవిలో కనీసం ఉపాధి పనులు కూడా చేపట్టకపోవడంతో చెంచులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.అటవీ ఉత్పత్తులు ఇవే..నల్లమల అటవీ ప్రాంతంలో తేనె, మారెడు గడ్డలు, జిగురు, చింతపండు, కుంకుడుకాయలు, ముష్టి గింజలు, ఎండు ఉసిరి, చిల్లగింజలు, నరమామిడి చెక్క, కరక్కాయలు, ఇప్పపువ్వు, ఇప్పగింజలు, కానుగ గింజలు, తునికాకు, బుడ్డపార్ల వేర్లు, వెదురుతో పాటు మరో పది రకాల ఉత్పత్తులు అడవిలో లభిస్తాయి. వాతావరణ పరిస్థితులు, రేడియేషన్ ప్రభావం వల్ల సహజసిద్ధంగా లభించే అటవీ ఫలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వీటికోసం చెంచులు పెద్ద పులులు ఇతర క్రూరమృగాలతో పొంచి ఉన్న ముప్పును సైతం లెక్కచేయడం లేదు. అటవీ ఉత్పత్తులు సేకరించి, గిరిజన కార్పొరేషన్ సంస్థ జీసీసీ కేంద్రాల్లో విక్రయిస్తూ.. తమకు కావలసిన సరుకులు తీసుకెళ్తారు. ఇప్పటికే తీగలు, గడ్డలు అంతరించిపోవడంతో చెంచులకు ఉపాధి లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృష్టి సారించినా.. చెంచులకు ఫలాలు ఇచ్చే మొక్కల పెంపకంపై మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికే అడవిలో లభించే తునికాకు సేకరణను అటవీశాఖ అధికారులు పదేళ్లుగా నిలిపివేశారు. రేడియేషన్ కారణంగా తేనెటీగలు అంతరించిపోవడంతో తేనె తుట్టెలు కనిపించడం లేదు. తేనెటీగల పెంపకంపై ప్రభుత్వం చెంచులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. చెంచులు ఏడాది పొడవునా జిగురు, చింతపండు, తేనెపైనే ఆధారపడి జీవిస్తున్నారు.ఉప్పుకైనా అప్పాపూరే..చెంచులకు జీసీసీ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. నల్లమలలోని చెంచులందరూ కాలినడకన అప్పాపూర్ చెంచుపెంటకు వచ్చి వాటిని కొనుగోలు చేస్తారు. అటవీ వస్తువులను విక్రయించి, వాటి ద్వారా వచ్చిన డబ్బుతో బియ్యం, నూనె, పప్పు వంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొన్ని సరుకులకు బయటి మార్కెట్ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. చెంచులకు నాసిరకం సరుకులు అంటగడుతున్నారు.బీమా కల్పించాలిప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు.. తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయోగపడుతున్నాయి. వారు ఇచ్చిన కిట్లు కూడా పాడయ్యాయి. కొత్త వాటిని ఇవ్వలేదు. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది. ఇప్పుడు అడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. – బయన్న, మల్లాపూర్ చెంచుపెంటపక్కా ఇళ్లు లేవులోతట్టు చెంచులు నేటికి ఆనాగరిక జీవితం కొనసాగిస్తున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గాయి. జీవనం కొనసాగడం కష్టంగా ఉంది. పక్కా ఇళ్లు లేక బొడ్డు గుడిసెల్లోనే కాపురం వెళ్లదీస్తున్నారు. ప్రత్యేక ఉపాధి తీసివేసిన తర్వాత పనులు లేకుండా పోయాయి. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నారు. – నిమ్మల శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ చెంచు ఐక్యవేదిక ఉపాధి కల్పనకు చర్యలుచెంచుల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. చెంచుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్«మన్ యోజన) పథకం కింద 88 చెంచుపెంటల్లో 11 రకాల కార్యక్రమాలను విడతల వారీగా చేపడుతున్నాం. చెంచుపెంటల్లో 1,030 ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదించి, పనులు ప్రారంభించాం. కొంతమంది చెంచులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆధార్కార్డులు అందజేశాం. ప్రత్యేక వైద్య వాహనం ఏర్పాటు చేశాం. మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.– రోహిత్రెడ్డి, ఇన్చార్జి ఐటీడీఏ పీవో -
మహిళకు నెట్టిల్లు మేలు!
మహిళకు నెట్టిల్లు మేలు ‘ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే ఏమవుతుంది?’ అనే ప్రశ్న ఒకప్పుడైతే అంత తీవ్రంగా ఆలోచించాల్సినంత ప్రశ్న కాకపోవచ్చు. ఇప్పుడు మాత్రం ఈ ప్రశ్నకు అధ్యయనకర్తలు అనేక కోణాలలో జవాబులు అన్వేషిస్తున్నారు...ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా దక్షిణాసియా కీలక దశలో ఉంది. మధ్యతరగతి అభివృద్ధిపథంలో ఉంది. అయితే ఈ పురోగతికి ఒక ఆటంకం ఉంది. అదే... డిజిటల్ జెండర్ డివైడ్. ఇంటర్నెట్ను ఉపయోగించడంలో స్త్రీ, పురుషుల మధ్య భారీ అంతరం ఉండడమే డిజిటల్ జెండర్ డివైడ్.ఇంటర్నెట్ అందుబాటులో లేని 260 కోట్ల మందిలో ఎక్కువగా మహిళలు, బాలికలే ఉన్నారు. దీనివల్ల మహిళలు ఉద్యోగ శిక్షణకు దూరం అవుతున్నారు. ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలు అందుకోలేకపోతున్నారు. ఆరోగ్య, ఆర్థిక సేవలకు దూరం అవుతున్నారు.గత 25 ఏళ్లలో దక్షిణాసియా అంతటా డిజిటల్ యాక్సెస్ విపరీతంగా పెరిగింది. మన దేశం విషయానికి వస్తే గత దశాబ్దకాలంలో ఇంటర్నెట్ వినియోగం నాలుగు రెట్లు పెరిగింది. అయితే స్త్రీ, పురుషుల విషయంలో ఈ పురోగతి ఒకేరకంగా లేదు. కట్టుబాట్లు మొదలుకొని వ్యవస్థాగత కారణాలు, పేదరికం వరకు రకరకాల కారణాల వల్ల మహిళలు, బాలికలు ఇంటర్నెట్కు దూరం అవుతున్నారు.ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే దక్షిణాసియా దేశాలలో మహిళలు విద్య, ఉద్యోగాలలో వెనకబడిపోతున్నారు. ఇంటర్నెట్కు దూరం కావడం అనేది మహిళల కెరీర్ అవకాశాలను పరిమితం చేస్తుంది. మన దేశంలో 20–25 శాతం వ్యాపారాలు మహిళలు నిర్వహిస్తున్నప్పటికీ 2 శాతం కంటే తక్కువ మంది మాత్రమే మూలధనాన్ని సమీకరించుకోగలుగుతున్నారు.ఇక ‘స్టెమ్’ విషయానికి వస్తే దక్షిణాసియా అంతటా కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మహిళలు 25 శాతం మాత్రమే ఉన్నారు. ‘స్టెమ్’ ఫీల్డ్కు సంబంధించిన ఉద్యోగాలలో కూడా మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం ఉంది. ‘డిజిటల్ జెండర్ డివైడ్ అనేది కేవలం సామాజిక సమస్య కాదు ఆర్థిక సమస్య కూడా’ అంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల మంది బాలికలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే కేవలం మూడేళ్లలో ఆయా దేశాల జీడిపీలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.‘మహిళలు ఇంటర్నెట్కు దగ్గరైతే ఉద్యోగ రంగంలో అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగాల వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఇది మహిళలకు వారి కుటుంబాల మెరుగైన జీవన నాణ్యత(క్వాలిటీ ఆఫ్ లైఫ్)కు దారి తీస్తుంది. మహిళలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. తరతరాలకు ఉపయోగపడే ఫలాలు ఇస్తుంది’ అంటున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డిజిటల్ ఇన్క్లూజన్ హెడ్ కెల్లీ ఓముడ్సెన్.2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఉద్యోగాల సంఖ్య 9.2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఆ ఉద్యోగాలలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటే వారు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అనేది అనివార్యం.(చదవండి: శారీ రన్! చీర కట్టులో కూడా పరుగు పెట్టొచ్చు..!) -
సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు
టాటా సన్స్ కంపెనీ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆగస్టు 16న కలిశారు. అదే రోజు – ‘టాస్క్ ఫోర్స్ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047’ కో– చైర్మన్ చంద్రశేఖర్ అని సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. ముఖ్య మంత్రి దీనికి చైర్మన్. ‘రాబోయే ఐదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబోతున్నది. ఇందులో అగ్రశ్రేణి ఇండస్ట్రీ ‘లీడర్లు’, నిపుణులు ఉంటారు’ అని పత్రికల్లో వార్తలొచ్చాయి. ఇది విన్నాక,ముందుగా ఈ విషయం చెప్పాలి అనిపించింది. ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ కంపెనీ ‘అమెజాన్’ తన రిక్రూట్మెంట్ విభాగంలో ఇకముందు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏ.ఐ.) వాడ వద్దని నిర్ణయం తీసుకుంది. ‘రిక్రూట్మెంట్’ కోసం దరఖా స్తులు ‘స్క్రూటినీ’ చేసేటప్పుడు, ‘జెండర్’ అని ఉండేచోట– ‘ఆడ’ అని ఉంటే, ‘ఏఐ’ వాటిని తిరస్కరిస్తున్నది. అది గమ నించాక, కంపెనీ దాని వాడడం వెంటనే ఆపేసింది. అటువంటి కంపెనీలే అంత బాధ్యతగా ఉంటున్నప్పుడు, ప్రజలు ఎంపిక చేసుకున్న ప్రభుత్వాలు యువతరం జీవితా లను ప్రభావితం చేసే ఉపాధి అంశాల విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలనేది అవి గ్రహించాలి. టీడీపీ ప్రభుత్వం 2015లో ఇలాగే– ‘స్ట్రాటజిక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్సా్ఫర్మింగ్ – ఏపీ’ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసినట్లుగా వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత, దానికి కొనసాగింపు కనిపించలేదు. ‘ఫేస్ బుక్’, ‘గూగుల్’ వంటి సామాజిక మాధ్యమాల బహుళ జాతీయ కంపెనీలు కొత్తగా అమరావతికి వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ ‘ఏఐ’ యూనివర్సిటీ వస్తుంది అని ఆ శాఖ మంత్రి అంటున్నారు. గతంలో ‘గేమ్స్ సిటీ’ అన్నారు. అయితే ఈ దిశలో ప్రభుత్వ స్థాయిలో జరగాల్సిన కసరత్తు ఇప్పటికే మొదలైతే, అది మంచిదే. అలాగే, వాటితోపాటు ఎన్నికల ముందు కూటమి వెల్లడించిన– ‘స్కిల్ సెన్సెస్’ వెంటనే పూర్తికావాలి. ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు తమ వద్ద లేవనుకున్నప్పుడు ఇదొక పద్ధతి. అలా కాకుండా తాము చేసింది ఏదైనా అది ఆ ప్రాంతానికీ, ప్రజలకూ కూడా శాశ్వత ప్రయోజనం కలగాలి. తామే అందుకు ప్రత్యామ్నాయాలు వెతకాలని ప్రభుత్వం అను కొన్నప్పుడు అది మరోలా ఉంటుంది. అప్పటి ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖర రెడ్డి 2008లో ప్రారంభించిన ‘సెజ్’లో ఇప్పుడు ‘శ్రీసిటీ’గా అందరికీ తెలిసిన–‘సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ’ (టౌన్ షిప్) ఉంది. అదిప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది. రాష్ట్రానికి ఏ ప్రపంచ దిగ్గజ కంపెనీ వచ్చినా వాళ్లకు ప్రభుత్వాలు ఇప్పుడు చూపించేది– ‘శ్రీసిటీ’. సీఎమ్గా వైఎస్ మొత్తం 22 ‘సెజ్’లకు కేంద్రం నుంచి అనుమతి తెచ్చారు. నాన్న కృషికి కొనసాగింపు అన్నట్టుగా జగన్ ప్రభుత్వంలో రాయలసీమ ఖనిజ నిక్షేపాల విలువ పెంచడానికి కడప జిల్లా కొప్పర్తి వద్ద ‘మెగా ఇండస్ట్రియల్ హబ్’ కోసం 2020లో 3,155 ఎకరాలను కేటాయించారు. ఇది కర్నూల్ – రాణిపేట నేషనల్ హైవేకి, రైల్వే లైన్, కడప ఎయిర్ పోర్ట్కు సమీపాన ఉండడమే కాకుండా... రేణిగుంట అంతర్జాతీయ విమానా శ్రయానికి 145 కి.మీ దూరంలో ఉంది. ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తున్న వసతులతో రూ. 25,000 కోట్ల మేర పెట్టు బడులు వస్తాయనీ, 2.5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందనీ 2020 డిసెంబర్ నాటి ప్రభుత్వ అంచనా. కనీసం శ్రీసిటీ, కొప్పర్తి వంటి పారిశ్రామిక కూడళ్ళ వద్ద, అలాగే కొత్త జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పడే మార్కెట్ డిమాండ్ దృష్ట్యా సూక్ష్మ స్థాయిలో ‘సర్వీస్ సెక్టార్’లో ‘ఐటీఐ’, ‘పాలి టెక్నిక్’ స్థాయిలో ‘కరిక్యులం’ సమీక్ష అనేది ముందు... ‘స్కిల్ సెన్సెస్’ పూర్తి అయితే అప్పుడు వాటిని సరిచేసుకోవచ్చు. దానివల్ల ‘స్టార్ట్ అప్’లకు ‘ఎంఎస్ఎంఈ’లకు అవసరమైన కొత్త ‘మ్యాన్ పవర్’ దొరుకుతుంది. కానీ ఇవన్నీ ‘పెండింగ్’లో ఉంచి, అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున –‘అంకుర యాత్ర’ పేరుతో భారీ బస్ ర్యాలీ అమరావతి నుంచి శ్రీసిటీ వరకు ప్రభుత్వం ‘ప్లాన్’ చేసింది. ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ‘ఎన్నారై’లు మన ‘స్టార్ట్ అప్’లను ప్రోత్సహించడానికి ఇక్కడికి వస్తున్నారని అంటున్నారు. అదలా ఉంటే, కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ‘విజన్ డాక్యుమెంట్లు’ తయారుచేస్తారని వార్తలు వస్తున్నాయి. పరిపాలనలో ఇంత అనుభవం ఉన్న పార్టీ ప్రభుత్వానికి మళ్ళీ ఇటువంటి కసరత్తు అవసరమా? మరి ఏ ‘విజన్’ అనకుండానే గత ప్రభుత్వం ఉద్యానవనం, పరిశ్రమలు రెండింటినీ కలుపుతూ కొత్తగా ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖను ప్రారంభించింది. దాంతో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మొదటిసారి ఆ శాఖకు మంత్రిని నియమించింది. ఈ శాఖ ఏర్పాటుతో రైతులకు సంప్రదాయ పంటల సాగు కంటే ఉద్యా నవన ఉత్పత్తులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ఇలా గత ప్రభుత్వం చూపించిన బాటలో కూటమి ప్రభుత్వం కొన సాగుతూ మైక్రో ఇరిగేషన్తో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2029 నాటికి రెట్టింపు చేస్తాం అంటున్నారు. కేంద్ర–రాష్ట్రాలు కలిసి ప్రస్తుతం ఇస్తున్న 55% సబ్సిడీని ఇక ముందు 90% శాతానికి పెంచాలని నిర్ణయించారు. వాస్తవానికి అభివృద్ధి ప్రణాళికల అమలు పలు దొంత ర్లుగా ఉంటుంది. అదలా ఉన్నప్పుడే, సూక్ష్మ స్థాయి వరకు ఇంకి కొన్ని తరాలు పాటు ఆ మేలు చివరి ‘మైలు’ వరకు చేరు తుంది. ఇంతకూ ‘విజన్’ అంటే ఏమిటి? ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ తాడేపల్లిగూడెం వద్ద హార్టీకల్చర్ యూనివర్సిటీ పెడితే, విభజిత ఏపీలో జగన్ ‘ఫుడ్ ఇండస్ట్రీ శాఖ పెట్టడం! ఫలితంగా ఈ ప్రభుత్వంలో దానికి కొత్తగా ఒక మంత్రి వచ్చి, పంట విస్తీర్ణం రెట్టింపు లక్ష్యంగా ప్రకటించడం. దానివల్ల ప్రయోజనాల వ్యాప్తి 26 జిల్లాలకు ఉంటుంది. అది మట్టిలో చేసే సాగుబడి నుంచి, ఆ ఉత్ప్పత్తులను ‘ఆన్ లైన్’లో మార్కె టింగ్ చేస్తూ ‘డెస్క్’ వద్దకు చేరింది! ప్రతి దశలోనూ ఇందులో యువత ప్రయోజనాలు పొందుతుంది. నిజానికి ఇది ‘ప్రాంతము– ప్రజలు’ కేంద్రిత అభివృద్ధి నమూనా.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అర్హతకు తగిన ఉపాధి లేకపోతే...
నేడు భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి అల్ప ఉద్యోగిత. అర్హత, నైçపుణ్యాలకు తగిన ఉద్యోగానికి బదులు... తక్కువ స్థాయి ఉద్యోగం లభించే స్థితినే అల్ప ఉద్యోగిత అంటారు. ఇది ఆర్థిక వ్యవస్థలో ఉపాధి, శ్రామిక శక్తుల వినియోగానికి కొలమానం. అల్ప ఉద్యోగితకు అనేక కారణాలు ఉన్నాయి. పరిశ్రమల డిమాండ్లో మార్పుల కార ణంగా పాత నైపుణ్యాలు కలిగిన కార్మికులకు ఉపాధి దొరకదు. భౌగోళిక అసమానతలు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేస్తాయి. లింగ, జాతి లేదా వయస్సు ఆధారంగా చూపే పక్షపాతం వ్యక్తులు తగిన ఉపాధిని పొందకుండా అడ్డుకుంటుంది. కొన్ని రంగాలలో అధిక పోటీ కారణంగా అర్హత కలిగిన అభ్యర్థులు తమ నైపుణ్యానికి సరి పోయే ఉద్యోగాలను పొందడం కష్టమవుతుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త రంగంలోకి మారి తగిన ఉద్యోగాలు సంపాదించాలన్నా... ఆ రంగా నికి అవసరమైన నైపుణ్యాల కొరత కారణంగా ఉద్యోగాలు పొందడం కష్టమవుతుంది. అల్ప ఉద్యోగిత వ్యక్తిగతంగానూ, సామాజిక పరంగానూ నష్టదాయకం. వ్యక్తులు తరచుగా ప్రాథమిక అవసరాలు తీరడానికి కూడా ఖర్చు చేయలేరు. అందువల్ల అప్పుల పాలవుతారు. ఆర్థిక అభద్రతకూ గురవుతారు. అల్ప ఉద్యోగిత ఎక్కు కాలం కొనసాగడం వల్ల వ్యక్తుల నైపుణ్యాలు క్షీణిస్తాయి. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై ఎక్కువ ఆధారపడటానికి అల్ప ఉద్యోగిత దారి తీస్తుంది. ప్రజా వనరులపై భారం పడుతుంది. ఈ స్థితి ఆర్థిక అసమానతలను పెంచుతుంది. వ్యక్తుల నైపుణ్యాలు పూర్తిగా వినియోగించుకోలేని కారణంగా ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పాదకత క్షీణించవచ్చు. అల్ప ఉపాధి వల్ల తక్కువ ఆదాయం వస్తుంది కనుక వస్తు వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిరుద్యోగం లాగానే అల్ప ఉద్యోగిత కూడా ప్రపంచ దేశాల సమస్య. దేశాలు, ప్రాంతాలను బట్టి దీని తీవ్రత మారుతూ ఉంటుంది.ముఖ్యంగా స్పెయిన్, గ్రీస్, ఇటలీ దేశాలలో చాలా మంది నైపుణ్యం కలిగిన కార్మికులు తక్కువ జీతాలు పొందుతున్నారు లేదా పార్ట్టైమ్ ఉద్యో గాలు చేస్తున్నారు.కొన్ని అధ్యయనాల ప్రకారం భారతదేశంలో అల్ప ఉద్యోగిత 15–20 శాతం ఉన్నట్లు తేలింది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటాను బట్టి... కేరళలో 10–15%, తమిళ నాడులో దాదాపు 10–20%, గుజరాత్, మహా రాష్ట్రల్లో 10–15% వరకు అల్ప ఉద్యోగిత ఉందని అంచనా. ఉత్తరప్రదేశ్లో వ్యవసాయం ఎక్కువగా ఉండి ఉద్యోగాల కల్పన పరిమితంగా ఉన్నందున 20–30% అల్ప ఉద్యోగిత ఉంది. బిహార్లో వ్యవ సాయంపై ఆధారపడి ఉండటం, తక్కువ పారిశ్రా మిక వృద్ధి జరగడం వల్ల అక్కడ, బహుశా 30% కంటే ఎక్కువ అల్ప ఉద్యోగిత ఉంది. అనేక దేశాలు అల్ప ఉద్యోగితను తగ్గించే లక్ష్యంతో కొన్ని విధానాలను అమలు చేశాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాల కోసం కార్మికులు సన్నద్ధమయ్యారని నిర్ధారించుకోవడానికి వృత్తి శిక్షణ–నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడిని ప్రోత్సహించడం అందులో ఒకటి. ఉద్యోగ భద్రతను పెంచే విధానాలు చేపట్టడం, పని పరిస్థితులను మెరుగు పరచడం, న్యాయమైన వేతనాలను ప్రోత్సహించడం; గ్రాంట్లు, రుణాలు, శిక్షణ ద్వారా చిన్న వ్యాపార అభివృద్ధిని ప్రోత్సహించడం; పార్ట్ టైమ్ లేదా గిగ్ వర్క్కు మద్దతు ఇచ్చే విధానాలు రూపొందించడం వంటి విధానాలను ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. అల్ప ఉద్యోగితను పరిష్కరించడానికి తరచుగా నైపుణ్యాల శిక్షణ, ఆర్థిక మద్దతు, ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించే బహు ముఖ విధానం అవసరం. ప్రభుత్వాలు ఈ దిశలో చర్యలు తీసుకుంటే కొంత పరిష్కారం లభిస్తుంది.డా‘‘ పి.ఎస్. చారి వ్యాసకర్త బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ మొబైల్: 83090 82823 -
స్కిల్స్ వర్సిటీలో భాగస్వాములు కండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలతో పాటు పారిశ్రామికవేత్తలు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. సీఎం గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, బోర్డు సభ్యులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు రూ.100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు, కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఆయన స్కిల్స్ యూనివర్సిటీకి బ్రాండ్ ఇమేజీని తీసుకువస్తారనే నమ్మకం ఉందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని తెలిపారు. దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పి, 2028 ఒలింపిక్స్లో ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణ అందిస్తుందని చెప్పారు. పట్టాలు ముఖ్యం కాదు.. నైపుణ్యం కావాలి డిగ్రీ, పీజీ పట్టాలు ఉంటే సరిపోదని, ఏటేటా లక్షలాది మంది యువకులు డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నప్పటికీ, అందరూ ఉద్యోగాలు సాధించలేక పోతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన లక్షలాది మంది యువకులు ఒక ఉద్యోగం ఇప్పించమని తన వద్దకు వస్తున్నారంటూ తనకు ఎదురైన కొన్ని అనుభవాలను వివరించారు. ఇదే సమయంలో పరిశ్రమలు మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఈ అంతరాన్ని తొలిగించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పాలని, తద్వారా యువత ఉపాధికి ఢోకా ఉండదని భావించినట్లు తెలిపారు. ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్: శ్రీధర్బాబు స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి పలు కీలక అంశాలను మంత్రి శ్రీధర్బాబు పారిశ్రామికవేత్తలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ను ప్రపంచ స్థాయి ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుందని అన్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఫ్యూచర్ సిటీని నెలకొల్పుతోందని, ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రి స్వీయ ఆలోచనతో త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ లో కొత్త కోర్సులు ప్రారంభమవటం ఆనందంగా ఉందన్నారు. సీఎం ఆలోచనలో దార్శినికత ఉంది ఆనంద్ మహీంద్రా తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయమైన పథకాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తాయని, కానీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని భావించడంలో దార్శనికత ఉందని అన్నారు. అతి పెద్ద యూఎస్ కాన్సులేట్ తెలంగాణలో ఉందని, ఇక్కడి నుంచే అమెరికాకు ఎక్కువ మంది వెళుతున్నారని తెలిపారు. కాగా యూనివర్సిటీలో వచ్చే నెల దసరా పండుగ తర్వాత కోర్సులు ప్రారంభించనున్నట్లు బోర్డు తెలిపింది. ఈ సమావేశంలో బోర్డు కో చైర్మన్ శ్రీని రాజు, సభ్యులు పి.దేవయ్య, సుచిత్రా ఎల్లా, సతీష్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బోర్డు సభ్యులు మనీష్ సభర్వాల్, సంజీవ్ బిక్చందానీ, ఎంఎం మురుగప్పన్, డాక్టర్ కేపీ కృష్ణన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. -
తమ వాళ్ల కోసం సోషల్ మీడియా పోస్టులు
సాక్షి, అమరావతి: పార్టీ వారికి ఉపాధి కోసం ఏకంగా ప్రభుత్వంలో చంద్రబాబు సర్కారు సోషల్ మీడియా పోస్టులను సృష్టించింది. ప్రభుత్వం నేరుగా ఇటువంటి పోస్టులను సృష్టించి భర్తీ చేయడం ఇదే తొలిసారి. మంత్రుల పేషీల్లో పనిచేయడం కోసం మొత్తం 44 సోషల్ మీడియా పోస్టులను సృష్టించడమే కాకుండా వాటిని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ మేరకు డిజిటల్ కార్పొరేషన్ లిమిడెట్ సోమవారం ఎంప్లాయ్మెంట్ నోటీసు జారీ చేసింది. 24 మంది మంత్రుల పేషీల్లో 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ను, మరో 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్స్ను భర్తీచేయనున్నట్లు నోటీసులో పేర్కొంది. ఔట్ సోర్సింగ్ విధానంలో వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటీసులో స్పష్టం చేసింది. వ్యక్తిగత ఇంటర్వ్యూలు ద్వారా ఎంపిక అంటేనే పార్టీకి చెందిన వారిని తీసుకుంటారని స్పష్టం అవుతోంది. ప్రభుత్వ ఇమేజ్ను పెంపొందించాలని, సోషల్ మీడియా ఖాతాలను, సంఘాలను నిర్వహించాల్సి ఉంటుందని, ప్రభుత్వ సందేశాలను, కార్యక్రమాలను బలంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సి ఉంటుందని నోటీస్లో పేర్కొంది. వీసీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంసాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నత విద్యా కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఈనెల 28వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 10ఏళ్ల పాటు ఆచార్యులు, సంబంధిత స్థాయిలో అనుభవం గడించిన వారు వైస్ చాన్సలర్లు పోస్టుల కోసం దరఖాస్తుకు అర్హులని తెలిపారు. మూడేళ్ల కాల పరిమితితో భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. -
తగ్గుతున్న ఉద్యోగాలు.. అందరి చూపు అటువైపే!
నిరుద్యోగం అనేది భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒక సమస్యగా ఉంది. యూరప్ దేశమైన ఎస్టోనియాలో నిరుద్యోగం రేటు 2024 రెండో త్రైమాసికంలో 7.6 శాతం పెరిగిందని స్టాటిస్టిక్స్ ఎస్టోనియా సంస్థ 'టీ వాసిల్జెవా' (Tea Vassiljeva) వెల్లడించారు.టీ వాసిల్జెవా గణాంకాల ప్రకారం, 2023 రెండో త్రైమాసికంతో పోలిస్తే 2024 రెండో త్రైమాసికంలో నిరుద్యోగుల సంఖ్య 7,600 పెరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ భాగం యువత ఉన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. రెండవ త్రైమాసికంలో నిరుద్యోగుల సంఖ్య కొంత ఎక్కువే అని వాసిల్జెవా పేర్కొన్నారు.పెరిగిన స్వయం ఉపాధిఎస్టోనియాలో ఉద్యోగం రాలేదని ఎదురు చూడకుండా.. చాలామంది స్వయం ఉపాధివైపు అడుగులు వేశారు. దీంతో స్వయం ఉపాధి పెరిగింది, ఉపాధిలో ఉన్నవారి సంఖ్య వృద్ధి చెందింది. ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో ఉపాధిలో ఉన్న వ్యక్తుల నిష్పత్తి 10.6 శాతానికి చేరింది.రాబోయే రోజుల్లో (మూడో త్రైమాసికం) స్వయం ఉపాధి మరింత పెరిగే అవకాశం ఉందని వాసిల్జెవా వెల్లడించింది. ఇందులో 15 నుంచి 74 సంవత్సరాల వయసున్న వారు ఉన్నారు. వీరందరూ ఉద్యోగం కోసం వేచి చూడక సొంత పని ప్రారంభిస్తున్నారు. ఇది వారి ఆర్థిక వృద్ధికి దోహదపడుతోంది.ఇదీ చదవండి: మార్చి నాటికి భారత్లో 6 లక్షల ఉద్యోగాలు: యాపిల్లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాల ప్రకారం, ఎస్టోనియాలో శాశ్వత నివాసులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తాత్కాలికంగా ఉండేవారు లేదా ఉక్రేనియన్ శరణార్ధుల సంఖ్య తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది కూడా ఎస్టోనియాలో స్వయం ఉపాధి పెరగటానికి ఓ కారణమనే చెప్పాలి. ఎందుకంటే తాత్కాలికంగా ఉండే ప్రజలు ఉద్యోగం లేకుంటే.. ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. కానీ శాశ్వతంగా నివాసం ఉండేవారు అక్కడే ఉండాలని, ఉద్యోగం లేకపోతే స్వయం ఉపాధి చూసుకుంటున్నారు. ఇలా అక్కడ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పెరుగుతోంది. ఇదే ఫార్ములా ఎక్కడైనా, ఏ దేశంలో అయినా ఉపయోగించవచ్చు. ఉద్యోగం రాలేదని ఎదురు చూడక, స్వయం ఉపాధి పొందవచ్చు. -
కాల్ చేస్తే కట్ చేయొచ్చు
సిడ్నీ: ఆఫీసులో పని ముగించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యాజమాన్యం నుంచి ఫోన్లు, మెసేజ్లు వస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకు కలుగుతుంది కదా! ఆ్రస్టేలియాలో ఇలాంటి చిరాకు ఇకపై ఉండదు. ఎందుకంటే ‘రైట్ టు డిస్కనెక్ట్’ నిబంధన అమల్లోకి వచ్చింది. పని వేళలు ముగించుకొని ఇంటికెళ్లిన ఉద్యోగులకు యాజమాన్యాలు అనవసరంగా ఫోన్ చేస్తే జరిమానా విధిస్తారు. యాజమాన్యాలు ఫోన్లు, మెసేజ్లు చేస్తే ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. మాట్లాడకపోతే శిక్షిస్తారేమో, ఉద్యోగం పోతోందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆఫీసు అయిపోయాక యాజమాన్యం ఫోన్ చేస్తే ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేయొచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ఫోన్ వస్తే ఉద్యోగులు స్పందించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఫోన్కాల్ను తిరస్కరించకూడదు. ఎఫ్డబ్ల్యూసీ నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలకు 94 వేల డాలర్లు, ఉద్యోగులకు 19 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. ఆఫీసులో పని ముగిశాక తమకు ఫోన్ చేయవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకొనే అధికారాన్ని ఉద్యోగికి కట్టబెట్టారు. ఆ్రస్టేలియాలో ఆఫీసు టైమ్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయడం మామూలే. ఒక్కో ఉద్యోగి ప్రతిఏటా సగటున 281 గంటలు అధికంగా ఆఫీసులో పని చేస్తున్నట్లు గత ఏడాది ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఓవర్టైమ్ పనికి అదనపు వేతనం ఉండదు. -
ఉత్తుత్తి గ్రామసభలే!
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పనుల్లో ఏమేమి చేయాలో ముందే నిర్ణయించుకుని, వాటికి అధికార ముద్ర కోసం ఉత్తుత్తి గ్రామ సభలు నిర్వహించడానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. శుక్రవారం (నేడు) రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తామంటూ ఆర్భాటం చేస్తోంది. ఉపాధి హామీ పథకం నిబంధనలకు తూట్లు పొడుస్తూ గ్రామ సభల నిర్వహణకు సంబంధించి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.గ్రామాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సచివాలయాల భవనాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులన్నింటినీ పక్కనపెట్టి, ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరీ నిధులతో కొత్తగా గ్రామాల్లో అధికార పార్టీ నేతలకు పనులను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరి నిధుల నుంచి ఒక్కో నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 2 వేల కోట్ల మేర కొత్త పనులు గుర్తింపు ప్రక్రియ అంతా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాదాపు పూర్తయింది. నిజానికి.. ఉపాధి పథకంలో చేపట్టే ఏ పనైనా నిబంధనల ప్రకారం ముందుగా గ్రామసభ ఆమోదం పొందాలి.అందుకే కూటమి పెద్దలు తమ వాళ్లకి కట్టబెట్టే పనులకు ఆమోదం తెలపడానికి ఉత్తుత్తి గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఎందుకీ హడావుడి పవన్.. ఈ ఉత్తుత్తి గ్రామ సభల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా ఎక్కడాలేని హడావుడి చేస్తుండడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించాలని పక్షం రోజులుగా పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఆయన సోమవారం అన్ని జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు జరగడం కొత్త కాదని, ఏటా నాలుగు విడతలుగా (ఏప్రిల్ 24న, ఆగస్టు 15న, అక్టోబర్ 2న, జనవరిలో మరో విడత) గ్రామ సభలు జరుగుతూనే ఉంటాయని అధికారులు గుర్తు చేస్తున్నారు.ఇప్పుడే ఎందుకింత హడావుడి చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. 9.92 లక్షల పనులకు జనవరిలోనే ఆమోదం సాధారణంగా ఏప్రిల్లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఆరు నెలల ముందు నుంచే.. పంచాయతీలో చేపట్టాల్సిన పనులు, పేదలకు పనిదినాల కల్పనకు ఉన్న అవకాశాలు గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టి ఫిబ్రవరిలో పూర్తి చేస్తారు. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయి లేబర్ బడ్జెట్ రూపకల్పనతో గ్రామాల వారీగా పనుల గుర్తింపు, ఆ పనులకు గ్రామ సభలో ఆమోదం వంటి ప్రక్రియ కూడా ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు కల్లా అధికారులు పూర్తి చేశారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూలీలకు కల్పించే పనులతో పాటు మెటీరియల్ నిధులతో చేపట్టే ఇతర అభివృద్ధి పనులన్నీ కలిపి మొత్తం 9.92 లక్షల పనులకు ఈ ఏడాది జనవరిలోనే గ్రామ సభల్లో ఆమోదం తీసుకొని, ఆ పనుల జాబితాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పుడే అందజేశారు. అందులో దాదాపు 8.53 లక్షల పనులు పురోగతి దశలో ఉన్నాయి. అయితే, తమ నాయకులకు ఆర్థిక లబ్ధిని చేకూర్చే మట్టి రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులకు కొత్తగా అనుమతులు తెలిపేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. -
ఉపాధి రహిత వృద్ధి వృథాయే!
కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల తరువాత ఎదురైన ఆర్థిక సవాళ్లను అధిగమించి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడింది. కాబట్టి భవిష్యత్తులో భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నా యని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. స్థిరమైన వృద్ధిరేటుతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనతోనే 2047 నాటికి భారత్ ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకో గలుగుతుంది.ఒక్క సంపద సృష్టితోనే ఏ ఆర్థిక వ్యవస్థా బలంగా ఎదగలేదు. సంపద వృద్ధితో పాటు మానవ వనరుల ప్రమాణాలను పెంచే ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన తోనే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా బలంగా ఎదుగుతుంది. కానీ ఆరు దశాబ్దాల ప్రణాళికా యుగంలో భారత దేశంలో వృద్ధిరేటు ఉపాధి రహితంగా మందకొడిగా కొనసాగింది. ఫలితంగా ఉద్యోగ అవకాశాల సృష్టిలో వెనకబడటం వలన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. 1991 నుండి దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తరువాత ఆర్థిక వృద్ధిరేటు పెరిగినా అది కూడా ఉపాధి రహితంగానే కొనసాగిందనే చెప్పాలి.ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ... భారత దేశంలోని ఉద్యోగ ఉపాధి కల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కల్పనలో భారతదేశం జీ–20 దేశాల కంటే వెనకబడి ఉంది. అలాగే 2010– 20ల మధ్యకాలంలో దేశంలో సగటు వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటే ఉపాధి కల్పన రేటు మాత్రం కేవలం రెండు శాతం గానే ఉంది. అంటే ఇప్పటికీ భారతదేశంలో ఉపాధి రహిత వృద్ధి కొనసాగు తోందని గీతా గోపీనాథ్ కూడా భావిస్తున్నారని చెప్పాలి. సులభతర వ్యాపారం ద్వారా దిగుమతి సుంకాలను తగ్గించి మరింత ప్రైవేటు పెట్టబడులను ఆకర్షించటం ద్వారా ఉద్యోగాల సృష్టి జరగటానికి అవకాశం ఉంటుందని గీతా గోపీనాథ్ సూచిస్తున్నారు.2024– 25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతం నుండి 7 శాతం వరకు ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వే భావిస్తోంది. అలాగే ప్రపంచ బ్యాంకు కూడా భారత్ వార్షిక వృద్ధి రేటు 6.3 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కానీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) రిపోర్ట్ ప్రకారంగా 2014లో 5.4 శాతంగా ఉన్న నిరుద్యోగితా రేటు 2024 మొదటి త్రైమాసికానికి 9.2 శాతానికి పెరగటం, పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా 15 ఏళ్లు పైబడిన వయసుగల వారిలో నిరుద్యోగిత రేటు 17 శాతంగా ఉండటం కూడా ఆందోళన కలిగించే అంశం.ఆర్థిక మందగమనం వలన ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ విధానాల వలన ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో జాప్యం వలన నిరుద్యోగ సమస్య తీవ్రత దేశంలో పెరుగుతుందని చెప్పాలి. 3,942 అమెరికన్ డాలర్ల జీడీపీగా ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్... గీతా గోపీనాథ్ చెప్తున్నట్లు 2027 నాటికి జర్మనీ, జపాన్లను కూడా అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చు. కానీ ఆ ఎదుగుదల ఉపాధి ఉద్యోగాలను సృష్టించేదిగా ఉంటే యువ భారత్కి ఉపయోగకరంగా ఉంటుంది. – డాక్టర్ తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం, 98854 65877 -
ఎకానమీకి అమెజాన్ చేసిందేమీ లేదు
న్యూఢిల్లీ: భారత్లో వ్యాపారం కొనసాగించడానికే అమెజాన్ తాజా పెట్టుబడులు చేస్తుందని, ఇందులో సంబరపడాల్సిందేమీ లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెజాన్ తన పెట్టుబడులతో భారత్లోని సేవల రంగానికి, ఆర్థిక వ్యవస్థకు చేసిందేమీ లేదన్నారు. పనిలో పనిగా ఈ–కామర్స్ పరిశ్రమ లక్షలాది రిటైలర్ల ఉపాధిని దెబ్బతీస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,300 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అమెజాన్ చేసిన ప్రకటన పట్ల సంతోషించాల్సిందేమీ లేదన్నారు. భారత వ్యాపారంలో నష్టాలను పూడ్చుకోవడానికే తాజా పెట్టుబడులను తీసుకొస్తున్నట్టు వ్యాఖ్యానించారు. కొల్లగొట్టే ధరల విధానాన్ని ఈ నష్టాలు సూచిస్తున్నాయంటూ.. ఇది భారత్కు ఎంత మాత్రం మేలు చేయబోదని, చిన్న వర్తకులను దెబ్బతీస్తుందన్నారు. ‘ఉపాధి అవకాశాలు, వినియోగదారుల సంక్షేమంపై ఈ–కామర్స్ రంగం చూపించే నికర ప్రభావం’ పేరుతో ఓ నివేదికను మంత్రి బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. దేశంలో చిన్న రిటైలర్ల ఉపాధిని దెబ్బతీసే ఈ–కామర్స్ కంపెనీల వ్యాపార నమూనాను మంత్రి ప్రశ్నించారు.ఈ–రిటైలర్లతో 1.58 కోట్ల ఉద్యోగాలు ఆన్లైన్ వర్తకులు దేశంలో 1.58 కోట్ల మందికి ఉపాధి కల్పించినట్టు మంత్రి గోయల్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇందులో 35 లక్షల మంది మహిళలు ఉన్నట్టు, 17.6 లక్షల రిటైల్ సంస్థలు ఈ –కామర్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ నివేదికను పహలే ఇండియా ఫౌండేషన్ (పీఐఎఫ్) విడుదల చేసింది. భారత్లో ఉపాధి కల్పన పరంగా, కస్టమర్ల సంక్షేమం పరంగా (మెరుగైన అనుభవం) ఈ–కామర్స్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ–కామర్స్ తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరిస్తున్నట్టు వెల్లడించింది. టైర్–3 పట్టణాల్లోని వినియోగదారులు నెలవారీగా రూ.5,000కు పైనే ఆన్లైన్ షాపింగ్పై ఖర్చు చేస్తున్నట్టు వివరించింది. ఉపాధిపై ఈ–కామర్స్ రంగం చూపిస్తున్న ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 2,062 మంది ఆన్లైన్ వర్తకులు, 2,031 ఆఫ్లైన్ వర్తకులు, 8,209 మంది వినియోగదారుల అభిప్రాయాలను పీఐఎఫ్ తెలుసుకుంది. -
వ్యవసాయం.. యువరైతు దూరం!
సాక్షి, వరంగల్: రాష్ట్రంలో వ్యవసాయానికి యువరైతులు దూరమవుతున్నారు. వాతావరణ అనిశ్చిత పరిస్థితులు, తక్కువ దిగుబడులకు తోడు చిన్న భూ కమతాల సంఖ్య పెరగడంతో ఆ విస్తీర్ణంలో పండిన పంటకు వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోక ఈ రంగాన్నే వీడుతున్నారు. నగరీకరణకు అనుగుణంగా గ్రామాల్లోనూ జీవనోపాధి ఖర్చులు పెరగడంతో అంత మేర ఆదాయం పొందేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మరలుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ యూనిట్, గ్లోబల్ డెవలప్మెంట్ ఇంక్యుబేటర్, ట్రాన్స్ఫార్మింగ్ రూరల్ ఇండియా సంస్థలు నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంస్థలు ‘స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయ్మెంట్–2024’ పేరుతో ఇటీవల నివేదికను విడుదల చేశాయి.వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లతో యువ రైతులు ఈ రంగాన్ని వీడి పట్టణాలు, నగరాల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొనేందుకు లేదా ఇతర రంగాలను ఎంచుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు 60 శాతం మంది యువత సాగును వీడారని పేర్కొంది. చిన్న కమతాలు ఎక్కువే... : రాష్ట్రంలో సగటు భూకమతాల విస్తీర్ణం ఒక హెక్టార్ (2.47 ఎకరాలు) నుంచి 0.89 హెక్టార్ల (2.19 ఎకరాలు)కు తగ్గింది. కుటుంబాల విభజనతో భూముల పంపకంతోపాటు కొత్తగా సాగు, జీవనోపాధి కోసం సొంతంగా భూముల కొనుగోళ్లకు మొగ్గు చూపడం తదితర కారణాలతో చిన్న కమతాలు పెరిగాయి. 2.47 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం గల భూమిని సన్నకారు, 2.48 నుంచి 4.94 ఎకరాలను చిన్నకారు, 4.95 ఎకరాల నుంచి 9.88 ఎకరాలను పాక్షిక మధ్యతరహా, 9.89 నుంచి 24.77 ఎకరాలుంటే మధ్యతరహా, 24.78 ఎకరాలకన్నా పైన ఉంటే పెద్ద భూకమతంగా పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురం భీం, భద్రాద్రి జిల్లాల్లో 1.5, 1.4, 1.3 హెక్టార్ల విస్తీర్ణం సగటున ఉంటే కరీంనగర్, వరంగల్ జిల్లా, మెదక్ జిల్లాల్లో 0.75, 0.74, 0.60 హెక్టార్లుగా సగటు విస్తీర్ణం ఉంది. రాష్ట్రంలో చిన్న కమతాలతో సేద్యం ఎక్కువగా జరుగుతుందని ఇటీవల విడుదలైన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక పేర్కొంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికవేడు గ్రామానికి చెందిన ఇతని పేరు గారె రాజు. అతనికి వారసత్వంగా ఎకరం భూమి ఉంది. ఇది పంట సాగుకు సరిపోకపోవడంతో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, మొక్కజొన్న, పత్తి సాగు చేశాడు. ట్రాక్టర్ కూడా కొన్నాడు. 2020 నుంచి 2024 వరకు రూ. లక్షలు వెచ్చించి వ్యవసాయం చేసినా కష్టానికి తగ్గ ప్రతిఫలం రాలేదు. దీంతో ఫొటోగ్రఫీని జీవనాధారంగా మార్చుకున్నాడు. వ్యవసాయంపై ప్రేమ ఉన్నా సాగు ఖర్చులకు తగ్గట్టు లాభాల్లేక సాగుకు దూరమైనట్లు చెప్పాడు. పెట్టుబడి ఖర్చుకు తగ్గ ఆదాయం రాక అవస్థలు » చిన్న భూకమతాలు, వాతావరణ అనిశ్చి తి, తక్కువ దిగుబడులూ కారణం » కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ ఉపాధి వైపు అడుగులు » స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయ్మెంట్–2024 నివేదికలో వెల్లడి » యువతకు నైపుణ్యాల పెంపుతో ఆదాయం పెంచొచ్చంటున్న నిపుణులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలివ్యవసాయానికి దూరమవుతున్న యువతకు బ్రేక్ వేయాలంటే విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను విస్తృతంగా నెలకొల్పాలి. మొక్కజొన్నల నుంచి పేలాల తయారీ, మామిడి నుంచి గుజ్జు తీయడం, మిరపకాయ నుంచి కారం... ఇలా వివిధ పరిశ్రమలను గ్రామాల్లో నెలకొల్పాలి. అలాగే యువతకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించాలి. – ఉమారెడ్డి, ఏడీఆర్, వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంట్రైనింగ్ కోర్సులు అందించాలి యువ రైతులకు పంటల సాగు పద్ధతులపై సరి్టఫికెట్ ట్రైనింగ్ కోర్సులు అందించాల్సిన అవసరం ఉంది. యాంత్రీకరణతో కూడిన యాజమాన్య పద్ధతులు తీసుకురావాలి. కస్టమ్ హైరింగ్ సెంటర్లను విస్తృతం చేయాలి. ఈ కేంద్రాల ద్వారా పనిముట్లను అద్దెకు ఇస్తే యువ రైతులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలి. అప్పుడే యువ రైతులకు మేలు జరుగుతుంది. – కె. భాస్కర్, సంచాలకుడు, జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం, మహబూబాబాద్ జిల్లా -
దేశంకాని దేశంలో.. తమది కాని యుద్ధంలో... సమిధలుగా మనోళ్లు
భవిష్యత్తు మీద బంగారు కలలతో ఆశలకు రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరారు. ఉపాధి దొరికితే కొత్త ఉషోదయాలు చూస్తామనుకున్నారు. కానీం చివరకు తమది కాని యుద్ధంలో నిస్సహాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా తరఫున తలపడుతున్న భారత యువకుల విషాదమిది. ఎందుకిలా జరుగుతోంది? తమది కాని దేశంలో, తమకు సంబంధమే లేని యుద్ధంలో వారు ఎందుకిలా బలవుతున్నట్టు...? అతని పేరు రవి మౌన్. హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువకుడు. రష్యాలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ చెప్పాడు. నమ్మిన కుటుంబం భూమి తెగనమ్మి మరీ ఏజెంట్కు రూ.11.5 లక్షలు ముట్టజెప్పింది. తీరా జనవరి 13న రష్యాకు వెళ్లాక ఏజెంట్ మోసగించినట్టు అర్థమైంది. ఇప్పుడతని ముందు రెండే ఆప్షన్లు. పదేళ్ల జైలు. లేదంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాటం. పదేళ్ల జైలు కంటే తనకిష్టం లేకున్నా యుద్ధ క్షేత్రాన్ని ఎంచుకున్నాడు రవి. ఈ విషయం కుటుంబానికి తెలియనివ్వలేదు. రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న భారత యువకుల వీడియోలో అతన్ని చూశాకే వారికి తెలిసింది. చివరగా మార్చిలో కుటుంబంతో మాట్లాడాడు. అప్పటినుంచి వారికతని సమాచారమే లేదు. యుద్ధంలో మరణించిన వారి మృతదేహాలను పూడ్చేందుకు రాత్రంతా గోతులు, కందకాలు తవ్వడమే పని! నాలుగు నెలల తర్వాత యుద్ధభూమిలో ప్రాణాలొదిలాడు. రవి సోదరునితో పాటు రష్యాలోని భారత రాయబార కార్యాలయం కూడా సోమవారం దీన్ని ధ్రువీకరించింది. డ్రైవర్ ఉద్యోగం ఆశ చూపి యుద్ధానికి ఎలా బలి పెడతారన్న రవి కుటుంబం ప్రశ్నకు బదులిచ్చేదెవరు...? భారీ వేతనాలు ఎర చూపి... ఇది ఒక్క రవి కథే కాదు. ఎంతోమంది భారత యువకులకు భారీ వేతనంతో ఉద్యోగాలంటూ ఊరించి రష్యాకు తీసుకెళ్తున్నారు. చివరికిలా బలవంతంగా యుద్ధాన్ని నెత్తిన రుద్దుతున్నారు. 2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య చాలామంది భారతీయులు ఇలా రష్యా సైన్యంలో చేరారు. వారిక్కూడా అక్కడికి వెళ్లేదాకా ఆ సంగతి తెలియదు! 2023 డిసెంబర్లో హర్‡్ష కుమార్ అనే యువకున్ని బెలారస్కని చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ మధ్యలోనే వదిలేశాడు. రష్యా సైన్యానికి చిక్కడంతో యుద్ధంలో పాల్గొనాల్సి వచి్చంది. అమృత్సర్కు చెందిన తేజ్పాల్సింగ్ పరిస్థితీ అంతే. ఏజెంటుకు రూ.2 లక్షలు చెల్లించి మరీ ఉద్యోగం కోసం రష్యా వెళ్లి చివరకు సైన్యంలో తేలాడు. చివరగా మార్చి 3న కుటుంబంతో మాట్లాడారు. జూన్లో మరణించాడు. పశి్చమ బెంగాల్లోని కాలింపాంగ్కు చెందిన ఉర్గెన్ తమాంగ్ క్రిమియా యుద్ధ ప్రాంతం నుంచి మార్చిలో వీడియో పంపాడు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం, మంచి జీతం పేరిట ఏజెంట్ మోసగించాడని వాపోయాడు. 10 రోజులు నామమాత్ర ఆయుధ శిక్షణ ఇచ్చి బలవంతంగా వార్ జోన్లోకి నెట్టారని వెల్లడించాడు. తన యూనిట్లోని 15 మంది రష్యనేతర సైనికుల్లో 13 మంది ఎలా దుర్మరణం పాలయ్యారో వివరంగా చెప్పుకొచ్చాడు. ఏపీ నుంచి కూడా పలువురు యువకులు ఈ వలలో చిక్కి ఉక్రెయిన్ యుద్ధక్షేత్రానికి చేరినట్టు చెబుతున్నారు. నేరం నిరుద్యోగానిదే... సంపాదనకు విదేశీ బాట, ప్రవాస భారతీయుని హోదా మన సమాజంలో గౌరవ చిహ్నాలు. గ్రామీణ నిరుద్యోగిత మరీ ఎక్కువ ఉన్న పంజాబ్, హరియాణా యువత కెనడా, యూరప్ దేశాలకు విపరీతంగా వెళ్తుంటారు. కానీ ఆ దేశాలు వీసా నిబంధనలు కఠినతరం చేశాయి. రష్యన్ స్టాంప్ ఐరోపా దేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం చేస్తుందనే ఆశతో పంజాబ్, హరియాణా యువకులు రష్యా బాట పడుతున్నారు. తీరా వెళ్లాక ఏజెంట్ల చేతిలో మోసపోయి యుద్ధంలో తేలుతున్నారు. రష్యా సైన్యంలో మనోళ్లు 40 మంది దాకా ఉన్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నా వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. 8 మంది భారతీయుల మృతి: కేంద్రం విదేశీ యువతను రష్యా ఇలా ఉక్రెయిన్ యుద్ధానికి బలి పెడుతున్న నేపథ్యంలో తమ పౌరులు ఆ దేశాలకు వెళ్లకుండా పలు దేశాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. నేపాల్ వంటి చిన్న దేశాలు కూడా ఈ విషయంలో నిబంధనలను కఠినతరం చేశాయి. మన దేశంలో అలాంటి చర్యల ఊసే లేదు! కనీసం మోసగిస్తున్న ఏజెంట్లపైనా చర్యల్లేవు. సరికదాం, రష్యాలో ఉపాధి కోసం వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలనే ప్రకటనలతో కేంద్రం సరిపెడుతోంది! మన యువకులు ఉక్రెయిన్ యుద్ధంలో బలవుతున్న వైనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి రష్యా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రత్యేకంగా చర్చించినా లాభం లేకపోయింది. మనోళ్లను స్వదేశానికి పంపేందుకు రష్యా అధికారులు ససేమిరా అంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో 8 మంది భారతీయులు రష్యా తరఫున పోరాడుతూ మరణించినట్టు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తాజాగా గత గురువారం రాజ్యసభలో వెల్లడించారు. ‘‘12 మంది భారతీయులు ఇప్పటికే రష్యా సైన్యాన్ని వీడినట్టు సమాచారముంది. మరో 63 మంది కూడా సైన్యం నుంచి త్వరగా విడుదల చేయాలని రష్యా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు’’ అని వెల్లడించారు. రష్యా సైన్యం తరఫున యుద్ధక్షేత్రంలో పోరాడుతున్న భారతీయులను వెనక్కు పంపేలా ఆ దేశంతో అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్టు చెప్పారు.ఇలా మోసగిస్తున్నారు... నిరుపేద యువతను వారికే తెలియకుండా రష్యా సైన్యంలోకి పంపేందుకు ఏజెంట్లు ప్రధానంగా లక్షల్లో జీతం, మెరుగైన జీవితాన్ని ఎరగా చూపుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో సీబీఐ చేసిన దాడుల్లో భారీ మానవ అక్రమ రవాణా రాకెట్ వెలుగు చూసింది. దాని సభ్యులను విచారించగా ఈ వివరాలు బయటికొచ్చాయి. → ఈ ‘రష్యాలో ఉపాధి’ ప్రచారానికి వారు ప్రధానంగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. → ఒకసారి బాధితులు తమ వల్లో పడగానే స్థానిక ఏజెంట్లు రంగంలోకి దిగుతారు. రంగుల కల చూపి ఒప్పిస్తారు.→ పలు సందర్భాల్లో ఉన్నత విద్యను కూడా ఎర వేస్తున్నారు. → రష్యాలో దిగీ దిగగానే స్థానిక ఏజెంట్లు వాళ్ల పాస్పోర్టులు లాగేసుకుంటారు. → ఆనక బలవంతంగా రష్యా సైన్యంలో చేరక తప్పని పరిస్థితులు కల్పిస్తారు. ఇతని పేరు సయ్యద్ ఇలియాస్ హుసేనీ. కర్నాటకలోని కలబురిగి వాసి. వెనక ఉన్నది అతని మిత్రులు అబ్దుల్ నయీం, మహ్మద్ సమీర్ అహ్మద్. వీళ్లు, తెలంగాణలోని నారాయణపేటకు చెందిన మొహమ్మద్ సూఫియాన్ దుబాయ్ విమానాశ్రయంలో పని చేసేవారు. రష్యాలో సెక్యూరిటీ గార్డులు కావాలంటూ యూట్యూబ్లో ప్రకటనలు చూశారు. నెలకు లక్షకు పైగా జీతం వస్తుందన్న ఏజెంట్ మాటలు నమ్మి నలుగురూ గత డిసెంబర్లో రష్యా వెళ్లారు. వారిని బలవంతంగా సైన్యంలో చేర్చుకుని ఉక్రెయిన్ సరిహద్దులకు పంపారు. అక్కడి నుంచి ఇలియాస్ తమ దుస్థితిని ఇలా గోప్యంగా వీడియో తీసి పంపాడు. ఇలియాస్ తండ్రి నవాజ్ అలీ హెడ్ కానిస్టేబుల్. తన కొడుకును, అతని స్నేహితులను ఎలాగైనా సురక్షితంగా తీసుకు రావాలంటూ అప్పటినుంచీ అతను ఎక్కని గడప లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జగనన్న మహిళా మార్టులకు జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని మహిళలకు ఉపాధి చూపడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసి న సంస్కరణలకు మరోసారి జాతీయ స్తాయి గుర్తింపు లభించింది. ‘దీన్ దయాళ్ అంత్యోదయ యోజ న–జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్’ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినందుకుగా ను పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)ను అ వార్డులు వరించాయి. 2023–24 సంవత్సరానికి గా ను సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అనలిటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్ (స్పార్క్) అవార్డు, పెర్ఫార్మెన్స్ రికగ్నేషన్ ఫర్ యాక్సెస్ టు ఫైనాన్సియల్ ఇంక్లూజన్ అండ్ స్ట్రీట్ వెండోర్స్ ఎంపవర్మెంట్ (ప్రయిస్) పురస్కారం వచ్చాయి.ఈ అవార్డులు మెప్మాకు రావడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం. గురువారం న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సహాయమంత్రి తోఖాన్ సాహు చేతుల మీదుగా మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి అవార్డులను అందుకున్నారు. స్టేట్ మిషన్ మేనేజర్లు ఆది నారాయణ, రంగాచార్యులు, ఎన్ఎన్ఆర్ శ్రీనివాస్, ప్రభావతి పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం కృషితో..సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందించే నగదుతో మహిళలను స్వయం ఉపాధి వైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంత మహిళలను ప్రోత్సహించి 2 లక్షల మంది ఎస్హెచ్జీ సభ్యుల భాగస్వామ్యంతో జగనన్న మహిళా మార్టులను 15 మునిసిపాలిటీల్లో ఏర్పాటు చేసింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలే పెట్టుబడిదారులు, ఉద్యోగులు, నిర్వాహకులు, వాటాదార్లుగా ఉన్న ఈ మార్టులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది లాభాలను ఆర్జిస్తున్నాయి. మార్టులు ఏర్పాటు చేసిన అతితక్కువ కాలంలోనే రూ.60 కోట్లకు పైగా వ్యాపారం చేయడం గమనా ర్హం. వీటి నిర్వహణ పనితీరును పరిశీలించిన కేంద్రం స్పార్క్ అవార్డు ప్రదానం చేసింది. ఆర్థిక చేయూత, సాధికారత సాధించడంలో మెప్మా విభాగం అత్యుత్తమ పనితీరు కనబర్చింది. వీధి వ్యాపారులకు సరైన సమయంలో ఆర్థిక సాయం అందించడంతో పాటు వారు సరైన మార్గంలో వ్యాపారాలు చేసేలా ప్రోత్సహించినందుకుగాను ప్రయిస్ అవార్డును ప్రదానం చేశారు. -
‘100 శాతం ఉద్యోగాలు కన్నడిగులకే’.. పోస్టు డిలీట్ చేసిన సీఎం
ప్రైవేటు రంగంలో స్థానికులకు రిజర్వేషన్ తప్పనిసారి చేస్తూ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కొత్త బిల్లును ఆమోదించింది. అయితే కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎక్స్లో ఓ పోస్టు చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరిశ్రమల్లోని గ్రూప్ సీ, డీ గ్రేడ్ ఉద్యోగాల్లో వంద శాతం కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించిందని సీఎం పేర్కొన్నారు.కన్నడిగులు తమ రాష్ట్రంలో సంతోషంగా జీవించేందుకు అవకాశం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్ధేశ్యమని సీఎం పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగానికి వారు దూరం కాకూడదని తెలిపారు. కన్నడిగుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. అయితే పోస్టుపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో.. తరువాత ఆయన దానిని డిలీట్ చేశారు. అనంతరం మళ్లీ సరిచేసి ట్వీట్ చేశారు.ರಾಜ್ಯದ ಖಾಸಗಿ ಕೈಗಾರಿಕೆಗಳು ಹಾಗೂ ಇತರೆ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ಕನ್ನಡಿಗರಿಗೆ ಆಡಳಿತಾತ್ಮಕ ಹುದ್ದೆಗಳಿಗೆ ಶೇ.50 ಹಾಗೂ ಆಡಳಿತಾತ್ಮಕವಲ್ಲದ ಹುದ್ದೆಗಳಿಗೆ ಶೇ.75 ಮೀಸಲಾತಿ ನಿಗದಿಪಡಿಸುವ ವಿಧೇಯಕಕ್ಕೆ ಸೋಮವಾರ ನಡೆದ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಯು ಒಪ್ಪಿಗೆ ನೀಡಿದೆ.ಕನ್ನಡಿಗರು ಕನ್ನಡದ ನೆಲದಲ್ಲಿ ಉದ್ಯೋಗ ವಂಚಿತರಾಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಿ, ತಾಯ್ನಾಡಿನಲ್ಲಿ… pic.twitter.com/Rz6a0vNCBz— Siddaramaiah (@siddaramaiah) July 17, 2024 తాజాగా దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లోని నాన్ మెనేజ్మెంట్ ఉద్యోగాల్లో స్థానికులకు (కన్నడిగులకు) 70 శాతం.. మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 50 శాతం స్థానికులకు రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ పేర్కొన్నారు. అయితే బిల్లులో గ్రూప్ సీ, డీ పోస్టుల్లో మొత్తం 100 శాతం స్థానికులకే కేటాయిస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు.అదే విధంగా ఉద్యోగానికి అర్హతలు, నైపుణ్యం ఉన్న స్థానికులు లేకపోతే.. కంపెనీలు.. ఇతర రాష్ట్రాల వారిని నియమించుకోవచ్చిని పేర్కొన్నారు. ‘ఉద్యోగానికి తగిన నైపుణ్యాలు కలిగిన కన్నడిగులలో లేకపోతే వాటిని అవుట్సోర్సింగ్ ఇవ్వవచ్చు. నైపుణ్యం కలిగిన కార్మికులలను వెలికి తీసీ..స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చే చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ప్రతిభకు కొదవలేదని మంత్రి వెల్లడించారు. "కర్ణాటకలో తగినంత నైపుణ్యం కలిగిన వర్క్ఫోర్స్ ఉందని.. చాలా ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. కన్నడిగులకు 70 శాతం పని ఇవ్వాలని తాము కంపెనీలను అడుగుతున్నామని ఒకవేళ ఇక్కడ తగిన ప్రతిభ లేకపోతే బయట నుంచి తీసుకోవచ్చని అన్నారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు పారిశ్రామిక వేత్తలు తప్పుబడుతున్నారు. ఈ బిల్లు వల్ల అనేకమంది ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. కర్ణాటకలో ఐటీ సహా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో ఇక ఇతర రాష్ట్రాలవారికి ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.ఈ బిల్లు వివక్షాపూరితమైనది, తిరోగమనపూరితమైనది, ఫాసిస్ట్ బిల్లు అంటూ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఛైర్మన్ మోహన్దాస్ పాయ్ ఎక్స్లో అన్నారు. మరోవైపు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తూనే.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం మంచిదే అని, కానీ నైపుణ్యం ఉన్న వారిని ఇతరులను ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఎవరు స్థానికులు?కర్ణాటకలో జన్మించినవారు.. 15 ఏళ్లుగా ఆ రాష్ట్రంలోనే నివసిస్తున్నవారు.. కన్నడ భాషలో మాట్లాడే, చదివే, రాసే నైపుణ్యం ఉండి.. రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షలో నెగ్గినవారిని స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. కన్నడం ఓ భాషగా ఉన్న ఎస్ఎ్ససీ సర్టిఫికెట్ను ఉద్యోగార్థులు కలిగి ఉండాలి. లేదంటే ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ నిర్వహించే కన్నడ ప్రావీణ్య పరీక్షలో పాసవ్వాలి. అర్హతలున్న స్థానిక అభ్యర్థులు దొరక్కపోతే.. చట్ట నిబంధనల సడలింపునకు ప్రైవేటు పరిశ్రమలు, సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. తగు విచారణ తర్వాత ప్రభుత్వం సముచిత ఉత్తర్వులు జారీచేస్తుంది. -
రైతులకు లాభాలు తేలేమా?
ఇరవై ఏళ్లలో బ్రెడ్ ధర రెండింతలు పెరిగింది, కానీ గోధుమల ధర సగానికి తగ్గింది. రైతులను మినహాయిస్తే అందరినీ సంతోషపెట్టే ఏర్పాటు ఇది. ప్రపంచవ్యాప్తంగా ఓవైపు రైతుల ఆదాయం పడిపోతుంటే, మరోవైపు కార్పొరేట్లు మాత్రం లాభార్జన చేస్తున్నాయి. భారత దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగమే. 45.5 శాతం మంది శ్రామిక శక్తికి ఉపాధి కల్పిస్తూ, వ్యవసాయాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చడం ఈ కాలపు అవసరం. 2024–25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి సమాయత్తమవుతున్న తరుణంలో, వ్యవసాయాన్ని పునర్నిర్మించే రోడ్మ్యాప్ను రూపొందించేందుకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరమో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.‘పంజాబ్ ఫార్మర్స్ అండ్ ఫార్మ్ వర్కర్స్ కమిషన్’ మాజీ చైర్పర్సన్ అజయ్ వీర్ జాఖడ్ ఇటీవల ట్వీట్ చేస్తూ, ‘ఇరవై ఏళ్ల క్రితం, స్విట్జర్లాండ్లో బ్రెడ్ ధర 2.5 స్విస్ ఫ్రాంకులు, గోధుమ ధర కిలోకు 110 స్విస్ ఫ్రాంకులు ఉండేది. ఇప్పుడు బ్రెడ్ ధర 4 ఫ్రాంకులు కాగా, గోధుమల ధర కిలోకు 50 ఫ్రాంకులు అయింది’ అన్నారు. కొంతకాలం క్రితం, నేను కూడా కెనడా నుండి ఒక ఉదాహరణను షేర్ చేశాను. గత 150 సంవత్సరాలుగా కెనడాలో గోధుమ ధరలు పడిపోతున్నాయి, కానీ గత నాలుగు దశాబ్దాలుగా బ్రెడ్ ధరలు పెరుగుతూ వచ్చాయి. వ్యవసాయ ఉత్పాదక ధరల తగ్గుదలకు సంబంధించి ఈ ఆందోళనకరమైన ధోరణి స్విట్జర్లాండ్, కెనడాకు మాత్రమే కాదు, కాస్త ఎక్కువ లేదా తక్కువగా ప్రపంచమంతటా ఇలాగే ఉంటోంది. ఒక శతాబ్దానికి పైగా, వ్యవసాయ ధరలు బాగా పడిపోతున్నాయి. ఇది రైతులను ఆత్మహత్యలకు లేదా వ్యవసాయాన్ని వదిలేసేలా పురిగొల్పుతోంది. ఇది ఆహార అసమానత్వమే.స్థోమత లేని పోషకులుఆహారాన్ని ఉత్పత్తి చేసేవారు నిరంతరం పేదరికంలో జీవిస్తున్నారు. తరచుగా, వ్యవసాయ ధరలు తక్కువగా ఉండటమే కాకుండా ఉత్పత్తి ఖర్చు కూడా రైతులకు దక్కడం లేదు. విషాదమేమిటంటే, మన పళ్లేల దగ్గరికి ఆహారం తెచ్చేవారికి తమను తాము పోషించుకునే స్థోమత ఉండటం లేదు. తమను ‘అన్నదాత’లు అని పిలిచినప్పుడు రైతులు సులభంగా ఉప్పొంగిపోతారు; వ్యవసాయ సరఫరా గొలుసులోని ఇతర వాటాదారులు మాత్రం లాభాల్లో మునిగితేలుతారు. రైతులు కష్టాల్లో కూరుకుపోతూ, గ్రామీణ వేతనాలు స్తబ్ధుగా ఉంటున్నప్పడు కూడా విచ్ఛిన్నమైన ఆహార వ్యవస్థ వినియోగదారులను మాత్రం సంతోషంగా ఉంచింది. ఆహార ధరలను ఉద్దేశపూర్వకంగా తక్కువగా ఉంచడం, ఏటికేడూ వాటి ధరలను ఇంకా తగ్గించి వేయటం... అదే సమయంలో అధిక లాభాలను పొందడం (దీనిని విక్రేత లాభమని ఇప్పుడు పిలుస్తున్నారు) అనేది వ్యవసాయ వ్యాపార సంస్థలను సంతోషంలో ముంచెత్తుతోంది. పెరుగుతున్న వేతనాలు, ధరల వల్ల సరఫరా వ్యవస్థకు అడ్డంకులు పెరుగుతాయని కార్పొరేట్లు నిందించినప్పటికీ, అమెరికాలో ఉదాహరణకు, 2023 సంవత్సరం రెండవ, మూడవ త్రైమాసికాల్లో, కార్పొరేట్ లాభాలు ద్రవ్యోల్బణంలో 53 శాతానికి ఆజ్యం పోశాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా, కోవిడ్ మహమ్మారి తర్వాత కార్పొరేట్ లాభాలు మరింతగా పెరిగాయి. 2023 చివరి త్రైమాసికం నాటికి ఇది రికార్డు స్థాయికి చేరుకుంది. మహమ్మారికి ముందు నాలుగు దశాబ్దాలలో, ద్రవ్యోల్బణానికి కార్పొరేట్ లాభాల సహకారం కేవలం 11 శాతం మాత్రమే.ఒకటిన్నర శతాబ్దానికి పైగా, మన ఆర్థిక విధానాల రూపకల్పన రైతులకు సరైన ధరలను నిరాకరించింది. వ్యవసాయ రంగంలో ముదిరిపోతున్న సంక్షోభం పట్ల విధాన నిర్ణేతలు కళ్ళుమూసుకోవడంతో, గ్రామీణ ప్రాంత ఆగ్రహం ఎన్నికల సీజన్ లో మాత్రమే నొక్కి చెప్పబడుతోంది. ‘భారత ప్రభుత్వం రైతులకు రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటిస్తుంటుంది, కానీ వాస్తవానికి వారినే బాధపెడుతుంది’ (ది ఎకనామిస్ట్, 2018 జూలై 12) అనే కథనం ఆసక్తికరమైన అంతర్దృష్టిని అందిస్తుంది.ధనిక వాణిజ్య కూటమి అయిన ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) దేశాలు ఉత్పత్తిదారులకు వ్యవసాయ ఆదాయంలో 18 శాతానికి సమానమైన మొత్తాన్ని అందజేస్తుండగా, భారతదేశం వాస్తవానికి వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించడంతో సరిపెట్టింది.సాయం చేయని సాంకేతికత2024–25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి సమాయత్తమవుతున్న తరుణంలో, రైతులలో పెరుగుతున్న ఆగ్రహాన్ని చల్లార్చడమే కాకుండా వ్యవసాయాన్ని పునర్నిర్మించే రోడ్మ్యాప్ను రూపొందించేందుకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరమో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా, ఆర్థికవేత్త జీన్ డ్రేజ్ పేర్కొన్న ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ‘‘భారతదేశంలో రాజకీయ చర్చలు సాధారణంగా ప్రత్యేకాధికారులు, శక్తిమంతులు నిర్దేశించిన కొన్ని సరిహద్దుల్లోనే జరుగుతాయి. మీరు ఈ సరిహద్దులను అధిగమించినట్లయితే, ఇబ్బందిని ఎదుర్కొంటారు’’. వ్యవసాయానికి ‘అవుటాఫ్ ద బాక్స్ థింకింగ్’ అవసరం. అయితే అది పాలించే ఉన్నత వర్గాన్ని చాలావరకు కలవరపెట్టవచ్చు.ఈ అన్ని సంవత్సరాలలో, సాంకేతిక జోక్యాలకు మరింత బడ్జెట్ మద్దతును అందివ్వడమే వ్యవసాయ ఆదాయాలను పెంచడానికి ప్రధాన మార్గంగా ఉంటూ వచ్చింది. డిజిటలీకరణ, కృత్రిమ మేధ, రోబోటిక్స్, కచ్చితమైన వ్యవసాయం వైపు అడుగులు వేస్తూ, తద్వారా వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ ఒడిలోకి తీసుకువస్తున్నప్పటికీ, వ్యవసాయం చుట్టూ ఉన్న పరిశ్రమకు ఇటువంటి బడ్జెట్ మద్దతుతో అపారమైన ప్రయోజనం ఉంది. అదే సమయంలో రైతులు మరింత దుఃస్థితిలోకి కూరుకుపోవడం కొనసాగుతోంది. హరిత విప్లవం సాగిన 60 ఏళ్ల తర్వాత కూడా వ్యవసాయ ఆదాయాలు పిరమిడ్లో అట్టడుగునే కొనసాగితే, వ్యవసాయ విప్లవం 4.0 వైపు సాంకేతిక పరివర్తనను చేపడతామని చేస్తున్న వాగ్దానాన్ని, వ్యవసాయాన్ని పట్టి పీడిస్తున్న అన్ని రుగ్మతలకు దివ్యౌషధంగా చూడలేము. ఎప్పటిలాగే, విధాన నిర్ణేతలు మరోసారి వ్యవసాయ కష్టాలకు నిజమైన కారణాన్ని (వ్యవసాయ ఆదాయాలు పడిపోవడం), సాంకేతిక జోక్యాలు ఆదాయాన్ని పెంచుతాయనే లోపభూయిష్ట ఆలోచనతో కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు.‘ప్రపంచం వేడెక్కిపోతున్న’ స్థితిలో, పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతుల నుండి స్థితిస్థాపక వ్యవసాయం వస్తుంది. కృత్రిమ మేధస్సు కంటే ముందుగా అందుబాటులో ఉన్న సహజ మేధస్సును ఉపయోగించుకోవడం అవసరం. వ్యవసాయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో, వ్యవసాయంలో నిమగ్నమైన మానవ జనాభా సామర్థ్యాన్ని పెంచడానికి మొదటగా పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయమే. 45.5 శాతం మంది శ్రామికశక్తికి ఉపాధి కల్పిస్తూ, వ్యవసాయాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చడం ఈ కాలపు అవసరం. వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో తోడ్పడే పరిశ్రమకు సహాయం చేయాలనే సాంప్రదాయిక ఆలోచన (ట్రికిల్–డౌన్ సూత్రానికి అనుగుణంగా) ఇప్పుడు పని చేసే అవకాశం లేదు.ఆహార అసమానతలను తొలగించడానికి, తాజా ఆలోచనలు అవసరం. ముందుగా, ఎంఎస్ స్వామినాథన్ సూత్రం ప్రకారం వ్యవసాయ ధరలకు హామీ ఇవ్వడానికి చట్టపరమైన యంత్రాంగాన్ని అందించాలి; రెండవది, బడ్జెట్లో 50 శాతాన్ని జనాభాలో దాదాపు సగం మందికి కేటాయించేలా ఆర్థిక మంత్రి చూడాలి. దీనికోసం, వ్యవసాయ బడ్జెట్ను ప్రతి సంవత్సరం మొత్తం బడ్జెట్లో 10 శాతం పెంచడం ప్రారంభించాలి. ప్రస్తుతం ఇది 3 శాతం కంటే తక్కువగా ఉంది.- వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com- దేవీందర్ శర్మ -
Sahithi chiluveru: టెకీ ఉద్యోగం నుంచి టేస్టీ ఫుడ్ బిజినెస్ వరకు
ఒక అందమైన ఆలోచనను సక్రమంగా అమలులో పెడితే పల్లెటూరు నుంచి కూడా విదేశాలకు విస్తరించవచ్చు అని నిరూపిస్తుంది చిలువేరు సాహితి. చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఉపాధిని సృష్టిస్తోంది. 26 ఏళ్ల వయసులో తనతోపాటు మరో ఇరవై మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో వ్యవసాయాధారిత జీవనాల మధ్య వెలుగుతున్న సాహితిని పలకరిస్తే విజయావకాశాన్ని వంటలతో అందిపుచ్చుకుంటున్నానని వివరిస్తుంది.‘‘నాకు రుచికరమైన ఆహారం అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం నాకో ఉపాధిని కల్పిస్తుంది అని మాత్రం ఊహించలేదు. బీటెక్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ టీసీఎస్ కంపెనీలో నాలుగేళ్లు ఉద్యోగం చేశాను. కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ రావడంతో ఊరు వచ్చేశాను. ఆ టైమ్లో మా అమ్మ కన్యాకుమారి చేసే వంటలను ఆస్వాదిస్తూ ఉండేదాన్ని. ఖాళీ సమయంలో సరదాగా తీసుకున్న వంటల ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’ పేజీ క్రియేట్ చేసి పోస్ట్ చేసేదాన్ని. ఆ పోస్టులకు లైకులు వెల్లువెత్తుతుండేవి. ఒకటి నుంచి మొదలు.. ఓరోజున ఉన్నట్టుండి ఒక ఫాలోవర్ నుంచి ‘మాకు స్వీట్స్ చేసి పంపుతారా’ అంటూ ఒక పోస్ట్ వచ్చింది. కాదనటమెందుకులే, ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అని... ఆ ఆర్డర్ పూర్తిచేసి, కొరియర్ ద్వారా పంపించాం. ఆ తర్వాత మరో రెండు ఆర్డర్లు వచ్చాయి. అలా నెలకు ఒకటి రెండు ఆర్డర్లు రావడం మొదలయింది. క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. నా వంటలకు మంచి డిమాండ్ ఉందని అర్థమైంది. దానినే ఉపాధిగా ఎందుకు చేసుకోకూడదూ అని... చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, ఫుడ్ తయారీనే వ్యాపారంగా ఎంచుకున్నాను. ముందు మా ఇంటివరకే పనులు ఉండేవి. తర్వాత పనులు పెరగడంతో ఊళ్లోనే ఉన్న మా చుట్టుపక్కల మహిళలను ఫుడ్ తయారీకి నియమించుకున్నాం. స్నాక్స్, ఊరగాయలు, స్వీట్లు, మసాలా పొడులతో పాటు మిల్లెట్ ఉత్పత్తులు, ఇన్స్టంట్ మిక్స్లు తయారు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు నెలకు 30 నుంచి 40 ఆర్డర్లు వస్తున్నాయి.మరో 20 మందికి...పదిహేనేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఒక ఉద్యోగికి వచ్చే ప్యాకేజీని ఇప్పుడు నా వ్యాపారం ద్వారా పొందుతున్నాను. నాతోపాటు మరో 20 మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థితికి చేరుకున్నాను. వీరిలో పదిమంది తమ ఇళ్ల నుంచే పచ్చళ్లు, పొడులు, ఇతర పిండి వంటలు తయారు చేసి వాటిని అందంగా ΄్యాక్ చేసి ఇస్తారు. మా ఇంటి మొదటి అంతస్తులోని రెండు గదులను నా కంపెనీ ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’కి కేటాయించుకున్నాను. పదిహేను రకాల పచ్చళ్లు, 40 రకాల పిండి వంటలు, ఇన్స్టంట్ ఫుడ్ మిక్సర్లు, మసాల పొడులు.. దాదాపు 70 ర కాల వంటకాలు తయారు చేస్తుంటాం. మన దేశంలోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ.. దేశాలలో ఉండే మన తెలుగువారికి కొరియర్ ద్వారా పచ్చళ్లు, పొడులు పంపిస్తున్నాను.ఎక్కడా ప్లాన్ లేదు.. ఏ మాత్రం ప్లాన్ లేకుండా నా వ్యాపారం వృద్ధి చెందుతూ వస్తోంది. ఇంట్లో పెట్టిన ఆవకాయతో ఆరంభమైన ఈ బిజినెస్లో వచ్చిన ఆర్డర్ల ప్రకారం పెట్టుబడి పెడుతూ, ఆదాయాన్ని పొందుతున్నాను. ఫుడ్ బిజినెస్ కాబట్టి ఏడాది క్రితం లైసెన్స్ కూడా తీసుకున్నాను. మా ఊరికి మరింత పేరుతెచ్చేలా ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’ బ్రాండ్ ఉత్పత్తులను విస్తరించాలనుకుంటున్నాను. కానీ, తయారీ మాత్రం మా ఊరి నుంచి, మా ఇంటి నుంచే చేస్తుంటాను.సవాళ్లను అధిగమిస్తూ.. రుచికరమైన వంటకాల తయారీలో పదార్థాలు కూడా అంతే నాణ్యమైనవి ఉండాలి. సరైన శుభ్రత పాటించాలి. ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్పత్తులను సేకరించడం, వాటిని సమయానుకూలంగా తయారీలో వాడటం పెద్ద సవాల్గానే ఉంటోంది. అలాగే, సీజనల్గా ఉండే సమస్యల్లో ముఖ్యంగా వర్షాకాలం ΄్యాకింగ్లు తడవడం వంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు తిరిగి రీప్లేస్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటాను. చాలా మందితో డీల్ చేయాలి, కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు కాబట్టి సహనంతో ఉండాలి. ఈ ప్రయాణం నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ‘చిన్న అమ్మాయివే కానీ, మా ఇంట్లో బామ్మలు చేసిన వంటకాల రుచి చవి చూస్తున్నాం’ అంటూ మా వంటకాలను రుచి చూసినవారు నాకు ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా ప్రశంసలు తెలియచేస్తుంటారు. నాణ్యత ద్వారా వారి ఆశీస్సులను, అభిమానాన్ని, మద్దతును ఎప్పటికీ అలాగే నిలబెట్టుకుంటాను అంటూ ఆనందంగా వివరిస్తుంది సాహితి.– నిర్మలారెడ్డి -
వీరి వీరి గుమ్మడి విజయానికి చూపే దారి ఇది
వ్యాపారానికి సామాజిక బాధ్యత తోడైతే ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతుంది చెన్నైకి చెందిన పంప్కిన్ టేల్స్. ఆల్–ఉమెన్ టీమ్ రెస్టారెంట్గా ప్రత్యేకతను సాధించిన‘పంప్కిన్ టేల్స్’ అమ్మాయిలలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించే బడి. చల్లగా చూసే అమ్మ ఒడి.‘పంప్కిన్ ఉపాధి ఇవ్వడమే కాదు. ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త విషయాలు ఎన్నో నేర్చుకునేలా సహాయపడుతుంది’ అంటారు ఉద్యోగులు.ఉద్యోగం కోసం తాను ఉంటున్న డార్జిలింగ్ నుంచి గోవాకు వెళ్లాలనుకున్న అనూష మింజ్ విధివశాత్తు చెన్నైకి వచ్చింది. అక్కడి వాతావరణం ఆమెకు బాగా నచ్చింది.‘నా కొలీగ్స్తో ఎన్నో విషయాలు చర్చించే అవకాశం దొరికింది’ అంటుంది అనూష.‘మహిళలు కేఫ్లను నిర్వహించలేరు’లాంటి అపోహలకు అడ్డుకట్ట వేయడం కోసం చింది వరదరాజులు, జె.భువనేశ్వరి, ఆర్. రాజేశ్వరి అనే మహిళలు 2017లో ‘పంప్కిన్ టేల్స్’ప్రారంభించారు. రెస్టారెంట్, బేకరి, కేటరింగ్ విభాగాల్లో మంచి పేరు తెచ్చుకుంది... పంప్కిన్ టేల్స్.టేబుల్స్ను సెట్ చేయడం నుంచి కస్టమర్లతో ఇంటరాక్ట్ కావడం, ఆర్డర్లు తీసుకోవడం, టేక్ అవేలను రెడీ చేయడం వరకు ఎన్నో పనులు చేస్తుంది ఈ ఆల్–ఉమెన్ టీమ్.‘ఉద్యోగంలో చేరే సమయంలో రెస్టారెంట్లో పనికి సంబంధించి వారిలోప్రాథమిక జ్ఞానం ఉంటుంది. ఆ తరువాత టేబుల్ సెట్ చేయడం నుంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడం వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఆ వెంటనే వారిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది’ అంటారు కంపెనీ డైరెక్టర్లు భువనేశ్వరీ, రాజేశ్వరి.ఉదాహరణకు ‘పంప్కిన్’ వందమందికి పైగా మహిళల కుటుంబాలకు ఉ΄ాధి కల్పిస్తోంది. రెస్టారెంట్ ప్రారంభమైనప్పుడు షిల్లాంగ్కు చెందిన మోనిక వెయిటర్గా చేరింది. ఇప్పుడు ఆమె రెస్టారెంట్కు సంబంధించిన సమస్త విషయాలలోప్రావీణ్యం సాధించింది.‘ఎవరి మీదా ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడుతున్నందుకు గర్వంగా ఉంది. మా అమ్మాయి చెన్నైలో పనిచేస్తోంది. నెల నెలా నాకు డబ్బులు పంపిస్తుంది అని నా గురించి అమ్మ గర్వంగా చెప్పుకుంటుంది’ అంటుంది మోనిక.మోనిక ఏదో ఒకరోజు ఎక్కడో ఒకచోట సొంతంగా రెస్టారెంట్ ్ర΄ారంభించవచ్చు. ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే ‘పంప్కిన్ టేల్స్’ అనేది అనే ఉ΄ాధి కేంద్రమే కాదు, ఉజ్వల భవిష్యత్కు ఉపయోగపడే కేంద్రం కూడా. -
Lok Sabha Election 2024: ఎన్నికల ఉపాధి... 9 లక్షల మందికి!
లోక్సభ ఎన్నికలు ఎంతోమంది ఆకలి బాధ తీరుస్తున్నాయి. తాత్కాలికంగానైనా ఉపాధి కల్పిస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండడం తెలిసిందే. ఈ ఎన్నికల సీజన్లో దేశవ్యాప్తంగా కనీసం 9 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పలు రకాల అవసరాలను తీర్చే విధంగా ఉద్యోగాలుంటాయని ‘వర్క్ ఇండియా’ సీఈవో సహ వ్యవస్థాపకుడు నీలేశ్ దుంగార్వాల్ తెలిపారు. ప్రధానంగా డేటా ఎంట్రీ ఉద్యోగాలు, బ్యాక్ ఆఫీస్, డెలివరీ, డ్రైవర్లు, కంటెంట్ రైటింగ్, సేల్స్ వంటి రూపాల్లో ఉపాధి లభిస్తోంది. ఏప్రిల్ 19న తొలి విడత దశ పోలింగ్ నాటికే 2 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచి్చనట్టు సీఐఈఎల్ హెచ్ఆర్ డైరెక్టర్ ఆదిత్య నారాయణన్ మిశ్రా తెలిపారు. డేటా విశ్లేషణ, ప్రణాళిక, ప్రజలతో సంబంధాలు, మార్కెట్ సర్వే, మీడియా సంబంధాలు, కంటెంట్ డిజైన్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఏఐ స్ట్రాటజీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఈ అవకాశాలు అందివచి్చనట్టు చెప్పారు. 8 నుంచి 13 వారాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవెంట్ మేనేజ్మెంట్, ప్రింటింగ్, రవాణా, ఫుడ్, బెవరేజెస్, క్యాటరింగ్, సెక్యూరిటీ, ఐటీ నెట్వర్క్ మేనేజ్మెంట్, అనలిటిక్స్లో 4 నుంచి 5 లక్షల మందిని తాత్కాలిక ప్రాతిపదికగా నియమించుకుంటున్నట్టు మిశ్రా అంచనా వేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీడీపీలో 2 శాతం
న్యూఢిల్లీ: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతం ప్రత్యక్ష ప్రభుత్వ పెట్టుబడితో 11 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించవచ్చని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) తాజా నివేదిక పేర్కొంది. మొత్తం ఉపాధి సృష్టిలో దాదాపు 70 శాతం మహిళలకు ప్రయోజనం కలుగుతుందని కూడా విశ్లేíÙంచింది. భారత్ పురోగతికి తీసుకోవాల్సిన అంశాలపై ఎఫ్ఎల్ఓ ఒక రోడ్మ్యాప్ను కూడా ఆవిష్కరించింది. వీటిలో అంశాలు– లీవ్ పాలసీలు, కేర్ సరీ్వస్ సబ్సిడీలు, కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి, కేర్ వర్కర్లకు నైపుణ్య శిక్షణ, నాణ్యత హామీ కీలకమైనవని నివేదిక పేర్కొంది. -
ఉద్యోగాల భర్తీకి తొలగిన న్యాయ చిక్కులు
తెలంగాణ రాష్ట్రం ఏర్ప డినంక నిరుద్యోగుల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడినట్లు అయింది. నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా సాగిన ఉద్యమంలో నిరుద్యోగులకు గత ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుపై విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు , ఉద్యోగ ప్రకటనలకే పరిమి తమై భర్తీకి నోచుకోలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్లో 2016లోనే జీవో నెం. 40ని జారీ చేసి ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం క్లిష్టమైనటువంటి మహిళా రిజర్వేషన్ అమలుపై హైకోర్టు ఆదేశానుసారంగా నిర్ణయం తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మహిళా కోటాకు సంబంధించిన జీవోలను రద్దు చేస్తూ, 3, 35 నంబర్ల జీవోలను జారీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియలు కొనసాగే విధంగా మార్గాన్ని సుగుమం చేసింది. నూతన విధానంలో 100 పాయింట్ల రోస్టర్లో మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లను కేటాయించ కుండా ప్రతీ ఉద్యోగ ప్రకటనలో ఓసీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు కలిపి మొత్తం 33.33 శాతం పోస్టు లను కేటాయించనున్నారు. అనగా ప్రతీ కేటగి రిలో ప్రతీ నాలుగు పోస్టుల్లో ఒక్క పోస్టు మహిళ లకు సమాంతరంగా కేటాయించ బడుతుంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1992 నుండి నేటి వరకు ప్రధాన కేసులైన ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా, రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర తీర్పుల్లో వర్టికల్ రిజర్వేషన్లుగాఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాలను; హారిజాంటల్ రిజ ర్వేషన్లుగా మహిళా, దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ కోటాలను నిర్ధారించింది. అందులో వర్టికల్/ నిలువు/ సామాజిక మరియు హారిజాంటల్/ సమాంతర/ ప్రత్యేక రిజర్వేష న్లను ఏవిధంగా అమలు చెయ్యాలో స్పష్టం చేసింది. వర్టికల్ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 15(5), 15(6), 16(4), 16(6) ద్వారా కల్పిస్తున్నవి. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులు జనరల్ కేటగిరీ పోస్టులకు కూడా పోటీపడి ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని మించి ఎంపిక కావచ్చు. ఆర్టికల్ 15(3)ను అనుసరించి సమాంతర రిజర్వేషన్ పద్ధతిలో మహిళలకు మొత్తం ఉద్యోగాల్లో 33.33 శాతం పోస్టులకు మాత్రమే ఎంపిక అవ్వడానికి ఆస్కారం ఉంది. మహిళలు జనరల్ కేటగిరీ పోస్టులకు ఎన్నికైనా వారిని కూడా ఈ 33.33 శాతం కిందకే తీసుకువస్తారు. అంటే మహిళలు 33.33 శాతానికి మించి ఎంపిక కాకూడదన్నమాట. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో జూనియర్ సివిల్ జడ్జీల నియామకా లకు సంబంధించిన కేసు: కె. వెంకటేష్ వర్సెస్ గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్, 2020లో తెలంగాణ హైకోర్టు మాచర్ల సురేష్ వర్సెస్ స్టేట్ అఫ్ తెలంగాణ మధ్య జరిగిన కేసుల తీర్పుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చెయ్యాలని ఆదేశించాయి. దిన పత్రికల్లో 2020 నుండి మహిళా రిజ ర్వేషన్ల సమస్యపై పతాక శీర్షికల్లో వార్తలు వచ్చి నప్పటికీ, గత తెలంగాణ ప్రభుత్వానికి విధాన పరమైన నిర్ణయం తీసుకోవడానికి సమయం లేకపోయింది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో నిర్ణయం తీసుకొని 3, 35 నంబర్ల జీవోలను జారీ చేయడం స్వాగతించ వలసిన అంశం. -కోడెపాక కుమార స్వామి , వ్యాసకర్త తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మొబైల్: 94909 59625 -
ఉద్యోగాల భర్తీకి తొలగిన న్యాయ చిక్కులు
తెలంగాణ రాష్ట్రం ఏర్ప డినంక నిరుద్యోగుల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడినట్లు అయింది. నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా సాగిన ఉద్య మంలో నిరుద్యోగులకు గత ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుపై విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు, ఉద్యోగ ప్రకటనలకే పరిమి తమై భర్తీకి నోచుకోలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్లో 2016లోనే జీవో నెం. 40ని జారీ చేసి ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం క్లిష్టమైనటువంటి మహిళా రిజర్వేషన్ అమలుపై హైకోర్టు ఆదేశానుసారంగా నిర్ణయం తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మహిళా కోటాకుసంబంధించిన జీవోలను రద్దు చేస్తూ, 3, 35నంబర్ల జీవోలను జారీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియలు కొనసాగే విధంగా మార్గాన్ని సుగుమం చేసింది. నూతన విధానంలో 100 పాయింట్ల రోస్టర్లో మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లను కేటాయించ కుండా ప్రతీ ఉద్యోగ ప్రకటనలో ఓసీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు కలిపి మొత్తం 33.33 శాతం పోస్టు లను కేటాయించనున్నారు. అనగా ప్రతీ కేటగి రిలో ప్రతీ నాలుగు పోస్టుల్లో ఒక్క పోస్టు మహిళ లకు సమాంతరంగా కేటాయించ బడుతుంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1992 నుండి నేటి వరకు ప్రధాన కేసులైన ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ అఫ్ఇండియా, రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర తీర్పుల్లో వర్టికల్ రిజర్వేషన్లుగాఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాలను; హారిజాంటల్ రిజ ర్వేషన్లుగా మహిళా, దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ కోటాలను నిర్ధారించింది. అందులో వర్టికల్/ నిలువు/ సామాజిక మరియు హారిజాంటల్/ సమాంతర/ ప్రత్యేక రిజర్వేష న్లను ఏవిధంగా అమలు చెయ్యాలో స్పష్టం చేసింది. వర్టికల్ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 15(5), 15(6), 16(4), 16(6) ద్వారా కల్పిస్తున్నవి. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులు జనరల్ కేటగిరీ పోస్టులకు కూడా పోటీపడి ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని మించి ఎంపిక కావచ్చు. ఆర్టికల్ 15(3)ను అనుసరించి సమాంతర రిజర్వేషన్ పద్ధతిలో మహిళలకు మొత్తం ఉద్యోగాల్లో 33.33 శాతం పోస్టులకు మాత్రమే ఎంపిక అవ్వడానికి ఆస్కారం ఉంది. మహిళలు జనరల్ కేటగిరీ పోస్టులకు ఎన్నికైనా వారిని కూడా ఈ 33.33 శాతం కిందకే తీసుకువస్తారు. అంటే మహిళలు 33.33 శాతానికి మించి ఎంపిక కాకూడదన్నమాట. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో జూనియర్ సివిల్ జడ్జీల నియామకా లకు సంబంధించిన కేసు: కె. వెంకటేష్ వర్సెస్ గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్, 2020లో తెలంగాణ హైకోర్టు మాచర్ల సురేష్ వర్సెస్ స్టేట్ అఫ్ తెలంగాణ మధ్య జరిగిన కేసుల తీర్పుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చెయ్యాలని ఆదేశించాయి. దిన పత్రికల్లో 2020 నుండి మహిళా రిజ ర్వేషన్ల సమస్యపై పతాక శీర్షికల్లో వార్తలు వచ్చి నప్పటికీ, గత తెలంగాణ ప్రభుత్వానికి విధాన పరమైన నిర్ణయం తీసుకోవడానికి సమయం లేకపోయింది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో నిర్ణయం తీసుకొని 3, 35 నంబర్ల జీవోలను జారీ చేయడం స్వాగతించ వలసిన అంశం. - వ్యాసకర్త తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మొబైల్: 94909 59625 - కోడెపాక కుమార స్వామి -
రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. రాష్ట్ర యువతకు నైపుణ్య ‘భవిత’ రాష్ట్ర యువత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ‘భవిత’ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. భావి అవసరాలకు తగిన విధంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ స్కిల్ క్యాస్కేడింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి బి.సురేష్ కుమార్ పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా ‘భవిత’ను తీర్చిదిద్దినట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే 152 యూనిట్లతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో రూ.90 కోట్లతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను ముఖ్యమంత్రి వర్చువల్గా విశాఖ నుంచి ప్రారంభిస్తారు. అలాగే ఎంపీల్యాడ్స్ నిధులతో ఒక్కోటి రూ.70 లక్షలతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లనూ సీఎం ప్రారంభిస్తారు. 2023–24 సంవత్సరంలో నైపుణ్య శిక్షణను పూర్తి చేసుకుని ప్లేస్మెంట్స్ పొందిన 7,110 మంది విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సెర్మనీని నిర్వహించనున్నారు. 7న సీఎం అనకాపల్లి రాక సాక్షి, అనకాపల్లి : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 7న అనకాపల్లి రానున్నారు. వైఎస్సార్ చేయూత చివరి విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్లు సభా స్థలిని పరిశీలించారు. అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో హెలిప్యాడ్కు స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మలసాల భరత్కుమార్ తదితరులున్నారు. -
గిరిజనుల తరఫున పోరాటం: రాహుల్
ధన్బాద్: గిరిజన ప్రజలకు నీరు, అడవి, భూమి(జల్–జంగిల్–జమీన్)పై హక్కుల ను, గిరిజన యువతకు ఉపాధిని కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం ఆయన జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో జరిగిన రోడ్ షోలో ప్రసంగించారు. రాష్ట్రంలో జోడో యాత్ర మూడో రోజుకు చేరుకుంది. జిల్లాలోని తుండిలో శనివారం రాత్రి బస చేసిన రాహుల్ ఆదివారం గోవింద్పూర్ నుంచి తిరిగి యాత్రను మొదలుపెట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం కాకుండా కాపాడటం, యువతకు గిరిజనులకు న్యాయం దక్కేలా చేయడమే యాత్ర ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆర్థిక అసమానతలు, నోట్లరద్దు, జీఎస్టీ, నిరుద్యోగం వంటి సమస్యలు దేశంలోని యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం యాత్ర తిరిగి కొనసాగి బొకారో జిల్లాలోకి ప్రవేశించింది. బొకారో వైపు సాగుతూ గోధార్ కాళి బస్తీ వద్ద ఆయన బొగ్గు గని కార్మికులు, వారి పిల్లలతో ముచ్చటించారు. మధ్యాహ్నానికి యాత్ర బొకారో చేరుకుంది. భోజనానంతరం జెనామోర్ నుంచి మొదలైన యాత్ర రామ్గఢ్ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని గోలా వద్ద జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. -
చిన్న పరిశ్రమ ధగధగ
ఓ ప్రయత్నం పది మందికి ఉపాధి చూపించేందుకు మార్గమైంది. చిన్నపాటి సంకల్పం ఎంచుకున్న రంగంలో విజయపథానికి దారిచూపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే... ప్రతి జిల్లా పారిశ్రామికంగా పురోగమిస్తుందని రుజువైంది. విశాఖపట్నంలో అత్యాధునిక డెంటల్ ల్యాబ్... నెల్లూరు జిల్లా పొదలకూరులో బయో మాస్ బ్రికెట్స్... బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలో మారుతి గ్రానైట్స్... ఇలా ఏర్పడిన చిన్న పరిశ్రమలే. ఇప్పుడు వందలాదిమందికి ఉపాధి కల్పిస్తూ... పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకు ప్రతి జిల్లాలో పుట్టుకొస్తున్న ఎంఎస్ఎంఈలే సాక్ష్యం. ♦ కరోనా విలయం నుంచి.. విజయపథానికి ♦ గ్రానైట్ ఫ్యాక్టరీతో పది మందికి ఉపాధి.. వ్యవసాయం వదిలి పారిశ్రామిక పయనం బల్లికురవ: వారిది వ్యవసాయం కుటుంబం. భర్త డిగ్రీవరకూ చదువుకోగా... భార్య పాలిటెక్నిక్ పాసయ్యారు. వారికి వ్యవసాయం ద్వారా తగిన ఆదాయం సమకూరకపోవడంతో పదిమందికి ఉపాధి కల్పించాలనుకున్నారు. తొలుత పౌల్ట్రీ పరిశ్రమతో ప్రస్థానం మొదలైంది. దంపతులు ఇద్దరూ అక్కడే పనిచేసి కొందరికి ఉపాధి చూపారు. అయితే బంధువులు గ్రానైట్ వ్యాపారాలు చేసి లాభాలు పొందడాన్ని చూశాక వీరికీ ఓ ఆలోచన వచ్చింది. బాపట్ల జిల్లా ఈర్లకొండ మల్లాయపాలెం గ్రామాల్లో ముడిరాయి దొరుకుతుండడంతో గ్రానైట్ వ్యాపారం చేద్దామనుకున్నారు. అయితే సాయమందించే ప్రభుత్వం అప్పుడు లేదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాయితీతో రుణం అందించి ఊతం అందించడంతో మారుతి గ్రానైట్స్ ఏర్పాటు చేసుకున్నారు. వారి కల సాకారమైంది. ఇప్పుడు విజయవంతంగా ఆ సంస్థ నడుస్తోంది. ఇదీ బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొత్తమల్లాయపాలెం గ్రామానికి చెందిన లేమాటి నీరజ, హనుమంతరావు దంపతుల విజయప్రస్థానం. అధికారుల నుంచి సానుకూల స్పందన పరిశ్రమ స్థాపిస్తామని చెప్పగానే పరిశ్రమల శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. వెంటనే రూ.1.5 కోట్లు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద ఎస్ఐడీబీఐ(సిబీ)గా గుర్తించి బ్యాంక్ ద్వారా లోన్ మంజూరు చేశారు. అందులో రూ.90 లక్షలు ప్రభుత్వ రాయితీ కింద వచ్చింది. మొత్తం మూడు కోట్లతో ఫ్యాక్టరీ పెట్టారు. ముడిరాయిని పలకలు కోస్తూ స్థానికంగా విక్రయిస్తున్నారు. 15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయిన రాళ్లను అద్దంకి, మార్టూరు, ఒంగోలు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, చీరాల, బాపట్ల, గుంటూరు, విజయవాడ పట్టణాలకు తరలిస్తున్నారు. మాకు ఉపాధి దొరికింది నాకు ఏపనీ దొరక్క తిరుగుతున్న సమయంలో గ్రానైట్ అధినేత పిలిచి ఉపాధి కల్పించాడు. గతంలో క్వారీల్లో చేసిన అనుభవం ఉండడంతో ఇక్కడ లైన్ పాలిష్ ఆపరేటర్గా పని చేస్తున్నాను. నెలా నెలా జీతాలు బాగా ఇస్తున్నారు. – డేవిడ్, గ్రానైట్ ఆపరేటర్ కోవిడ్ కష్టకాలంలోనూ చేయూత.. రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి అందరినీ వణికించింది. గ్రానైట్పైనా ప్రభావం చూపింది. ఫ్యాక్టరీ మూత పడింది. కరోనాతో వందల మంది మృతి చెందడంతో అన్నీ రెడ్ జోన్లే. వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డాం. అప్పుడు మాకు మరో రూ.28 లక్షల లోన్ ఇచ్చారు. నెలానెలా కంతుల వారీగా రుణం చెల్లిస్తున్నాం. ప్రస్తుతం వ్యాపారం బాగానే ఉంది. పిల్లలను బాగానే చదివించుకుంటున్నాం. పది మందికి ఉపాధి కల్పిస్తున్నానే తృప్తి మిగిలింది. సంవత్సరానికి రూ. 1 కోటి వరకు టర్నోవర్ చేస్తున్నాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాకు బాగా అండగా నిలిచింది. – లేమాటి నీరజ, ఫ్యాక్టరీ యజమాని కర్షకుడి నుంచి కర్మాగార స్థాపన వరకూ.. ♦ నెల్లూరు జిల్లా పొదలకూరులో బయోమాస్ బ్రికెట్స్ పరిశ్రమ స్థాపన ♦ మొక్కవోని దీక్షతో విజయంవైపు అడుగులు పొదలకూరు: ఆయనో సామాన్య రైతు. వ్యాపారం, పరిశ్రమలపై అవగాహన లేదు. అయినా తాను జీవిస్తూ పది మందికి ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పం ఓ చిన్నతరహా పరిశ్రమ స్థాపన వైపు అడుగులు వేయించింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని బయో మాస్ బ్రికెట్స్ పరిశ్రమ స్థాపించి విజయం సాధించారు. మొక్కవోని దీక్షతో వెనుకడుగు వేయకుండా పరిశ్రమను నిర్వహిస్తూ పది మందికి అన్నం పెడుతున్నారు. ఇదీ పొదలకూరు మండలం సూదుగుంట గ్రామానికి చెందిన పెద్దమల్లు శ్రీనివాసులు రెడ్డి విజయప్రస్థానం. పడిలేచిన కెరటంలా.. గతంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో సూదుగుంట షుగర్స్, సోనాక్(రొయ్య పిల్లల మేత) వంటి పెద్ద తరహా పరిశ్రమలు, అల్లోవీర, సిమెంటు బ్రిక్స్ వంటి చిన్న తరహా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టి తట్టుకోలేక మూతపడ్డాయి. కానీ పెద్దమల్లు శ్రీనివాసులురెడ్డి 2015లో బయో మాస్ బ్రికెట్స్ పరిశ్రమలను స్థాపించి నష్టాలు, కష్టాలను అధిగమించి ఓ స్థాయికి చేరుకున్నారు. పడి లేచిన కెరటంలా ఎదిగారు. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వినియోగించే బయో మాస్ బ్రికెట్స్(కట్టె ముక్కలు) తయారీ పరిశ్రమను స్థాపించి తయారు చేసి వస్తువును అమ్ముకోలేక అనేక ఇబ్బందులు పడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లేక ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ కూడా పొందలేకపోయారు. ఫలితంగా పరిశ్రమకు ఎలాంటి రాయితీలు పొందలేకపోయారు. బ్రికెట్స్ను అమ్ముకోగలిగినా లాభాలు రాక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయారు. ఇబ్బందులతో నెట్టుకొస్తున్న సమయంలో 2019 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ పొంది యూనియన్ బ్యాంకులో రూ.కోటి రుణం పొందగలిగారు. దానితో పరిశ్రమలో ఆధునాతన మెషినరీని ఏర్పాటు చేసి ఉద్యోగుల సంఖ్యను పెంచారు. మార్కెటింగ్ పల్స్ తెలుసుకున్నారు. ఫలితంగా విజయం సాధించి ఇప్పుడు రూ.5 కోట్ల టర్నోవర్కు చేరుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 మందికి ఉపాధి అవకాశం కల్పించి నెలకు రూ.3 లక్షల జీతాలు అందజేస్తున్నారు. బ్యాంకు రుణంలో ప్రభుత్వం 20 శాతం రాయితీ ఇవ్వడం, విద్యుత్ యూనిట్కు ఒకరూపాయి సబ్సిడీని అందజేయడంతో నిలదొక్కుకోగలిగారు. సర్కారు సాయంతోనే నిలదొక్కుకున్నాం ప్రారంభంలో ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కొన్నాను. నిలదొక్కుకునేందుకు దాదాపు నాలుగేళ్లు పట్టింది. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమ నిలదొక్కుని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు. నా అదృష్టం బాగుండి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడడం వల్ల ప్రోత్సాహాలు లభించాయి. దీంతో ఫ్యాక్టరీకి అవసరమైన టిప్పర్లు, మెషనరీ కొనుగోలు చేయగలిగాను. ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ పొందడం వల్ల పంచాయతీ, టౌన్ప్లానింగ్ అనుమతులు లభించాయి. ఫలితంగా పరిశ్రమ గాడిలో పడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లించగలుగుతున్నాను. ఎలాంటి కాలుష్యం ఏర్పడనందున ఫార్మాసిటికల్స్ కంపెనీల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. – పెదమల్లు శ్రీనివాసులురెడ్డి, ఫ్యాక్టరీ యజమాని, పొదలకూరు స్థానికంగానే ఉద్యోగం దొరికింది నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. మా ఊరికి చెందిన మారుతీ గ్రానైట్స్ నీరజ, హనుమంతరావు ఫ్యాక్టరీ పెట్టడంతో నాకు అందులో సూపర్వైజర్గా పని ఇచ్చారు. నమ్మకంగా పనిచేస్తున్నాను. ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టడం వల్లే నాకు వేరే ప్రాంతానికి వెళ్లే పని లేకుండా ఉపాధి దొరికింది. నాతోపాటు ఇక్కడ మరో 15 మంది పనిచేస్తున్నారు. – వెంకటేశ్, సూపర్వైజర్ పదేళ్లుగా పనిచేయిస్తున్నా.. మాది రాజస్థాన్. బతుకుతెరువు కోసం వచ్చా. ఇక్కడ మేస్త్రీగా పని చేస్తున్నాను. ఈ ఫ్యాక్టరీ యజమాని మాకు బాగా నచ్చాడు. మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. నెలా నెలా వేతనాలు అందుతున్నాయి. – బీరారామ్, మేస్త్రీ డెంటిస్ట్ కల అలా సాకారమైంది విశాఖలో డెంటల్ ల్యాబ్కు శ్రీకారం సాక్షి, విశాఖపట్నం: ఆయనో దంత వైద్యుడు. వైద్య విద్యను పూర్తి చేసుకుని 2010లో విశాఖపట్నం మురళీనగర్లో ఓ డెంటల్ క్లినిక్ ప్రారంభించారు. తాను నడిపే క్లినిక్కంటే దానికి సంబంధించిన ఉత్పత్తి పరిశ్రమను స్థాపిస్తే పలువురికి ఉపాధి కల్పించవచ్చని ఆయన భావించారు. దాని వ్యాపార మెలకువలు తెలుసుకునేందుకు ఎంబీఏలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేశారు. స్నేహితుడు గోపీకృష్ణతో కలిసి కృత్రిమ దంతాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఎంఎస్ఎంఈ సింగిల్ పోర్టల్ విధానంలో నెల రోజుల్లోనే అన్ని అనుమతులతో పాటు రుణమూ మంజూరైంది. రూ.3.50 కోట్ల పెట్టుబడితో 2020 జనవరి నుంచి ఉత్పత్తిని ప్రారంభించారు. వార్షిక టర్నోవర్ రూ.4.80 కోట్లకు చేర్చారు. ఆయన పేరు డాక్టర్ గండి వెంకట శివప్రసాద్. ఆయన స్థాపించిన యూనిట్ పేరు డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్. రాష్ట్ర ప్రభుత్వం ఈ డెంటల్ ల్యాబ్కు రూ.20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ కూడా మంజూరు చేసింది. మెటల్ లేజర్ సింటరింగ్ టెక్నాలజీతో... విశాఖలోని కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఈ డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ల్యాబ్ నడుస్తోంది. ఇందులో కృత్రిమ దంతాలకు అవసరమైన అచ్చులు, క్రౌన్లు, బ్రిడ్జిలు వంటివి తయారు చేస్తారు. వీటిని కాస్టింగ్ టెక్నాలజీతో కాకుండా మెటల్ లేజర్ సింటరింగ్ టెక్నాలజీతో డిజిటల్ త్రీడీ ప్రింటింగ్ విధానంలో చేస్తారు. కొరియన్ టెక్నాలజీతో తయారయ్యే ఇవి మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ ల్యాబ్ తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్దది. ఇప్పుడు 45 మంది శాశ్వత, 20 మంది తాత్కాలిక, మరో 20 మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు మంచి ప్రోత్సాహాన్నిస్తోంది. అతి తక్కువ సమయంలోనే వీటి ఏర్పాటుకవసరమైన అనుమతులను మంజూరు చేస్తోంది. గతంలో ఇలాంటి సౌకర్యం లేదు. మా ల్యాబ్ను మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకు రూ.6.50 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం మా ఉత్పత్తులు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు, హైదరాబాద్కు సరఫరా చేస్తున్నాం. భవిష్యత్తులో దేశమంతటా విస్తరించాలని యోచిస్తున్నాం. ల్యాబ్ విస్తరిస్తే వెయ్యి మంది ఉపాధి పొందుతారని భావిస్తున్నాం. – డా. గండి వెంకట శివప్రసాద్, ఎండీ, డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, విశాఖపట్నం -
ఉపాధి కోసం క్యూ కడుతున్న మహిళలు
ముంబై: ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి మరింత మంది మహిళలు ఉపాధి కోసం ముందుకు వస్తున్నారు. 2023లో 13 శాతం అధికంగా సుమారు కోటి మంది మహిళలు ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు జాబ్స్, ప్రొఫెషనల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ ఆప్నా డాట్ కో నివేదిక వెల్లడించింది. 2022లో ఇవే పట్టణాల నుంచి మొత్తం 2.7 కోట్ల ఉద్యోగ దరఖాస్తులు రాగా, అందులో మహిళలకు సంబంధించినవి 87 లక్షలుగా ఉన్నాయి. మహిళలు ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. 2023లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి వచి్చన ఉద్యోగ దరఖాస్తులు 3.2 కోట్లుగా ఉన్నాయి. ప్రతి నిమిషానికి మహిళల నుంచి 100 ఉద్యోగ దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇందులో 80 శాతానికి పైగా కార్యాలయ విధులకు సంబంధించినవే ఉన్నాయి. ఇంటి నుంచి పనిచేయడానికి బదులు, కార్యాలయం నుంచి పని చేయడం, కెరీర్ వృద్ధి కోసం మహిళలు చూస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని ఆప్నా నివేదిక తెలిపింది. 2022, 2023 సంవత్సరాల్లో తన ప్లాట్ఫామ్పై నమోదైన జాబ్ పోస్టింగ్లు, దరఖాస్తుల ఆధారంగా ఆప్నా ఈ వివరాలను విడుదల చేసింది. సేల్స్ సపోర్ట్, ఎంటర్ప్రైజ్ సేల్స్, అడ్వరై్టజింగ్, రియల్ ఎస్టేట్, ఇన్సైడ్సేల్స్, బ్రాండ్ మార్కెటింగ్, ఈ కామర్స్ తదితర విభాగాల్లో నిర్వహణ విధులకు సంబంధించి పోస్టింగ్లు పది రెట్లు పెరిగాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 60 శాతం జాబ్ పోస్టింగ్లు ఫ్రెషర్లకు సంబంధించినవే ఉన్నట్టు ఆప్నా నివేదిక తెలిపింది. -
పరిశ్రమలు, ఉపాధి కల్పనలో క్రాంతి.. జగనన్న పాలనలో రాష్ట్రానికి సంక్రాంతి
భారీ, మెగా పరిశ్రమలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారీ, మెగా పరిశ్రమలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి. గడిచిన 55 నెలల సమయంలో 311కి పైగా భారీ పరిశ్రమల్లో 1.30 లక్షల మంది ఉపాధి పొందారు. అంతే కాకుండా జీఐఎస్ సదస్సులో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరిగాయి. దీంతో మరో 6.07 లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభించనుంది. ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో రూ. 30000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 3.94 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 26.29 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రూ. 2087 కోట్ల ప్రోత్సాహకాలను ఎంఎస్ఎంఈలకు ఇవ్వడం జరిగింది. పోర్టుల నిర్మాణం భారీ, మెగా పరిశ్రమలు మాత్రమే కాకుండా.. ఫోర్టుల అభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఇందులో భాగమగ్నే ఇప్పటికే ఉన్న ఆరు పోర్టులకు అదనంగా 4 కొత్త పోర్టుల నిర్మాణానికి రూ. 16000 కోట్ల వ్యయం వెచ్చించారు. దీంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. కొత్తగా నిర్మితమవుతున్న పోర్టుల ద్వారా 110 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం పెరుగుతుంది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 75,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు సీఎం జగన్ ప్రభుత్వం మత్స్యకారుల ఉపాధికి ఊతమిస్తూ రూ. 4,000 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం చేపడుతోంది. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేక ఒక ఫిషింగ్ హార్టర్ రానుంది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఎయిర్ పోర్టులు రూ. 3,200 కోట్ల వ్యయంతో శరవేగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు సాగుతున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 80 వేల మందికి ఉపాధి లభిస్తుంది. గన్నవరం, కాకినాడ, వైజాగ్, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడప ఎయిర్ పోర్టుల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల వెల్లువ పారిశ్రామిక రంగంలో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్లో JSW స్టీల్, రాంకో సిమెంట్, సెంచురీ ఫ్యానల్స్, ATC టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్ లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ వంటి భారీ, మెగా పరిశ్రమలు, MSMEల ద్వారా రూ.14.19 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీని వల్ల ఏకంగా 33.63 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
శ్రీకాకుళం భాగ్యరేఖ.. మూలపేట పోర్టు
సాక్షి, అమరావతి: వెనుకబడ్డ ఉత్తరాంధ్ర తలరాతను మార్చే మరో పోర్టు వేగంగా రూపుదిద్దుకుంటోంది. వలస జిల్లా పేరు నుంచి ఉపాధి కల్పించే జిల్లాగా శ్రీకాకుళం పేరును మార్చే మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జిల్లాకు రెండు వేల కోట్ల రూపాయలకు మించి పెట్టుబడులు రాలేదు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకంగా మూలపేట పోర్టు, మంచినీళ్లపేట, బుడగల్లపాలెం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ. 5,000 కోట్లు పైనే వ్యయం చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల్లో ఒకటైన మూలపేట మన రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాల నుంచి ఎగుమతులు దిగుమతులకు అనువుగా ఉంటుందని.. ఇలాంటి కీలకమైన ప్రదేశంలో మూలపేట ఉందని ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పోర్టు ద్వారా ఐదు రాష్ట్రాల్లోని పరిశ్రమలు తమకు అవసరమైన ముడి సరుకులు దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే ఇక్కడ నుంచి మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్, ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మూలపేట పోర్టు పనులను ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని అనుమతుల తర్వాత అన్ని అనుమతుల తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించడంతో పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. పోర్టులో కీలకమైన సౌత్ బ్రేక్ వాటర్ నిర్మాణానికి 19.40 లక్షల టన్నులు, నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణానికి 2.71 లక్షల టన్నుల బండరాళ్లు అవసరమవుతాయని అంచనా వేయగా ఇప్పటికే 8.3 లక్షల టన్నుల బండరాళ్లను తరలించారు. ఇదే సమయంలో జనరల్ బెర్త్ నిర్మాణ పనులు, తీర ప్రాంతం పటిష్టం చేయడం, ఎన్హెచ్ 16ను అనుసంధానం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి దశలో నాలుగు బెర్తులు పోర్టు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,361.91 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ పోర్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును విశ్వసముద్ర కన్సార్టియం చేపట్టింది. రూ. 2,949.70 కోట్ల వ్యయంతో తొలిదశలో నాలుగు బెర్తుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనను విశ్వసముద్ర అభివృద్ధి చేయనుంది. మొత్తం పోర్టు వార్షిక సామర్థ్యం 83.3 మిలియన్ టన్నులు కాగా తొలిదశలో నాలుగు బెర్తుల నిర్మాణంతో 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టును అభివృద్ధి చేయనున్నారు. మొత్తం నాలుగు బెర్తుల్లో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గు, ఇంకొకటి కంటైనర్తోపాటు ఇతర ఎగుమతి దిగుమతులకు వినియోగించనున్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూలపేట పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణరూపంలో సమీకరిస్తున్నారు. 596 కుటుంబాల తరలింపు పోర్టు నిర్మాణం కోసం విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 596 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరిని ఒక కుటుంబంగా పరిగణించి వారికి కస్త నౌపాడ వద్ద పునరావాస గ్రామం అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ. 149 కోట్లు్ల వ్యయం చేస్తోంది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద అక్కడ 13 రకాల మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పటికే స్థలాన్ని చదును చేసి విద్యుత్, తాగునీరు కనెక్షన్లను ఏర్పాటు చేయడం పూర్తయింది. త్వరలోనే లాటరీ విధానంలో ప్లాట్ను కేటాయించి ఇంటి నిర్మాణాలను ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మూలపేట పోర్టు స్వరూపం ప్రాజెక్టు వ్యయంరూ.4,361.91 కోట్లు తొలి దశ పోర్టు:23.5 ఎంటీపీఏ తుది దశ పోర్టు:83.3 ఎంటీపీఏ తొలి దశలో బెర్తుల సంఖ్య 4 నౌక పరిమాణం:1,20,000 డీడబ్ల్యూటీ అవసరమైన భూమి:1,254.72 ఎకరాలు దక్షిణ బ్రేక్ వాటర్:2,455 మీటర్లు ఉత్తర బ్రేక్ వాటర్: 580 మీటర్లు తీరం రక్షణ:1,000 మీటర్లు డ్రెడ్జింగ్: 15.85 మిలియన్ క్యూబిక్ మీటర్లు అప్రోచ్ చానల్:3.3 కి.మీ నీరు: గొట్టా బ్యారేజీ నుంచి 0.5 ఎంఎల్డీ నీటి సరఫరా రైల్: 10.6 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం రహదారి: ఎన్హెచ్16ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ. నాలుగులేన్ల రహదారి నిర్మాణం కార్యకలాపాలు ప్రారంభం: అక్టోబర్, 2025 శ్రీకాకుళం ఇక సిరుల జిల్లా ఇంతకాలం శ్రీకాకుళం అంటే వలసలు గుర్తుకు వచ్చేవి. కానీ మూలపేట పోర్టు రాకతో స్థానికులు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతేగాక వేరే ప్రాంతం వారికి కూడా ఇక్కడ ఉపాధి కల్పించే సిరుల జిల్లాగా రూపాంతరం చెందుతుంది. కేవలం పోర్టులే కాకుండా వాటిపక్కనే పోర్టు ఆధారిత పరిశ్రమలను ప్రమోట్ చేస్తున్నాం. కొత్తగా వస్తున్న నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లతో రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్రలతో పోటీ పడుతుంది. రెండు లక్షల టన్నుల బరువు ఉండే భారీ ఓడలను తీసుకువచ్చే విధంగా ఈపోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. – కాయల వెంకటరెడ్డి, చైర్మన్ ఏపీ మారిటైమ్ బోర్డు 6 నెలలు ముందుగానే అందుబాటులోకి పోర్టు శంకుస్థాపన జరిగిన 8 నెలల్లో రికార్డు స్థాయిలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే నార్త్ బ్రేక్ వాటర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సౌత్ బ్రేక్ వాటర్ పనులు 50 శాతంపైగా పూర్తయ్యాయి. వాస్తవంగా ఈ ప్రాజెక్టును అక్టోబర్ 2025 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా సీఎం ఆదేశాలు మేరకు ఆరు నెలలు ముందుగానే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఆ మేరకు ప్రణాళికలను సిద్ధం చేశాం. డ్రెడ్జింగ్ పనుల కోసం ప్రత్యేకంగా రూ. 350 కోట్లతో చైనా నుంచి డ్రెడ్జింగ్ మిషన్ కొనుగోలు చేశాం. త్వరలోనే డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించనున్నాం. –చావల బాబురావు, ఎండీ, మూలపేట పోర్టు భావితరాలకు మేలు చేకూరుతుంది భావితరాలకు మేలు చేకూరుతుందని మూలపేట పోర్టుకు మాభూములు, ఇళ్లు, గ్రామాన్ని ఇచ్చాము. జిల్లా అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యంగా ఉన్నందుకు గర్వంగా ఉంది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే పని దొరుకుతుంది. – గిన్ని భైరాగి, విష్ణుచక్రం గ్రామం పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది మూలపేట పోర్టు రావడం వల్ల మరికొన్ని అనుబంధ పరిశ్రమలు ఈ ప్రాంతానికి వస్తాయి. దీంతో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. యువకులకు ఉద్యోగ, ఉపాధి కలిగి వలసనివారణ జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మా భూములను ప్రభుత్వానికి ఇచ్చాము. – కనిరెడ్డి భాస్కర్రెడ్డి, నౌపడ పోర్టుతో భూముల ధరలు పెరిగాయి మూలపేట పోర్టుతో ఈ ప్రాంత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. సెంటు భూమి రూ. 1.50లక్షల నుంచి రూ. 2లక్షలు వరకు పెరిగింది. పోర్టు పూర్తి అయితే ఈ ప్రాంతం అంతా పారిశ్రామిక వాడగా మారుతుంది. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. – కర్రి కాంతారావు, రైతు, నౌపడ -
ఏపీలో ఎంఎస్ఎంఈ ఉద్యోగాలు భారీగా పెరిగాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కల్పన ఏటేటా భారీగా పెరుగుతోందని కేంద్ర ఎంఎస్ఎంఈల శాఖ సహాయ మంత్రి భానుప్రతాప్సింగ్వర్మ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. 2021–22వ ఆర్థిక సంవత్సరంలో ఏపీలో ఎంఎస్ఎంఈల ద్వారా 12,29,335 మందికి ఉద్యోగాలను కల్పించగా.. 2022–23లో ఏకంగా 27,27,273 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కేంద్ర మంత్రి భానుప్రతాప్సింగ్ తెలిపారు. ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ 7వ స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు. వైఎస్ జగన్ పాలనలోని ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 5.06 లక్షల ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయి. గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530 ఎంఎస్ఎంఈలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 6,99,881కు పెరిగిందని కేంద్ర మంత్రి భానుప్రతాప్సింగ్ తెలిపారు. దేశంలో 2021–22లో 6,222 ఎంఎస్ఎంఈలు మూతపడగా.. ఏపీలో 113 మాత్రమే మూతపడ్డాయని చెప్పారు. 2022–23లో దేశంలో 13,290 ఎంఎస్ఎంఈలు మూతపడగా ఏపీలో 261 మాత్రమే మూతపడ్డాయని వివరించారు. కోవిడ్ కష్ట సమయంలో సైతం ఎంఎస్ఎంఈల కార్యకలాపాలు నిలిచిపోకుండా సీఎం జగన్ రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం తదితర పథకాలతో చేదోడువాదోడుగా నిలిచారు. అలాగే చంద్రబాబు హయాంలో ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను కూడా సీఎం జగన్ చెల్లించారు. మరో రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలనూ విడుదల చేశారు. సీఎం జగన్ అందిస్తున్న ప్రోత్సాహంతో భారీగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటవుతున్నాయి. స్థానికులకు భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. -
‘ఫ్యూచర్ స్కిల్స్’లో ఏపీకి అగ్రాసనం
సాక్షి, అమరావతి: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ యువతను ఉపాధి వైపు నడిపించడంలో మన రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పరిశ్రమల నిర్దిష్ట అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్ నైపుణ్యాలు (ఫ్యూచర్ స్కిల్స్) కలిగిన మానవ వనరులను తయారు చేయడం, ఇంటర్న్షిప్ కోరుకుంటున్న విద్యార్థుల విషయంలో ఏపీ అగ్రశ్రేణిలో కొనసాగుతోంది. 21వ శతాబ్దపు విద్యార్థులను ‘కృతిమ మేధ’ (ఏఐ)సృష్టికర్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి ‘ఇండియా స్కిల్స్ రిపోర్టు–2024’ ఊతం ఇచ్చింది. ఈ క్రమంలోనే భవిష్యత్ నైపుణ్యాల కల్పనలో 76.15 శాతం స్కోర్తో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి. టాలెంట్ అసెస్మెంట్ ఏజెన్సీ ‘వీబాక్స్’ ఏటా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్త్రీ (సీఐఐ), అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ (ఏఐయూ)తో కలిసి ‘ఇండియా స్కిల్స్ రిపోర్టు’ను విడుదల చేస్తోంది. భవిష్యత్లో పరిశ్రమల డిమాండ్లు, సాంకేతిక పురోగతులకు అనుగుణంగా శ్రామిక శక్తిని సిద్ధం చేయడంలో బలమైన ప్రాధాన్యతను ప్రదర్శిస్తోందని తాజా నివేదిక ప్రశంసించింది. ఇక నైపుణ్యాభివృద్ధిలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలతో ఆంగ్లం, న్యూమరికల్, క్రిటికల్ థింకింగ్, కంప్యూటర్ నైపుణ్యాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. అత్యధిక న్యూమరికల్ స్కిల్స్ (సంఖ్యాపర నైపుణాలు) కనబరుస్తున్న సిటీల్లో బెంగళూరు తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత విజయవాడ, గుంటూరు ఉండటం విశేషం. ఇంటర్న్షిప్లోనూ టాప్ విద్యార్థులకు పాఠ్యాంశాల విజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్కు పెద్దపీట వేయాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. ఇందుకోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నత విద్యలో 10 నెలల ఇంటర్న్షిప్ను దేశంలోనే ప్రప్రథమంగా తీసుకొచ్చారు. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఓవైపు ఇంటర్న్షిప్.. మరోవైపు నైపుణ్య శిక్షణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వర్చువల్, హ్యాండ్ ఎక్స్పీరియన్స్లో సుమారు 8 లక్షల మందికి షార్ట్టెర్మ్, లాంగ్ టెర్మ్ ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించింది. ఇండియా స్కిల్స్ రిపోర్టు ప్రకారం వరుసగా రెండో ఏడాది ఇంటర్న్షిప్కు ఆసక్తి వ్యక్తం చేస్తున్న విద్యార్థులు గల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది 93.50 శాతం స్కోరు సాధిస్తే.. ఇప్పుడు 98.33 శాతాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 96.72 శాతంతో తెలంగాణ, 93.44 శాతంతో పంజాబ్, 92.44 శాతంతో హర్యానా ఉన్నాయి. వచ్చే జనవరిలో మరో 2.20 లక్షల మందికి ఇంటర్న్షిప్ 22 ఎడ్యుటెక్ సర్విస్ ప్రొవైడర్ల ద్వారా స్టేట్, గ్లోబల్ ఇంటర్న్షిప్ను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే అంతర్జాతీయ ఎడ్యుటెక్ సర్వీస్ ప్రొవైడర్లతో పాటు 27 వేలకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలను కళాశాలలకు అనుసంధానం చేసి వర్చువల్, హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఇంటర్న్షిప్ అవకాశాన్ని కల్పించింది. ఉద్యోగాల కల్పనలోనూ మేటి ఆంధ్రప్రదేశ్ అంతటా ఉద్యోగ అవకాశాల విస్తృతిలో సమతుల్యతను ప్రదర్శిస్తోందని నివేదిక కొనియాడింది. గతంతో పోలిస్తే ఉపాధి వనరులను మెరుగుపర్చుకుని ఏపీ అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. గతేడాది 65.58 శాతం స్కోరుతో 4వ స్థానంలో ఉండగా.. తాజాగా 72.38 శాతం స్కోరుతో 3వ స్థానానికి చేరుకుంది. హర్యానా (76.47శాతం), మహారాష్ట్ర (73.03 శాతం) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో మెట్రోస్థాయి నగరాలు లేనప్పటికీ ఇంతటి గణనీయమైన స్థాయిలో నిలవడం చిన్న విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు లేకపోవడం, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి పారిశ్రామిక కేంద్రాలతో పోటీపడీ మరి ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరుతో అత్యున్నతంగా నిలిచిందని నివేదిక ఊటంకించింది. సీఎం జగన్ దార్శనికతో ఐటీ, ఇతర పరిశ్రమల రాకతో ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఏపీ మెరుగైన ఫలితాలనే సాధించింది. ఇప్పుడు అన్ని వయసు్కలకు ఉపాధి బాగుందని, ముఖ్యంగా 18–21 ఏళ్ల వయసు్కల్లో (73.10 శాతం స్కోరు) ఉద్యోగాల అందించడంలో నాల్గవ స్థానంలో ఉంది. మహిళలు, పురుషులకు ఉపాధి, ఉద్యోగాల కల్పిస్తున్న అంశంలోనూ ఏపీ 3వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఎంబీఏలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు దక్కుతుంటే ఆ తర్వాత బీఈ/బీటెక్లో లభిస్తున్నాయి. ఈ లెక్కన బీఈ/బీటెక్ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ (73.32 శాతం స్కోరుతో) 2వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. కేరళ, కర్ణాటక మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఐటీలో 68.44 శాతం, కంప్యూటర్ సైన్స్లో 66 శాతం, ఆ తర్వాత ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గతేడాది సాంకేతిక విద్యార్థులకు ఏకంగా 1.20 లక్షలకు పైగా క్యాంపస్ ఉద్యోగాలు వచ్చాయి. గొప్ప టాలెంట్ రిజర్వాయర్! దేశంలో పరిశ్రమలకు తగిన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ను ‘టాలెంట్ రిజర్వాయర్’గా నివేదిక అభివర్ణించింది. విద్యార్థులకు మెరుగైన విద్య విషయంలో దృఢమైన నిబద్ధత, విభిన్న నైపుణ్యాల సాధికారత కల్పనలో చిత్తశుద్ధిని లేకుండా ఇతంటి వృద్ధి సాధ్యపడదని పేర్కొంది. భవిష్యత్ పారిశ్రామిక అవసరాల్లో ఏపీ కీలకంగా మారుతుందని, కంపెనీలకు స్వర్గధామంగా ఉంటోందని కొనియాడింది. ఉద్యోగాల్లో రూ.2.60 లక్షలు, అంతకంటే ఎక్కువ వేతనాన్ని కోరుకునే తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో కేరళ, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకుంది. ముఖ్యంగా బీఈ/బీటెక్ విద్యార్థుల్లో నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడినట్టు చెప్పింది. ఏపీలో అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలే ఎక్కువ. కానీ, నైపుణ్యం కలిగిన ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న మహిళా వర్క్పోర్స్లో మెట్రోపాలిటిన్ సిటీలను కూడా వెనక్కినెట్టింది. 39.96 శాతం స్కోర్తో హర్యానా తర్వాతో రెండో స్థానంలో నిలుస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సీఎం దార్శనికతకు నిదర్శనం భవిష్యత్ ప్రపంచం కృత్రిమ మేధపై ఆధారపడుతుంది. అలాంటి తరుణంలో మన విద్యార్థుల్లో ఫ్యూచర్ స్కిల్స్ అభివృద్ధి చేయాలి. ప్రపంచంలోనే ఏపీ విద్యార్థులను అగ్రస్థానంలో నిలపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పిం చారు. అందుకే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టారు. వాటిని ఫలితాల ప్రతిరూపం తాజా ఇండియా స్కిల్స్ నివేదిక ద్వారా వెల్లడైంది. దేశంలోనే ‘ఫ్యూచర్ స్కిల్స్ రెడీస్’లో మనం టాప్గా నిలవడం సంతోషంగా ఉంది. ఏఐలో పరిపూర్ణ విజ్ఞానవంతులుగా మన విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే ఎల్ఎంఎస్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాం. పరిశ్రమల భాగస్వామ్యంతో రిసోర్స్ సెంటర్లు, ఇన్నోవేటివ్ ల్యాబ్స్ను పెడతాం. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి -
ఉద్యోగాలు.. బదిలీలు
లక్డీకాపూల్: ప్రజాభవన్లో నిర్వహిస్తోన్న ప్రజావాణికి అర్జీల వరద కొనసాగుతోంది. మంగళవారం 2,717 దరఖాస్తులు అందగా, వాటిని కంప్యూటరైజ్డ్ చేసి దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) విభాగానికి ప్రభుత్వం బాధ్యతలప్పగించింది. దరఖాస్తుల సంఖ్య పె రుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. మంగళవారం ఉపాధ్యాయుల దంపతుల బదిలీపై స్పౌజ్ ఫోరం ప్రతినిధులు భారీగా ప్రజావాణికి తరలివచ్చారు. స్పౌజ్ ఫోరం ప్రతినిధు లు వివేక్, నరే‹శ్, అర్చన, సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలోని అశాస్త్రీయ విధానా లవల్ల భర్త ఒకచోట, భార్య మరోచోట ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వెంటనే బదిలీ లు చేపట్టాలని కోరారు. మహిళా సమాంతర రిజర్వేషన్ సమస్యను త్వరితగతిన పరిష్కరించి ఏఈఈ గ్రూప్–4 ఫలితాలను విడుదల చే యాలని పలువురు నిరుద్యోగులు ప్రభుత్వాని కి మొరపెట్టుకున్నారు. నిరుద్యోగ ప్రతినిధులు నాగులు సాయికిరణ్, పవన్, శరత్ మీడియా తో మాట్లాడుతూ.. హారిజాంటల్ రిజర్వేషన్ విషయంలో అనవసరమైన కాలయాపన చేయకుండా మెమో నెం.7593ను ప్రకారం డాక్యు మెంట్ వెరిఫికేషన్ జాబితాను పదిహేను రోజు ల్లో విడుదల చేయాలని కోరారు. నా భర్త ఉద్యోగం ఇవ్వండి విధి నిర్వహణలో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన జెన్కో ఉద్యోగి సదానందన్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మృతుని భార్య వందన సదానందన్ తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చి ప్రజావాణిలో వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి సాయం అందలేదనీ, ఇప్పటికైనా భర్త ఉద్యోగం తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఉరకలేసేలా.. ఊపునిచ్చేలా..
ఓ వైపు సాంస్కృతిక సౌరభాలు వెదజల్లే సంప్రదాయ నాట్యాలు.. మరోవైపు అత్యాధునికతకు పట్టం కట్టే అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్స్.. అంబరాన్ని తాకే అద్భుతమైన పెళ్లి వేడుకలు.. రంగుల హంగుల హోలీ వేదికలు.. నగరం అంటే ఇప్పుడో ఈవెంట్ల సాగరం. ఓ వైపు ఈవెంట్స్కు పెద్దన్న లాంటి కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.. మరోవైపు ఇటీవలే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో నూతన కాంతులీనాలని నగర ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం ఆకాంక్షిస్తోంది. అందుకు గాను ప్రభుత్వ సహాయ సహకారాలను కోరుతోంది. – సాక్షి, సిటీబ్యూరో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈవెంట్స్ రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించాలని చాలాకాలంగా కోరుతున్నారు. ఈ రంగంలో ఈవెంట్ మేనేజర్లు, సౌండ్ లైట్ వీడియో ప్రొవైడర్లు, డెకరేటర్లు, డిజైనర్లు తదితర విభిన్న క్రాఫ్ట్లను కలిగి ఉన్న నగర ఈవెంట్ రంగం దేశంలోనే నంబర్ 1గా దూసుకుపోతోంది. పెద్ద సంఖ్యలో కళాకారులు, క్యాటరర్లు, ఈవెంట్ వేదికల యజమానులు, కన్వెన్షన్ కేంద్రాలతో కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలోనే తమ ఈవెంట్ రంగానికి ప్రభుత్వం నుంచి పరిశ్రమ గుర్తింపు కావాలని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ప్రతినిధులు కోరుతున్నారు. టీసీఈఐలో 400 మంది సభ్యులు, 15,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్రంలో అధికారికంగా ఈవెంట్ మార్కెట్ పరిమాణం రూ.800 కోట్ల అసంఘటిత రంగంలో కొన్ని వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ రంగం ఏటా 16% చొప్పున వృద్ధి నమోదు చేస్తోంది. కోర్సులకు శ్రీకారం.. విస్తృత అవసరాలను కలిగి ఉన్న ఈవెంట్ రంగం వైపు నిపుణులను ఆకర్షించడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ కోర్సులను ప్రారంభించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్తో టీసీఈఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కోర్సుల పట్ల యువతలో ఆసక్తి పెంచడానికి వీటిని ఉపాధి ఆధారితంగా మార్చడానికి, టీసీఈఐ ప్రభుత్వ సహకారం కోరుతోంది. సింగిల్ విండోతో సమస్యలకు చెక్... ఈవెంట్ నిర్వహణ కత్తిమీద సాము. ముఖ్యంగా ఇందులో సమయం కీలకపాత్ర పోషిస్తుంది. కాలం వృథా వల్ల కలిగే నష్టం ఒక్కోసారి అంచనాలకు అందదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈవెంట్ల నిర్వహణకు కావాల్సిన అనుమతుల కోసం అనేక ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరిగే అవసరం తప్పించాల్సిందిగా టీసీఈఐ చాన్నాళ్లుగా కోరుతోంది. అన్ని రకాల అనుమతులూ ఒకే చోట క్లియర్ అయ్యేలాగా విండో క్లియరెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తోంది. గత ప్రభుత్వం అందించిన సహకారంతో ఈవెంట్స్ రంగం కొత్త పుంతలు తొక్కిందనీ నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వం అంతకు మించిన ప్రోత్సాహం అందిస్తుందని, ప్రపంచంలోనే హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే కృషిలో చేయూత అందిస్తుందని టీసీఈఐ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్ సిటీ ఏర్పాటు కావాలి.. నగరంలోని ఈవెంట్స్, మేనేజర్ల టాలెంట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరాయి. దీనికి అనుగుణంగా మరిన్ని మార్పులు చేర్పులు అవసరం. ప్రపంచ స్థాయి ఈవెంట్లు – కాన్ఫరెన్స్ల నిర్వహణను సులభతరం చేయడానికి, భారీ కన్వెన్షన్ సెంటర్లు, స్పోర్ట్స్ స్టేడియాలు, అడ్వెంచర్ స్పోర్ట్స్ అరేనాలు, అవుట్డోర్ ఈవెంట్ అరేనాలు, మోటర్ స్పోర్ట్స్ రేసింగ్ ట్రాక్లు, హోటళ్లు, వివిధ రంగాల్లో పనిచేసే వ్యక్తుల హౌసింగ్ వంటివన్నీ ఒకే చోట నెలకొల్పే విధంగా ఒక ఈవెంట్ సిటీని ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుంది. దీనిని నగరానికి 80–100 కి.మీ లోపల ఈవెంట్ సిటీని సృష్టించేందుకు వీలుంది. ఇలాంటి ప్రతిపాదనలతో కొత్త ప్రభుత్వ సారధులను త్వరలోనే కలవనున్నాం. – రవి కుమార్, జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ -
3 నెలల్లో.. 4 క్లస్టర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధికమందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. తక్కువ వ్యయంతో ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా పోటీ మార్కెట్లో నిలబడే విధంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఔత్సాహికుల చేయిపట్టుకుని నడిపిస్తోంది. దేశంలోనే మొదటగా కాకినాడలో ఏర్పాటైన ప్రింటింగ్ క్లస్టర్ విజయవంతంగా అందుబాటులోకి రావడంతో.. అదే స్ఫూర్తితో ఎంఎస్ఎంఈ క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. రూ.46.03 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నాలుగు క్లస్టర్లను మూడునెలల్లోగా అందుబాటులోకి తీసుకువాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి పరిశ్రమలశాఖ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రూ.8 కోట్లతో బంగారు ఆభరణాల తయారీ క్లస్టర్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద రూ.14.98 కోట్లతో ప్రింటింగ్ క్లస్టర్, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మాచవరం వద్ద రూ.14.83 కోట్లతో పప్పుదినుసులు తయారు చేసే పల్సస్ క్లస్టర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరు వద్ద రూ.8.22 కోట్లతో గార్మెంట్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. చుట్టపక్కల ప్రాంతాల్లో ఉండే సూక్ష్మ, చిన్నతరహా యూనిట్లు జట్టుకట్టి ఒక ప్రత్యేక కంపెనీగా ఏర్పడి ఈ క్లస్టర్లలో ఉమ్మడిగా మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. మార్చిలోగా ఈ నాలుగు క్లస్టర్లను ప్రారంభించే విధంగా పనులు చురుగ్గా సాగుతున్నాయని ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.గోపాలకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నాలుగు క్లస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన మ్యాచింగ్ గ్రాంట్, ఎస్పీవీలు సమకూర్చాల్సిన మొత్తం ఇప్పటికే జమచేయడంతో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ నాలుగు క్లస్టర్లతో సుమారు 25 వేలమందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం బకాయిలు గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ఈ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఆదుకుంటోందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లులకు కలిపి బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి ఆదుకుందని తెలిపారు. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంపై ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో ఎంఎస్ఎంఈల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలు 1,93,530 కాగా.. వీటి సంఖ్య ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి ఏకంగా 5,81,152కు చేరింది. నాలుగున్నరేళ్లలో క్తొతగా 3.87 లక్షల యూనిట్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో మొత్తం ఎంఎస్ఎంఈల ద్వారా 34.83 లక్షల మందికి ఉపాధి లభిస్తుంటే.. ఈ నాలుగున్నరేళ్లలోనే కొత్తగా 12.61 లక్షల మందికి ఉపాధి లభించినట్లు ఉద్యమ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్రంలోని వలస కార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉపాధి కల్పించడానికి ఏడీఎన్హెచ్ కంపాస్ కంపెనీ ఉచిత రిక్రూటింగ్ ప్రక్రియ చేపట్టింది. తెలంగాణ జిల్లాలకు చెందిన 12 వేలమంది వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కంపెనీ మరి కొంతమంది కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్యాటరింగ్ రంగంలో వలస కార్మికులకు ఆరు రకాలైన పనులు కల్పించనున్నారు. ఉచితంగా వీసా, విమాన టికెట్ సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తుంది. క్యాటరింగ్ సూపర్వైజర్(హాస్పిటాలిటీ క్యాటరింగ్ అనుభవం ఉన్నవారికి), టీం లీడర్(హాస్టల్ నిర్వహణ అనుభవం), హెవీ వెహికల్ డ్రైవర్(యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి), కిచెన్ స్టీవార్డ్స్, క్లీనర్స్, వెయిటర్లకు ఉపాధి కల్పించడానికి వీసాలను జారీ చేయనున్నారు. ఈ నెల 9న ముంబైలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఆర్మూర్, జగిత్యాల్లోని జీటీఎం ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీవారిని కలిసి వివరాలను అందించాలని సంస్థ యజమాని చీటి సతీశ్రావు ‘సాక్షి’కి వివరించారు. 22 నుంచి 35 ఏళ్లలోపు వయసు కలవారు ఈసీఎన్ఆర్ పాస్పోర్టు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులకు పచ్చ»ొట్టు ఉండకూడదని చెప్పారు. వేతనంతోపాటు ఉచితవసతి, భోజన సదుపాయం కల్పించి ఉపాధి ఇవ్వనున్నారని వెల్లడించారు. ముంబైలో ఇంటర్వ్యూకు వెళ్లేవారి కోసం తక్కువ ఖర్చుతో బస్సు సౌకర్యం కల్పించామన్నారు. -
కరువు మండలాల్లో అదనపు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: కరువు మండలాల్లో కూలీల కుటుంబాలకు అదనపు పనులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కుటుంబానికి అదనంగా 50 పనిదినాల పాటు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించనుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 103 కరువు మండలాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో పూర్తిగా నగర ప్రాంతంలో ఉండే కర్నూలు మినహాయించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మిగిలిన 102 మండలాల్లో అదనపు పనులు కల్పిస్తారు. ఈ మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కావాలని కోరే ఒక్కో కుటుంబం ఏడాదికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు పొందే వీలుంటుంది. దీంతో 2.42 లక్షల కుటుంబాలకు మేలు చేకూరుతుంది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.13,660 వరకు అదనపు లబ్ధి కలుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సోమవారం కేంద్రానికి లేఖ రాశారు. కరువు మండలాల్లో అదనపు పని దినాలు.. సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి వంద పనిదినాల కల్పనకు అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో మాత్రం ఈ ఏడాది ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు కల్పిస్తారు. 102 మండలాల పరిధిలో 5.68 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుంటుంటారు. 5.68 లక్షల కుటుంబాల్లో దాదాపు లక్ష కుటుంబాలు ఇప్పటికే వంద పనిదినాల గరిష్ట లక్ష్యాన్ని పూర్తి చేసుకుని ఉండడం లేదా గరిష్ట లక్ష్యానికి అతి దగ్గరగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబాలతోపాటు దాదాపు మరో లక్షన్నర కుటుంబాలు వచ్చే ఐదు నెలల్లో అదనపు పనులు కోరేందుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 102 మండలాల పరిధిలో కనీసం 2,42,282 కూలీల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. -
‘కొయ్య బొమ్మ’కు ప్రాణం పోసేదెప్పుడు?
తెలంగాణ కళలకు కాణాచి. చేతివృత్తులు, హస్తకళలకు పెట్టింది పేరు. అలాంటి కళల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్మల్ కొయ్యబొమ్మలు ఇప్పటికీ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. దాదాపు 450ఏళ్లుగా నకాషీ కుటుంబాలు ఈ కళను నమ్ముకొని బతుకుతున్నాయి. కాలక్రమంలో పాలకుల పట్టింపు లేక ఈ కళ కనుమరుగయ్యే దశకు చేరుకుంటోంది. కొయ్య బొమ్మ తయారయ్యే ‘పొనికి’ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వెరసి కర్రకు కరువు ఏర్పడడం వల్ల కళాకారులకు పని ఉండడం లేదు. ఈ క్రమంలో చాలావరకు నకాషీ కుటుంబాలు ఇతర రంగాల్లో ఉపాధి వెతుక్కుంటున్నారు. ఇలాగే సాగితే రానున్న తరంలో కళ అంతరించి పోతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మల్ కొయ్య బొమ్మల తయారీలో అసలైన ముడిపదార్థం పొనికి కర్ర. మృదువుగా ఉండే పొనిక చెట్టు కర్రతోనే ఈ బొమ్మలను చేయడం ప్రత్యేకత. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో పొనికి చెట్లు విపరీతంగా ఉండేవి. కాలక్రమంలో అడవులతోపాటు పొనికి చెట్లు కూడా అంతరించి పోతున్నాయి. బొమ్మల తయారీకి కావాల్సిన కర్రను కళాకారులు అటవీశాఖ కలప డిపోల నుంచి సేకరిస్తున్నారు. ఈ కర్రకు కొరత ఏర్పడడంతో బొమ్మలు చేసేవాళ్లకు పని ఉండడం లేదు. మూడునెలల క్రితం నిర్మల్ జిల్లా కలెక్టర్గా ఉన్న వరుణ్రెడ్డి, డీఆర్డీఓ విజయలక్ష్మి ప్రత్యేక చొరవ తీసుకుని పొనికి వనాన్ని ప్రారంభించారు. అందులో మొక్కల పెంపకం చేపట్టారు. కానీ అవి చేతికొచ్చి కొయ్యబొమ్మగా మారేందుకు సమయం పడుతుంది. కనీసం పింఛన్ లేదు.. నిర్మల్ జిల్లా కేంద్రంలో 1955లో కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేశారు. కొయ్య బొమ్మను నమ్ముకొని ఒకప్పుడు రెండు వందల కుటుంబాల ఉండేవి. ఇప్పుడు 50లోపే కుటుంబాలు బొమ్మలను తయారు చేస్తున్నాయి. అందులోనూ నేటితరమంతా వివిధ రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు చూసుకున్నారు. ఇప్పుడు పనిచేస్తున్న కళాకారులంతా ఎప్పుడో 25–30ఏళ్ల నుంచి చేస్తున్నవారే. వారికి కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం, పింఛన్ లభించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించిన షెడ్డు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి సాయం అందడంలేదు. ‘మా చేతులతో చేసుకున్న బొమ్మలు పెట్టే అన్నం తప్ప.. ఇప్పటిదాకా ప్రత్యేకంగా రూపాయి అందడం లేదు..’ అని సీనియర్ కళాకారులు వాపోతున్నారు. తమ జీవితాల్లోనే ఎలాంటి ఎదుగుదల లేదని, ఇక అలాంటప్పుడు తమ పిల్లలు ఈ కళను ఎలా కొనసాగిస్తారని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. జీవితమంతా బొమ్మలతోనే.. 35ఏళ్లుగా కొయ్యబొమ్మల తయారీలోనే ఉన్నా. మా పూర్వికుల నుంచి ఇదే ఉపాధి. కానీ పొనికి కర్ర కొరతతో చాలామందికి పనిలేకుండా పోతోంది. సరైన ప్రోత్సాహం లేకపోవడంతో మా పిల్లలు ఇటువైపు రావడం లేదు. –పెంటయ్య, నకాషీ కళాకారుడు -
మరిన్ని పెట్టుబడులు
సాక్షి, అమరావతి: స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.19,037 కోట్ల విలువైన 10 పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో ఏడు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు కాగా.. మూడు విస్తరణ కార్యక్రమాలకు చెందినవి ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 69,565 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికరంగంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. వీటన్నింటినీ అధికారులు తెలుసుకుంటూ ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అర్థంచేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. అత్యంత పారదర్శక విధానాల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చా మని.. ఈ క్రమంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచామని ముఖ్యమంత్రి జగన్ గుర్తుచేశారు. పరిశ్రమలపట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయడం ద్వారా ఈ ప్రయాణం మరింతగా ముందుకు సాగించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే అనుమతులు, తదితర అంశాల్లో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోందని, ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్కాల్ దూరంలో ఉన్నామన్న భరోసాను వారికి కల్పిస్తున్నామన్నారు. కానీ, అనుమతులు, క్లియరెన్స్ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతంగా పెంచాల్సిన అవసరం ఉందని, పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలపట్ల చురుగ్గా వ్యవహరించడంతో పాటు, వాటికి త్వరగా అనుమతులు మంజూరు చేసే ప్రక్రియ వేగాన్ని ఇంకా పెంచాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జీఐఎస్ ఒప్పందాల అమలును వేగవంతం చేయండి.. ఇక విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున మేలు చేకూర్చామని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల రంగానికి పునరుజ్జీవం కల్పించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇస్తూ వారికి చేదోడుగా నిలవడం ద్వారా ఎంఎస్ఎంఈల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలతతో ముందుకు సాగుతోందన్నారు. ఈ రంగంపై ఎక్కువమంది ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి.. వీటిని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతన్నారు. ఈ సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. పురపాలక, పట్టణాభివద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్భార్గవ్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె. విజయానంద్, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ (చేనేత, జౌళి) ముఖ్యకార్యదర్శి కె. సునీత, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్ఐపీబీ ఆమోదం పొందిన కంపెనీల వివరాలు.. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయనున్న పెప్పర్ మోషన్ కంపెనీ. రూ.4,640 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 8080 మందికి ఉద్యోగాలు రానున్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం. దీనిద్వారా రూ.531 కోట్ల పెట్టుబడి, 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు లభిస్తాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.1,750 కోట్ల పెట్టుబడితో శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు. ఇందులో 2,000 మందికి ప్రత్యక్షంగానూ, మరో 500 మందికి పరోక్షంగా ఉద్యోగాలు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో స్మైల్ (సబ్స్ట్రేట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్) కంపెనీ ఆధ్వర్యంలో రూ.166 కోట్ల పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్ ఏర్పాటు. దీనిద్వారా దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలు. నెల్లూరు జిల్లా కష్ణపట్నం వద్ద కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ (రిలయెన్స్ పవర్) తన పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు ఎస్ఐపీబీ ఆమోదం. థర్మల్ పవర్ స్థానంలో రూ.6,174 కోట్ల పెట్టుబడితో కొత్త తరహా, సాంప్రదాయేతర పర్యావరణహిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటుకు ఆమోదం. దీనిద్వారా 600 మందికి ప్రత్యక్షంగానూ, 2,000 మందికి పరోక్షంగానూ ఉద్యోగావకాశాలు. తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద ఆంధ్ర పేపర్ లిమిటెడ్ రూ.4వేల కోట్ల పెట్టుబడితో సంస్థను విస్తరించనుంది. తద్వారా 3వేల మందికి ఉద్యోగాలు. విశాఖ జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ లిమిటెడ్ కూడా రూ.679 కోట్ల పెట్టుబడితో విస్తరణ. తద్వారా 300 మందికి ఉద్యోగాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ సైతం రూ.933 కోట్ల పెట్టుబడి సంస్థను విస్తరించనుంది. 2,100 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద రూ.114 కోట్ల పెట్టుబడి పెట్టనున్న శ్రీ వెంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్కు ఎస్ఐపీబీ ఆమోదం. దీనిద్వారా 310 మందికి ఉద్యోగాలు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఓరిల్ ఫుడ్స్ లిమిటెడ్. దాదాపుగా 550 మందికి ఉద్యోగాలు వస్తాయి. -
గ్రీన్కార్డు దరఖాస్తుదారులకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డు
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్కార్డు పొందాలంటే దరఖాస్తుదారులు చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇలాంటి వారికి ఊరట కలి్పస్తూ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డు(ఈఏడీ) అందజేయాలని వైట్హౌస్ కమిషనర్ గురువారం ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్సు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆమోద ముద్ర వేస్తే ఈఏడీ మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనివల్ల లక్షలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుంది. -
ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డులు
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తీపి కబురు అందించింది. గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారితోపాటు కొన్ని నాన్–ఇమిగ్రేషన్ కేటగిరీల్లో ఉన్నవారికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డులు(ఈఏడీ) అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ కార్డులు ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతాయని వెల్లడించింది. ఈఏడీలతో అమెరికాలో వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కార్డులతో వారికి అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి సులభంగా అనుమతి లభిస్తుందని పేర్కొంటున్నారు. అమెరికాలో 10.5 లక్షల మందికిపైగా భారతీయులు ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. నిబంధనల ప్రకారం వీరందరికీ గ్రీన్కార్డులు రావాలంటే 50 ఏళ్లు పడుతుందని సమాచారం. -
వాస్తవాలపై ‘ఉక్కుపాదం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధి కార్యాలయాల ద్వారా నిరుద్యోగులకు నిరంతరం సేవలు అందిస్తున్నట్లు ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ కెరీర్ సర్వీసు(ఎన్సీఎస్) ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో 29 మోడల్ కెరీర్ సెంటర్ల(ఎంసీసీ) అభివృద్ధి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, ప్రణాళికాబద్ధంగా నిధులు విడుదల చేస్తోందని పేర్కొన్నారు. కానీ, ఈనాడు పత్రిక వాస్తవాలను వక్రీకరిస్తూ ‘ఉపాధిపై ఉక్కుపాదం’ పేరుతో అసత్య కథనాన్ని వండివార్చిందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4.99 కోట్ల ఎన్సీఎస్ నిధులతో 12 ఉపాధి కార్యాలయాలకు మరమ్మతులు చేసి కంప్యూటర్ పరికరాలను సమకూర్చడంతోపాటు పూర్తిస్థాయిలో ఎంసీసీ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఉపాది కార్యాలయాలు/ఎంసీసీ కేంద్రాల్లో అభ్యర్థుల వ్యక్తిగత హాజరు మేరకే రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ ప్రక్రియ జరుగుతుందన్న విషయాన్ని ఈనాడు పత్రిక గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. నిరుద్యోగులు తమ ధ్రువీకరణపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయాల్లో అధికారులను సంప్రదిస్తే ఉచిత రిజిస్ట్రేషన్, కెరీర్ కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2,07,971 మంది అభ్యర్థులు ఎన్సీఎస్ పోర్టల్లో నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ డేటా ఆధారంగా ప్రణాళిక ప్రకారం ప్రతి నెలా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంసీసీ, ఏపీఎస్ఎస్డీసీ, సీడాప్ సమన్వయంతో 516 జాబ్ మేళాలు నిర్వహించి 28,362 మందికి ఉపాధి కల్పించినట్టు వివరించారు. ఇప్పటికే కొత్త జిల్లాల్లోనూ ఎంసీసీల నిర్వహణ కోసం కార్యాలయాల ఎంపిక చేసి అధికారులను నియమించామని నవ్య స్పష్టంచేశారు. -
రూ.2,851 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ఆహార శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,851 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయి. వీటి ద్వారా 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా ఆహార శుద్ధి యూనిట్ల ద్వారా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా వీటికి భూమి పూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల పనులకు శ్రీకారం పరిశ్రమల రంగంలో రూ.2,294 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్ వర్చువల్గా భూమి పూజ నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అనంతపురం జిల్లా డి.హీరేహళ్లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్ ఇండియా, తిరుపతి నాయుడుపేటలో రూ.800 కోట్లతో గ్రీన్లామ్ సౌత్, బాపట్ల జిల్లా కొరిసిపాడు వద్ద శ్రావణి బయో ఫ్యూయల్ రూ.225 కోట్లు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్, తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రూ.150 కోట్లతో రవళి స్పిన్నర్స్, శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి వద్ద రూ.125 కోట్లతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. పులివెందులలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.557 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీఎం చేతుల మీదుగా భూమి పూజ, ఉత్పత్తి ప్రారంభం, ఒప్పందాలు జరగనున్నాయి. వీటి ద్వారా 2,405 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ.65 కోట్లతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా కంచరపాలెం వద్ద రూ.168 కోట్లతో ఏటా 40,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన డీపీ చాక్లెట్స్ యూనిట్ను సీఎం ప్రారంభిస్తారు. విశాఖపట్నం జిల్లా మద్ది వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఓరిల్ ఫుడ్స్ నిర్మాణ పనులకు, అనకాపల్లి జిల్లా కొడవాటిపూడి వద్ద రూ.20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నేటివ్ అరకు కాఫీ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా అయ్యవర్తం వద్ద రూ.350 కోట్లతో 3 ఎఫ్ ఆయిల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. కడప జిల్లా పులివెందులలో రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన అరటి ప్రాసెసింగ్ యూనిట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. -
‘దేవుడే’ దిక్కు..!
నా తల్లిదండ్రులు నన్ను జోగినిగా చేసి వదిలేశారు. ఉపాధి లేక దొరికిన రోజు కూలి పనులకు వెళ్తున్నా. వచ్చే కూలి పైసలతో కుటుంబ పోషణ భార మైంది. ప్రభు త్వం మాకు దళిత బంధు ఇస్తే ఉపాధి కల్పించినోళ్లయితరు. – గుర్రం బాలమ్మ నన్ను తెలియని వయసు లో జోగినిగా మార్చారు. నాకు ఇద్దరు పిల్లలు. మట్టి పని చేస్తూ సాకుతున్నా. పింఛన్ కోసం నాలుగేళ్లుగా ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికీ పెన్షన్ రాలేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. – చెక్క తిరుమలమ్మ నన్ను జోగినిగా మార్చి 25 ఏళ్లు. ఈమె నా బిడ్డ భారతి. తండ్రి పేరు లేనిదే స్కూల్లో చేర్పించుకోమని చెప్పడంతో చదువు చెప్పించలేదు. మాకు ఈ పెంకుటిల్లు తప్ప వేరేది లేదు. వర్షం వస్తే ఇల్లంతా నీళ్లే. కూతురి కూలిపైనే కడుపు నింపుకొంటున్నాం. మాకు గృహ లక్ష్మితో పాటు స్వయం ఉపాధి కల్పించాలి. – దొర్లపల్లి ఎల్లమ్మ మాది పులిమామిడి గ్రామం. నాకు 38 ఏళ్లు.. ముగ్గురు పిల్లలు. నన్ను 20 ఏళ్ల క్రితమే జోగినిని చేశారు. ఒంటరి మహిళ కింద ఆసరా పింఛన్ కోసం మూడు సార్లు ఊట్కూరు మండల కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నా. మా తరఫున మాట్లాడేవారు లేకపోవడంతో అధికారులు అప్పుడు, ఇప్పుడు అంటూ దాటవేస్తున్నారు. – శిపురం గజలమ్మ ..ఈ నలుగురే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సమాజంలో దేవుడి భార్యలుగా చెలామణి అవుతున్న వారి దీన గాథ ఇది. కూడు, గూడు, ఉపాధి లేక నానాపాట్లు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒంటరి పింఛన్ మినహా.. వారి స్థితిగతులను మార్చేలా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు పడకపోవడంపై వారిలో ఆవేదనతో కూడిన అసంతృప్తి పెల్లుబికుతోంది. ఆధునిక కాలంలోనూ ఆదరణకు నోచుకోకపోవడం.. విద్య, ఆర్థిక తదితర రంగాల్లో వెనుకబాటుతనం వెరసి దుర్భర జీవితాలు అనుభవిస్తున్న జోగినులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. ఏడేళ్ల క్రితం వరకు యథేచ్ఛగా.. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా సాధారణంగా ఒకే కుటుంబానికి చెందిన అట్టడుగు వర్గాల స్త్రీలను జోగినులుగా మార్చి దేవతలకు అర్పించడం.. ఊరికి ఉపకారం పేరిట ఉంపుడుగత్తెలను చేయడం ప్రాచీన కాలం నుంచి ఆచారంగా వచ్చింది. ఈ దురాచారాన్ని 1988లో రద్దు చేశారు. అయితే ఏడెనిమిదేళ్ల క్రితం వరకు యథేచ్ఛగా సాగిన ఈ జోగినీ వ్యవస్థ ఇప్పటికీ పలు చోట్ల గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ కాలంలో ఈ దురాచారం మళ్లీ పురుడుపోసుకున్నట్లు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. దేవరకద్ర, ఊట్కూరు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో రెండేళ్లుగా సుమారు 18 మందిని జోగినులుగా మార్చినట్లు సమాచారం. గత ఏడాది ఫిబ్రవరిలో దేవరకద్ర పరిధిలో ఓ విద్యావంతుల కుటుంబానికి చెందిన అమ్మాయిని జోగినిగా మార్చేందుకు ప్రయత్నించగా.. ఓ ఎన్జీఓ సంస్థ అడ్డుకోవడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇక జోగినుల జీవన భృతికి సంబంధించి ఒంటరి పింఛన్కు అర్బన్ ప్రాంతాల్లో 30 ఏళ్లు, గ్రామాల్లో 35 ఏళ్ల వయసు ఉన్న వారిని అర్హులుగా గుర్తించారు. కానీ పలు చోట్ల 20, 25 ఏళ్లు ఉన్న జోగిని మహిళలు ఒంటరి పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని బట్టి ఈ వ్యవస్థ ఇంకా కొనసాగుతోందని ఎన్జీఓలు చెబుతున్నారు. అప్పట్లో నిజామాబాద్లో.. ఇప్పుడు పాలమూరులో ఎక్కువగా 1987–88లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 24,273 మంది జోగినులు ఉన్నట్లు ఆనాటి ప్రభుత్వం గుర్తించింది. ఇందులో తెలంగాణలోనే 14,863 మంది జోగినులు ఉండగా.. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 5,666 మంది ఉన్నట్లు తేలింది. ఇక 2013లో ఏక సభ్య కమిషన్ నివేదిక ప్రకారం తెలంగాణలో 12 వేల మంది జోగినులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల పరిధిలోని దేవరకద్ర, మహబూబ్నగర్, గద్వాల, గట్టు, ధరూర్, నారాయణపేట , ఊట్కూర్, మక్తల్, మాగనూర్, ధన్వాడ, నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో సుమారు ఐదు వేల మందికి పైగా ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. ఇక ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎనిమిది వేలకు పైగా జోగినులు ఉన్నట్లు ఎన్జీఓ సంస్థలు చెబుతున్నాయి. విద్యకు దూరం.. జోగినులుగా మారినమహిళలకు వివాహం ఉండదు.. కుటుంబం కుదరదు.. సొంత జీవితమంటూ ఉండదు.. ఎవరి ఆదరణకు నోచుకోకపోవడంతో వ్యభిచారంతో ఆరోగ్యం దెబ్బతిని ఇప్పటికే వందల సంఖ్యలో అకారణంగా మృత్యువాతపడ్డారు. 75 శాతం మేర జోగినుల వయసు పైబడడం, తండ్రి పేరు లేకపోవడంతో వారి పిల్లలను పాఠశాలల్లో చేర్చుకోకపోవడంతో ఉన్న వారు సైతం నిరక్షరాస్యులుగానే మిగిలారు. 2009లో తల్లిపేరుతో అవకాశం కల్పించినప్పటికీ.. పదో తరగతికి మించి ఒకట్రెండు కుటుంబాలు మినహా ఉన్నత విద్యను అభ్యసించలేకపోయాయి. దీనికి తోడు అమ్మాయిల సంతానం ఎక్కువగా ఉన్న కుటుంబాలు ఆడపిల్లలను వదిలించుకుందామనే ఉద్దేశంతో మొక్కు పేరిట జోగినిగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా కుటుంబాలను చైతన్యం చేయడంతో పాటు స్వయం ఉపాధి కల్పించేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటేనే ఈ దురాచారాన్ని నిర్మూలించే అవకాశం ఉంది. జోగినులకు ప్రత్యేక చట్టం చేయాలి.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది జోగినులు ఉన్నారనే దానిపై సర్వే చేపట్టాలి. ఆ తర్వాత ఏపీలో చేసిన తరహాలో ప్రత్యేక చట్టం చేయాలి. గతంలో ఏకసభ్య కమిషన్కు సమర్పించిన డిమాండ్లను నెరవేర్చాలి. – హాజమ్మ, జోగిని నిర్మూలన హక్కుల పోరాట సమితి జిల్లా కన్వినర్ ప్రత్యేక బడ్జెట్.. జోగిని బంధు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏటా బడ్జెట్లో జోగిని సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3 కోట్ల బడ్జెట్ కేటాయించేవారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ సంప్రదాయం అటకెక్కింది. దీన్ని కొనసాగించడంతోపాటు రాష్ట్రంలోని వివిధ కులాలకు ఉన్నట్లుగానే జోగినుల సంక్షేమం, అభివృద్ధిలో భాగంగా తమకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని జోగినులు డిమాండ్ చేస్తున్నారు. దీని ద్వారా ఒక్కో జోగిని కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలని.. నివాసం కోసం ఉచితంగా స్థలంతో పాటు ఇల్లు కట్టించాలని కోరుతున్నారు. అదేవిధంగా దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు వలే జోగిని బంధు తీసుకొచ్చి.. ప్రతి ఒక్క జోగినికి స్వయం ఉపాధి నిమి త్తం రూ.10 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. జోగినుల ఇతర డిమాండ్లు.. ♦ ప్రతి జోగినికి రూ.3 వేల భృతి ఇవ్వాలి. ♦ పదో తరగతి పాసైన జోగినిల పిల్లలకు అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. ♦ స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బ్యాంకులతో సంబంధం లేకుండా ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వాలి. ♦చదువుకునే జోగిని పిల్లలందరికీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రై వేట్ విద్యాలయాల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను బోధించాలి. డిగ్రీ ఆపై విద్యార్హత ఉన్న వారికి ఉన్నత ఉద్యోగావకాశాలు కల్పించాలి. ♦ 1988 జోగిని నిర్మూలన చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలి. ♦ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కమిటీలో జోగినులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. గ్రామాల్లో ఉన్న ప్రతి జోగిని కుటుంబానికి ఆహారభద్రత కార్డు ఇవ్వాలి. -
డిగ్రీ చదివినా తక్షణ ఉపాధి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో మార్పులొస్తున్నాయి. విదేశీ అధ్యయనాల మేరకు బోధన ప్రణాళికలు రూపొందుతున్నాయి. పారిశ్రామిక అవసరాలే గీటురాయిగా డిగ్రీలో నైపుణ్యాన్ని మేళవిస్తున్నారు. మూడేళ్ళ స్థానంలో నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులు వస్తున్నాయి. డిగ్రీ చేసినా ఉపాధి ఖాయమనే భరోసా కల్పిస్తున్నాయి. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆనర్స్ డిగ్రీ కోర్సులను నాలుగేళ్ళతో పరిమితంగా ప్రవేశపెట్టారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ విధంగా ప్రవేశపెడుతున్న అనేక మార్పుల పురోగతిని కేంద్ర విద్యాశాఖ ఇటీవల సమీక్షించింది. మరోవైపు కాంబినేషన్ కోర్సులు, తక్షణ ఉపాధి అవకాశాలున్న స్కిల్ అనుసంధాన కోర్సులకు డిమాండ్ పెరుగుతోందని యూజీసీ తన నివేదికలో పేర్కొంది. ఇక మీదట సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో సాంకేతికత తోడైన డిగ్రీ కోర్సులు ప్రాచుర్యం పొందుతాయని తెలిపింది. కంప్యూటర్స్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర కోర్సుల మేళవింపుతో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆర్ట్స్తో కంప్యూటర్ పరిజ్ఞానం, సైన్స్తో సామాజిక అవగాహన కోర్సులు కలగలిపి రాబోతున్నాయి. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఈ తరహా బోధన ప్రణాళికను యూజీసీ ఇప్పటికే సిద్ధం చేసింది. దీనికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో క్రెడిట్స్ విధానం అమలులోకి రాబోతోంది. యూజీసీ కొత్త ప్రణాళికలను అన్ని రాష్ట్రాలూ ఆమోదించాయి. క్రెడిట్ విధానం బెస్ట్ డిగ్రీ పట్టాలు ఇక క్రెడిట్స్ ఆధారంగా ఉండనున్నాయి. ఒక్కో స్థాయికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్ల ను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలా గే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చే స్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అవకా శం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసు కు న్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నా లుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. ఆనర్స్ వైపు ఆకర్షణ తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలూ మూడేళ్ళ డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను యూజీసీ రూపొందించింది. తెలంగాణలో నాలుగేళ్ళ బీఎస్సీ (ఆనర్స్) కంప్యూటర్స్ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చారు. ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అతి ముఖ్యమైన అంశాలు ఆనర్స్లో చోటు చేసుకోబోతున్నాయి. దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ రాజ్యమేలుతోంది. దీంతో కామర్స్ డిగ్రీ నేపథ్యం ఉన్న వారికి మంచి డిమాండ్ వచ్చింది. కంప్యూటర్స్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అక్కౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్తో పాటు, కంప్యూటర్స్, టాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్ను తీసుకొచ్చారు. ఇక బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)లో చేరికలు కూడా ఆరేళ్లల్లోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. నైపుణ్యం వెలికితీసేలా మూల్యాంకనం విద్యార్థిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే మూల్యాంకన విధానం అందుబాటులోకి రాబోతోంది. దీనిపై ఇప్పటికే అధ్యయనం పూర్తయింది. డిగ్రీ కోర్సులు ఇక మీదట పూర్తి నైపుణ్యంతో అందించాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్ళాలని భావిస్తున్నాం. ఇప్పటికే ఈ ప్రయోగం మొదలైంది. భవిష్యత్లో దీని వేగం పెరుగుతుంది. ఇక మీదట డిగ్రీ కోర్సు చేసినా మంచి ఉపాధి పొందుతారనే విశ్వాసం విద్యార్థుల్లో వస్తుంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
గ్రామీణ పేదలకు ‘ఉన్నతి’
సాక్షి, అమరావతి:గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనులపై ఎక్కువగా ఆధారపడే పేద కుటుంబాల్లో యువతకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘ఉన్నతి’ పేరుతో వివిధ రకాల ఉపాధి, వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ద్విచక్ర వాహనాలు, ఏసీ మెషిన్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపేర్ అండ్ సర్వీసింగ్, ఇంటర్నెట్ సేవలకు సంబంధించి టెక్నికల్ సర్వీస్ తదితర 192 రకాల ఉపాధి, వృత్తి విద్య కోర్సుల్లో పేద కుటుంబాల్లోని దాదాపు 25 వేల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. నిబంధనల ప్రకారం.. ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా వంద రోజులపాటు పనులు కల్పిస్తున్నారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో ముగ్గురు పనిచేసే వ్యక్తులు ఉండి.. ఆ ముగ్గురు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకోవాలనుకుంటే.. ఒక్కొక్కరికి గరిష్టంగా 33 పని దినాల చొప్పున కేటాయిస్తున్నారు. ఉపాధి కూలీల కుటుంబాలు గరిష్ట వంద రోజుల పరిమితి వినియోగించుకున్న అనంతరం కూడా ఆ కుటుంబం ఏ పనిలేక ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా.. ఉన్నతి పథకం కింద శిక్షణ ఇస్తారు. ఏడాదిలో వంద రోజుల పనులు పూర్తి చేసుకున్న కుటుంబాలను గుర్తించి ఆయా కుటుంబాల్లో యువతకు శిక్షణ కార్యక్రమాలు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో గరిష్టంగా 18–45 ఏళ్ల మధ్య, ఇతర సామాజిక వర్గాల్లో 18–35 ఏళ్ల మధ్య వయసు గలవారు ఈ శిక్షణ కార్యక్రమాలకు అర్హులుగా నిర్థారించారు. ఉచిత శిక్షణతోపాటు రోజూ కూలి జమ శిక్షణ కార్యక్రమాలను పూర్తి ఉచితంగా అందజేయడంతో పాటు శిక్షణకు హాజరయ్యే యువతకు రోజు వారీ కూలి డబ్బులను స్టైఫండ్ రూపంలో ప్రభుత్వం అందజేస్తుంది. గరిష్టంగా వంద రోజులు పాటు స్టైఫండ్ అందజేస్తారు. సంబంధిత యువత శిక్షణ కాలంలో కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. గరిష్టంగా వంద రోజుల పాటు ఉపాధి హామీ పనులకు వెళ్లిన కుటుంబాల్లో యువత ఉన్న కుటుంబాలు 4,75,327 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఎస్ఈఈడీఏపీ (సీడాప్), ఆర్ఎస్ఈటీఐ, కేవీకే సంస్థల ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించారు. ఆయా సంస్థలు క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధి హామీ పథకం సిబ్బంది సాయంతో సంబంధిత కుటుంబాలను ప్రత్యక్షంగా సందర్శించి శిక్షణ పొందేందుకు ఆసక్తి గల యువత పేర్లను నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత అర్హులైన వారికి శిక్షణ అందజేస్తారు. -
స్కిల్ యూనివర్స్ పేరుతో డాష్ బోర్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహించే నైపుణ్య శిక్షణ కోర్సులు, ఉపాధి కల్పన వంటి వివరాలు 24గంటలు అందుబాటులో ఉండేవిధంగా ‘స్కిల్ యూనివర్స్’ పేరుతో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోర్టల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) త్వరలో అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. విజయవాడ ఆటోనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన శుక్రవారం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.ట్రైనింగ్, ప్లేస్మెంట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం యువతకు ఎప్పటికప్పుడు తెలిసేలా డాష్ బోర్డును తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ, సీడ్యాప్, న్యాక్, పీఏడీఏ వంటి వివిధ సంస్థలకు చెందిన శిక్షణ వివరాలు పోర్టల్లో నమోదు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర యువతి, యువకులు నైపుణ్య శిక్షణ కోసం నమోదు చేసుకునేవారు, శిక్షణ దశలో ఉన్నవారు, శిక్షణ పూర్తి చేసుకున్నవారు, ఉద్యోగాల్లో చేరినవారు... ఇలా సమగ్ర సమాచారం ఆన్లైన్ పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే విధంగా డ్యాష్బోర్డును అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.కేతిక, నైపుణ్య విద్యను అభ్యసించే యువతి, యువకులకు అధ్యాపకుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన పోర్టల్లో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో కరిక్యులమ్(రెజ్యూమ్) తయారు చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ తెలిపారు. వాటర్ మేనేజ్మెంట్, ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్లో ఏపీఎస్ఎస్డీసీ సాధించిన అవార్డును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ కార్యదర్శులు, ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ నాగరాణి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ డాక్టర్ వినోద్కుమార్, ఈడీ దినేష్కుమార్, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య, సీడ్యాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిలో ‘ఎంఎస్ఎంఈ’ల రికార్డు
సాక్షి, అమరావతి: ఉపాధి కల్పనలో రాష్ట్రంలోని సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) రికార్డు సృష్టిస్తున్నాయి. 2023–24లో ఎంఎస్ఎంఈల ద్వారా కనీసం 7.50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకోగా కేవలం ఐదు నెలల్లోనే లక్ష్యానికి చేరువ కావడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఎంఎస్ఎంఈల ద్వారా 7,01,975 మంది స్థానికులు కొత్తగా ఉపాధి పొందినట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ పోర్టల్ ‘ఉద్యం’ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆగస్టు నాటికే 93 శాతం లక్ష్యాన్ని సాధించడంతో గతేడాది తరహాలోనే రెండు రెట్లు అధికంగా ఉపాధి కల్పించే అవకాశాలున్నట్లు ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. 2022–23లో ఎంఎస్ఎంఈల ద్వారా 1,56,252 మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకోగా ఏకంగా 231 శాతం అదనంగా 3,61,172 మందికి ఉపాధి కల్పించిన సంగతి తెలిసిందే. లక్ష్యాన్ని దాటేసిన తొమ్మిది జిల్లాలు ఎంఎస్ఎంఈ రంగంలో ఉపాధి కల్పనకు పరిశ్రమల శాఖ జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించగా తొమ్మిది జిల్లాలు ఇప్పటికే లక్ష్యాన్ని దాటేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిత్తూరు, ఏలూరు, శ్రీసత్యసాయి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలు ఐదు నెలల్లోనే 100 శాతం లక్ష్యాన్ని అధిగమించాయి. చిత్తూరు జిల్లా లక్ష్యం కంటే ఇప్పటికే 317 శాతం, ఏలూరు 187 శాతం, శ్రీసత్యసాయి 151 శాతం సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది ‘ఉద్యం’ పోర్టల్లో కనీసం 1.50 లక్షల ఎంఎస్ఎంఈలను నమోదు చేయాలని నిర్దేశించుకోగా ఐదు నెలల్లోనే 97,378 యూనిట్లు కొత్తగా ఏర్పాటైనట్లు అధికారులు వెల్లడించారు. ఐదు జిల్లాలు 80 శాతానికిపైగా లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్నాయి. కొత్త యూనిట్ల ఏర్పాటు లక్ష్యంలో ఏలూరు 91 శాతం, పశి్చమ గోదావరి 84 శాతం, ప్రకాశం 81 శాతం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 80 శాతం, కర్నూలు 80 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి. -
ప్రకృతి ప్రేమకు నిదర్శనం
నగర జీవనంలో ప్రతిదీ యూజ్ అండ్ త్రోగా మారుతోంది.‘ఈ కాంక్రీట్ వనంలో ప్రకృతి గురించి అర్థం చేసుకుంటున్నదెవరు’.అని ప్రశ్నిస్తారు. హైదరాబాద్ నల్లగండ్లలో ఉంటున్న నిదర్శన.అపార్ట్మెంట్ సంస్కృతిలో వ్యర్థాలను ఎలా వేరు చేయాలి,ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలనే విషయాల మీద నెలకు ఒకసారి నాలుగేళ్లుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తోంది. కార్పోరేట్ కంపెనీలో మార్కెటింగ్ కమ్యూనికేషన్స్లో మేనేజర్గా వర్క్ చేసిన నిదర్శన సస్టెయినబుల్ లివింగ్ పట్ల ఆసక్తి పెరిగి, పర్యావరణ హిత వస్తువుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ,హస్తకళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే పని ఏ కొంచెమైనా ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతోంది. ‘‘ఈ రోజుల్లో మనం ఏ పని చేసినా అది ప్రకృతికి మేలు చేసేదై ఉండాలి. ఈ ఆలోచన నాకు నాలుగేళ్ల క్రితం కలిగింది. దీనికి కారణం మన దగ్గర చేస్తున్న పెళ్లిళ్లు, పార్టీలు. ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అక్కడ యూజ్ అండ్ త్రో ఏరియా చూస్తే మనసు వికలమయ్యేది. దీంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, సస్టైనబుల్ లివింగ్ మార్గం పట్టాను. ఈవెంట్స్కి స్టీల్ గిన్నెల రెంట్ మాటీ పేరతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. నాలాగే ఆలోచించే మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఫంక్షన్లకు స్టీల్ పాత్రలు నామమాత్రపు రెంట్తో ఇచ్చే బ్యాంక్ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత ఇదే థీమ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశాను. ఎవరింట్లో పెళ్లి, పండగ, పుట్టిన రోజులు జరిగినా మా దగ్గర నుంచి స్టీల్ పాత్రలు రెంట్కు తీసుకోవచ్చు. అలాగే, అపార్ట్మెంట్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. ఈ వర్క్షాప్స్లో కిచెన్ గార్డెనింగ్, కంప్రోస్ట్, ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్ థీమ్స్.. వంటివన్నీ అందుబాటులో ఉంటాయి. హస్తకళాకారుల నుంచి.. నెలకు ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలను చూసుకొని పర్యావరణ స్పృహ కలిగించడానికి ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టాను. ఇందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు, ఐటీ ఉద్యోగులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. నా టీమ్లో స్వచ్ఛందంగా పనిచేసే పది మంది బృందంగా ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలోని నగరాలలోనూ ఈ ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేస్తాను. ఇందులో హస్తకళాకారులు తయారుచేసిన రకరకాల కళాకృతులు, జ్యువెలరీ బాక్సులు, ఇత్తిడి, రాగి వస్తువులు, జ్యూట్ కాటన్ పర్సులు, ఇంటీరియర్ వస్తువులు .. వంటివన్నీ ఉంటాయి. హస్తకళాకారులే నేరుగా వచ్చి తమ వస్తువులు అమ్ముకోవచ్చు. ఒక్కొక్క కళాకారుడి నుంచి సేకరించిన వస్తువులను కూడా ప్రదర్శనలో ఉంచుతాను. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ కళాకారులకు అందజేస్తుంటాను. గ్రామీణ కళాకారులకు తమ హస్తకళలను ఎక్కడ అమ్మితే తగినంత ఆదాయం వస్తుందనే విషయంలో అంతగా అవగాహన ఉండదు. అందుకే, ఈ ఏర్పాట్లు చేస్తుంటాను. దీని ద్వారా కళకు, కొనుగోలుదారుకు ఇద్దరికీ తగిన న్యాయం చేయగలుగుతున్నాను అనే సంతృప్తి లభిస్తుంది. ‘ది బాంటిక్ కంపెనీ( పేరుతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా హస్తకళాకృతులను అందుబాటులో ఉంచుతున్నాను. ఎకో ఫ్రెండ్లీ గిఫ్టింగ్ కార్పోరేట్ కంపెనీలలో పండగల సందర్భాలలో ఇచ్చే కానుకలకు కన్స్టలెన్సీ వర్క్ కూడా చేస్తాను. ఇక్కడ కూడా ఎకో థీమ్తో కస్టమైజ్డ్ గిఫ్ట్ బాక్స్లు తయారుచేసి అందిస్తుంటాను. ఇక ఇళ్లలో జిరగే చిన్న చిన్న వేడుకలకూ ఎలాంటి కానుకలు కావాలో తెలుసుకొని, వాటిని తయారుచేయించి సప్లయ్ చేయిస్తుంటాను. కార్పోరేట్ కంపెనీలలో వర్క్షాప్స్ కార్పోరేట్ కంపెనీలలో సస్టెయినబులిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్లు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఉద్యోగులు పర్యావరణ హిత వస్తువులతో తమ జీవన విధానాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో, ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చో కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంటాను. అంతేకాదు, కిచెన్ వ్యర్థాలను ఎలా వేరు చేయాలి, కిచెన్ గార్డెన్ను తమకు తాముగా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే విషయాల మీద వర్క్షాప్స్ ఉంటాయి. అంతేకాదు, రోజువారీ జీవన విధానంలో ప్రతీది పర్యావరణ హితంగా మార్చుకుంటే కలిగే లాభాలనే వివరిస్తుంటాను. ఇదేమంత కష్టమైన పని కాదని వారే స్వయంగా తెలుసుకోవడం, తాము ఆచరిస్తున్న పనులు గురించి ఆనందంగా తెలియజేస్తుంటారు. మంచి జీవనశైలిని నలుగురికి పంచడంలోనే కాదు ప్రకృతికి మేలు చేస్తున్నాన్న సంతృప్తి కలుగుతుంది. అదే విధంగా గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానన్న ఆనందమూ కలుగుతుంది’ అని తెలియజేస్తారు నిదర్శన. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
గుడ్ న్యూస్ చెప్పిన ఫ్లిప్కార్ట్: ఏకంగా లక్ష ఉద్యోగాలు
వాల్మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ మేజర్ ఫ్లిప్కార్ట్ రాబోయే పండుగ సీజన్లో నిరుద్యోగులకు భారీ ఉపశమనం కలిగించనుంది. రానున్న ఫెస్టివ్ సీజన్లో కస్టమర్ డిమాండ్ను తీర్చే లక్ష్యంతో తన సప్లయ్ చెయిన్లో లక్షకు పైగా సీజనల్ ఉద్యోగాలను సృష్టించనుంది. ఈ మేరకు కంపెనీ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. కిరాణా డెలివరీ ప్రోగ్రామ్ ద్వారా పండుగ ఈవెంట్లో 40శాతం కంటే ఎక్కువ షిప్మెంట్లను డెలివరీ చేయడానికి ప్లాన్ చేస్తోందని ఫ్లిప్కార్ట్ తెలిపింది. అలాగే పండుగల సీజన్లో వేలాది మందికి నైపుణ్యం , శిక్షణ అవకాశాలు కల్పించినట్టు చెప్పింది. ప్రధానంగా ఈ ఉద్యోగాలు తమ సప్లై చెయిన్లో ఉంటాయని కంపెనీ పేర్కొంది, ఇందులో ఫుల్ఫెల్మెంట్ సెంటర్లు, సార్టేషన్ సెంటర్లు, డెలివరీ హబ్లు ఉన్నాయి. అంతేకాకుండా, లాజిస్టిక్స్కు సహాయం చేయడానికి డెలివరీ భాగస్వాముల జాబ్స్ కూడా ఉంటాయి. సరఫరా గొలుసులో లక్షకు పైగా కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తున్నమని ఫ్లిప్కార్ట్ గ్రూప్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ రీకామర్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , సప్లై చెయిన్ హెడ్ హేమంత్ బద్రీ తెలిపారు. ఇందులో భాగంగా హ్యాండ్హెల్డ్ పరికరాలు, PoS మెషీన్లు, స్కానర్లు, వివిధ మొబైల్ యాప్స్ నిర్వహరణలో తమ సిబ్బంది శిక్షణ పొందారని కంపెనీ పేర్కొంది. (కొంపముంచుతున్న క్రెడిట్ కార్డు బకాయిలు: డిఫాల్ట్ అయితే ఏం చేయాలో తెలుసా?) ఉద్యోగాల కల్పనతో పాటు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అంతటా 19 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలాన్ని జోడించాలని యోచిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా తమ గుర్తింపును మరింత బలోపేతం చేయడం ద్వారా ఉన్నతమైన కస్టమర్ అనుభవాన్ని అందించడానికి నైపుణ్యం కలిగిన కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టామని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ హబ్లు, పెద్ద-స్థాయి నెరవేర్పు కేంద్రాలు, టైర్-III నగరాలు, బయట కూడా మరింత బలపడనున్నామనే సంకేతాలందించారు. (జీతాల పెంపు: దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులకు షాక్!) -
1 నుంచి ‘ఉపాధి’కి ఆధార్ చెల్లింపులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు సెప్టెంబరు 1వతేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆధార్తో అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్లకు మాత్రమే వేతనాలు చెల్లింపులు చేస్తారు. ఉపాధి హామీ జాబ్ కార్డు నెంబరుతో పాటు ఆధార్, బ్యాంకు ఖాతాలను ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటేనే ఆయా ఖాతాలకు వేతనాలు జమ అవుతాయి. ఈ మూడింటినీ అనుసంధానం చేసుకోని వారికి సెప్టెంబరు ఒకటో తేదీ తర్వాత ఉపాధి పథకం పనులకు హాజరైనా వేతనాలు జమ చేసే పరిస్థితి ఉండదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు కీలక మార్పులు తెచ్చింది. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నుంచే అమలు చేయాలని తొలుత భావించినా చాలా రాష్ట్రాల్లో (మన రాష్ట్రం కాదు) పెద్ద సంఖ్యలో కూలీల జాబ్కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పలు దఫాలు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సెప్టెంబరు ఒకటి నుంచి ఖచ్చితంగా నూతన విధానంలోనే కూలీలకు వేతనాల చెల్లింపులు ఉంటాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసినట్టు అధికారులు వెల్లడించారు. కేంద్రం ఈ ప్రతిపాదనలను తేకముందు నుంచే మన రాష్ట్రంలో ఉపాధి కూలీలకు పాక్షికంగా ఆధార్ అనుసంధానంతో కూడిన వేతనాల చెల్లింపులు కొనసాగుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పథకం అమలులో పారదర్శకత కోసం వీలైనంత మేర కూలీల జాబ్కార్డులను బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించగా మిగతావారికి కూడా ఇప్పటివరకు వేతనాలను చెల్లిస్తున్నారు. అయితే సెప్టెంబరు ఒకటి నుంచి మాత్రం వందకు వంద శాతం తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం విధానంలో వేతనాల చెల్లింపుల ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 99.53 శాతం అనుసంధానం ఆంధ్రప్రదేశ్లో 69 లక్షల కుటుంబాలకు చెందిన 1.24 కోట్ల మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా గరిష్టంగా 47.74 లక్షల కుటుంబాలకు సంబంధించి దాదాపు 79.81 లక్షల మంది కూలీలు ఉపాధి పనులతో లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కలిపి గత ఐదేళ్లుగా ఏటా రూ.ఐదారు వేల కోట్లకు తక్కువ కాకుండా ప్రయోజనం చేకూరుతోంది. వేతనాల చెల్లింపుల్లో కేంద్రం తెచ్చిన నూతన విధానంతో ఉపాధి హామీ కూలీలెవరూ ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం 1.24 కోట్ల మంది కూలీలలో 99.53 శాతం మంది జాబ్ కార్డులు ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. గత మూడేళ్లలో ఒక్క రోజైనా ఉపాధి పనులకు హాజరైన క్రియాశీలక కూలీలలో 97.2 శాతం మందిని కూడా ఇప్పటికే అనుసంధానించారు. ఉపాధి పథకం కూలీల జాబ్కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. త్రిపుర, కేరళ, లడఖ్, పుదుచ్చేరి, చత్తీస్గఢ్, సిక్కిం, తమిళనాడు తరువాత స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న కూలీలలో ఇంకా కేవలం 60 వేల మందికి సంబంధించి మాత్రమే ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. వారు గతంలో పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ ఉపాధి పనులపై పెద్దగా ఆసక్తి చూపని వారే కావచ్చని పేర్కొంటున్నారు. -
ల్యాబ్ డైమండ్లతో ఉపాధికి ఊతం
జైపూర్: ల్యాబ్లలో తయారు చేసే వజ్రాలు (ఎల్జీడీ) కృత్రిమమైనవి కావని, వాటికి కూడా ప్రస్తు తం సహజ వజ్రాలుగా ఆమోదయోగ్యత పెరుగుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇలాంటి సానుకూల పరిణామాలు పరిశ్రమ వృద్ధికి దోహదపడగలవని, దీనితో ఉపాధి కల్పనకు కూడా ఊతం లభించగలదని ఆయన చెప్పారు. ఎల్జీడీల తయారీలో సౌర, పవన విద్యుత్ వంటి వనరులను వినియోగించడం వల్ల ఇది పర్యావరణానికి కూడా అనుకూలమైనదని మంత్రి తెలిపారు. జూన్ 22న అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 7.5 క్యారట్ల ఎల్జీడీని అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్కు బహూకరించడం ల్యాబ్ డైమండ్లకు పెరుగుతున్న ఆమోదయోగ్యతకు నిదర్శనం. ఎల్జీడీల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎల్జీ డీ సీడ్స్పై 5% కస్టమ్స్ సుంకాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, దేశీ యంగా ఎల్జీడీ యంత్రాలు, సీడ్స్, తయారీ విధానాన్ని రూపొందించడంపై పరిశోధనలు చేసేందుకు ఐఐటీ–మద్రాస్కు రీసెర్చ్ గ్రాంట్ ప్రకటించింది. 2025 నాటికి ఎల్జీడీ ఆభరణాల మార్కెట్ 5 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. 2021 –22లో కట్, పాలిష్డ్ ఎల్జీడీల ఎగుమతులు 1.35 బిలియన్ డాలర్లుగా ఉండగా, గతేడాది ఏప్రిల్–డిసెంబర్ వ్యవధిలో 1.4 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదైంది. -
ఇక ముందూ ఇళ్లకు డిమాండ్.. గృహ నిర్మాణంలో పెద్ద ఎత్తున ఉపాధి
కోల్కతా: ఇళ్ల కోసం డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందని, ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాలను వెలికితీసే శక్తి ఈ రంగానికి ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డైరెక్టర్ కేకీ మిస్త్రీ పేర్కొన్నారు. గృహ నిర్మాణ రంగం పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇతర విభాగాలతో పోలిస్తే గృహ రుణాలు సురక్షితమని, వీటిల్లో రుణ రిస్క్ చాలా తక్కువని చెప్పారు. బంధన్ బ్యాంక్ వ్యవస్థాపక దినం వేడుకల్లో భాగంగా మిస్త్రీ మాట్లాడారు. గృహ రుణాల్లో అగ్రగామి కంపెనీ హెచ్డీఎఫ్సీ ఇటీవలే హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో విలీనం అవ్వడం గమనార్హం. తక్కువ ఎన్పీఏలతో భారత బ్యాంకింగ్ రంగం మరంత బలంగా ఉన్నట్టు చెప్పారు. అమెరికా, చైనాతో పోలిస్తే గృహ రుణాలు మన దేశంలో చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నట్టు మిస్త్రీ తెలిపారు. మన జీడీపీలో మార్ట్గేజ్ నిష్పత్తి చాలా తక్కువ ఉందన్నారు. ఇళ్లకు నిర్మాణాత్మక డిమాండ్ ఎప్పటికీ ఉంటుందన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ (సీజీ)పై స్పందిస్తూ.. స్వతంత్ర డైరెక్టర్ల పాత్రను మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘కంపెనీలు ఎలా పనిచేస్తున్నాయనే దానికి సీజీ ఒక కొలమానం. దీర్ఘకాలం పాటు నిలదొక్కుకోవాలంటే బలమైన కార్పొరేట్ గవర్నెన్స్ సూత్రాలు తప్పనిసరి. మంచి సీజీ అనేది అనుకూలం. ఇది ఉంటే ఇన్వెస్టర్లు అధిక ధర చెల్లించేందుకు ముందుకు వస్తారు’’అని మిస్త్రీ వివరించారు. వాటాదారులు, నిర్వాహకుల మధ్య ఇండిపెండెంట్ డైరెక్టర్లు వాహకం మాదిరిగా పనిచేస్తారని చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్కు తోడు ఈఎస్జీ సైతం వ్యాపారాలకు కీలకమని మారిపోయినట్టు ప్రకటించారు. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో భారత్ వృద్ధి అంచనాలను మించింది. భారత్ వృద్ధి అవకాశాలను విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు గురిస్తున్నారు. యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద వినియోగ మార్కెట్గా భారత్ అవతరిస్తుంది’’అని మిస్త్రీ పేర్కొన్నారు. -
యానాం రీజెన్సీకి పూర్వ వైభవం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమ 11 ఏళ్ల తరువాత పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. 1985లో ఏర్పాటైన యానాం రీజెన్సీ 2012లో వివాదాల నేపథ్యంలో యాజమాన్యం లాక్ అవుట్ ప్రకటించింది. ఈ పరిణామంతో ఫ్యాక్టరీపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అప్పటినుంచి ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 50 వేల జనాభా గల యానాం అభివృద్ధిలో రీజెన్సీ సిరామిక్స్ పాత్ర ఎంతో ఉంది. 1980వ దశకంలో సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో జీఎన్ నాయుడు తదితరులు కలిసి ఈ పరిశ్రమ ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా మంచిపేరు సంపాదించి 1986–87 వరకు సిరామిక్స్ టైల్స్ను విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. అప్పట్లో ఈ ఫ్యాక్టరీలో రోజుకు 26వేల చదరపు అడుగుల మేర టైల్స్ ఉత్పత్తి చేసేవారు. రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమతో యానాం, దాని సరిహద్దున మన రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 6 వేల నుంచి 7 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించింది. పరిశ్రమకు అనుబంధంగా సిరామిక్స్ టైల్స్ తయారీకి ఉపయోగపడే చిన్నతరహా పరిశ్రమలు, అట్టల తయారీ ఫ్యాక్టరీలను స్థాపించడంతో మహిళలకు ఉపాధి లభించింది. విధ్వంసం నేపథ్యంలో మూత వేతనాలు, పీఎఫ్ వంటి విషయాల్లో కార్మీక సంఘాలు, యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో కార్మీకులు ఆందోళనకు దిగారు. కార్మీక సంఘ ప్రతినిధి మచ్చా మురళీమోహన్ యానాం పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.. అనంతరం 2012 జనవరి 27న కొందరు దుండగులు సృష్టించిన విధ్వంసం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది.ఫ్యాక్టరీని తగులబెట్టి ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ కె.చంద్రశేఖర్ను హత్య చేశారు. నాటి విధ్వంసంతో ఫ్యాక్టరీకి రూ.300 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిణామాలతో యాజమాన్యం ఫ్యాక్టరీని లాక్అవుట్ చేసింది. వేలాది మంది కార్మీకులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు. కాగా.. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, రీజెన్సీ సీఎండీ గూడూరు నారయ్య నాయుడు, సీఈఓ, ఈడీ సత్యేంద్రప్రసాద్ తదితరులు మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు ఫలించి ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి యాజమాన్యం ముందుకొచ్చింది. వివాదానికి ముందు కార్మీకులకు చెల్లించాల్సిన సెటిల్మెంట్స్పై ఒక అంగీకారానికి వచ్చారు. ఫ్యాక్టరీకి సంబంధించి దనియాలతిప్పలో ఉన్న భూముల్లో కార్మీకులకు ప్లాట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అక్టోబర్ నెలలో తొలివిడత రూ.70 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని రీజెన్సీ సీఈవో సత్యేంద్రప్రసాద్ ‘సాక్షి’ ప్రతినిధి వద్ద ధ్రువీకరించారు. మలి విడతలో 2025 మార్చి నాటికి మూడింతల రెట్టింపు ఉత్పత్తిని తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. రెండు నెలల్లో పునఃప్రారంభిస్తాం విజయ దశమి సందర్భంగా పరిశ్రమను పునఃప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఉత్పత్తికి అవసరమైన గ్యాస్ కోసం గెయిల్ను అభ్యర్థించాం. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కూడా నివేదించాం. కార్మీకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో పనులు అప్పగించడమే కాకుండా సర్వీస్ కూడా చేస్తున్నాం. – డాక్టర్ గుడారు నారయ్య నాయుడు, సీఎండీ, రీజెన్సీ సిరామిక్స్ 11 ఏళ్ల కల నెరవేరుతోంది యానాంలో పారిశ్రామిక రంగం పూర్వవైభవానికి రీజెన్సీ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభించడం దోహదం చేస్తుంది. యాజమాన్యం ముందుకు రావడం శుభపరిణామం. వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా ఆదాయం సమకూరుతుంది. – గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఎమ్మెల్యే, యానాం -
మణికేరళం
ఎక్కడి కేరళ? ఎక్కడి మణిపుర్? అయితే మానవత్వానికి భౌగోళిక సరిహద్దులతో పనిలేదు అని నిరూపించే విషయం ఇది. కేరళ కోచిలోని ఆర్సీపీ రెస్టారెంట్లో మణిపుర్కు చెందిన సుస్మిత పనిచేస్తుంది. సర్వీస్ స్టాఫ్లో ఒకరైన సుస్మిత ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. మూడుసార్లు ‘బెస్ట్ ఎంప్లాయీ’గా అవార్డ్ కూడా అందుకుంది. అలాంటిది... ఓ రోజున సుస్మిత డల్గా ఉండడం చూసి ‘ఏమైంది?’ అని అడిగాడు జనరల్ మేనేజర్. తన రాష్ట్రం మణిపుర్లో జరుగుతున్న అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తల్లి, సోదరి గురించి ప్రస్తావిస్తూ ‘వారికేమైనా అవుతుందేమో’ అంటూ భయపడింది. విషయం తెలిసిన చెఫ్ పిళ్లై, అతని టీమ్ మణిపుర్ నుంచి ఆమె తల్లి, సోదరిలను రప్పించి కోచిలో బస ఏర్పాటు చేశారు. సుస్మిత తల్లి ఇబెంచదేవి, సోదరి సర్ఫిదేవిలకు ‘ఆర్సీపీ కోచి కిచెన్’లో ఉపాధి కల్పించారు. ఈ స్టోరీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. -
నేటి నుంచి మైనార్టీలకు రూ. లక్ష సాయం
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభం కానుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష ఆర్థిక సాయం నూరుశాతం రాయితీతో అందించనున్నట్లు వెల్లడించింది. సీఎం కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మైనార్టీ సంక్షేమ శాఖ వెల్లడించింది. -
సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!
మాట్లాడే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు చెబుతుంటారు. ఆదుకోవాలని మనసు ఉండాలేగానీ, సరికొత్త దారులు అనేకం కనిపిస్తాయని చేసి చూపెడుతోంది పదిహేడేళ్ల సీమర్ సంగ్లా. యాసిడ్ దాడి బాధితులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు సబ్బుల తయారీలో శిక్షణ ఇస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ఢిల్లీకి చెందిన సీమర్ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఒకసారి పూనమ్ అనే అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది. దీంతో ఆమె ముఖం మొత్తం కాలిపోయింది. అయితే ఆమె మామూలు సబ్బులతో స్నానం చేస్తే యాసిడ్ దాడి జరిగిన ప్రదేశంలో బాగా మంట పుట్టేది. ఈ విషయం తెలిసిన యాసిడ్ దాడి బాధితులకు సాయం చేసే సీమర్ తల్లి... పూనమ్ను ఆదుకునే క్రమంలో ... మంట రాని సబ్బు తయారు చేయాలనుకుంది. ఈ క్రమంలోనే సీమర్ అమ్మ, అమ్మమ్మలు కలిసి, సబ్బు తయారు చేశారు. యాసిడ్ దాడికి కాలిపోయిన పూనంకు ఈ సబ్బు స్వాంతన కలిగించింది. వాడుకోవడానికి చాలా అనువుగా అనిపించింది. ఇదంతా దగ్గర నుంచి చూసిన సీమర్ యాసిడ్ బాధితుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం మొదలు పెట్టింది. పూనమ్లా ఎంతోమంది యాసిడ్ దాడికి గురైనట్లు తెలుసుకుని, వాళ్లందరికి తాను ఏదోరకంగా సాయపడాలనుకుంది. గతేడాది యాసిడి బాధితుల అవసరాలకు తగినట్లుగా ‘సేఫ్ కేవ్’ పేరిట సబ్బులు తయారు చేయడం ప్రారంభించింది. అలోవెర, తేనెలతో సబ్బులు తయారు చేసి యాసిడ్ బాధితులకు ఇచ్చేది. ఈ సబ్బులు బాధితులకు సాంత్వననిచ్చేవి. వారి ఆసక్తిని గమనించిన సీమర్... సబ్బుల తయారీలో శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టింది. శిక్షణ తీసుకున్న వారంతా సబ్బులు తయారు చేసి మార్కెట్లో విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో వాళ్లకంటూ ఒక గుర్తింపుతోపాటు, సాధారణ అమ్మాయిల్లా జీవించగలుగుతున్నారు. సీమర్.. ఇప్పటిదాక ఇరవైమందికిపైగా సబ్బుల తయారీలో శిక్షణ ఇచ్చింది. యాసిడ్ బాధితుల గురించి తన స్నేహితులు, ఇతర పిల్లలకు చెబుతూ వారికి సాయం చేయాలని కోరుతోంది. ఇది చిన్నపనే అయినప్పటికీ వారి జీవితాల్లో పెద్ద మార్పుని తీసుకొస్తుంది సీమర్. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన బాధితులంతా సీమర్ శిక్షణతో ధైర్యాన్ని కూడగట్టుకొంటూ జీవితంపై కొత్త ఆశలతో ముందుకు సాగుతున్నారు. -
యువ ఇంజనీర్లకు 'ఉపాధి ఎక్కడ'?
► నిజామాబాద్కు చెందిన సూర్యకిరణ్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేశాడు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్సే అతని ప్రధాన సబ్జెక్టు. ఇతను ఓ ప్రముఖ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. మైక్రో లెవల్ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ప్రశ్నలు వేశారు. ఇంత సూక్ష్మ స్థాయి టెక్నాలజీ గురించి అతను పుస్తకాల్లో చదవలేదు. ప్రాజెక్టు సమయంలోనూ దీని జోలికెళ్ళలేదు. దీంతో నైపుణ్యం లేదని కంపెనీ ఉద్యోగం ఇవ్వలేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే కాదు..దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆకర్షణీయమైన వేతనంతో ఏ బహుళజాతి కంపెనీలోనో తక్షణ ఉద్యోగం లేదా డిగ్రీ పూర్తి కాగానే ఎమ్మెస్ కోసం అమెరికా లాంటి దేశానికి వెళ్లి పోవచ్చు. డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులు ప్రధానంగా ఇలాంటి కారణాలతోనే ఇంజనీరింగ్పై ఆసక్తి చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా కంప్యూటర్ సంబంధిత కోర్సులపై క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఏటా సగటున 14 లక్షల మంది ఇంజనీరింగ్లో చేరుతున్నారు. కానీ ఏటా సగటున కేవలం 6 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభిస్తుండటం గమనార్హం. ఇందులోనూ కేవలం 8 శాతం మందికి మాత్రమే వారు చదివిన విద్యకు తగిన ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా వారంతా ఏదో ఒక ఉద్యోగంతో సరిపుచ్చుకుంటున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాలు స్పష్టం చేస్తుండటం శోచనీయం. మన రాష్ట్రంలో 2021–22లో 87 వేల మంది ఇంజనీరింగ్లో చేరారు. వీరిలో 58 శాతం కంప్యూటర్ కోర్సుల్లో చేరారు. కానీ ఈ ఏడాదిలో కేవలం 39 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఉద్యోగాలు పొందారు. వీటిల్లో ఎక్కువగా నాన్–స్కిల్డ్ ఉద్యోగాలే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాంకేతికతకు సరిపడ నైపుణ్యాలు కొరవడటం, సంబంధిత సబ్జెక్టుపై తగిన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏళ్ల నాటి టెక్నాలజీయే ఇప్పుడూ..! ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సాంకేతికతను అన్ని రంగాలూ అందిపుచ్చుకుంటున్నాయి. మానవ వనరులతో సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి టెక్నాలజీ పారిశ్రామిక రంగాన్ని శాసిస్తోంది. అయితే వీటి నిర్వహణకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఇంజనీర్ల అవసరం ఉంది. కానీ బోధనలో ఎప్పటికప్పుడు మార్పు చెందే టెక్నాలజీని చేర్చడం లేదని, ఏళ్ళ నాటి టెక్నాలజీతోనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నారని విద్యావేత్తలు అంటున్నారు. గత కొన్నేళ్ళుగా కంప్యూటర్ సైన్స్లో అనేక కొత్త కోర్సులు వస్తున్నాయి. ఇవన్నీ మూడేళ్ళ క్రితమే డిజైన్ చేసినవి. కోవిడ్ తర్వాత అన్ని రంగాలు తక్కువ మానవ వనరులతో పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను అభివృద్ధి చేశాయి. ఇంటినుంచే బ్యాంకు లావాదేవీలు, ఢిల్లీలో ఉండి ఎక్కడో మారుమూల ఉన్న సోలార్ సిస్టమ్ను పరిశీలించే విధానాలు వచ్చాయి. కానీ ఈ టెక్నాలజీ విద్యార్థుల వరకూ వెళ్ళడం లేదు. ఇలాంటి పరిస్థితులే యువ ఇంజనీర్ల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని చెబుతున్నారు. తూతూ మంత్రం ప్రాజెక్టులు ఇంజనీరింగ్ విద్యలో ప్రాజెక్టులు కీలకం. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేసేవారు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండే టెక్నాలజీపై ప్రాజెక్టులు చేయాలి. కానీ ఏదో ఒక ప్రాజెక్టును ఎవరితోనో చేయించుకుని వస్తున్నారని, విధిలేని పరిస్థితుల్లో వాటిని అనుమతించాల్సి వస్తోందని ఒక యూనివర్సిటీ వీసీ తెలిపారు. ఇక ప్రైవేటు కాలేజీలు వీటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. చాలా కాలేజీలకు నాణ్యమైన పరిశ్రమలతో ఎలాంటి సంబంధాలూ లేవు. దీంతో విద్యార్థులకు మంచి ప్రాజెక్టులను సూచించలేకపోతున్నారు. విద్యార్థులు కూడా ఏదో ఒక ప్రాజెక్టు చేశామనిపించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త విషయాలపై దృష్టి పెట్టాలనే ఆలోచనను విద్యార్థి దశలోనే విస్మరిస్తే, కంపెనీలు కోరుకునే కొత్త టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుందని విద్యారంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యకే కాదు..ఉన్నత విద్య మొత్తానికీ ఇదే పరిస్థితి ఉందని, ఈ పరిస్థితిలో, విద్యా విధానంలో మార్పు రావాల్సిన తక్షణ ఆవశ్యకత ఎంతైనా ఉందని అంటున్నారు. సాంకేతికతలో మార్పులు అందిపుచ్చుకోవడం లేదు ఉన్నత విద్యకు వచ్చిన విద్యార్థి తరగతి గదిలోనే ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలి. అప్పుడే కొత్త విషయాలను రాబట్టే విధానం అభివృద్ధి చెందుతుంది. మెజారిటీ విద్యార్థుల్లో ఇది కన్పించడం లేదు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికతలో వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోలేక పోతున్నారు. ఇదే ఉపాధికి ప్రధాన అడ్డంకిగా మారింది. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (వీసీ, జేఎన్టీయూహెచ్) ప్రయోగాత్మక విద్యను అభివృద్ధి చేయాలి 75 ఏళ్ళు గడిచినా భారత విద్యా విధానంపై స్పష్టమైన రోడ్ మ్యాప్ లేదు. అనేక కమిషన్లు వేసినా ఈ దిశగా ముందడుగు వేయలేదు. ఈ కారణంగానే మన అవసరాలకు కావాల్సిన విద్యా విధానాన్ని రూపొందించుకోలేకపోతున్నాం. పరిశోధనాత్మక విద్యకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. థియరీ విద్యతో పాటు ప్రధానంగా ప్రయోగాత్మక విద్యను అభివృద్ధి చేయాలి. – ప్రొఫెసర్ తాటికొండ రమేష్ (వీసీ, కాకతీయ వర్సిటీ) నాణ్యమైన ప్రాజెక్టు వర్క్ పెంచాలి సాంకేతిక విద్యే కాదు.. ఉన్నత విద్యలోనూ థియరీలోనే ముందుకెళ్తున్నాం. కానీ పుస్తకాల్లో ఉన్నదానికి నిజ జీవితంలోని అనుభవాలు జోడించడం లేదు. థియరీతో పాటు నాణ్యమైన ప్రాజెక్టు వర్క్ గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే పెంచాలి. ఈ దిశగా ఏఐసీటీఈ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం. ఏదో ఒక ఉపాధి అనుకోవడం కాదు.. ఉన్నత విద్య తర్వాత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం) విద్యార్థి దశలోనే సంస్థలతో భాగస్వామ్యం ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా అన్ని సంస్థలు యాంత్రిక విధానాలను అనుసరిస్తున్నాయి. వీటి నిర్వహణ నైపుణ్యాలు ఉన్న ఇంజనీర్లకే ఉపాధి అవకాశాలుంటాయి. ఉదాహరణకు ఆసుపత్రులు ఏఐ ద్వారా ముందుకెళ్తున్నాయి. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తెలియాలంటే ఇంజనీరింగ్ చేసేటప్పుడే ఆ విద్యార్థికి సంస్థలు, కంపెనీలతో భాగస్వామ్యం అవసరం. అప్పుడే భవిష్యత్ అవసరాలకు ఇంజనీరింగ్ విద్యను ఎలా మలుచుకోవాలో తెలుస్తుంది. ఈ దిశగా ఉన్నత విద్యలో మార్పులు అవసరం. – ఎస్.నీలిమ (సీఈవో, అనురాగ్ యూనివర్సిటీ) నైపుణ్య సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసే విధానం ఉండాలి విద్యార్థికి మార్కులు కొలమానంగా ఉండే విద్యా విధానం మారాలి. అందుకే దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వమని ఓ సంస్థను కోరాం. విద్యార్థిలో ఉండే నైపుణ్య సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసే పరీక్షా విధానం భావి ఇంజనీర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి (చైర్మన్, ఉన్నత విద్యా మండలి) -
హిందూపూర్లో 350 ఎకరాల్లో టెక్స్టైల్ మరియు ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ కోసం పారిశ్రామికపార్క్ ఏర్పాటు
-
గుహనే ఇల్లుగా మార్చేసి..ఆ ఇంటితోనే..
గుహను ఇల్లుగా మార్చేసి, ఆ ఇంటితోనే స్వయం ఉపాధి పొందుతున్నాడు గ్రాంట్ జాన్సన్ అనే ఈ అమెరికన్ పెద్దమనిషి. సరిగా చదువుకోక పోవడంతో పదిహేడేళ్ల వయసులోనే ఇతన్ని బడి నుంచి సాగనంపేశారు. బడి నుంచి బయటపడ్డాక పొట్టపోసుకోవడానికి గని కార్మికుడుగా కుదురుకున్నాడు. గనుల్లో పనిచేసి, కూడబెట్టుకున్న సొమ్ముతో 1995లో 25 వేల డాలర్లు (ర.15.60 లక్షలు) పెట్టి యూటా శివార్లలో 40 ఎకరాల బీడు భమిని కొన్నాడు. ఈ భూమి కొన్నప్పుడు అతడి మిత్రులంతా పనికిరాని భమి కొని వెర్రిబాగుల పని చేశాడంటూ అతడిని తిట్టిపోశారు. గ్రాంట్ వాళ్ల మాటలను పట్టించుకోలేదు. తాను కొన్న భూమిలోనే ఉన్న కొండ గుహను ఏళ్ల తరబడి శ్రమించి 5,700 చదరపు అడుగుల విస్తీర్ణం గల చూడచక్కని ఇంటిగా తయారు చేశాడు. అధునాతనమైన ఇంటికి కావలసిన హంగులన్నింటినీ అందులో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ ఇంటిని పర్యాటకులకు అద్దెకు ఇస్త, వచ్చే ఆదాయంతో నిక్షేపంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఇందులోని ఒక గదిలో బస చేసేందుకు ఒక రాత్రికి 350 డాలర్లు (ర.28,741), ఇల్లు మొత్తంగా అద్దెకు కావాలనుకుంటే ఒక రాత్రికి వెయ్యి డాలర్లు (ర.82,119) చెల్లించాల్సి ఉంటుంది. గ్రాంట్ ఈ భూమిని కొన్నప్పుడు ఇక్కడ ఉండే గుహ ప్రవేశమార్గం చాలా చిన్నగా ఉండేది. డైనమైట్లతో దాన్ని పేల్చి, మార్గాన్ని విశాలం చేశాడు. లోపలి గోడలను స్వయంగా తన చేతులతోనే ఉలి, సుత్తి వంటి పరికరాలను పట్టుకుని నున్నగా చెక్కాడు. నేల మీద మొజాయిక్ ఫ్లోరింగ్ చేయించాడు. నీటి సరఫరాకు పైపులు వేయించాడు. పైఅంతస్తుకు, కింది అంతస్తుకు రాకపోకలు జరుపుకోవడానికి మెట్లు ఏర్పాటు చేశాడు. విద్యుత్తు, టెలిఫోన్ కనెక్షన్లు ఏర్పాటు చేయించుకున్నాడు. సలక్షణమైన ఇంటిగా మార్చుకున్నాక, ఈ గుహనే అద్దెకిస్త స్వయం ఉపాధి పొందుతున్నాడు. (చదవండి: ఆకాశమే హద్దుగా.. స్కైడైవింగ్ చేస్తూ పెళ్లి..) -
యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు
భారీ పరిశ్రమలను ఆకర్షించేలా యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2023 – 27 విధివిధానాలను తాజాగా విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 30 వరకు నూతన పాలసీ అమల్లో ఉంటుంది. ఈ కాలపరిమితిలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. యాంకర్ యూనిట్లతో పాటు లార్జ్, మెగా, అల్ట్రా మెగా, ఎంఎస్ఎంఈలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టమైన విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా ప్రభుత్వం నూతన పాలసీ విధివిధానాలను రూపొందించింది. యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు అందించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. యాంకర్ యూనిట్ రూ.500 కోట్లకు పైబడి పెట్టుబడితో ఏర్పాటవ్వాలి. కనీసం 1,000 మందికి ఉపాధి కల్పించాలి. ఈ యూనిట్ ఆధారంగా కనీసం మరో ఐదు యూనిట్లు ఏర్పాటవ్వాలి. ఇటువంటి యూనిట్లకు పారిశ్రామిక పాలసీ 2023 – 27లో పేర్కొన్న ప్రోత్సాహకాలతో పాటు అదనపు రాయితీలు కూడా లభిస్తాయి. యూనిట్ ఏర్పాటు వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కలిగే ప్రయోజనం, ఉపాధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ యూనిట్ ప్రతిపాదనలను బట్టి టైలర్ మేడ్ రాయితీలను ఇవ్వనున్నారు. తొలుత యాంకర్ యూనిట్ పూర్తి నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్కు సమర్పించాలి. వారు కోరుకొనే రాయితీలను ప్రజంటేషన్ రూపంలో చూపించాలి. ఆ రాయితీలు ఇవ్వడానికి సహేతుక కారణాలను వివరించాలి. ఈ ప్రతిపాదనలను ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ ముందుకు తేవాలి. వాటిని ఎస్ఐపీబీ పరిశీలించి భూమి ధరలు, ప్రత్యేక రాయితీలపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు విస్తరణ చేపట్టినా, లేక వేరే రంగంలో పెట్టుబడులు పెట్టినా వాటికి కూడా నిబంధనలకు అనుగుణంగా రాయితీలు అందుతాయి. రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన ప్రతి పరిశ్రమకు ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఉద్యోగుల్లో 75 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని, అటువంటి సంస్థలకే ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఇందులోనూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందుకు విధివిధానాలను నూతన పాలసీలో పొందుపరిచింది. ఈ పరిశ్రమల్లో 100 శాతం పెట్టుబడి ఎస్సీలు, ఎస్టీల పేరు మీద ఉండాలి. 100 శాతం పెట్టుబడి ఎస్సీ, ఎస్టీ మహిళల పేరు మీద ఉంటే వాటిని ఎస్సీ, ఎస్టీ మహిళా యూనిట్లుగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ మహిళలను తొలి తరం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా వారిని చేయిపట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నూతన పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. జగనన్న కాలనీల్లో వాక్ టు వర్క్ విధానంలో పనిచేసుకునే విధంగా ఉమ్మడి వసతులతో కూడిన సూక్ష్మ యూనిట్లు ఏర్పాటు చేయడానికి క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. ఈ క్లస్టర్లలో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కాలనీల్లో యూనిట్లు ఏర్పాటు చేసేలా ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
ఉపాధి, శిక్షణపై విస్తృత అధ్యయనం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి వియత్నాం పర్యటన ముగిసింది. ఏపీ యువతకు ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, వృత్తి విద్య, శిక్షణపై అధ్యయనమే లక్ష్యంగా దక్షిణ కొరియా, వియత్నాం దేశాలలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పది రోజుల పర్యటించారు. ఈ పర్యటనలో చివరి రోజైన మంగళవారం హోచిమిన్ సిటీలోని సైగాన్ హైటెక్ ఇండ్రస్టియల్ పార్క్లో ఉన్న అంతర్జాతీయ ఎల్రక్టానిక్స్ ట్రైనింగ్ సెంటర్ను అధికారుల బృందంతో కలసి సందర్శించారు. పార్కును తీర్చిదిద్దిన తీరు, టెక్నాలజీ అంశాలపై సైగాన్ హైటెక్ పార్కు అధ్యక్షుడు న్గుయెన్ అన్హ్ థీని అడిగి తెలుసుకున్నారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలున్న రంగాలపై ప్రతినిధులతో చర్చించారు. పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్లో శిక్షణ కేంద్రాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, వృత్తి శిక్షణలో సహకారం, అవకాశాలపై మన అధికారుల బృందం అధ్యయనం చేసింది. వియత్నాంలోని అతిపెద్ద సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ‘మోవి’ని మంత్రి బుగ్గన సందర్శించారు. సాల్మన్ ఫిష్ (మాఘ చేప), ట్యూనా ఫిష్ (తూర చేప)లను శుద్ధి చేసే యూనిట్లోని టెక్నాలజీని అడిగి తెలుసుకున్నారు. డాంగ్ నై ప్రావిన్స్ వైస్ చైర్మన్తో ఆర్ధిక మంత్రి బుగ్గన సమావేశమై. ఏపీలో పర్యటించాలని వైస్ చైర్మన్ను ఆహ్వానించారు. -
ఉపాధి హామీ పథకం పనులు కల్పించడంలో ఏపీ నెంబర్ వన్
-
మే నెలలో కొత్తగా 8.83 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలలో 8.83 లక్షల మంది కొత్త వారికి ఉపాధి లభించింది. వీరంతా ఈపీఎఫ్వో కిందకు కొత్తగా వచ్చి చేరారు. ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, మే నెలలో ఈపీఎఫ్వో కిందకు చేరిన సభ్యుల సంఖ్య 16.30 లక్షలుగా ఉంది. కేంద్ర కార్మిక శాఖ ఈ వివరాలను గురువారం విడుదల చేసింది. కొత్తగా 3,673 సంస్థలు తమ ఉద్యోగులకు ఈపీఎఫ్వో పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ సంస్థలు అన్నీ కూడా మొదటిసారి ఈపీఎఫ్వో కింద నమోదయ్యాయి. గత ఆరు నెలల కాలంలో ఎక్కువ సభ్యుల చేరిక మేలోనే నమోదైంది. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసు వారు 56 శాతంగా ఉన్నారు. సంఘటిత రంగంలో యువత గణనీయ స్థాయిలో ఉపాధి పొందినట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సాధారణంగా విద్య పూర్తయిన తర్వాత ఈ వయసు వారే ఉద్యోగాన్వేషణ చేస్తుంటారని తెలిసిందే. కొత్త సభ్యుల్లో 2.21 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం మీద మే నెలలో చేరిన మహిళా సభ్యుల 3.15 లక్షలుగా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల నుంచి కొత్త సభ్యులు అధికంగా చేరినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల నుంచే 57.85 శాతం మంది ఈపీఎఫ్వో కిందకు వచ్చి చేరారు. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 19.32 శాతం మంది సభ్యులయ్యారు. బిల్డింగ్, నిర్మాణం, వ్రస్తాల తయారీ, ఎల్రక్టానిక్ మీడియా, టెక్స్టైల్స్, రబ్బర్ ఉత్పత్తులు, ఆర్థిక సేవల సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. మొత్తం సభ్యుల్లో 42 శాతం మేర నైపుణ్య సేవల విభాగం కిందే ఉన్నారు. -
ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో, ఆందోళనలో సగం మంది భారతీయులు!
ప్రపంచ వ్యాప్తంగా ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి జాబ్ విషయంలో అభద్రతా భావానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. వారిలో భారతీయులు 47 శాతం మంది ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఏడీపీ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ‘పీపుల్ ఎట్ వర్క్ 2023: ఏ గ్లోబల్ వర్క్ఫోర్స్ వ్యూ’ పేరిట సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో 47 శాతం మంది సిబ్బంది తమ కొలువుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడీపీ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ 32,000 మందిపై సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో సగానికి పైగా జెన్ జెడ్ (18- 24ఏళ్ల వయస్సు) వారు చేస్తున్న ఉద్యోగం పట్ల నమ్మకంతో లేదనే తెలుస్తోంది. 55ఏళ్ల వయస్సు వారిలో సైతం ఈ తరహా ఆందోళనలు రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు నివేదిక హైలెట్ చేసింది. ముఖ్యంగా, ఈ తరహా ఆందోళనలు రియల్ ఎస్టేట్,కన్స్ట్రక్షన్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎక్కువ మంది ఉన్నారు. అంతర్జాతీయ జాబ్ మార్కెట్లో మీడియా, ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ ఉద్యోగాలపై అపనమ్మకంతో ఉన్నారు. ఆయా రంగాలతో పాటు ఆతిధ్యం, ఎంటర్టైన్మెంట్ వంటి రంగాల్లో పనిచేస్తున్న తమ జాబ్ ఉంటుందో..ఊడుతుందోనన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. కారణాలు అనేకం మొత్తం వర్క్ ఫోర్స్లో యువతే అభద్రతకు లోనవుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయని ఏడీపీ ఎండీ రాహుల్ తెలిపారు. ఇటీవల కాలంలో ఆర్ధిక అనిశ్చితి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్, ట్విటర్, మెటాలాంటి సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్ మనుషులు చేస్తున్న ఉద్యోగాలకు మరింత ప్రమాదంలోకి నెట్టే ప్రమాదం ఉందని వెలుగులోకి వస్తున్న నివేదికలే యువతలో ఆందోళనకు కారణమని తెలిపారు. జాబ్ మార్కెట్లో నైఫుణ్యం ఉన్న వారిని గుర్తించడంలో, వారిని ఉద్యోగంలో కొనసాగించడం మరింత కష్టంగా మారినట్లు రాహుల్ గోయల్ గుర్తించామని అన్నారు. సంస్థలు తమ ఉద్యోగులకు భరోసా ఇవ్వకపోతే అనుభవాల్ని, ఉత్సాహాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. తద్వారా క్లయింట్లకు ఆశించిన స్థాయిలో సేవల్ని అందించడంలో కష్టతరం మారుతుందని చెప్పారు. దిగ్రేట్ రిజిగ్నేషన్ వంటి ప్రపంచవ్యాప్తంగా, గత ఏడాది కాలంలో ఐదుగురు జెన్జెడ్లలో ఒకరు.. చేస్తున్న రంగం నుంచి మరో రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేశారు. పావు వంతు మంది సొంతంగా బిజినెస్ ప్రారంభించాలని ఆలోచించినట్లు తేటతెల్లమైంది. 55 ఏళ్లు పైబడిన వారిలో 17 శాతం మంది ముందస్తుగా పదవీ విరమణ చేయాలని ఆలోచించారు. ఇదే ది గ్రేట్ రిజిగ్నేషన్ వంటి అంశాలకు కారణమందన్నారు. ఉద్యోగంలో అభద్రత పోవాలంటే యజమానులు ఉద్యోగులు మార్కెట్కు అనుగుణంగా జీతాలు ఇవ్వగలిగితే ఈ ఆందోళన నుంచి బయట పడొచ్చు. తద్వారా ఉద్యోగులు తాము పనిచేసే సంస్థ పట్ల మరింత సానుకూలంగా భావించే అవకాశం ఉంది. చదవండి👉 ‘పాపం సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. జాబులు పోయి బైక్ ట్యాక్సీలు నడుపుకుంటున్నారు’ -
గ్రామీణ యువతకు శిక్షణ, ఉపాధిలో ఏపీ స్పీడ్
-
గ్రామీణ యువతకు శిక్షణ, ఉపాధిలో ఏపీ స్పీడ్
సాక్షి, అమరావతి: గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి ఐదు రాష్ట్రాల్లో స్థానం సంపాదించుకుంది. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణలో మూడో స్థానం, వారు ఉపాధి పొందడం (ప్లేస్మెంట్స్)లో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద దేశంలోని 27 రాస్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 14.51 లక్షల మంది గ్రామీణ యువత శిక్షణ పొందగా ఇందులో 8.70 లక్షల మంది ఉపాధి పొందినట్లు తెలిపింది. గ్రామీణ యువతకు వృత్తిపరమైన లేదా వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ఈ పథకం కింద నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంలో ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. శిక్షణ పొందిన అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 15 నుంచి 35 ఏళ్ల లోపు పేద కుటుంబాలకు చెందిన గ్రామీణ యువతకు ఈ పథకం కింద నైపుణ్య శిక్షణ ఇస్తారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనారిటీలకు 15 శాతం, మహిళలకు 33 శాతం మందికి శిక్షణలో ప్రాధాన్యత ఇస్తారు. అలాగే దివ్యాంగులు, కుటుంబ నిర్వహణలో ఉన్న మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. దేశంలో 37 రంగాల్లో 877 ప్రాజెక్టు అమలు ఏజెన్సీలు 2,369 కేంద్రాల్లో ఈ శిక్షణ ఇస్తున్నాయి. -
అసలేం జరుగుతోంది.. డిగ్రీ పట్టా అందుకొని ‘శవాలు’గా విద్యార్ధులు!
బీజింగ్: ఇప్పుడు చైనాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకున్న విద్యార్థులు శవాల్లా పోజులిస్తూ ఫొటోలు తీయించుకుంటున్నారు. అనంతరం వాటిని అక్కడి సోషల్మీడియాలో చనిపోయే ఉన్నాం అని ట్యాగ్లైన్తో పోస్ట్ చేస్తున్నారు. అసలు విద్యార్థులు ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఇదేమైనా ప్రాంక్ అనుకుంటే మీ పొరపాటే. అక్కడి విద్యార్థులు తమ నిరసనను ఈ రకంగా తెలుపుతున్నారు. దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే.. ప్రస్తుతం డ్రాగన్ కంట్రీలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఎంతో కష్టపడి డిగ్రీలు చేసినా.. తమకు ఉపాధి లభించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము బతికినా చచ్చినా ఒకటేననే భావంతో ఈ రకంగా నిరసన తెలుపుతున్నారు. తాజాగా ఈ ఫొటోలు చైనీస్ సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శవాలుగా చైనీస్ విద్యార్థులు ఒక దశాబ్దం క్రితం వరకు ఉపాధి, అభివృద్ధి వైపు దృష్టి సారించిన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం. ఇటీవల మాత్రం అంతర్జాతీయ వ్యవహారాలు, భద్రతపై దృష్టి పెడుతుండటంతో దేశ వృద్ధి రేటు మందగించింది. దేశవ్యాప్తంగా మొత్తం ఉద్యోగాలలో 80 శాతం ప్రైవేట్ రంగం వాటాను కలిగి ఉంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న ప్రైవేట్ రంగంపై చైనా తీసుకున్న కఠిన నిర్ణయాలు ప్రస్తుతం విద్యా రంగానికి భారీ నష్టాన్ని కలిగించడంతో పాటు కొన్ని సంస్థలు మూసివేయడమో లేదా తమ వాటాను తగ్గించుకునే పనిలో పడ్డాయి. చైనాలో, రికార్డు స్థాయిలో 11.6 మిలియన్ల తాజాగా వారి గ్రాడ్యుయేషన్ను పూర్తి చేసుకుని ఉద్యోగాల వేట ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా గత మేలో, పట్టణ చైనాలో నిరుద్యోగం రేటు 20.8 శాతానికి చేరుకుంది. ఓ వైపు పరిస్థితులు ఇలా ఉండగా.. కొత్తగా ఉద్యోగార్ధుల ప్రవాహం మరింత పెరుగుతుండడం..ఆ దేశంలో నిరుద్యోగ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. పనికి రాని డిగ్రీ పట్టాలు.. ప్రతి సంవత్సరం లక్షల్లో విద్యార్థులు డిగ్రీ పట్టా పట్టుకుని జాబ్ మార్కెట్లోకి ప్రవేశించడంతో.. ఆ డిగ్రీలకు విలువ లేకుండా పోయిందని చైనా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల చైనాలో ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు మాస్టర్స్, పీహెచ్డీ అభ్యసించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ తమ చదువుకి తగ్గ ఉద్యోగం వస్తుందని గ్యారెంటీ లేదని అక్కడి విద్యార్థులు వాపోతున్నారు. చదవండి: ఆ ఏడు 'పిల్లుల పేర రూ. 2.4 కోట్ల ఆస్తి! తీసుకునేందుకు ఎగబడుతున్న జనం.. -
Andhra Pradesh: ఉపాధికి స‘పోర్టు’
కాకినాడ నుంచి సాక్షి ప్రతినిధి చంద్రశేఖర్ మైలవరపు: రాష్ట్రంలో వీలున్న చోటల్లా విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా అదనంగా ఏడు వేల మందికి ఉపాధి కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. బియ్యం, మొక్కజొన్న, సిమెంట్ వంటి ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో విదేశాలకు సులభంగా ఎగుమతి చేసుకునే వెసులుబాటు ఉండటం ఈ పోర్టు ప్రత్యేకత. దీని పనితీరు ఇతర పోర్టులకు భిన్నంగా ఉంటుంది. ఇతర మోడరన్ పోర్టులతో పోలిస్తే ఇందులో మానవ వనరుల వినియోగం చాలా అధికం. డీప్ వాటర్ పోర్టుల్లో నేరుగా పోర్టు నుంచే సరుకు రవాణా చేసుకునే వీలుంటుంది. కానీ.. యాంకరేజ్ పోర్టులో ఓడలు సముద్రం మధ్యలో లంగరు వేసి ఉంటాయి. వాటి వద్దకు చిన్న పడవల్లో సరుకును తీసుకెళ్లి నింపుతారు. ఇందుకోసం భారీ స్థాయిలో మానవ వనరుల వినియోగం అవసరమవుతుంది. ప్రస్తుతం కాకినాడ యాంకరేజ్ పోర్టు ప్రత్యక్షంగా.. పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. కానీ.. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ నిరాదరణకు గురైంది. యాంకరేజ్ పోర్టును విస్తరిస్తే మరింత మందికి ఉపాధి లభిస్తుందన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు ముందుకు వేశారు. సాగర్మాల పథకం కింద కాకినాడ యాంకరేజ్ పోర్టు సామర్థ్యాన్ని 4 మిలియన్ టన్నుల నుంచి 5 మిలియన్ టన్నులకు పెంచడం ద్వారా మరో 7 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. అదనంగా జెట్టీ పొడవు 260 మీటర్లు పెంపు కాకినాడ యాంకరేజ్ పోర్టును రూ.91.85 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఆధునికీకరించనుంది. ఈ నిధులతో సరుకు రవాణా బోట్లు నిలుపుకునే జెట్టీ పొడవు, కాల్వ లోతు, సరుకు లోడింగ్ పాయింట్లను పెంచడం, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ప్రస్తుత యాంకరేజ్ పోర్టు జెట్టీ పొడవు 930 మీటర్లు ఉండగా.. దీనికి అదనంగా 260 మీటర్లు పెంచడం ద్వారా మొత్తం జెట్టీ పొడవును 1,190 మీటర్లకు పెంచనున్నారు. ఇంతకాలం జెట్టీల ద్వారా మానవుల సహాయంతో సరుకును లోడింగ్ అన్లోడింగ్ మాత్రమే చేసేవారు. ఇప్పుడు కొత్తగా 5 చోట్ల యంత్రాల సహయంతో లోడింగ్ చేసేలా పాయింటన్లు ఆధునికీకరిస్తున్నారు. కాలువ లోతు పెరిగేలా డ్రెడ్జింగ్ పోర్టులో బోట్లు నిలుపుకునే కాలువ పూడుకుపోవడంతో లోతు తగ్గింది. దీన్ని 2.5 మీటర్ల లోతు ఉండే విధంగా డ్రెడ్జింగ్ చేయడంతోపాటు పోర్టు నుంచి కాకినాడ జగన్నాథపురం వరకు ఉన్న వాణిజ్య కాలువ లోతును పెంచి గట్లను పటిష్టం చేయనున్నారు. పోర్టును అనుసంధానించే ప్రధాన రహదారితో పాటు, పోర్టు లోపల అంతర్గత రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈ విస్తరణ పనుల టెండర్ దక్కించుకున్న సంస్థ వేగంగా పనులు చేపడుతోంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కాకినాడ యాంకరేజ్ పోర్టు 1,150 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పోర్టు విస్తరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరగనుంది. 2022–23 సంవత్సరంలో యాంకరేజ్ పోర్టు 3.87 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ.63 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. టర్న్ ఎరౌండ్ తగ్గించడమే లక్ష్యం అత్యధిక మందికి ఉపాధి కల్పించే యాంకరేజ్ పోర్టు ఆధునికీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. బియ్యం, మొక్కజొన్న, సిమెంట్ వంటి ఎగుమతులకు అనుకూలంగా ఉండే కాకినాడ యాంకరేజ్ పోర్టులో ఒక ఓడలో సరుకు నింపుకుని వెళ్లడానికి కనీసం 28 నుంచి 30 రోజులు (టర్న్ ఎరౌండ్ టైమ్)గా ఉంది. ఆధునికీకరణ చేయడం ద్వారా ఈ సమయాన్ని కనీసం 15 రోజులకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. టర్న్ ఎరౌండ్ సమయం సగానికి తగ్గించగలిగితే కాకినాడ యాంకరేజ్ పోర్టు ఎగుమతి సామర్థ్యం పెరగడమే కాకుండా ఎగుమతిదారులకు వ్యయం కూడా తగ్గుతుంది. – కల్నల్ రవీంద్రనాథ్రెడ్డి, డిప్యూటీ సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు చిన్న ఎగుమతిదారులకు ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో మన రాష్ట్రం సముద్ర వాణిజ్యానికి వేదికగా మారుతోంది. పురాతన కాలం నాటి కాకినాడ డీప్ వాటర్ పోర్టును ఆధునికీకరించడం స్థానిక ఎగుమతిదారులకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. డీప్ వాటర్ పోర్టులతో పోలిస్తే యాంకరేజ్ పోర్టుల్లో షిప్ ల్యాండింగ్ చార్జీలు చాలా తక్కువ. డీప్ వాటర్ చార్జీల్లో సగం వ్యయంతోనే సరుకులు ఎగుమతి చేయవచ్చు. ఇది చిన్న ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. – రఘు, ప్రెసిడెంట్, కాకినాడ చాంబర్ ఆఫ్ కామర్స్ -
మొక్కలు నాటి ఉప్పును పండించవచ్చు
సాక్షి, అమరావతి: సాలికోర్నియా.. సముద్ర తీరం వెంబడి ఉప్పునీటి ప్రాంతాల్లో విస్తారంగా పెరిగే ఈ మొక్కలను సంప్రదాయ ఉప్పునకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కల నుంచి ఉత్పత్తి చేసే ఇంధనాన్ని విమానాల్లో సైతం ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. సముద్రతీర ప్రాంతాల్లో ఉప్పును తట్టుకుని పుషి్పంచే మొక్కల జాతికి చెందిన సాలికోర్నియా మొక్కల్లో 50 శాతం వరకు సోడియం క్లోరైడ్ నిండి ఉంటుంది. ఇందులోని లవణీయత సంప్రదాయ సముద్ర ఉప్పు రుచిని కలిగి ఉంటుంది. వీటి నుంచి తీసే ఉప్పును హెర్బల్ సాల్ట్, గ్రీన్ సాల్ట్గా పిలుస్తున్నారు. ప్రొటీన్లు.. విటమిన్లూ ఉన్నాయ్ సాలికోర్నియా మొక్కల్లో 11 శాతం ప్రొటీన్లు, 20 శాతం ఫైబర్, జింక్, పొటాషియం, ఏ, బీ–1, బీ–12, బీ–15, సీ, ఈ విటమిన్లు అపారంగా ఉన్నాయని పరిశోధనల్లో గుర్తించారు. రక్తపోటు, మధుమేహం, గ్యాస్ట్రిక్ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఈ గ్రీన్ సాల్ట్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు చాలా దేశాల్లో ఈ మొక్క నుంచి ఉత్పత్తి చేసే ఉప్పును అన్ని వంటకాల్లో వాడుతున్నారు. సీఎస్ఎంసీఆర్ఐ సాంకేతిక సహకారం గుజరాత్ భావనగర్లోని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) సాలికోర్నియా మొక్కల నుంచి ఉప్పు తయారు చేసే టెక్నాలజీని కనుగొంది. ప్రత్యామ్నాయ ఉప్పు తయారీకి సంబంధించిన అన్ని శాస్త్రీయ, సాంకేతిక సహాయాలను అందిస్తోంది. సాలికోర్నియా మొక్కల సాగు, కోత, మొక్కల్ని ఎండబెట్టడం, ఇతర ప్రక్రియల ద్వారా ఎకరాకు టన్ను ఉప్పు వస్తుందని సీఎస్ఎంసీఆర్ఐ చెబుతోంది. రూ.15 వేల పెట్టుబడితో రూ.25 వేలకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఈ మొక్కల నుంచి ఉత్పత్తి చేసే ఇంధనాన్ని సౌదీ దేశాలలో కొన్ని విమానయాన సంస్థలు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నాయట. ఏపీలోనూ సాగుకు అవకాశాలు రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సువిశాల సముద్రతీర ప్రాంతం ఉంది. కాకినాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో పెద్దఎత్తున విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. తీరం వెంబడి రిజర్వ్ మడ అడవుల్లో సాలికోర్నియా మొక్కలు విస్తారంగా ఉన్నట్టుగా గుర్తించారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా తీర ప్రాంతంలో ఈ మొక్కల జాడను సీఎస్ఎంసీఆర్ఐ గుర్తించింది. ఉప్పునీటి చెరువుల్లో చేపలు, రొయ్యలు సాగు చేసే రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధిగా సాలికోర్నియా మొక్కల సాగు నిలుస్తుందని చెబుతున్నారు. కొన్ని దేశాల్లో ఇండోర్లో కూడా సాగు చేస్తున్నారు. భవిష్యత్లో మంచి ఆదాయ వనరుగా ఉపయోగపడే ఈ మొక్కల సాగుపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
గిరిజనులకు అదనపు ఉపాధి
-
ఉపాధిలో ఎయిరిండియా జోరు..
న్యూఢిల్లీ: వృద్ధి అవకాశాలపై అత్యంత ఆశావహంగా ఉన్న విమానయాన సంస్థ ఎయిరిండియా అయిదేళ్ల వ్యాపార పరివర్తన ప్రణాళిక అమలుపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతోంది. ప్రతి నెలా 550 మంది క్యాబిన్ సిబ్బంది, 50 పైలట్లను నియమించుకుంటోంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఆరు ఏ350 పెద్ద విమానాలను అందుకోనుంది. ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంప్బెల్ విల్సన్ ఈ వివరాలను వెల్లడించారు. ఎయిర్లైన్ హైరింగ్ ప్రణాళికలను ప్రస్తావిస్తూ నిర్దిష్ట టార్గెట్ అంటూ ఏదీ లేదన్న విల్సన్ .. ‘ప్రతి నెలా కొత్తగా సుమారు 550 మంది క్యాబిన్ సిబ్బంది, 50 మంది పైలట్లను తీసుకుంటున్నాం, శిక్షణనిస్తున్నాం. ఎయిర్లైన్ ప్రైవేటీకరణ ముందు నాటి పరిస్థితితో పోలిస్తే వార్షికంగా క్యాబిన్ సిబ్బంది నియామకాల రేటు పది రెట్లు, పైలట్లది అయిదు రెట్లు పెరిగింది‘ అని వివరించారు. ఈ ఏడాదంతా కూడా ఇదే తీరులో హైరింగ్ కొనసాగుతుందని, ఏడాది ఆఖరులో నెమ్మదించి, 2024 ఆఖర్లో మళ్లీ పెరగవచ్చని ఆయన పేర్కొన్నారు. కొత్త విమానాలు వచ్చే కొద్దీ రిక్రూట్మెంట్ పెరుగుతుందన్నారు. నాలుగు సంస్థల్లో 20 వేల సిబ్బంది.. ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఎయిరేషియా ఇండియా (ప్రస్తుతం ఏఐఎక్స్ కనెక్ట్), విస్తారాలను ఎయిరిండియాలో విలీనం చేసే విషయంపై స్పందిస్తూ నియంత్రణ సంస్థల అనుమతుల మేరకు ఎయిర్లైన్స్ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించుకోనున్నట్లు విల్సన్ చెప్పారు. వృద్ధి వ్యూహంలో భాగంగా కొత్తగా తీసుకుంటున్న వారు కాకుండా నాలుగు ఎయిర్లైన్స్లో కలిపి సుమారు 20,000 సిబ్బంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 3,900 మంది పైచిలుకు సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నట్లు గత నెలలో ఉద్యోగులకు విల్సన్ తెలిపారు. వీరిలో 500 మంది పైలట్లు, 2,400 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారని వివరించారు. 122 విమానాలు .. ప్రస్తుతం ఎయిరిండియాకు 122 విమానాలు ఉన్నాయి. వీటి సంఖ్యను మరింతగా పెంచుకుంటోంది. ఇందులో భాగంగా 470 విమానాల కోసం ఆర్డరు ఇచ్చింది. వీటిలో 250 విమానాలను యూరప్ దిగ్గజం ఎయిర్బస్ నుంచి, 220 ఎయిర్క్రాఫ్ట్లను అమెరికన్ దిగ్గజం బోయింగ్ దగ్గర్నుంచి కొనుగోలు చేస్తోంది. వీటిలో 40 ఎయిర్బస్ ఏ350లు, 20 బోయింగ్ 787లు, 10 బోయింగ్ 777–9 రకం పెద్ద విమానాలు, 210 ఎయిర్బస్ ఏ320/321 నియో ఎయిర్క్రాఫ్ట్, 190 బోయింగ్ 737 మ్యాక్స్ చిన్న విమానాలు ఉన్నాయి. వీటికి సంబంధించి తొలి చిన్న విమానం (నారో–బాడీ) జూలై లేదా ఆగస్టు నాటికి అందుకోవచ్చని విల్సన్ చెప్పా రు. అలాగే ఈ ఏడాది ఆఖరు నాటికి ఆరు ఏ350, ఎనిమిది బీ777 ఎయిర్క్రాఫ్ట్లు రాగలవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా తొమ్మిది బీ777 విమానాలను లీజుకు తీసుకుని నడుపుతోంది. సవాళ్లు.. కొన్నాళ్లుగా పెట్టుబడులు లేక సతమతమవుతున్న ఎయిరిండియా వంటి పెద్ద సంస్థను వేగంగా గాడిన పెట్టాల్సి రావడమనేది సవాలు వంటిదని విల్సన్ తెలిపారు. ఎయిర్లైన్ను గణనీయంగా మార్చాల్సిన పరిస్థితి ఉందన్నారు. మిగతా ఎయిర్లైన్స్ను విలీనం చేయడం, శిక్షణా సామరŠాధ్యలను పెంపొందించుకోవడం, ప్రారంభం నుంచి గతంలో ఎన్నడూ లేనంత వృద్ధి సాధించేలా మద్దతు కల్పించడం వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు, ఎకానమీ, ప్రయాణికులు, ఎయిర్లైన్స్, సిబ్బందిలాంటి భాగస్వాములందరికీ మేలు చేసేలా దేశీ విమానయాన వ్యవస్థ ఆరోగ్యకరంగా, స్థిరంగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని విల్సన్ చెప్పారు. -
కేసును కోర్టు కొట్టేస్తే ఉద్యోగిని విధుల్లోకి తీసుకోవాల్సిందే
సాక్షి, అమరావతి : ఏ ఆరోపణలతో శాఖాపరమైన విచారణ జరిపి ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించారో అదే ఆరోపణలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసినప్పుడు ఆ ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. న్యాయస్థానం అతన్ని నిర్దోషిగా విడుదల చేసినప్పుడు అదే ఆరోపణలపై సర్వీసు నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఇలా కర్నూలు జిల్లా, నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో టైపిస్ట్ ఖాసిం సాహెబ్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. తనను సర్వీసు నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ ఖాసిం సాహెబ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ పరిపాలన ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులను సైతం హైకోర్టు రద్దు చేసింది. ఖాసింను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే సర్వీసులోని తొలగించిన తేదీ నుంచి నిర్దోషిగా తేలిన తేదీ వరకు నో వర్క్, నో పే సూత్రం ఆధారంగా ఎలాంటి జీతభత్యాలకు అర్హుడు కాదని స్పష్టం చేసింది. నిర్దోషిగా తేలిన నాటి నుంచి సర్వీసులో చేరేంత వరకు అన్ని ప్రయోజనాలకు అర్హుడని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ వెణుతురుమిల్లి గోపాలకృష్ణారావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. దీంతో సర్వీసు నుంచి తొలగింపునకు గురైన 28 ఏళ్లకు ఖాసిం తిరిగి ఉద్యోగంలో చేరుతున్నారు. రూ.69 వేల దుర్వినియోగం ఆరోపణలు నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో టైపిస్ట్ డి.ఖాసిం సాహెబ్ ఇతర ఉద్యోగుల సంతకాలు ఫోర్జరీ చేసి డూప్లికేట్ రసీదులతో రూ.69 వేల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 1988లో స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఖాసిం దుర్వినియోగానికి పాల్పడినట్లు శాఖాపరమైన విచారణలో తేలింది. దీంతో 1995లో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఇదిలా ఉండగానే ఖాసింపై పోలీసులు నమోదు చేసిన కేసును నందికొట్కూరు జూనియర్ ఫస్ట్ క్లాజ్ మేజిస్ట్రేట్ కోర్టు 1997లో కొట్టివేసింది. దీనిపై పోలీసులు హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయగా, దానిని హైకోర్టు 1998లో కొట్టేసింది. ఈ నేపథ్యంలో తనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ మార్కెట్ కమిటీ పర్సన్ ఇన్చార్జి ఇచ్చిన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ ఖాసిం 2001లో ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ)లో పిటిషన్ వేశారు. ఖాసిం రెండున్నరేళ్లు జాప్యం చేశారన్న కారణంతో అతని పిటిషన్ను 2003లో పరిపాలన ట్రిబ్యునల్ కొట్టేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ 2003లో ఖాసిం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపి, తీర్పు వెలువరించింది. -
సారీ.. సారా
వెంకటనగరం వంటి ఆదర్శ గ్రామాలెన్నో.. ప్రభుత్వ యంత్రాంగం కృషితో రాజమండ్రి సమీపంలోని వెంకటనగరం గ్రామం పూర్తి సారా రహిత గ్రామంగా మారింది. ఈ గ్రామం ఒకప్పుడు నాటుసారాకు అడ్డాగా ఉండేది. 741 కుటుంబాలున్న ఆ గ్రామంలో 55 కుటుంబాలు నాటుసారా తయారీనే ఉపాధి మార్గంగా ఎంచుకున్నాయి. 30 ఏళ్లకు పైగా సారా తయారీ, విక్రయాలు చేసిన వీరిలో మూడున్నరేళ్లుగా మార్పు మొదలైంది. ఎస్ఈబీ పరివర్తన–2 కార్యక్రమంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తోడుకావడంతో గతేడాది ఏప్రిల్ నుంచి సారా రహిత గ్రామంగా మార్పుచెందింది. నిజానికి.. రాష్ట్రంలో నాటుసారా స్థావరాలకు తూర్పుగోదావరి జిల్లా పెట్టింది పేరు. గోకవరం, రాజానగరం, గండేపల్లి, కాతేరు, రామవరం, శాటిలైట్ సిటీ, కోరుకొండ, సీతానగరం వంటి 240 గ్రామాల్లో నాటుసారా ఏరులై పారేది. దీని నియంత్రణకు ప్రభుత్వం ‘పరివర్తన 2.0’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలుచేసింది. దీంతో పది గ్రామాలు మినహా 230 గ్రామాలు ఇప్పుడు సారాకు టాటా చెప్పి సంక్షేమబాట పట్టాయి. ప్రభుత్వ తోడ్పాటుతో స్వయం ఉపాధి మరోవైపు.. సామాజిక రుగ్మతగా మారిన సారాపై ప్రభుత్వం సంధించిన సంక్షేమాస్త్రం మంచి ఫలితాలిస్తోంది. మూడు దశాబ్దాల పూర్వం నుంచి ‘తూర్పు’న సాగిన సారా ప్రవాహానికి మూడున్నరేళ్లలో అడ్డుకట్ట పడటంతో ఆ గ్రామాల్లో గణనీయమైన మార్పు కన్పిస్తోంది. సారా మహమ్మారి నుంచి బయటపడిన అనేక కుటుంబాల స్వయం ఉపాధికి ప్రభు త్వం ఊతమిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ‘నవరత్నాలు’ ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో అందుతున్నాయి. దీనికితోడు డీఆర్డీఏ, మెప్మా, పరిశ్రమల శాఖలు కూడా అనేక కార్యక్రమాల ద్వారా వారిని ఆదుకుంటున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత పలు శాఖలను సమన్వయంతో వారి జీవనోపాధికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 128 కుటుంబాలకు రూ.1.47 కోట్ల సబ్సిడీ రుణాలు అందించారు. ఫలితంగా.. వారు గేదెలు, కోళ్ల పెంపకం, కిరాణా, పాన్షాప్, హోటల్ వంటి వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పరిశ్రమల శాఖ ద్వారా చిన్న తరహా యూనిట్ల ఏర్పాటు నిమిత్తం 27 మంది లబ్ధిదారులకు రూ.1.01కోట్లు మంజూరు చేశారు. వారంతా పేపర్ప్లేట్లు, అప్పడాల తయారీ, ఎంబ్రాయిడరీ వర్క్, సెంట్రింగ్ వర్క్, టెంట్హౌస్, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకున్నారు. ప్రభుత్వ సహకారంతో స్వీటు కొట్టు పెట్టుకున్నా.. ప్రభుత్వం నాకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఆ డబ్బుతో స్వీటు కొట్టు పెట్టుకుని పూతరేకులు విక్రయిస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాను. నా భార్య ప్రమోదకు ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ ఇస్తోంది. అమ్మఒడి కూడా వస్తోంది. నన్ను ఆర్థికంగా ఆదుకుని నా కుటుంబానికి భరోసా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ మేలు ఎప్పటికీ మరిచిపోం. – పల్లి అంబేడ్కర్, మద్దూరులంక గ్రామం కొంతమూరుకు చెందిన సాలా జోగమ్మ కుటుంబం పదేళ్లకు పైగా సారా తయారీ, విక్రయాలపైనే ఆధారపడి బతికేది. ఆమె పెద్ద కొడుకు బలరామ్పై ఏడు కేసులు, చిన్న కొడుకు వెంకన్నపై నాలుగు కేసులు ఉండేవి. సారా తయారీపై వచ్చిన డబ్బులు కేసులు, బెయిల్ ఖర్చులకే సరిపోయేవి. చివరకు ఆ కుటుంబం అప్పులపాలైంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారుల కౌన్సెలింగ్లో సారాకు స్వస్తిపలికి చిన్నబడ్డీ పెట్టుకుని జోగమ్మ జీవిస్తోంది. భర్త శ్రీను, కొడుకు బలరామ్లు పందుల పెంపకంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారిపై ఉన్న సారా కేసులను ఒక్కొక్కటిగా ఎత్తేస్తున్నారు. డ్వాక్రా ద్వారా సాయం అందింది. సారా విక్రయాలు ఆపేసిన తనకు బతుకుదెరువు కోసం అధికారులు రూ.3 లక్షల సాయం అందించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు జోగమ్మ చెప్పింది. కవలగొయ్యికి చెందిన తీగిరెడ్డి శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి సారా విక్రయించేవాడు. చదువుకు స్వస్తిచెప్పి సారా తయారీనే ఉపాధిగా ఎంచుకున్నాడు. అతనిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఎన్నిసార్లు పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పులేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సారాపై ప్రధాన దృష్టిసారించి ‘పరివర్తన’ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో సారా తయారీ, విక్రయాలకు శ్రీనివాస్ స్వస్తి పలికాడు. ప్రభుత్వం అందించిన రూ.50వేల సాయంతో టిఫిన్ బండి పెట్టుకుని గౌరవంగా జీవిస్తున్నాడు. అతని భార్య గంగాభవానీకి ప్రభుత్వం రూ.5 లక్షలు (రూ.1.50లక్షలు సబ్సిడీ) లోను ఇవ్వడంతో టైలరింగ్ చేసుకుంటోంది. అంతేకాదు.. డ్వాక్రాలో ఉన్న ఆమెకు ఏటా రూ.10వేలు ప్రభుత్వ సాయంతోపాటు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున అందుకుంటోంది. వీరి కుమారులకు జగనన్న విద్యా దీవెన, విద్యా కానుకలు మూడేళ్లుగా అందుతున్నాయి. ఇలా.. సర్కారు అందిస్తున్న సంక్షేమంతో శ్రీనివాస్ సారాకు సారీ చెప్పేశాడు. వీరే కాదు.. వెంకటనగరం గ్రామానికి చెందిన గుమ్మడి నాగరాజు (నాని) పది గేదెలను పెంచుతూ పాలవ్యాపారం చేస్తున్నాడు.. ♦ అదే గ్రామానికి చెందిన మగ్గం రాంబాబు తాపీ పనికి, వెళ్తున్నాడు.. ♦ రాజమండ్రి రాజీవ్ గృహకల్ప శాటిలైట్ సిటీకి చెందిన మార్గాని వీర్రాజు హోటల్ నిర్వహించి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. ♦ శాటిలైట్ సిటీ ‘బీ–బ్లాక్’కు చెందిన బచ్చు అంజిబాబు కిరాణా, కిళ్లీ షాపుతోపాటు కోళ్ల పెంపకం చేపట్టి స్వయం ఉపాధి పొందుతున్నాడు.. ♦ లాలా చెరువు కాలనీకి చెందిన గరుగుమిల్లి శ్రీనివాసరావు రెండు గేదెలు, ఆవులు, 40 కోళ్లను పెంచుతూ నెలకు దాదాపు రూ.40వేలు సంపాదిస్తున్నాడు.. ♦ రాజీవ్ గృహకల్ప నివాసి పసల సూర్యచంద్రరావు పాన్షాపు నిర్వహిస్తూ గౌరవంగా జీవిస్తున్నాడు. ♦ ఇలా అనేకమంది నాటుసారా విష వలయం నుంచి బయటకొచ్చి స్వయం ఉపాధితో ఆనందంగా జీవిస్తున్నారు. - తూర్పుగోదావరి నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు -
Andhra Pradesh: మహిళే మహారాణి
అమ్మ కడుపులోని బిడ్డ మొదలు.. చేతలుడిగిన అవ్వ వరకు.. ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి అందుకు తగ్గ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి.. దాదాపు ప్రతి పథకంలోనూ వారినే లబ్దిదారులుగా గుర్తించి అడుగులు ముందుకు వేస్తోంది. చిన్న చిన్న వ్యాపారాలతో లక్షలాది మందికి శాశ్వత ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంది. ఫలితంగా నాలుగేళ్లలో మహిళా సాధికారత ఏ మేరకు సాధ్యమైందో ఊరూరా కళ్లెదుటే కనిపిస్తోంది. ప్రతి ఇంట్లోనూ మహిళలకు గౌరవం పెరిగింది. సాక్షి, అమరావతి : ఎక్కడ మహిళలకు గౌరవం దక్కుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న నానుడిని నిజం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళామణులకు అగ్ర తాంబూలం ఇస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలోని మహిళలు ప్రగతిబాటలో పయనిస్తున్నారు. మహోన్నతంగా మహిళా సంక్షేమం అమలవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తోంది. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్లోనే ఆవిర్భవించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో మహిళలే కేంద్ర బింధువుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నవరత్నాలు వంటి అనేక పథకాల్లో 90 శాతం పైగా మహిళలే లబ్దిదారులున్నారు. తద్వారా ప్రతి ఇంటిలో మహిళకు అత్యంత ప్రాధాన్యత పెరగడానికి ప్రభుత్వం దోహదం చేస్తోంది. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, సున్నా వడ్డీ, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, కళ్యాణమస్తు, ఇళ్ల పట్టాలు.. ఇలా అన్ని పథకాల లబ్ధి అక్కచెల్లెమ్మలకే దక్కుతుండటం గమనార్హం. వృద్ధాప్య, వితంతు పింఛన్లు, మహిళల రక్షణ కోసం దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు లాంటి ఎన్నో కార్యక్రమాలు కచ్చి తత్వంతో అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల దశ, దిశ మార్చిన పథకాల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. కళ్లెదుటే రాజకీయ సాధికారత ♦ ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారతలో సాధించిన అద్భుతాలు గమనిస్తే దేశంలో మరే రాష్ట్రం మనకు సాటిలేదని గర్వంగా చెప్పొచ్చు. రాజకీయ సాధికారత విషయమే తీసుకుంటే.. దేశ వ్యాప్తంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని 1993 నుంచి పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ బిల్లు చర్చకు వచ్చి న దాఖలాలు లేవు. ♦ కానీ, రాష్ట్రంలో ఏ డిమాండ్లు, ఉద్యమాలు లేకపోయినా వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత ఎవరూ అడగకుండానే పదవుల్లో మహిళలకు సమున్నత వాటా దక్కింది. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో మహిళలకే 50 శాతం కేటాయించేలా ఏకంగా చట్టం చేసిన సీఎం వైఎస్ జగన్ దేశానికి ఆదర్శంగా నిలిచారు. ♦ నామినేటెడ్ పదవుల్లో 51 శాతంపైగా పదవులు ఇచ్చి న తొలి ప్రభుత్వం వైస్ జగన్ ప్రభుత్వమే. గ్రామాల్లో వార్డు మెంబర్, పట్టణాల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ దగ్గర్నుంచి రాష్ట్ర మంత్రి వరకు మహిళలకు పెద్దపీట వేయడం దేశంలోనే రికార్డు. ♦ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసనమండలి వైస్ చైర్మన్గా జకియా ఖానంను నియమించారు. రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్నిని నియమించారు. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్గా వాసిరెడ్డి పద్మ, సభ్యుల నియామకం ద్వారా మహిళల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని చాటారు. ♦ గతంలో మహిళలకు తొలిసారిగా హోం మంత్రి ఇచ్చి న ఘనత దివంగత సీఎం వైఎస్సార్దే. ఆ తర్వాత ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్.. మరో రెండడుగులు ముందుకు వేస్తూ రాష్ట్ర హోం మంత్రిగా దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరితతో పాటు తొలి మంత్రివర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణిని, మలి విడతలో రాష్ట్ర హోం మంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనితతోపాటు మరో ముగ్గురు మహిళలకు కీలక మంత్రి పదవులు అప్పగించారు. ♦ రాష్ట్రంలో 13 జడ్పీ చైర్మన్ పదవుల్లో ఏడుగురు.. 26 జడ్పీ వైస్చైర్మన్ పదవుల్లో 15 మంది మహిళలే. 12 మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా 36 పదవుల్లో 18 మంది మహిళలే ఎన్నికయ్యేలా చేశారు. స్థానిక సంస్థల నుంచి నామినేటెడ్ పదవుల్లోను మహిళలకు అగ్రపీఠం దక్కింది. దాదాపు 2.60 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 51 శాతం మహిళలే ఉండటం గమనార్హం. సున్నా వడ్డీ పథకానికి మళ్లీ జీవం ♦ గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థల అధిక వడ్డీ ఆగడాల నుంచి మహిళలను ఆదుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పావలా వడ్డీ పథకాన్ని తొలిసారి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారింది. పొదుపు సంఘాల పేరుతో బ్యాంకు నుంచి తీసుకునే రుణం సకాలంలో చెల్లించే మహిళలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వమే బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. ♦ 2014 తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ పథకానికి నిధులు విడుదల చేయడం ఆపేశారు. దాంతో పొదుపు సంఘాల మహిళలపై కొత్తగా వడ్డీ భారం పడింది. తద్వారా సుమారు 18.36 శాతం పొదుపు సంఘాలు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మిగిలిపోయాయి. అప్పటి దాకా బాగా నడుస్తున్న ‘ఎ’ కేటగిరిలో ఉండే సంఘాలు కూడా ‘సి’, ‘డి’ గ్రేడ్లలోకి పడిపోయాయి. ♦ 2019లో అధికారంలోకి వచ్చి న సీఎం వైఎస్ జగన్.. సున్నా వడ్డీ పథకానికి తిరిగి జీవం పోశారు. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలకు చెందిన 1,02,16,410 ఖాతాల రుణాలకు సంబంధించి బ్యాంకులకు ప్రభుత్వం వడ్డీ రూపేణా రూ.3,615.28 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం 99.6 శాతానికి పైగా పొదుపు సంఘాలు తిరిగి ‘ఎ’ గ్రేడ్లో చేరాయి. ఆసరాతో కొండంత భరోసా ♦ గత చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత హామీలతో అప్పుల పాలైన పొదుపు సంఘాల మహిళలను ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా సీఎం వైఎస్ జగన్ ఆదుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి మహిళా స్వయం సహాయక సంఘాల పేరిట ఉండే బ్యాంకు రుణం మొత్తాన్ని ఈ పథకం కింద నాలుగు విడతల్లో ఆయా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ♦ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) వివరాల ప్రకారం ఎన్నికలు జరిగిన ఆ తేదీ నాటికి రాష్ట్రంలో 7.97 లక్షల పొదుపు సంఘాల పేరిట రూ.25,517 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయా పొదుపు సంఘాలకు చెందిన 78,94,169 మందికి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ప్రభుత్వం రూ.19,178.17 కోట్ల లబ్ధి చేకూర్చింది. శాశ్వత ఉపాధికి ‘చేయూత’ ♦ రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు సైతం ఆర్థిక దన్ను కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం ప్రవేశపెట్టింది. అర్హులైన లబ్ధిదారులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 26,39,703 మంది మహిళలకు రూ.14,129.12 కోట్లు అందించింది. ♦ మహిళలకు శాశ్వత జీవనోపాధి కలిగేలా అమూల్, హిందూస్థాన్ యూనీ లీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబుల్, రిలయెన్స్ రిటైల్, అజియో బిజినెస్ వంటి సంస్థలతో ఒప్పందం కుదిర్చింది. ఆయా మల్టీ నేషనల్ సంస్థల సహకారం, ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో రాష్ట్రంలో 5,28,662 కుటుంబాలు వివిధ రకాల వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకొని శాశ్వత జీవనోపా«ధి పొందుతున్నాయి. వైఎస్సార్ సంపూర్ణ పోషణ.. జగనన్న గోరుముద్ద ♦ రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా గర్భిణులు, బాలింతలకు మంచి ఆహారం అందిస్తున్నారు. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు, అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి విద్యతోపాటు వారికి అవసరమైన బలమైన ఆహారం, వైద్యం అందిస్తున్నారు. వారికి ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నారు. ♦ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంలో 43,26,782 మందికి రూ.3,590 కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకానికి గత ప్రభుత్వ హయాంలో ఏటా కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం ఏటా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. బడికెళ్లే పిల్లలకు జగనన్న గోరుముద్ద పథకం ద్వారా బలమైన ఆహారాన్ని అందిస్తున్నారు. లక్షాధికారి అవుతున్న పేదింటి మహిళ ♦ సొంతిల్లు అనేది సామాన్య, నిరుపేద ప్రజల కల. సీఎం జగన్ ఈ స్వప్నం నెరవేర్చే మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో 30,76,675 మందికి రూ.75,670.05 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అంతటితో ఆగకుండా ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని మహా యజ్ఞంలా చేపట్టారు. ఇప్పటి వరకు 21,31,564 మంది ఇళ్ల నిర్మాణానికి రూ.9,151.79 కోట్లు ఖర్చు చేశారు. ♦ మరోవైపు వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదలపై భారం వేయకుండా కనీస మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తోంది. ఒక్కో మహిళకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన ఇంటిని ప్రభుత్వం అందించడం ద్వారా పేదింటి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతోంది. మొత్తంగా రాష్ట్రంలోని 31 లక్షల మంది మహిళలకు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను సమకూరుస్తున్నారు. ♦ వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా దేశంలోనే తొలిసారిగా పేద ఓసీ మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు 4,38,088 మంది ఈ వర్గం నిరుపేద అక్క చెల్లెమ్మలకు రూ.1,257.04 కోట్లు అందించారు. కాపు నేస్తం, లా నేస్తం వంటి అనేక పథకాల్లోనూ ఓసీ మహిళలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేలు చేస్తోంది. ♦ పేద తల్లిదండ్రులు తమ ఆడబిడ్డ పెళ్లి చేయడానికి పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు 16,668 మంది ఆడబిడ్డల తల్లుల ఖాతాల్లో రూ.125.50 కోట్లు జమ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కారి్మకులకు ఈ పథకాలను వర్తింపజేయడం ద్వారా ఆ వర్గాల్లో సంతోషం నింపారు. అమ్మ ఒడి.. చదువులమ్మ గుడి ♦ ప్రతి తల్లి తన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆకాంక్షిస్తుంది. అటువంటి తల్లుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రతి దశలో విద్యార్థుల చదువుల భారం తల్లిదండ్రులపై పడకుండా మొత్తం ప్రభుత్వమే భరించేలా పథకాలు అమలు చేస్తున్నారు. ♦ మూడేళ్ల వయసులో అంగన్వాడీ కేంద్రానికి వచ్చే దశ నుంచి పాఠశాల విద్య, ఇంటర్ విద్య, ఉన్నత విద్యను పూర్తి చేసుకొనే వరకు పేద వర్గాల కుటుంబాల్లోని పిల్లల చదువులకు అయ్యే మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా పలు పథకాలు ప్రవేశపెట్టారు. పాఠశాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేందుకు వీలుగా 8వ తరగతిలోకి వచ్చే పిల్లలకు ప్రతి ఏటా ఉచితంగా ప్రభుత్వం ట్యాబులు అందిస్తోంది. ♦ ఈ నాలుగేళ్లలో జగనన్న అమ్మ ఒడి ద్వారా 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ.19,674.34 కోట్లు జమ చేశారు. జగనన్న వసతి దీవెన ద్వారా 25,17,245 మందికి రూ.4,275.76 కోట్లు ఖర్చు చేశారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 26,98,728 మందికి రూ.10,636.67 కోట్లు లబ్ధి చేకూర్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 1,858 మందికి రూ.132.41 కోట్లు ఇచ్చారు. -
ప్రపంచ దేశాల్లో భారత్లో సగటు జీతం, నిరుద్యోగ శాతం ఎంతో తెలుసా?
అవునూ.. మీ జీతమెంత? ఎందుకంటే.. ప్రపంచంలో వివిధ దేశాల ప్రజల సగటు జీతం ఎంత అన్న దానిపై వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఒక నివేదిక రూపొందించింది.. దీని ప్రకారం ప్రపంచంలోని 23 దేశాల్లో సగటు జీతం లక్ష రూపాయల కన్నా ఎక్కువగా ఉందట. 104 దేశాల్లో సర్వే చేయగా.. టాప్లో స్విట్జర్లాండ్ (రూ.4,98,567) ఉండగా.. అట్టడుగున పాకిస్థాన్ (రూ. 11,858) ఉంది. మరి మన పరిస్థితి ఏమిటనా.. భారత్తో సగటు జీతం రూ.46,861. ఆయా దేశాల్లో ఉద్యోగుల కనిష్ట వేతనం, గరిష్ట వేతనాన్ని పరిగణనలోకి తీసుకొని.. ఈ సగటు వేతనాన్ని నిర్ధారించారు. జీతాల సంగతి చెప్పుకున్నాం.. ఇప్పుడు అసలు జీతాలే రాని వారి గురించి చెప్పుకుందాం.. అదేనండీ నిరుద్యోగుల గురించి.. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత శాతాన్ని చూస్తే.. నైజీరియాలో ఇది ఎక్కువగా ఉంది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఖతార్లో ఇది అత్యల్పంగా ఉంది. పలు దేశాల్లో నిరుద్యోగిత శాతం సంగతి ఓసారి చూస్తే.. చదవండి: విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్ట్పై లైంగిక వేధింపులు -
ఉపాధికి రక్షణ కవచం!
సాక్షి, అమరావతి : పారిశ్రామికంగా రాష్ట్రం శరవేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఓ వైపు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు.. మరో వైపు సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)లు, వాటిలో భారీ పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వీటికి అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా లక్షల సంఖ్యలో యువతకు ఉపాధి మార్గాలు చేరువ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా పాల సముద్రం వద్ద 914 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్ పనులు వేగం అందుకున్నాయి. ఐదు దశల్లో ఈ యూనిట్ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తొలి దశలో రూ.384 కోట్లతో అభివృద్ధికి బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలో జరిగే బోర్డు సమావేశంలో మిగిలిన దశలకు సంబంధించి ఆమోదం లభించనుందని బీఈఎల్ అధికారులు తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్లో రాడార్, మిసైల్, సబ్మెరైన్లకు సంబంధించిన పరికరాలను అభివృద్ధి చేయడమే కాకుండా వీటిని పరీక్షించేలా టెస్టింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశకు సంబంధించి క్షిపణుల అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతులను రూ.148 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. బిడ్ దక్కించుకున్న సంస్థ క్షిపణుల తయారీకి సంబంధించి మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, ప్రీ ఇంజనీర్డ్ బిల్డ్లతో పాటు ఒక ఫ్యాక్టరీకి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు విద్యుత్, నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వరద నీటి కాల్వలు, అంతర్గత రహదారులు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాలు వంటి వాటిని సమకూర్చాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు మే 23లోగా బిడ్లను దాఖలు చేయాలని కోరింది. ఇప్పటికే ఈ 914 ఎకరాల చుట్టూ సుమారు రూ.50 కోట్లతో ప్రహరీ నిర్మించింది. గోడ చుట్టూ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా, సొంత అవసరాల కోసం సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఏపీఐఐసీ అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. చకచకా అనుమతులు గత ప్రభుత్వ అసమర్థ నిర్వాకానికి బీఈఎల్ ప్రాజెక్టు ఒక ఉదాహరణ. అత్యంత ప్రతిష్టాత్మకమైన క్షిపణులు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి 2016లోనే బీఈఎల్ ముందుకు రాగా, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు తేవడంలో అప్పటి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి, త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోపక్క యూనిట్ పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు, పెనాల్టీ విధిస్తామంటూ బీఈఎల్కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఈఎల్ కొంత సమయం ఇవ్వాలని, పెనాల్టిలు రద్దు చేయాలని కోరింది. గతంలో కంటే పెద్ద యూనిట్ ఏర్పాటు చేసేలా, కొత్తగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏపీఐఐసీ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో బీఈఎల్ కూడా యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టింది. నిధులు కూడా కేటాయించింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీఈఎల్ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం బీఈఎల్ కార్యాలయంలో ప్రత్యేకంగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసి, తొలి దశలో రూ.384 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయితే 2025 నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. డిఫెన్స్ హబ్గా ఏపీ దేశ రక్షణ అవసరాల తయారీ హబ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. ఇప్పటికే కేంద్ర రక్షణ సంస్థ 914 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్ అభివృద్ధి చేస్తుండగా ఏపీఐఐసీ కూడా 1,200 ఎకరాల్లో ఏపీ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ ఎల్రక్టానిక్స్ (ఏపీ–ఏడీఈ) పార్క్ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో జరిగే ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో శ్రీ సత్యసాయి జిల్లాతోపాటు రాష్ట్రం రక్షణ రంగ ఉత్పత్తులకు తయారీ కేంద్రంగా తయారవుతుందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో ప్రత్యక్షంగా 2,800 మందికి, పరోక్షంగా 8,000 మంది వరకు ఉపాధి లభిస్తుంది. యాంకర్ యూనిట్గా బీఈఎల్ భారీ ప్రాజెక్టును చేపడుతుండటంతో అనేక అనుబంధ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కానున్నాయి. -
అరవైలో అల్లికలు
అభిరుచి ఏ వయసులోనైనా మనకు ఆదాయ వనరుగా మారవచ్చు. గుర్తింపును తీసుకురావచ్చు. ఈ మాటను ‘లక్ష’రాల నిజం చేసి చూపుతోంది ఆరు పదుల వయసులో ఉన్న కంచన్ భదానీ అనే గృహిణి. జార్ఖండ్ రాష్ట్రంలో ఉండే కంచన్ ఏడాది క్రితం వరకు గృహిణి. ఇప్పుడు వ్యాపారవేత్తగా మారింది. అదీ తనకు బాగా నచ్చిన అల్లికల బొమ్మలతో. యేడాదిలోనే రూ.14 లక్షల రూపాయలు సంపాదించడమే కాకుండా, యాభై మంది గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తూ తన సత్తా ఏంటో నిరూపించింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న కంచన్కు వచ్చిన ఈ ఆలోచన గురించి ఎవరైనా అడిగితే ఎన్నో విషయాలు వెలిబుచ్చుతుంది. ‘‘వస్త్ర పరిశ్రమ ఎంతో వేగవంతంగా మారిపోతోంది. అయినా ఇప్పటికీ ఇళ్లలో చేతితో కుట్టే ఎంబ్రాయిడరీకి, అల్లిన వస్తువులకు ఎనలేనంత డిమాండ్ ఉంది. ఒకప్పుడు తల్లులు, అమ్మమ్మలు చాలా సాధారణంగా రోజువారీ ఇంటి పనులు పూర్తి చేసిన తర్వాత టేబుల్ క్లాత్లు, సోఫా కవర్లు, బొమ్మల వరకు అనేక అలంకార వస్తువులను తయారుచేసేవారు. అలాంటి వస్తువులు కాలక్రమంలో తగ్గిపోతున్నాయి. ఇది గమనించే 2021లో ‘లూప్హూప్’ పేరుతో క్రోచెట్ బొమ్మల యూనిట్ను స్టార్ట్ చేశాను. దీనికి ముందు 50 మంది గిరిజన మహిళలకు క్రోచెట్ కళలో శిక్షణ ఇచ్చి, వారికి వర్క్స్ ఇస్తుండేదాన్ని. కోల్కతాలో పుట్టిన పెరిగిన నేను మా అమ్మమ్మ, అత్తలు తయారుచేసే క్రోచెట్ బొమ్మలు, టేబుల్ క్లాత్ తయారు చేయడం చూసి నేర్చుకున్నాను. ఆ రోజుల్లో ప్రతి ఆడపిల్లకు కుట్లు, అల్లికలు నేర్పేవారు. ► స్కూల్లోనూ నైపుణ్యం.. ఇంట్లోనే కాదు, స్కూల్లోనూ క్రోచెట్ వస్తువుల తయారీలో శిక్షణ ఉండేది. దీంతో ప్రాక్టీస్ బాగా అయ్యింది. పెళ్లయ్యాక పట్టణప్రాంతానికి వెళ్లాల్సి రావడం, బాధ్యతలు పెరగడంతో పై చదువులకు వెళ్లలేకపోయాను. కానీ, వచ్చిన క్రోచెట్ కళను ఇష్టంగా చేస్తుండేదాన్ని. మా వారి ఉద్యోగరీత్యా మేం జార్ఖండ్లోని జుమ్రీ తెలయాకు మారినప్పుడు అక్కడ గిరిజన స్త్రీలను చూశాను. వారు గనులలో పనులు చేసేవారు. రోజువారి కూలీ ఏ మాత్రం వారికి సరిపోదు. వారి బాధలను చూసి, ఏదైనా మార్పు తీసుకురాగలిగితే బాగుంటుందని ఆలోచించేదాన్ని. ఏదైనా చేస్తాను అనుకుంటాను, కానీ, ఏం చేయాలో కచ్చితంగా తెలిసేది కాదు. ► కుటుంబ బాధ్యతలలో.. ముగ్గురు పిల్లల తల్లిగా నాకు ఇంటి బాధ్యతలు ఎక్కువే ఉండేవి. ఎప్పుడూ తీరికలేకుండా ఉండేదాన్ని. దీంతో నా సామాజిక ఆకాంక్షలపై దృష్టి పెట్టలేకపోయేదాన్ని. పిల్లలు పెద్దయ్యి, వారి జీవితాల్లో స్థిరపడ్డాక నా అభిరుచిని కొనసాగించాలనే ఆలోచన పెరిగింది. క్రోచెట్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న మహిళలకు అప్పుడప్పుడు క్లాసులు తీసుకునేదాన్ని. 2021లో మా పిల్లలతో కూర్చొని చర్చిస్తున్నప్పుడు ఈ క్రోచెట్ బొమ్మల తయారీ పెద్ద ఎత్తున చేసి, అమ్మకాలు జరిపితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ► సోషల్ మీడియాలో.. క్రోచెట్ బొమ్మల అమ్మకాలను ఆన్లైన్ ద్వారా చేయాలనే ఆలోచనతో వెబ్సైట్, సోషల్ మీడియా సెటప్స్కి మా పిల్లలు సాయం చేశారు. నేను గిరిజన మహిళలకు క్రొచెట్ వర్క్ నేర్పిస్తూ, వారితో ఈ బొమ్మలను తయారుచేయిస్తుంటాను. యాభై మంది గిరిజన మహిళలు తమ ఇళ్ల వద్దే ఉంటూ సౌకర్యంగా ఈ పనులు చేస్తుంటారు. నా దగ్గర కావల్సిన మెటీరియల్ తీసుకెళ్లి, బొమ్మలతో వస్తారు. ఒక్కొక్కరు రోజుకు 2–3 గంటల క్రోచెట్ అల్లిక చేస్తే నెలకు ఐదు వేల రూపాయలు వస్తాయి. మా జట్టులో ఉండే కొందరు నెలలో 30 బొమ్మలకు పైగా చేస్తారు. దీంతో ఇంకొంత ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా ఏడాది కాలంలో మూడు వేల బొమ్మలను అమ్మగలిగాను. పద్నాలుగు లక్షల రూపాయలు సంపాదించగలిగాను. చదువుకునే పిల్లలు, తీరిక ఉండే గృహిణుల్ని ఈ పనిని ఎంచుకుంటున్నారు. ► మృదువైన బొమ్మలు తాబేళ్లు, కుందేళ్లు, ఆక్టోపస్లు, ఏనుగులు, మనుషుల బొమ్మలు వీటిలో ప్రధానంగా ఉంటాయి. వెబ్సైట్, సోషల్మీడియా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్ఫారమ్లలోనూ ఈ బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. ఏ పదార్థాలనూ వృథా చేయకుండా ఉన్నితో వీటిని తయారుచేస్తాం. పసిపిల్లలు వీటితో ఆడుకోవడం చాలా ఇష్టపడతారు. ఆదివాసీ సమాజం కోసం ఏదైనా చేయాలన్న నా కల ఇలా తీరడం సంతోషంగా ఉంది. ఏదైనా పనిని ప్రారంభించడానికి అభిరుచి ఉండాలి కానీ, వయసుపైబడటం ముఖ్యం కాదని నమ్ముతున్నాను’’ అని వివరిస్తుంది కంచన్. -
Meeta Sharma: ఆటలు ఆడు కన్నా
చీప్ ప్లాస్టిక్. చైనా ప్లాస్టిక్. ఇవాళ పిల్లల బొమ్మలు వీటితోనే దొరుకుతున్నాయి. కళాత్మకమైన దేశీయమైన చెక్కతో తయారైన బొమ్మలు పిల్లలకు ఉండాలి అని బొమ్మల కేంద్రం ప్రారంభించింది మీతా శర్మ. హార్వర్డ్లో చదువుకున్నా తన ఇద్దరు పిల్లలు ఆడుతున్న బొమ్మలను చూశాక ఆమె ఈ పని మొదలెట్టింది. ఇవాళ నెలకు వెయ్యి అర్డర్లు వస్తున్నాయి. 100 మంది బొమ్మల కళాకారులు ఉపాధి పొందుతున్నారు. పిల్లలు ఆమె బొమ్మలతో చక్కగా ఆడుకుంటున్నారు. ఈసప్ కథల్లో ‘కాకి దప్పిక’ కథ పిల్లలందరికీ చెబుతారు. దప్పికగొన్న కాకి కుండలో నీళ్లను తాగడానికి ప్రయత్నించి, అవి అందకపోతే నాలుగు రాళ్లు జారవిడిచి, నీళ్లు పైకి తేలాక తాగుతుంది. ఆ విధంగా ఆ కథ అవసరం అయినప్పుడు యుక్తిని ఎలా పాటించాలో పిల్లలకు చెబుతుంది. ఈ కథ యూట్యూబ్లో వీడియో గా సులభంగా దొరుకుతుంది. కాని మీతా శర్మ తయారు చేసే బొమ్మల్లో ఇదే కథ మొత్తం బుజ్జి బుజ్జి చెక్క బొమ్మల సెట్టుగా దొరుకుతుంది. పిల్లలను ఉద్రేక పరిచే ఆటబొమ్మల కంటే ఇలాంటి బొమ్మలే అవసరం అంటుంది ‘షుమి’ అనే బొమ్మల సంస్థను సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్న మీతా శర్మ. కంప్యూటర్ ఇంజనీర్ మీతా శర్మది ఢిల్లీ. అక్కడే ఐఐటీ లో బిటెక్ చేసింది. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసింది. వివాహం అయ్యాక అమెరికాలోనే జీవితం మొదలెట్టింది. ‘మా పెద్దాడు పుట్టాక అమెరికాలో క్వాలిటీ బొమ్మలు కొనిచ్చాను ఆడుకోవడానికి. అవన్నీ ఎకో ఫ్రెండ్లీ కొయ్యబొమ్మలు. పాడు కావు. హాని చేయవు. 2012 లో అమెరికా వద్దనుకుని ఇండియా వచ్చాక నాకు సమస్య ఎదురైంది. అప్పటికి నా రెండో కొడుక్కి రెండేళ్లు. ఇక్కడ వాడికి ఇద్దామంటే మంచి బొమ్మలే లేవు. అన్నీ ప్లాస్టిక్వి లేదా గాడ్జెట్స్, అమెరికన్ కామిక్స్లో ఉన్న కేరెక్టర్... ఇవే ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ పిల్లలు నోటిలో పెట్టుకుంటే ప్రమాదం. మన చిన్నప్పుడు చెక్కతో తయారు చేసిన బుజ్జి బుజ్జి బొమ్మలు ఎంతో బాగుండేవి. అలాంటి బొమ్మలకోసం ఎంత వెతికినా దొరకడం లేదు. కొన్నిచోట్ల సంప్రదాయ బొమ్మలు ఉన్నాయి కాని వాటి మార్కెటింగ్ సరిగా లేదు. అందుకని నాకే ఒక బొమ్మల తయారీ సంస్థ ఎందుకు మొదలెట్టకూడదు అనిపించింది. 2016లో షుమి సంస్థను స్థాపించాను’ అని తెలిపింది మీతా శర్మ. వేప, మామిడి కలపతో ‘నిజానికి సంస్థ స్థాపించడానికి పెట్టుబడి దొరకలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ పిల్లల గేమ్స్ తయారు చేసే సంస్థలనే ప్రోత్సహించేవి. నా దారేమో సంప్రదాయ కలప బొమ్మల దారి. అందుకే సొంత పెట్టుబడితో సంస్థను స్థాపించాను. బొమ్మలు చేసే కళకారులను సంప్రదించి కేవలం వేప, మామిడి కలపతో ముద్దొచ్చే బొమ్మలను ముఖ్యంగా రెండేళ్ల వయసున్న పిల్లల కోసం ఎక్కువ గా ఆ తర్వాత పదేళ్ల లోపున్న పిల్లలకోసం బొమ్మలను తయారు చేయించాను. వాటికి ఉపయోగించే రంగులు కూడా రసాయనాలు లేనివే’ అంది మీతా శర్మ. ఢిల్లీలో తన సంస్థను స్థాపించాక రకరకాల కొయ్యగుర్రాలను, మూడు చక్రాల తోపుడు బండ్లను, బుజ్జి గుడారాలను, పిల్లలు ఆడే వంట సామగ్రిని, వారికి కొద్దిపాటి లెక్కలు నేర్పే ఆట వస్తువులను, కథలను బొమ్మల్లో చెప్పే సెట్లను ఇలా తయారు చేయించింది.‘ఆన్లైన్లో మాకు ఆర్డర్లు వచ్చేవి. చాలామంది తల్లులు ఆ బొమ్మలతో ఐడెంటిఫై అయ్యారు. ఎందుకంటే వారంతా బాల్యంలో అలాంటి బొమ్మలతోనే ఆడారు కనుక. తమ పిల్లలకు సరిగ్గా అలాంటివే దొరకడంతో వారి ఆనందానికి హద్దులు లేవు’ అని చెప్పిందామె. ఇప్పుడు మీతా తయారు చేయిస్తున్న బొమ్మలు అమెరికా, యు.కె, సింగపూర్కు కూడా రవాణా అవుతున్నాయి. నెలలో 8000 ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నాయి. 100 మంది కళాకారులు చేతినిండా పనితో ఉపాధి పొందుతున్నారు. ఆటే పరిశోధన ‘పిల్లల అసలైన పరిశోధన వారు ఆడే ఆటలతోనే మొదలవుతుందని పిల్లల మనస్తత్వ నిపుణులు తెలుపుతారు. పిల్లల్ని పిల్లల్లా ఉంచే ఆటబొమ్మలతో వారిని ఆడనివ్వాలి. హింసాత్మకమైన బొమ్మల నుంచి వారిని దూరం పెట్టాలి. హింసను ప్రేరేపించే గేమ్స్ నుంచి కూడా. పిల్లలు బొమ్మలతో స్నేహం చేసి వాటిని పక్కన పెట్టుకుని భయం లేకుండా నిద్రపోతారు. వారికి బాల్యం నుంచి అలాంటి నిశ్చింతనిచ్చే బొమ్మల వైపుకు నడిపించాలి’ అని సలహా ఇస్తోంది మీతా. ఒక ఉద్యోగిగా కంటే తల్లిగా ప్రయోజనాత్మక అంట్రప్రెన్యూర్గా ఆమె ఎక్కువ సంతృప్తిని, గౌరవాన్ని, ఆదాయాన్ని పొందుతోంది. అదీ విజయమేగా. -
50% రిజర్వేషన్లతో 4వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్ది
-
విదేశాల్లోనూ ఉపాధికి ‘స్కిల్’ శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర యువత విదేశాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ముందడుగు వేసింది. మిడిల్ ఈస్ట్, యూరప్తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, అమెరికా తదితర దేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఇందులో భాగంగా గురువారం తాడేపల్లిలోని ఏపీఎస్ఎస్డీసీ కార్యాలయంలో టీఏకేటీ గ్రూప్తో ఏపీఎస్ఎస్డీసీ, ఏపీఎన్ఆర్టీ ఎస్ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ సత్యనారాయణ, ఏపీఎన్ఆర్టీ ఎస్ సీఈవో వెంకట్ ఎస్ మేడపాటి, టీఏకేటీ గ్రూప్ ఎండీ రాజ్సింగ్ సమక్షంలో పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా వైద్యం, నిర్మాణం, ఆతిథ్య రంగాల్లోని విదేశీ అవకాశాలపై టీఏకేటీ గ్రూప్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. తొలి దశలో జర్మనీలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు 15 మంది నర్సింగ్ అభ్యర్థులను ఇంటర్వూ్యల ద్వారా ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. వీరికి జర్మనీ భాషపై 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. వీసా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రిల్లో జర్మనీకి పంపిస్తారు. అలాగే సీఎం వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు 192 స్కిల్ హబ్స్, 26 స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీఎస్ఎస్డీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. -
‘అమ్మా.. నాకు నౌకరొస్తుంది. మన కష్టాలు తొలగిపోతాయమ్మా’....
‘అమ్మా.. నాకు నౌకరొస్తుంది. మన కష్టాలు తొలగిపోతాయమ్మా’.... భువనగిరికి చెందిన శ్రీశైలం కొద్దికాలం క్రితం తన తల్లికి చెప్పిన మాటలివి. శ్రీశైలం ఎల్ఎల్బీ చదివాడు. టెట్ అర్హతా పొందాడు. అతని తండ్రి సన్నకారు రైతు. అయినా కొడుకు గ్రూప్–1 కోచింగ్ కోసం అప్పు చేసి మరీ డబ్బులు పంపాడు. తమ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందనే నమ్మకం వారిలో ఉండేది. టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన శ్రీశైలంలోనూ ఆ ధైర్యం నెలకొంది. కానీ ఇప్పుడు అతనిలో భయం, ఆందోళన కన్పిస్తున్నాయి. ‘పర్లేదులేయ్యా.. ఇంకేదైనా ఉద్యోగం చూసుకోవచ్చు..’ అని తండ్రి బుజ్జగిస్తుంటే తట్టుకోలేకపోతున్నానంటూ బావురుమన్నాడు. వరంగల్ జిల్లాలో మారుమూల ప్రాంతానికి చెందిన సంజయ్కుమార్ది దయనీయ స్థితి. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. తల్లి కూలీ పని చేస్తోంది. ఆమె కూడా దీర్ఘకాల వ్యాధికి గురైంది. ఆ విషయాన్ని కొడుకు దగ్గర దాచి పెట్టింది. పీజీ చేసిన కొడుకుకు మంచి ఉద్యోగం వస్తుందనేది ఆమె ఆశ. మందులకు వాడాల్సిన సొమ్మును కొడుకు కోచింగ్ కోసం పంపేది. సంజయ్ కూడా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ మరీ గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యాడు. మెయిన్స్ దాకా వచ్చాడు. ప్రిలిమ్స్ పరీక్ష రద్దవ్వడంతో దిగాలుపడ్డాడు. ‘నాకు ఉద్యోగం కాదు.. అమ్మ కష్టం గుర్తుకొస్తోంది’ అంటూ గుండె పగిలేలా ఏడ్చాడు. సాక్షి, హైదరాబాద్: ఎన్నాళ్లగానో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు..షడ్రుచుల ఉగాది ఒట్టి చేదునే పంచుతోంది. వేలాది మంది తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు రద్దు కావడం, వాయిదా పడటం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీక్తో తమ ఏళ్ల తరబడి కష్టం వృథా అయిందంటూ కుమిలిపోతున్నారు. ముఖ్యంగా గ్రూప్–1 కోచింగ్ కోసం చేసిన అప్పులు, కుదవబెట్టిన ఆస్తులు గుర్తుకొచ్చి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అమ్మానాన్నల కలలు చెదిరిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయంటూ తల్లడిల్లిపోతున్నారు. చిన్నా చితక ఉద్యోగాలొదిలిపెట్టి, ఉన్న ఉపాధిని కోల్పోయి.. సర్కారీ కొలువే లక్ష్యంగా కఠోర దీక్ష బూనిన నిరుపేద నిరుద్యోగుల బరువెక్కిన గుండెల్లోంచి ఆవేదన ఉప్పొంగుతోంది. దిగాలు పడ్డ పిల్లలను ఓదార్చేందుకు తమ వద్ద మాటల్లేవంటున్న తల్లిదండ్రుల వ్యథ వర్ణనాతీతంగా ఉంది. అమ్మ పుస్తెను అమ్మేసి ఇస్తున్నా.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నీలేశ్ మాటలు గుండెను పిండేసేలా ఉన్నాయి. ‘30 ఏళ్ల క్రితం మీ అమ్మకు కట్టిన పుస్తె కొడుకా.. అమ్మేసి ఇస్తున్నా. ఉద్యోగం తెచ్చుకో బిడ్డా..’ అంటూ కోచింగ్కు డబ్బులిచ్చేప్పుడు తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ గుక్క తిప్పుకోకుండా ఏడ్చాడు. ఇప్పుడేం చేయాలి? అంటూ నిస్సహాయంగా ప్రశ్నించాడు. ఉపాధి పోయే.. భరోసా కరువాయే ఎమ్మెస్సీ చేసిన ప్రశాంతి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ కాలేజీలో మేథ్స్ లెక్చరర్గా పనిచేస్తూ నెలకు రూ. 50 వేలకు పైనే సంపాదించేది. ప్రభుత్వ నోటిఫికేషన్ల తర్వాత ఉన్న ఉద్యోగం వదిలేసింది. ఏడాదిగా గ్రూప్స్పైనే దృష్టి పెట్టింది. మెయిన్స్కు అర్హత సాధించింది. పరీక్ష రద్దవ్వడంతో ఏమీ పాలుపోని స్థితిలో ఉంది. ఇప్పుడామె గర్భిణి కూడా. ‘పుట్టబోయే బిడ్డ కోసం దుఃఖాన్ని దిగమింగుతున్నా. మళ్లీ సన్నద్ధమవ్వడం కష్టమే..’ అంటూ కన్నీటి పర్యంతమైంది. చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బులు.. పీజీ తర్వాత భద్రాచలానికి దగ్గర్లోని ఓ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు ఉద్యోగం తెచ్చుకున్నాడు వీరబోయిన నరేంద్ర. తండ్రి చనిపోవడంతో ఇంటికి పెద్ద దిక్కడయ్యాడు. కానీ గ్రూప్స్ కోసం ఉద్యోగం మానేసి హైదరాబాద్లో కోచింగ్ కోసం వచ్చాడు. చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బు ఖర్చు చేశాడు. ‘ఇప్పుడు ప్రభుత్వ కొలువు ఎండమావిగా మారింది. ఉన్న ఇంటిని అమ్మేయడమే దిక్కు’ అంటూ వాపోయాడు. ఎవరిని కదిపినా..ఉప్పొంగే ఆవేదనే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లతో లక్షలాది మంది నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇళ్ళను వదిలేసి, వ్యక్తిగత బాధలన్నీ పక్కన బెట్టి కొలువు కొట్టే లక్ష్యంతో లక్షల మంది కోచింగ్ కేంద్రాల బాట పట్టారు. ఇంకొందరు ఇళ్లల్లోనే ఉండి చదువుతూ బయటి ప్రపంచాన్ని మరిచిపోయారు. నిద్రాహారాలు మానుకుని పరీక్షల కోసం సన్నద్ధమయ్యారు. ఈ దశలో బాంబులా పేలింది..రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అదే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్. తీగలాగితే డొంక కదిలినట్టు ఒక పరీక్షతో ఆగిపోలేదు. గ్రూప్–1 ప్రిలిమ్స్ సహా ఏకంగా నాలుగు పరీక్షలు రద్దు అయ్యాయి. మరో రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. నిరుద్యోగ యువతలో అయోమయాన్ని నింపాయి. మెడలోని పుస్తెనో, ఇంట్లోని గొర్రెనో.. బర్రెనో.. ఉన్న కుంట భూమినో.. తాతల నుంచి వచ్చిన ఇంటినో అమ్మేసి కన్న బిడ్డల్ని ఉన్నత స్థితిలో చూడాలనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరై పోయాయి. మళ్లీ గ్రూప్–1కు సన్నద్ధమవడమనే ఊహే వారిని తీవ్రంగా బాధిస్తోంది. ఊహించని ఈ పరిణామంపై ‘సాక్షి’ వారి ప్రతిస్పందన కోరినప్పుడు.. ఎంతో ఆందోళన..ఆవేదన, మరెంతో నిరాశా నిస్పృహలు వారిలో స్పష్టంగా కన్పించాయి. ఎంఏ చేసినా అమ్మకు భారంగానే.. నాన్న చనిపోతే అమ్మే కూలి పనిచేసి పెంచింది. ఎంఏ చేసినా ఇంకా అమ్మకు భారంగానే ఉన్నా. టీఎస్పీఎస్సీ పరీక్షల ద్వారా ఉద్యోగం వస్తుందని, అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తాననే నమ్మకం తగ్గిపోతోంది. పరీక్షల పట్ల ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా? – కాదిరాబంద్ పాండు (ఆందోల్, సంగారెడ్డి జిల్లా) మళ్లీ సన్నద్ధమవ్వడం ఎలా? వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా కష్టపడి బీఎస్సీ, బీఈడీ చేశా. గ్రూప్స్ కోసం మూడేళ్లు కష్టపడ్డా. నేను, నా స్నేహితు లు నిద్రహారాలు మానేసి చదివాం. పరీక్ష రద్దు మనసు కకావికలం అయిపోయింది. మళ్లీ ఎలా సన్నద్ధమవ్వాలో అర్ధం కావడం లేదు. – దుర్గం శ్రావణి బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి.. కొంతకాలంగా ఇంటివద్ద పిల్లల్ని సైతం వదిలేసి.. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ పరీక్షకు సిద్ధమవుతున్నా. ఈ సమయంలో పరీక్ష రద్దు చేయడం బాధించింది. లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి. మాలాంటి వారిని ఆదుకోవాలి. ఈసారైనా పకడ్బందీగా ప్రక్రియను పూర్తి చేయాలి. – సంధ్య గ్రూప్–1 అభ్యర్థి, మహబూబ్నగర్ నష్టపోయిన వారికి చేయూతనివ్వాలి కోచింగ్ కోసం ఉన్నవన్నీ అమ్ముకుని వచ్చిన వాళ్ళున్నారు. తప్పు ప్రభుత్వానిదైతే శిక్ష పరీక్ష రాసిన వాళ్లెందుకు అనుభవించాలి? దరఖాస్తు చేసిన వారికి ప్రభుత్వం ఆర్థిక పరమైన చేయూతనివ్వాలి. – చెన్నగాని దయాకర్ గౌడ్ (పీహెచ్డీ విద్యార్థి, నకిరేకల్, నల్లగొండ జిల్లా) -
IWD2023: విలేజ్వనిత ఘనత
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ మహిళలు రూట్ మార్చారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ వ్యవసాయేతర కార్యకలాపాల వైపు మళ్లుతున్నారు.‘మోడల్ ఎంటర్ప్రైజెస్’ వీరికి చేదోడుగా నిలుస్తున్నాయి. చిన్న చిన్న యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్న మహిళలు తాము ఆదాయాన్ని పొందుతూ కుటుంబానికి ఆసరాగా నిలవడమే కాకుండా ఇతరులకూ ఉపాధి కల్పిస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా శిక్షణ పొందుతున్న మహిళలు వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లో స్టార్టప్ విలేజ్ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ కింద విలేజ్ ఆర్గనైజేషన్స్ (గ్రామ సంస్థలు)లో ఈ ‘మోడల్ ఎంటర్ప్రైజెస్’ ఏర్పాటవుతున్నాయి. ఒక్కో విలేజ్ ఆర్గనైజేషన్లో 5–8 దాకా మోడల్ ఎంటర్ప్రైజెస్ ఉంటున్నాయి. గత రెండేళ్లలో 1.70 లక్షలకు పైగా మోడల్ ఎంటర్ప్రెజెస్ను ప్రమోట్ చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద కూడా గ్రామ ప్రాంతాల్లో స్టార్టప్ ప్రమోషన్, ఎంటర్ప్రైజ్ ఫైనాన్సింగ్, ధాన్యం సేకరణ, తదితరాల ద్వారా మహిళలకు ఆర్థిక సాధికారత దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. స్వయం సహాయక బృందాల్లో (ఎస్హెచ్జీల) సభ్యులుగా ఉంటున్న మహిళలు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులు, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వంటి వాటిని ఉపయోగించుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నారు. 2022–23లో ఈ విలేజ్ ఆర్గనైజేషన్స్ రైతుల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాయి. కమీషన్ల రూపంలో రూ.64 కోట్ల మేర ఆదాయం పొందాయి. నాడు వ్యవసాయ కూలీ.. ♦ మంచిర్యాల జిల్లా భీమారానికి చెందిన పండ్ల శ్రీలత స్కూల్ స్థాయిలోనే చదువు మానేశారు. వ్యవసాయ కూలీగా పనిచేసిన ఆమె.. శ్రీరామ విలేజ్ ఆర్గనైజేషన్లోని ఝాన్సీ ఎస్హెచ్జీలో సభ్యురాలు. ప్రస్తుతం భీమారంలోనే ఆదివాసీ విస్తరాకుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదు ర్కొన్నా.. బ్యాంకులు, ఇతర రూపాల్లో అందిన రుణాలతో మోదుగ, అడ్డాకులతో పర్యావరణహిత టేబుల్ ప్లేట్లు, బఫె ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, దొప్పలు తయారీకి సంబంధించి సొంత మెషిన్లను ఏర్పాటు చేసుకున్నారు. శ్రీలత, ఆమె భర్త, పిల్లలు ఈ యూనిట్లోనే పనిచేస్తున్నారు. మరో ఇద్దరు పనివాళ్లను కూడా పెట్టుకున్నారు. తాము ఆదాయం పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పించడంతో పాటు బ్యాంకు రుణం కూడా తీరుస్తున్నారు. బిస్కెట్ల యూనిట్తో భరోసా.. ♦ వికారాబాద్ జిల్లా యాలాల మండలానికి చెందిన కొడంగల్ హజీరా బేగం గతంలోనే మహబూబ్ సుభానీ ఎస్హెచ్జీలో చేరారు. తర్వా త బిస్కెట్ల తయారీ, మార్కెటింగ్ యూనిట్ వైపు మళ్లారు. బ్యాంకులు, స్త్రీనిధి, ఇతర రూపాల్లో ఆర్థిక సహకారం అందడంతో బేకరీ ఉత్పత్తులతో పాటు పలురకాల తినుబండారాలు తయారు చేస్తూ తమ వ్యాపారాన్ని విస్తరింపజేశారు. వివిధ రకాల బిస్కెట్లు, బ్రెడ్డు, బన్ను, టోస్టులు, ఎగ్, కర్రీ పఫ్లు విక్రయిస్తున్నారు. కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఈ వ్యాపారంలో నిమగ్నం కావడంతో పాటు మరో ఐదుగురు పనివారికి ఉపాధి కల్పిస్తున్నారు. కేంద్ర మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సర్టఫికెట్, ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టఫికెట్ పొందారు. ప్రస్తుతం ఈ కుటుంబానికి అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50 వేల దాకా ఆదాయం మిగులుతోంది. అవుషా ఫుడ్స్ అదుర్స్.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామంలోని వివిధ స్వయం సహాయక బృందాలకు చెందిన 18 మంది మహిళా సభ్యులు కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్గా ఏర్పడి ఎన్ఐఆర్డీలోని రూరల్ టెక్నాలజీ పార్క్లో శిక్షణ అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పా టు చేశారు. తమ తమ సంఘాల నుంచి రుణ రూపేణా తీసుకున్న మొత్తంతో ఆహార భద్రత, ప్రమా ణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ పొంది అవుషా ఫుడ్స్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ కారంపొడి, పసుపు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కోల్డ్ప్రెస్డ్ నూనెలు, రాగి, జొన్న ఇతర పిండి పదార్థాలు కలిపి మొత్తం 41 వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. ఈ యూనిట్ నెలవారీ టర్నోవర్ రూ.3 లక్షలుగా ఉంది. గ్రూపులోని మహిళలంతా సొంతకాళ్లపై నిలబడడమే కాకుండా ఎస్హెచ్జీలకు చెందిన మరో పది మంది మహిళలకు నెలకు రూ. 4 వేల చొప్పున ఉపాధి కల్పి స్తున్నారు. ఔత్సాహిక మహిళలకు ప్రోత్సాహం రాష్ట్రవ్యాప్తంగా 1.70 లక్షలకు పైగా ఎంటర్ప్రెజెస్ ప్రమోట్ చేశాం. వాళ్లకు రూ.75 వేల నుంచి రూ.5 లక్షల దాకా ఫండింగ్ సపోర్ట్ కల్పించాం. బ్యాంకులు, స్త్రీనిధి ద్వారా అందిన రుణాలను ఈ ఔత్సాహిక మహిళలు తమ తమ యూనిట్లతో పొందే ఆదాయం ద్వారా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎస్హెచ్జీ బృందాల్లోని ఉత్సాహవంతులు, సొంత వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారిని బ్యాంక్లతో టయ్యప్ చేయిస్తాం. 2021–22లో దీనిని మొదలు పెట్టాం. ఆ ఏడాది 65 వేల దాకా ఎంటర్ప్రెజెస్ గ్రౌండ్ చేశాం. 2022–23లో 1.34 లక్షలు టార్గెట్గా పెట్టుకుని 1.10 లక్షల దాకా సాధించాం. – రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) అధికారులు -
యువతరం మారుతోంది
యువతరం ఆలోచన మారుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అవసరాలు వారి ఆలోచనలో మార్పు తెస్తుంటే.. అందుబాటులోకి వస్తున్న సరికొత్త ఉపాధి అవకాశాలు ఉత్సాహాన్నిస్తున్నాయి. హుందాగా పనిచేస్తూ కష్టాన్ని బట్టి సంపాదన పెంచుకునే అవకాశం వారిని ఆకర్షిస్తోంది. దీంతో చదువుకుంటూనే, పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే కుటుంబంపై ఆధారపడకుండా అవసరమైన ఖర్చుల కోసం ఆహారం, సరుకులు, వస్తువుల ఆన్లైన్ డెలివరీ బాయ్స్గా, బైక్ ట్యాక్సీ డ్రైవర్లుగా చేరిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది (80 శాతం) విద్యాధికులు కావడం ఆసక్తి కలిగించే అంశం. – సాక్షి, హైదరాబాద్ నగర బాట.. ఉపాధి వేట మొత్తం మీద విద్య కోసమో, ఉద్యోగం కోసమో లక్షలాది మంది యువత హైదరాబాద్ మహా నగరానికి వలస వస్తోంది. వీరిలో ఎక్కువ శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్లే. మొన్నటి వరకు ఇంటి నుంచి పంపించే డబ్బులను జాగ్రత్తగా వాడుకుంటూ చదువుకోవడమో, మంచి ఉద్యోగం వెతుక్కోవడమో చేస్తూ వచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడంతో ఇక తల్లిదండ్రుల డబ్బులపై ఆధారపడి ఉండాలని అనుకోవడం లేదు. తమ అవసరాలు తామే తీర్చుకోవడానికి పార్ట్ టైం ఉద్యోగాలను వెతుక్కుంటున్నారు. వేగంగా విస్తరిస్తున్న డెలివరీ రంగం వీరికి గొప్ప అవకాశంగా మారింది. 75 వేల మందికి పైనే.. మహానగరంలో 75 వేల మందికి పైగానే ఫుడ్, గ్రోసరీ డెలివరీ, బైక్ ట్యాక్సీ రంగంలో కొనసాగుతున్నట్లు ఆయా కంపెనీల ఆధికార గణంగాలు స్పష్టం చేస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్, ఫుడ్పాండా, రాపిడో తదితర సంస్థలు తమ మార్కెట్ను విస్తరించుకోవడంలో భాగంగా యువతను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇక అమెజాన్, మింత్ర, ఫ్లిప్కార్ట్, బిగ్బాస్కెట్, జెప్టో వంటి సంస్థలు కూడా తమ సరుకులు, వస్తువుల డెలివరీకి యువతను వినియోగిస్తున్నాయి. పని చేయాలనే తపన ఉంటే సరి.. పార్ట్ టైం ఉద్యోగం చేయాలనే తపన, కాలం విలువ తెలిస్తే చాలు ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేయొచ్చు. కనీస విద్యార్హతతో పాటు లైసెన్స్, ద్విచక్రవాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ఆధార్కార్డు, పాన్కార్డు, బ్యాంక్ వివరాల ఒరిజినల్స్తో కంపెనీలో సంపద్రిస్తే సరిపోతుంది. కస్టమర్కు ఆర్డర్ సమయానికి ఎలా అందించాలి? వారితో ఎలా నడుచుకోవాలి? ఇన్సెంటివ్స్ కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? నగరంలో డ్రైవింగ్ ఎలా చేయాలి? తదితర వాటిపై సదరు కంపెనీలు శిక్షణ ఇస్తున్నాయి. బీకాం చేస్తూనే డెలివరీ... బీకాం కంప్యూటర్ ఫైనల్ ఇయర్ చేస్తూ పార్ట్టైంగా ఫుడ్ డెలివరీ బోయ్గా పనిచేస్తు న్నా. ప్రతిరోజు రూ.400 నుంచి రూ.500 వరకు సంపాదిస్తున్నా. కాలేజీ, ట్యూషన్ ఫీజులు, చేతి ఖర్చులకు సరిపోతున్నాయి. ఇంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తల్లిదండ్రులపై ఆధార పడకుండా సొంతంగా సమకూర్చుకుంటుండటంతో సంతృప్తిగా ఉంది. నా మిత్రు లు చాలామంది ఇలా చదువుకుంటూనే పార్ట్టైంగా పని చేస్తూ సంపాదిస్తున్నారు. – మొహియొద్దీన్, ఫుడ్ డెలివరీ బాయ్, మల్లాపూర్ ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతూనే బీటెక్ పూర్తి కావడంతో అదనపు కోర్సుల కోసం నగరానికి వచ్చాను. కోచింగ్ ఇనిస్టిట్యూట్లో చేరా. ఏడాది పాటు ఇంటి నుంచి డబ్బులు పంపించారు. తర్వాత కుటుంబానికి భారంగా మారకూడదనే ఉద్దేశంతో ఫ్రెండ్ బైక్తో పార్ట్ టైం జాబ్లో చేరాను. ఆ డబ్బులతోనే ఇప్పుడు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా. – వెంకటేశ్వర్లు, నల్లగొండ డిగ్నిటీ ఆఫ్ వర్క్.. సిటీలో ఫుడ్, గ్రాసరీ డెలివరీ, బైక్ ట్యాక్సీ డిగ్నిటీ ఆఫ్ వర్క్గా మారాయి. నిరుద్యోగులు, విద్యార్థులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సైతం పార్ట్టైం జాబ్ చేస్తూ సంపాదించుకుంటున్నారు. – షేక్ సలావుద్దీన్, అధ్యక్షుడు, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ -
విశ్రాంత జీవనం.. హాయిగా..!
ప్రజల ఆయుర్ధాయం పెరుగుతోంది. గతంలో మాదిరి కాకుండా నేటి యువత ప్రైవేటు రంగంలోనే ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. లేదంటే సొంత వ్యాపారాలు, ఇతర స్వయం ఉపాధి మార్గాలతో స్థిరపడుతున్నారు. జీవించి ఉన్నంత కాలం ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహించలేం. ఉద్యోగంలో అయితే 58 ఏళ్లకు దిగిపోవాల్సిందే. స్వయం ఉపాధిలోని వారికి వయో పరిమితి లేదు. అయినా కానీ ఏదో ఒక రోజు చేస్తున్న పనికి విరామం పలకాల్సిందే. శారీరక, ఆరోగ్య పరమైన మార్పులు మునుపటి మాదిరిగా పనిచేయనీయవు. కనుక వృద్ధాప్యంలో పనికి విరామం పలికిన తర్వాత జీవన అవసరాలను తీర్చుకోవడం ఎలా అన్నది ముందే ఆలోచించాలి. దీనివల్ల విశ్రాంత రోజుల్లో ప్రశాంతమైన జీవనానికి అవకాశం లభిస్తుంది. ఈ అంశంపై ‘మనీ పాత్శాల’ వ్యవస్థాపకులు వివేక్ లా ఏం చెబుతున్నారో చూద్దాం... రిటైర్మెంట్ అనేది తప్పనిసరి దీర్ఘకాల ప్రణాళిక. అంతేకాదు, జీవితంలో ఖరీదైన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత మరో 20–30 ఏళ్లు జీవించాల్సి రావడం, అందుకు కావాల్సినంత నిధిని సమకూర్చుకోవడం చిన్న విషయం కాదు. దీనికి డబ్బు విలువను హరించే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొనే స్థాయిలో రిటైర్మెంట్ కోసం కేటాయింపులు చేసుకోవాలి. చేస్తున్న పనికే రిటైర్మెంట్ కానీ, మన జీవన అవసరాలకు కాదు. ఉద్యోగం/వ్యాపారం ఆగిపోయినా, మన జీవన అవసరాలను తీర్చే ఆదాయం ఆగిపోకూడదని అనుకుంటే అందుకు ముందు నుంచి తగిన ఏర్పాట్లు ఉండాలి. ఆర్జన ఆరంభించిన వెంటనే రిటర్మెంట్ ప్రణాళిక మొదలు పెట్టాలి. నిజానికి చాలా మంది యువత దీని ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. దీంతో రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎంతో మందికి సవాలుగా మారుతోంది. వాయిదా సరికాదు.. రిటైర్మెంట్ ఆలస్యం చేసిన కొద్దీ లక్ష్యం భారంగా మారుతుంది. పెట్టుబడి ఎంత ముందుగా ప్రారంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనంతో దీర్ఘకాలంలో అది మంచి నిధిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పెట్టుబడి ఎన్నో రెట్లు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయసు నుంచే ప్రతి నెలా రూ.5,000 చొప్పున 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేస్తే.. 35 ఏళ్ల కాలంలో ఎంత సమకూరుతుంది? 12% కాంపౌండింగ్ రాబడి అంచనా ప్రకారం రూ.3.24 కోట్లు సమకూరుతుంది. కేవలం నెలకు రూ.5వేలు అంత పెద్ద నిధిగా మారిందంటే అదే కాంపౌండింగ్ మహిమ. ఒకవేళ ఈ పెట్టుడిని ఒక ఏడాది ఆలస్యంగా మొదలు పెట్టారని అనుకుందాం. అంటే 26 ఏళ్లకు ఇన్వెస్ట్మెంట్ మొదలైతే రూ.37 లక్షలు తక్కువ మొత్తం సమకూరుతుంది. ఏడాది ఆలస్యం చేయడం వల్ల ఏర్పడిన నష్టం రూ.37 లక్షలు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడని, అన్నింటికంటే ముందు ఆరంభించే పెట్టుబడి ప్రణాళిక రిటైర్మెంట్ ఫండ్ కావాలి. ఉపసంహరించుకునే దశ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, రిటైర్మెంట్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతీ నెలా నిర్ణయించుకున్న మేర బ్యాంకు ఖాతాకు జమ అవుతుంటుంది. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఉంచడం వల్ల రాబడులతో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణ నష్టం నుంచి రిటైర్మెంట్ ఫండ్ విలువను కాపాడుకోవచ్చు. ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక రిటైర్మెంట్ నాటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై పన్ను భారం ఉండదు. అయితే ఈ మొత్తాన్ని తిరిగి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడే మిగిలిన 30 ఏళ్ల జీవన అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి వృద్ధిని చేసుకోవచ్చు. ప్రణాళిక విషయంలో ఆర్థిక నిపుణుడి సేవలు తప్పకుండా తీసుకోవాలి. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునే విషయంలో భయం, ఊహాజనిత, ఉద్రేకాలకు అవకాశం ఇవ్వకుండా, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. గృహ రుణం ఇంకా తీర్చాల్సి ఉన్నా లేదా తమపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నా.. రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కొన్ని రకాల రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. గృహ రుణం తీరేంత వరకు, తమ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడే కాలానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ 45–55 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుని ప్రపంచమంతా తిరిగి రావాలి? ఇది కొందరి లక్ష్యం కావచ్చు. కానీ, 60 ఏళ్లు వచ్చే నాటికి అయినా దీన్ని సాధించగలిగారా? అని ప్రశ్నిస్తే.. ఎక్కువ మంది నుంచి లేదన్నదే సమాధానం వస్తుంది. సంపాదన మొదలైన నాటి నుంచే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, మనలో చాలా మంది ఆర్జించే మొత్తం చెప్పుకోతగ్గ గొప్పగా ఉండదు. దీంతో పరిమిత ఆర్జన, అవసరాల నడుమ.. రిటైర్మెంట్ 60 ఏళ్లప్పుడు కదా, తర్వాత చూద్దాంలే? అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. యుక్త వయసు, ఆరోగ్యం సహకరిస్తున్న రోజుల్లోనే అలా అనుకుంటే.. వృద్ధాప్యానికి చేరువ అవుతున్న సమయంలో రిటైర్మెంట్ ఫండ్ వంటి భారీ లక్ష్యం ఎలా సాధ్యపడుతుంది? ఒక్కసారి ఆలోచించాలి. పిల్లల విద్య, వారి వివాహం, ఇతర బాధ్యతలతో రిటైర్మెంట్కు ముందు వరకు చాలా మంది తీరిక లేకుండా ఉంటారు. కనుక ఏ లక్ష్యాన్నీ నిర్లక్ష్యం చేయడానికి, వాయిదా వేయడానికి లేదు. 25–30 ఏళ్ల కెరీర్లో రోజువారీ అవసరాల్లో ఎలాంటి రాజీ పడకుండా, రిటైర్మెంట్కు కావాల్సినంత నిధిని సమకూర్చుకోవడం ఎలా? ఆర్థిక ప్రణాళిక ఇందుకు మార్గం చూపుతుంది. జీవితంలో ఏవి కావాలని కోరుకుంటున్నారు? అందుకోసం ఏం చేయాలి, ఎలా చేయాలనేది? ఆర్థిక ప్రణాళిక స్పష్టం చేస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం. కారణాలు ఏవైనా, రిటైర్మెంట్ నాటికి కావాల్సినంత నిధి సమకూర్చుకోలేకపోతే తిరిగి మునుపటి మాదిరి యువకుల్లా పనిచేయడం సాధ్యపడదు? అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. ఉదాహరణకు మీరు 60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటారని అనుకుంటే, 90 ఏళ్ల వరకు జీవించి ఉండేట్టు అయితే కనీసం 30 ఏళ్ల అవసరాలకు సరిపడా నిధి అవసరమవుతుంది. ఇది చాలా పెద్ద లక్ష్యమే అనడంలో సందేహం లేదు. ఆరోగ్య సంరక్షణ అవసరాలు, పిల్లల విద్య, వారి వివాహాలు, వృద్ధాప్యంలో జీవన అవసరాలు, ద్రవ్యోల్బణం వల్ల పెరిగిపోయే జీవన వ్యయాలను విస్మరించడానికి లేదు. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా అవసరాలు తీర్చుకునేందుకు రూ.3 లక్షలు కావాలని అనుకుంటే.. ఏటా 7 శాతం ద్రవ్యోల్బణం అంచనా ఆధారంగా రూ.10 కోట్ల నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 35 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్మెంట్ ఆరంభించారని అనుకుంటే.. 60 ఏళ్ల వయసు వచ్చే నాటికి మీ చేతిలో 25 ఏళ్లు మిగిలి ఉంటుంది. ఇందుకు గాను ప్రతి నెలా రూ.55,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏటా 12% చొప్పున వృద్ధిని చూస్తుందనుకుంటే 60 ఏళ్ల నాటికి రూ.10 కోట్లు సమకూరుతుంది. అందుకే మొదటి నెల వేతనం నుంచే రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవడానికి తొలి అడుగు పడాలి. తల్లిదండ్రులు లేదా తాతలు ప్రభుత్వరంగంలో ఉద్యోగులుగా పనిచేసి రిటైర్మెంట్ అవ్వడంతో, వారికి పెన్షన్ సదుపాయం ఉండేది. కానీ మన పరిస్థితి అలా కాదు. గ్యారంటీడ్ పెన్షన్ అనేది లేదు. ఎవరికి వారే సొంతంగా నిధిని సమకూర్చుకుని, దానిపై ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో మన దేశంలో సగటు ద్రవ్యోల్బణం 4–6 శాతం మధ్యలో ఉంటుందని అంచనా. అంటే నేడు పాకెట్లో ఉన్న రూ.1000 విలువ ఏడాది తర్వాత రూ.96కు తగ్గుతుంది. ఇలా తరిగిపోయే విలువకు తగిన రక్షణగా అదనపు పెట్టుబడి అవసరం ఉంటుంది. మిగులు లేదని చెప్పుకోవద్దు.. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి వెసులుబాటు లేదని కొందరు చెబుతుంటారు. తర్వాత వీలు చూసుకుని మొదలు పెడదామని, అనుకుంటూ ఉంటుంటారు. కానీ, విలువైన సమయాన్ని వృధా చేసిన తర్వాత ప్రతి నెలా ఎంత మొత్తం పొదుపు చేసినా అది గణనీయమైన వృద్ధిని చూడడానికి కావల్సిందన వ్యవధి ఉండదు. ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణలోనే 25 ఏళ్లకు కాకుండా, తీరిగ్గా 45 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెటు మొదలు పెట్టారని అనుకుందాం. ప్రతి నెలా రూ.50,000 చొప్పున అక్కడి నుంచి 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే.. 12 శాతం కాంపౌండింగ్ రాబడి చొప్పున 2.5 కోట్లు సమకూరుతుంది. 25 ఏళ్ల వయసులో ఆరంభించడం వల్ల కేవలం ప్రతి నెలా రూ.5వేలతోనే రిటైర్మెంట్ నాటికి రూ.3.24 కోట్లు సమకూరుతుంటే.. 20 ఏళ్లు ఆలస్యంగా మొదలు పెట్టడం వల్ల ప్రతి నెలా రూ.50వేల చొప్పున పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అప్పటికీ సమకూరే మొత్తం కేవలం రూ.2.5 కోట్లు కావడాన్ని గమనించాలి. సమకూర్చుకునేది ఎలా? రిటైర్మెంట్ ప్రణాళికలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి రిటైర్మెంట్ సమయం వచ్చేంత వరకు కావాల్సిన నిధిని సమకూర్చుకోవడం. రిటైర్మెంట్ తర్వాత ఆ నిధి నుంచి ప్రతి నెలా రాబడి పొందడం రెండోది అవుతుంది. 25–30 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది కనుక, పెట్టుబడులకు ఈక్విటీలను మెరుగైన మార్గంగా చూడాలి. దీర్ఘకాలంలో ఈక్విటీలను మించి కాంపౌండెడ్ రాబడులను ఇచ్చిన మెరుగైన సాధనం మరొకటి లేదనే చెప్పుకోవాలి. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఎన్పీఎస్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్థిక సలహాదారు సూచనలను తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. నిపుణుల సాయంతో రాబడుల అంచనాలు, కాల వ్యవధి ఆధారంగా పోర్ట్ఫోలియోను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్కు సమయం దగ్గర పడుతుండగా, ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకుని, డెట్కు మళ్లించుకోవడంలో ఆర్థిక సలహాదారు సాయపడతారు. తద్వారా మీ లక్ష్యాలు నెరవేరతాయి. ఉపసంహరించుకునే దశ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, రిటైర్మెంట్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతీ నెలా నిర్ణయించుకున్న మేర బ్యాంకు ఖాతాకు జమ అవుతుంటుంది. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఉంచడం వల్ల రాబడులతో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణ నష్టం నుంచి రిటైర్మెంట్ ఫండ్ విలువను కాపాడుకోవచ్చు. ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక రిటైర్మెంట్ నాటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై పన్ను భారం ఉండదు. అయితే ఈ మొత్తాన్ని తిరిగి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడే మిగిలిన 30 ఏళ్ల జీవన అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి వృద్ధిని చేసుకోవచ్చు. ప్రణాళిక విషయంలో ఆర్థిక నిపుణుడి సేవలు తప్పకుండా తీసుకోవాలి. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునే విషయంలో భయం, ఊహాజనిత, ఉద్రేకాలకు అవకాశం ఇవ్వకుండా, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. గృహ రుణం ఇంకా తీర్చాల్సి ఉన్నా లేదా తమపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నా.. రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కొన్ని రకాల రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. గృహ రుణం తీరేంత వరకు, తమ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడే కాలానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. -
8 ఏళ్లు.. 17 లక్షల ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో గ్రూప్–1 మొదలు అన్ని రకాల ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ ఎత్తున ప్రకటనలు జారీ చేస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇటీవల దాదాపు 60 వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. మరి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన ఎలా ఉంది? తెలంగాణ ఏర్పాటయిన తర్వాత ఏ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి? ఈ ప్రశ్నలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే–2023 సమాధానం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ ఏర్పాటయిన ఏడాదిని మినహాయిస్తే 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2022–23 వరకు అంటే 8 ఏళ్లలో ప్రైవేటు రంగంలో వచ్చిన ఉద్యోగాల సంఖ్య 17.2 లక్షలపైనే. టీఎస్–ఐపాస్ కింద రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతులు పొందిన సంస్థలు, కంపెనీల్లో ఈ మేరకు ఉపాధి అవకాశాలు లభించాయి. వరుసగా నాలుగేళ్లు.. గత 8 ఏళ్లలో ప్రైవేటు రంగంలో లభించిన ఉద్యోగావకాశాలను పరిశీలిస్తే రియల్ ఎస్టేట్, ఐటీ భవనాలు, పారిశ్రామిక పార్కుల్లోనే యువతకు ఎక్కువగా ఉపాధి లభించిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 9.5 లక్షలకుపైగా ఉద్యోగాలు లభించాయి. ఆ తర్వాత ఫార్మా, కెమికల్ రంగంలో, వరుసగా ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, టెక్స్టైల్స్ రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. ఈ ప్రధాన రంగాలు కాకుండా మిగిలిన రంగాల్లో కలిపి 3.5 లక్షల ఉద్యోగాల వరకు వచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 75 వేలకుపైగా, ఫార్మాలో 1.2 లక్షలు, ఇంజనీరింగ్లో 60 వేల మంది వరకు ఉపాధి కలిగింది. సంవత్సరాలవారీగా పరిశీలిస్తే 2017–18, 2018–19, 2019–20లో 12 లక్షల మందికిపైగా ఉపాధి కల్పన జరిగింది. 2017–18లో 2,74,963, 2018–19లో 5,99,933, 2019–20లో 3,15,607 ఉద్యోగాలు లభించాయని, టీఎస్–ఐపాస్ ద్వారా ఈ ప్రధాన రంగాల్లో గత 8 ఏళ్లలో దాదాపు రూ. 2.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినట్లు ఆర్థిక సర్వే గణాంకాలు వెల్లడించాయి. -
వలసలు, నిరాసక్తత
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి ఉపాధి కోసం వలసలు, పట్టణాల్లో, యువతలో నిరాసక్తత వంటి ఎన్నో కారణాలున్నా యని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. సి బ్బంది, న్యాయం, ప్రజా సమస్యలపై పార్లమెంటు సంఘానికి ఈ మేరకు నివేదించింది. సోమ వారం జరిగిన సంఘం సమావేశంలో ఈ అంశంపై ఈసీ ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ సమర్పించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు రిమో ట్ ఓటింగ్ సదుపాయం వంటివి అందుబాటులోకి తేవాలని సూచించారు. అయితే, ‘‘రిమోట్ ఓటింగ్ పరిజ్ఞానం కూడా నెట్వర్క్లకు అనుసంధానమయ్యే తరహాలో కాకుండా ఈవీఎంల మాదిరిగా స్వతంత్రంగా ఉండేలా చూడటం ముఖ్యం. అప్పుడే ఎలాంటి దుర్వినియోగానికీ తావుండదు’’ అని అభిప్రాయపడ్డారు. -
ఆ పరిశ్రమలో ఉద్యోగులకు యమ డిమాండ్.. ఖాళీలు ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయ్!
ముంబై: గడిచిన ఏడాది కాలంలో (2021 నవంబర్ నుంచి 2022 నవంబర్ వరకు) కార్మికులు, గ్రే కాలర్ (టెక్నీషియన్లు మొదలైనవి) ఉద్యోగాలు నాలుగు రెట్లు పెరిగాయి. డిజిటైజేషన్, ఆటోమేషన్, మారుతున్న పని విధానాలు తదితర అంశాలు ఇందుకు కారణం. క్వెస్ కార్ప్ అనుబంధ సంస్థ బిలియన్ కెరియర్స్ ప్లాట్ఫామ్లో నమోదైన పోస్టింగ్స్కు సంబంధించిన డేటాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2021లో బ్లూ, గ్రే–కాలర్ పరిశ్రమలో ఖాళీలు 26.26 లక్షలుగా ఉండగా 2022లో 1.05 కోట్లకు పెరిగాయి. డేటా ప్రకారం కంపెనీలు ఉత్పాదకతను, సమర్ధతను పెంచుకునేందుకు నైపుణ్యాలున్న వారిని పెద్ద ఎత్తున తీసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. టెక్నాలజీ ద్వారా హైరింగ్ ప్రక్రియలను రిక్రూటర్లు గణనీయంగా మెరుగుపర్చుకుంటారని, ఉద్యోగులను అట్టే పెట్టుకోవడంపైనా దృష్టి పెట్టనున్నారని బిలియన్ కెరియర్స్ సీనియర్ వీపీ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. చదవండి: Jack Ma: సంచలన నిర్ణయం తీసుకున్న చైనా వ్యాపార దిగ్గజం -
Bachelor of Commerce: బీకాం.. భలే గిరాకీ!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వార్షిక ప్యాకేజీ రూ.20 లక్షలు అంటే.. అబ్బో అంటారు. కానీ ఇప్పుడు బీకాం చేసిన విద్యార్థికే ఏడాదికి రూ.21 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారంటే నమ్మగలమా? నమ్మాల్సిందే! అంతర్జాతీయ సంస్థలే కాదు, భారత్లోని కంపెనీలూ ఇప్పుడు అనలిస్ట్లకు ఇంతకన్నా ఎక్కువ ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 2023లో 60 శాతం వరకు అవకాశాలు వారికే దక్కే అవకాశం ఉందని ఇండియా స్కిల్ రిపోర్టు– 2023 చెబుతోంది. భవిష్యత్తులోనూ కామర్స్ చేసిన వారికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేస్తోంది. వాస్తవానికి గత ఆరేళ్ల నుంచే డిమాండ్ పెరుగుతూ వస్తోందని పేర్కొంది. 2017లో 37.98 శాతం బీకాం విద్యార్థులు ఉద్యోగాలు పొందితే, 2023లో ఇది ఊహించని విధంగా ఏకంగా 60.62 శాతానికి చేరుకోబోతోందని వివరించింది. ఇక బీటెక్లో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సైబర్ క్రైం కోర్సుల విద్యార్థులకు ఎక్కువ అవకాశాలుంటాయని తెలిపింది. అన్ని రంగాల్లో పెరిగిన అవకాశాలు.. కరోనా తర్వాత వాణిజ్య రంగంలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ–కామర్స్ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. అంతర్జాతీయంగా బహుళజాతి కంపెనీల్లో డేటా అనాలసిస్ వ్యవస్థ పెరిగింది. దీంతో అనలిస్ట్ల అవసరం పెరిగింది. బీకాం నేపథ్యం ఉన్న విద్యార్థులకు అంతర్జాతీయంగా డిమాండ్, తద్వారా ఉపాధి పెరగడానికి ఇది దోహద పడింది. ఇండియాలో బీకామ్కు ఉద్యోగావకాశాలు ఐదేళ్లలో దాదాపు 30 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో పాటు జీఎస్టీ తీసుకొచ్చిన తర్వాత ట్యాక్స్ నిపుణుల ప్రాధాన్యత ఎక్కువైంది. గతంలో ఉన్న ఇన్కం ట్యాక్స్కు, ఇప్పటి జీఎస్టీకి చాలా తేడాలున్నాయి. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా పెరిగాయి. వీటన్నింటినీ సమన్వయం చేయడానికి ట్యాక్స్ నైపుణ్యతను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్ బిజినెస్ రంగాల్లో కూడా కామర్స్ నేపథ్యం ఉన్న సిబ్బంది అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే అనలిస్ట్ ఉద్యోగుల వేతనం మూడేళ్ళల్లోనే 98 శాతం పెరిగినట్టు ఇండియా స్కిల్ నివేదిక పేర్కొంది. బీకాం కోర్సుల్లో వచ్చిన మార్పులు కూడా ఈ పరిస్థితికి కారణమని తెలిపింది. బీకాం కోర్సులకు క్రేజ్ అందివస్తున్న మార్కెట్ అవసరాల నేపథ్యంలో రాష్ట్రంలో బీకాం కోర్సులకు రానురాను డిమాండ్ పెరుగుతోంది. డిగ్రీ ప్రవేశాల్లో 41 శాతం వరకు బీకాం విద్యార్థులే ఉంటున్నారు. వాస్తవానికి ఆరేళ్ళ కిందట 46 శాతం సైన్స్ విద్యార్థులే ఉండేవాళ్ళు. ఇప్పుడు వీరి సంఖ్య 36 శాతానికి పడిపోయింది. 2017–18లో 80,776 మంది బీకాం కోర్సులో చేరితే, 2022–23లో 87,480 మంది చేరారు. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ను అందుకోవడానికి వీలుగా బీకాం కోర్సుల్లో తీసుకొచ్చిన మార్పులు ఇందుకు దోహదపడ్డాయి. బీకాంలో జనరల్, కంప్యూటర్స్, ట్యాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త కోర్సులు ఉపాధి అవకాశాలు పెంచుతున్నాయి. స్టాక్ మార్కెట్ ట్రెండ్ను అంచనా వేసే టెక్నాలజీని కూడా బీకాం కోర్సుల్లో మేళవించారు. ఈ తరహా కామర్స్ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ–కామర్స్ పెరగడంతో మంచి డిమాండ్ ఈ–కామర్స్ పెరిగిన నేపథ్యంలో ట్యాక్స్ కన్సల్టెన్సీ, ఆడిట్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాల్లో బహుళజాతి కంపెనీలు కామర్స్ విద్యార్థులను అత్యధిక వేతనాలతో నియమిస్తున్నాయి. ప్రతి ఏటా డెలాయిట్, బ్రాడ్రిచ్, వెల్స్ఫార్గో, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు క్యాంపస్ నియామకాలు చేపడుతున్నాయి. హైదరాబాద్లో రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఢిల్లీలో రూ. 21 లక్షల వరకు బహుళజాతి సంస్థలు ఇస్తున్నాయి. బీకాం తర్వాత విదేశాల్లో ఎంబీఏ చేసిన వారికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు వస్తున్నాయి. – డాక్టర్ మోహన్కుమార్ (భద్రుక కాలేజీ ప్రిన్సిపల్) జీఎస్టీపై పట్టు ఉంటే మంచి వేతనం జీఎస్టీ వచ్చిన తర్వాత కామర్స్ విద్యార్థులకు డిమాండ్ పెరిగింది. అన్ని రకాల సర్టిఫికేషన్ కోర్సులు చేసిన వారికి ఎక్కువ వేతనం ఇస్తున్నారు. ఫైలింగ్ సిస్టమ్లో అనుభవాన్ని బట్టి వేతనాలు ఉన్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలో సీఏ తర్వాత జీఎస్టీ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకు పొజిషన్ ఇస్తున్నారు. సీఏలకు ఏటా రూ.50 లక్షలు ఇవ్వడం కంటే జీఎస్టీ సర్టిఫికేషన్ ప్రోగ్రాం చేసిన వారికి రూ. 21 లక్షలు ఇవ్వడం కంపెనీలకు లాభదాయకంగా మారింది. – ఎక్కుల్దేవి పరమేశ్వర్ (ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి) సీఏ చేసే పనులన్నీ చేస్తున్నాం కామర్స్ తర్వాత యూఎస్లో మాస్టర్ ప్రోగ్రాం చేశాను. బహుళజాతి కంపెనీలో ఆడిట్, రిస్క్ మేనేజ్మెంట్ వింగ్లో ఉద్యోగం వచ్చింది. మొదట్లో రూ.18 లక్షలు ఇచ్చారు. సీఏ చేసే పనులన్నీ చేయగలుగుతున్నాం. జీఎస్టీ విధానంలో ఎక్కువ అనుభవం గడించాం. రెండేళ్ళల్లో నా వేతనం రూ.21 లక్షలకు పెరిగింది. – శశాంక్ (బహుళజాతి కంపెనీ ఉద్యోగి, ఢిల్లీ) -
మహిళలకు బంపరాఫర్.. పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న దిగ్గజ కంపెనీలు!
న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థలు మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నాయి. కాగ్నిజంట్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, కేపీఎంజీ, యాక్సిస్ బ్యాంకు, ష్నీడర్ ఎలక్ట్రిక్, సిప్లా, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ తదితర ఎన్నో సంస్థలు తమ ఉద్యోగుల్లో స్త్రీ/పురుషుల నిష్పత్తి మరింత మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాయి. ఇప్పటి వరకు మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండగా, మరింత పెంచాలని భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి చర్యలను కొన్ని సంస్థలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. సౌకర్యవంతంగా పనిచేసే ఏర్పాట్లు చేయడం, ట్రైనీలుగా, ఫ్రెషర్లుగా క్యాంపస్ల నుంచి తీసుకోవడం, సీనియర్ స్థాయిలో మార్గదర్శకులుగా నియమించుకోవడం, టీమ్ లీడ్ బాధ్యతల్లోకి మహిళలను తీసుకోవడం వంటివి సంస్థలు అమలు చేస్తున్నాయి. సెకండర్ కెరీర్ (విరామం తర్వాత మళ్లీ చేరడం) మహిలకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నాయి. మంచి ఐడియాలకు నాంది ఉద్యోగుల్లో స్త్రీ/పురుషుల పరంగా మంచి వైవిధ్యం ఉంటే మెరుగైన ఆలోచనలు, ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని ఎల్అండ్టీ కార్పొరేట్ హ్యుమన్ రీసెర్సెస్ హెడ్ సి.జయకుమార్ తెలిపారు. వైవిధ్యంతో కూడిన బృందం ఇతరులతో పోలిస్తే ఎంత మెరుగైన ఫలితాలు ఇస్తుందనే దానిపై అధ్యయనాలు కూడా ఉన్నట్టు చెప్పారు. మంచి నైపుణ్యాలు కలిగిన మహిళా ఉద్యోగులను తాము కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు పేర్కొన్నారు. మహిళలను ఆకర్షించేందుకు పనిలో సౌకర్యంపై దృష్టి పెట్టాలని చాలా కంపెనీల అభిప్రాయపడుతున్నాయి. ఐటీసీ అయితే మహిళా ఉద్యోగుల విధుల నిర్వహణలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. చంటి పిల్లలు ఉన్న ఉద్యోగినులకు సంరక్షకుల సేవలు, ప్రత్యేక రవాణా వసతులను సైతం సమకూరుస్తోంది. యాక్సిస్ బ్యాంకు అయితే ప్రత్యామ్నాయ పని నమూనాలతో నైపుణ్యాలు కలిగిన మహిళలను ఆకర్షిస్తోంది. ‘గిగ్–ఏ’ అవకాశాల పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం కింద 44 శాతం అధికంగా మహిళలను నియమించుకున్నట్టు బ్యాంక్ హెచ్ హెడ్ రాజ్కమల్ వెంపటి తెలిపారు. పోటీతత్వం.. ఎల్అండ్టీ మహిళల డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తోంది. ఎవరైనా వేరే పట్టణానికి బదిలీ చేయాలని కోరితే, సాధ్యమైన మేర వారు కోరిన ప్రాంతంలో సర్దుబాటుకు ప్రయత్నిస్తోంది. వైవిధ్యమైన మానవ వనరులతో పోటీతత్వం పెరుగుతుందని ఐటీసీ కార్పొరేట్ హ్యూమన్ రీసోర్సెస్ హెడ్ అమితవ్ ముఖర్జి పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో లింగ నిష్పత్తి ప్రస్తుతం 23.3 శాతంగా ఉంది. అంటే ప్రతి 100 మందికి గాను 23 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వైవిధ్యాన్ని పెంచడం కోసం గత కొన్ని త్రైమాసికాలుగా బ్యాంక్ తీసుకుంటున్న చర్యలతో ఇది పెరుగుతూ వస్తోంది. ఇందుకోసం ఓ నిర్మాణాత్మక విధానాన్ని అనుసరిస్తోంది. క్యాంపస్ నియామకాలకు ఇచ్చినంత ప్రాధాన్యాన్ని, సెకండ్ కెరీర్ మహిళల విషయంలోనూ కంపెనీలు చూపిస్తుండడం సానుకూలం. అధిక నైపుణ్యాలు, సామర్థ్యాలు ఉన్న మహిళలు తిరిగి చేరేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆహ్వానం పలుకుతోంది. ఇందుకు రెండు విధానాలను అనుసరిస్తోంది. పిల్లల కోసం కెరీర్ బ్రేక్ తీసుకున్న వారిని తిరిగి నియమించుకోవడం, గత ఐదేళ్లలో సంస్థను వీడిని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం చేస్తోంది. ఉన్న మహిళా ఉద్యోగులను కాపాడుకోవడం, కొత్త వారికి అవకాశాలు ఇవ్వడాన్ని కాగ్నిజంట్ అనుసరిస్తోంది. 2020 నుంచి డైరెక్టర్, ఆ పై స్థాయి వారికి ఇందుకోసం ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది. చదవండి👉 ఐటీ జాబ్ పొందడమే మీ లక్ష్యమా? రెజ్యూమ్లో ఈ తప్పులు చేయకండి! -
సీఎన్హెచ్లో నియామకాలు
ఫీనిక్స్: నిర్మాణం, వ్యవసాయ అవసరాలకు వినియోగించే వాహనాల తయారీలో ఉన్న సీఎన్హెచ్ ఇండస్ట్రియల్ మూడేళ్లలో 1,000 మందికిపైగా ఐటీ నిపుణులను నియమించుకోనుంది. గురుగ్రామ్లోని టెక్నాలజీ సెంటర్లో వీరు పనిచేయాల్సి ఉంటుంది. కేస్ బ్రాండ్లో నిర్మాణ రంగానికి, న్యూ హాలండ్ బ్రాండ్లో ట్రాక్టర్లు, హార్వెస్టర్లను కంపెనీ 180 దేశాల్లో విక్రయిస్తోంది. భారత్లో కంపెనీలో ఇప్పటికే 2,500 మంది ఉద్యోగులు ఉన్నారు. -
ఆ రంగంలో బలంగా నియామకాలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2023 జనవరి–మార్చి)లో సేవల రంగంలో నియామకాలు బలంగా ఉంటాయని టీమ్లీజ్ సర్వీసెస్ ‘ఎంప్లాయర్స్ అవుట్లుక్ నివేదిక’ తెలియజేసింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 77 శాతం కంపెనీల ప్రతినిధులు క్యూ4లో నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3) త్రైమాసికంలో ఇలా చెప్పిన సంస్థలు 73 శాతంతో పోలిస్తే నియామకాల సెంటిమెంట్ మెరుగుపడినట్టు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం అంచనాలతో పోలిస్తే 27 శాతం అధికమని టీమ్లీజ్ సర్వీసెస్ నివేదిక తెలిపింది. ఫ్రెషర్లకు (గ్రాడ్యుయేట్లు) ఎక్కువ అవకాశాలు ఇస్తామని 79 శాతం కంపెనీలు చెప్పాయి. ఈ కామర్స్ విభాగంలో 98 శాతం, టెలికమ్యూనికేషన్స్లో 94 శాతం, విద్యా సంబంధిత సేవల్లో 93 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్లో 88 శాతం, రిటైల్లో 85 శాతం, లాజిస్టిక్స్లో 81 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టనున్నాయి. ‘‘అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో ఉద్యోగాల తొలగింపులు, నియామకాల నిలిపివేతల ప్రభావం సేవల రంగంపై ఉంది. కానీ, భారత్లో ఈ సెంటిమెంట్ ఎగువ దిశగా బలంగా ఉంది. 77 శాతం మంది నియామకాలు చేపట్టే ధోరణితో ఉన్నారు’’అని టీమ్ లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మయూర్ తెలిపారు. చదవండి: ఆరేళ్లలో బ్యాంకింగ్ రుణ మాఫీ ఎన్ని లక్షల కోట్లు తెలుసా? -
చిత్తూరులో రూ.250 కోట్లతో.. అమరరాజా కొత్త ప్లాంట్
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా తేనిపల్లి వద్ద రూ.250 కోట్లతో కొత్త తయారీ యూనిట్ను ఏర్పాటుచేస్తున్నట్లు అమరరాజా గ్రూపు ప్రకటించింది. అమరరాజా గ్రూపునకు చెందిన మంగళం ఇండస్ట్రీస్ 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటో బ్యాటరీ విడిభాగాల తయారీ యూనిట్ను ఏర్పాటుచేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యూనిట్ ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసేలా ఆటో విడిభాగాలు, మెటల్ ఫాబ్రికేషన్, బ్యాటరీ విడిభాగాలను డిజైన్ చేసి సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఇక ఈ ప్రాంతంలో తమ వ్యాపార విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు కూడా అమరరాజా గ్రూపు సహ వ్యవస్థాపకుడు జయదేవ్ గల్లా ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. స్థానికులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న కాలంలో ఈ కొత్త యూనిట్ ఏర్పాటు ద్వారా మరో 1,000 మంది స్థానికులకు ఉపాధి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అమరరాజా గ్రూపు 15,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా అందులో మంగళం గ్రూపు 3,000 మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టి మరోవైపు.. సుస్థిర ఇంధన అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇందులో భాగంగా సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నట్లు మంగళం ఇండస్ట్రీస్ డైరెక్టర్ హర్షవర్థన్ గోగినేని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. (చదవండి: రాష్ట్రంలో తొలి టెన్నిస్ అకాడమీ) -
‘పని’కొచ్చే విద్య కావాలి! ఒక సబ్జెక్ట్లో బీటెక్.. సాఫ్ట్వేర్ జాబ్లో చేరిపోవడం!
-కంచర్ల యాదగిరిరెడ్డి ♦ ప్రస్తుతం చదివే చదువుకు, చేసే పనికి ఏమైనా సంబంధం ఉంటోందా? ఏదో ఒక సబ్జెక్ట్లో బీటెక్ చదవడం.. ఏ మాత్రం సంబంధం లేని సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిపోవడం! ఉద్యోగంలో చేరాక తగిన నైపుణ్యం లేక తడబడుతూ భవిష్యత్ను అంధకారం చేసుకోవడం!! ..ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జరుగుతున్నది ఇదే. ఇక్కడ తప్పు ఎవరిది..? చదివిన చదువుదా, ఉద్యోగాలిస్తున్న కంపెనీలదా అని తరచి చూస్తే.. సమస్య అంతా దశాబ్దాల పాటు నామమాత్రపు మార్పులతో నెట్టుకొస్తున్న విద్యా వ్యవస్థలదే. మరి ఏం చేస్తే బాగుంటుందంటే.. తరగతులను తిరగేయాలని, సిలబస్లో సమూలంగా మార్పులు రావాలని అంటున్నారు ప్రొఫెసర్ సంజయ్శర్మ. ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ అయిన సంజయ్శర్మ ‘న్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ పేరుతో ఈ ఏడాది సెపె్టంబర్లో ఓ విధాన పత్రాన్ని విడుదల చేశారు. అంతేకాదు ఉద్యోగార్హతలు, విద్యా (సిలబస్) విధానాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఆయన ఓ పోరాటమే ప్రారంభించారు. ఉన్నత విద్యకు– ఉద్యోగ నైపుణ్యానికి మధ్య అంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య అంతరం పెరిగిపోతూనే ఉంది. డిగ్రీ లేదా పీజీ పట్టా చేత పట్టుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం, అక్కడ చేయాల్సిన పనులను సీనియర్లు చెబితే నేర్చుకోవడం, తప్పులు చేస్తూ దిద్దుకుంటూ ముందుకు వెళ్లడంతోనే సరిపోతోంది. ‘‘ప్రపంచంలో 80శాతం మంది ఉద్యోగులది ఇదే పరిస్థితి. అందువల్ల అన్నిరంగాల్లో పరిశోధనలు కుంటుపడుతున్నాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాలతో కాలం వెళ్లదీస్తున్నంత కాలం పరిశోధనల్లో ముందడుగు ఉండదు’’ అని యాపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ గతంలో పలు సందర్భాలలో ఎత్తిచూపారు. మధ్యతరగతికి భారమవుతున్న ఉన్నత విద్య ఇప్పుడు ఉన్నత విద్య మునుపటిలా చౌక కాదు. బ్యాంకులిచ్చే రుణాలతో చదువుకున్నవారు అప్పులు తీర్చడంతో జీవితాన్ని మొదలుపెడతారు. అమెరికాలో ఉన్నతవిద్యకు అయ్యే ఖర్చు వార్షిక ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరిగిపోతోందని అధ్యక్షుడు బైడెన్ స్వయంగా చెప్పారు. ఈ మధ్యే ఆయన కొన్ని షరతులతో కొందరు విద్యార్థులకు ఫీజు బకాయిలు రద్దు చేశారు. అయినా సరే అమెరికాలో ఇప్పుడు విద్యార్థులపై ఉన్న భారం లక్షా డెబై ఐదు వేల కోట్ల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే సుమారు కోటిన్నర కోట్లు. చాలా దేశాల్లో ఉన్నత విద్యకు సబ్సిడీలు ఇస్తున్నారు. స్థూల జాతీయోత్పత్తిలో సగటున 2.5 శాతం వరకూ విద్యకు ఖర్చు పెడుతున్నారు. ఇంతఖర్చు చేస్తున్నా ఉద్యోగాలకు తగ్గట్టుగా విద్యను రూపొందించడంపై దృష్టి పెట్టడం లేదు. దీనితో డిగ్రీ/ పీజీ పట్టా పుచ్చుకుని ఉద్యోగాల్లో చేరేవారికి నైపుణ్యాలు ఉండటం లేదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పలు సందర్భాల్లో ఉటంకించారు. ఈ క్రమంలోనే కంపెనీలు కాలేజీల డిగ్రీలను పక్కనపెట్టేసి ఉద్యోగులకు తమ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలను తగ్గిస్తున్నాయి. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హత అవసరమైన ఉద్యోగాల సంఖ్య 45 శాతం వరకూ తగ్గిపోయినట్టు ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. విద్యా సంస్థలు మాత్రం ఈ సమస్యను గుర్తించడం లేదు. ఎంఐటీ ప్రొఫెసర్ సంజయ్ శర్మ ‘న్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ పేరిట చేసిన ప్రతిపాదనపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత సానుకూలతలను కొనసాగిస్తూనే.. ‘న్యూఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ ప్రతిపాదిస్తున్న కొత్త పద్ధతి ప్రస్తుత ఉన్నత విద్య విధానంలోని మేలైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. సామాజిక, భావోద్వేగ అభివృద్ధితోపాటు బతికేందుకు అనువైన సంపూర్ణమైన చదువు ప్రస్తుత విద్యావిధానంలోని సావకాశం. ఎట్టి పరిస్థితుల్లో వీటిని కాపాడుకోవాల్సిందే అంటారు సంజయ్ శర్మ. తాము వీటికి మరిన్ని అంశాలను జోడించి కంప్యూటర్ సైన్స్, బిజినెస్ రంగాలకు ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని ప్రతిపాదిస్తున్నామని ఆయన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ కోసం రాసిన ఒక వ్యాసంలో తెలిపారు. ఈ కొత్త విధానంలో బోధన పద్ధతులతోపాటు నిర్మాణాత్మక బోధన అంశాల్లోనూ మార్పులు చేస్తున్నామన్నారు. మొత్తమ్మీద చూస్తే ఈ కొత్త విధానంలో ‘ఫ్లిప్డ్ క్లాస్రూమ్’ అనేది ఒక అంశం. ప్రస్తుతం తరగతి గదిలో కేవలం ప్రొఫెసర్లు చెప్పే పాఠాలు (సిలబస్కు లోబడి) మాత్రమే ఉంటున్నాయి. మొత్తం కోర్సు అవధిలో 95 శాతం ఈ పాఠాలే. మిగతా ఐదు శాతం కంపెనీల్లో ఇంటర్న్íÙప్లు లేదా ప్రాక్టికల్స్ ఉంటాయి. ‘ఫ్లిప్డ్ క్లాస్రూమ్’లో ఏముంటుంది? ఫ్లిప్డ్ క్లాస్రూమ్ ప్రస్తుత విధానానికి భిన్నంగా ఉంటుంది. పాఠాలన్నీ డిజిటల్ రూపంలో ఉంటాయి. విద్యార్థి తనకు కావాల్సిన టైమ్లో వాటిని చూసుకోవచ్చు. వాస్తవంగా తరగతి గదిలో ఉద్యోగ సంబంధిత అంశాలపై చర్చలు జరుగుతాయి. నైపుణ్యాల శిక్షణ ఇస్తారు. న్యూఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోర్సు కూడా నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో సెమిస్టర్లకు బదులు 11 ట్రైమిస్టర్లు (త్రైమాసికాలు) ఉంటాయి. ఇందులో నాలుగింటిలో పరిశ్రమకు సంబంధించిన అంశాలను విద్యార్థికి అందజేస్తారు. వీటిని కో–ఆప్స్ అని పిలుస్తున్నారు. పరిశోధనశాలలు, మ్యూజియంలు, ఇతర విశ్వవిద్యాలయాలు, ఐఎంఎఫ్, యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ కో–ఆప్స్లో భాగంగా ఉంటాయి. కంపెనీల ఉద్యోగులు కొందరు తమ ఉద్యోగాలకు తాత్కాలిక విరామమిచ్చి విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకుంటారు. ఈ భాగస్వామ్యం వల్ల విద్యార్థికి చాలా లాభాలు ఉంటాయి. పైగా కోర్సు సమయంలోనే విద్యార్థి కొంత ఆదాయం పొందే అవకాశమూ ఏర్పడుతుంది. కో–ఆప్స్ సమయంలో కంపెనీలు విద్యార్థులకు రెమ్యూనరేషన్ చెల్లిస్తాయి. కంపెనీలకు తమకు కావాల్సిన నైపుణ్యాలతో ఉద్యోగార్థులు లభిస్తారు. న్యూఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రతిపాదిస్తున్న కొత్త డిగ్రీలో ఐదారు అంశాలపై క్రెడిట్స్ ఉంటాయి. ఒక్కో అంశానికీ ప్రత్యేకంగా విలువ ఉంటుంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో లీనియర్ ఆల్జీబ్రా, కంప్యూటేషన్, మెషీన్ లెర్నింగ్లతోపాటు నైతిక విలువలు, సామాజిక శా్రస్తాలు కలగలిపి బోధిస్తారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేయకపోయినా.. వారు సాధించిన క్రెడిట్లకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కోర్సుకాలం పూర్తయిపోయినా మిగిలిన క్రెడిట్లను ఎప్పుడైనా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. చదువుతూనే.. అప్రెంటిస్షిప్.. నిజానికి న్యూఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రతిపాదిస్తున్న కొత్త విద్యావిధానం ఇతర రూపాల్లో కొన్నిచోట్ల అమల్లో ఉంది. ఉదాహరణకు జర్మనీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చదివేవారు కాలేజీలో సగం సమయం మాత్రమే ఉంటారు. తర్వాత సంబంధిత పరిశ్రమలో వారికి ఒకేషనల్ అప్రెంటిస్íÙప్ పేరుతో శిక్షణ అందిస్తారు. అది పూర్తయిన తరువాతే డిగ్రీ లభిస్తుంది. భారత్ విషయానికి వస్తే ఆతిథ్య రంగంలో ఈ రకమైన విధానం అమల్లో ఉంది. ఐహెచ్ఎస్ వంటి సంస్థల్లో కోర్సులు చేసేటప్పుడు కోర్సులో గణనీయమైన సమయం హోటల్స్, రెస్టారెంట్లలో ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, మరికొన్ని సంస్థల్లోనూ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఈ రకమైన పద్ధతి అమల్లో ఉంది. ఇప్పుడు శర్మ ప్రతిపాదన అమల్లోకి వస్తే చదవడంతో పాటు నేర్చుకోవాలన్న తపన ఉన్న వారికి ఉద్యోగావకాశాలకు కొదవ ఉండదు. దేశంలో పది మందిలో ఒకరికే నైపుణ్యాలు భారతదేశంలో చదువులకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య సంబంధమే లేదని చెప్పాలి. ప్రతి పది మంది పట్టభద్రుల్లో ఒకరికి, ప్రతి ఐదుగురు ఇంజనీర్లలో ఒకరికి, నలుగురు మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లలో ఒకరికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. దేశంలో ఏటా సుమారు కోటీ 30లక్షల మంది ఉద్యోగ మార్కెట్లోకి అడుగుపెడుతుంటే.. వీరిలో అత్యధికులకు నైపుణ్యాలు ఉండటం లేదు. ఎప్పుడో కాలం చెల్లిననాటి ఉద్యోగాలకు తగ్గట్టు విద్యాబోధన ఉండటమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ఐఐటీ ఖరగ్పూర్ డీన్ జయంత ముఖోపాధ్యాయ స్పష్టం చేశారు. నైపుణ్యాల ఆవశ్యకత గురించి ఐక్యరాజ్యసమితి దాదాపు దశాబ్దకాలంగా చెప్తున్నా భారత్లో ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు నామమాత్రమే. 2020 నాటి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక కూడా డేటాసైన్స్, బిగ్ డేటా, మెషీన్ లెరి్నంగ్, ఏఐ, వెబ్ డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్ వంటి రేపటి తరం నైపుణ్యాలను ఉద్యోగార్థులకు అందించాలని సూచించడం గమనార్హం. రెండేళ్ల క్రితం విడుదలైన జాతీయ విద్యా విధానం కూడా పిల్లలకు ఆరో తరగతి నుంచే వృత్తి నైపుణ్యాలను అందించాలని.. ఇంటర్న్షిప్స్ ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలను ముందుగానే అందించాలని సిఫార్సు చేసింది. -
హైదరాబాద్లో బోర్డు తిప్పేసిన కంపెనీ.. వత్తులు, బొట్టు బిల్లల వ్యాపారమంటూ..
కుషాయిగూడ (హైదరాబాద్): ఉపాధి చూపుతానంటూ ముగ్గులోకి దించి అందిన కాడికి దండుకొని బోర్డు తిప్పేసిన ఘటన సోమవారం హైదరాబాద్లో వెలుగుచూసింది. రావులకొల్లు రమేశ్ అనే వ్యక్తి ఏఎస్ రావునగర్లో ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ (గ్రోయింగ్ టుగెదర్) కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. వత్తులు, బొట్టుబిల్లలు తయారు చేసే మిషన్లు సరఫరా చేస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. మిషన్లు కొనుగోలు చేసేవారికి అవసరమైన ముడిసరుకు తానే సరఫరా చేస్తానని, తయారు చేసిన వత్తులు, బొట్టుబిల్లలను కూడా తానే కొనుగోలు చేసి ఉపాధి చూపుతానంటూ నమ్మించాడు. ఆకర్షితులైన వారు వత్తుల మిషన్కు రూ.1.50 లక్షలు, బొట్టు బిల్లల మిషన్కు రూ.2.20 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేసి వత్తులు, బొట్లు తయారు చేయడం మొదలుపెట్టారు. వారి వద్ద నుంచి కిలో వత్తులకు రూ.300, కిలో బొట్లకు రూ. 600 చెల్లిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో గొలుసు కట్టు మాదిరిగా ఆంధ్ర, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల వారూ మిషన్లు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. ఇలా వేల మంది యంత్రాలు కొనుగోలు చేయడంతో దాదాపు రూ.30 కోట్లు ఆర్జించాడు. కొన్నిరోజులుగా తయారీదారుల నుంచి వత్తులు, బొట్టుబిల్లలు తీసుకుంటున్నారే తప్ప డబ్బులు చెల్లించడం లేదు. ఈ క్రమంలో నాగర్జుననగర్ కాలనీకి చెందిన రుద్రరాజు రామసీత అనే మహిళకు చెందిన యంత్రాలు రిపేర్కు వచ్చాయి. ఆఫీసుకు వెళ్లగా ఆమెలా ఇబ్బందులు పడుతున్న చాలామంది అక్కడ కనిపించారు. దీంతో తాము మోసపోయా మని గ్రహించిన వారు.. వారం రోజులుగా ఆ ఆఫీసుకు వెళ్తున్నా రమేష్ అందుబాటులోకి రాలేదు. దీంతో బాధితులంతా కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
గేమింగ్లో భారీ ఉద్యోగాలు
ముంబై: గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మందికి (ప్రత్యక్షంగా, పరోక్షంగా) ఉపాధి కల్పించొచ్చని టీమ్లీజ్ డిజిటల్ తెలిపింది. ప్రోగ్రామింగ్, టెస్టింగ్, యానిమేషన్, డిజైన్ తదితర విభాగాల్లో ఈ ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. 20–30 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ‘గేమింగ్–రేపటి బ్లాక్ బస్టర్’పేరుతో టీమ్లీజ్ డిజిటల్ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం.. గేమింగ్ పరిశ్రమ ప్రస్తుతం ప్రత్యక్షంగా 50వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో 30 శాతం ఉద్యోగాలు ప్రోగ్రామర్లు, డెవలపర్ల రూపంలోనే ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో ఈ రంగంలో గేమ్ డెవలపర్లు, యూనిటీ డెవలపర్లు, గేమ్స్ టెస్ట్ ఇంజనీర్లు, క్యూఏ హెడ్లు, యానిమేటర్లు, మోషన్ గ్రాఫిక్ డిజైనర్లు, వర్చువల్ రియాలిటీ డిజైనర్లు, వీఎఫ్ఎక్స్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్లకు డిమాండ్ ఉంటుంది. అధిక వేతనం.. ఈ రంగంలో అత్యధికంగా గేమ్ ప్రొడ్యూసర్లకు రూ.10 లక్షల వార్షిక వేతనం ఉంటే.. గేమ్ డిజైనర్లకు 6.5 లక్షలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రూ.5.5 లక్షలు, గేమ్ డెవలపర్లు రూ.5.25 లక్షలు, క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టర్లకు రూ.5.11 లక్షల చొప్పున వార్షిక ప్యాకేజీలున్నాయి. ‘‘గేమింగ్ పరిశ్రమ తదుపరి ఉదయించే రంగం. యూజర్ల సంఖ్య పెరుగుతుండడంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు వెల్లువలా రానున్నాయి. తరచూ నియంత్రణపరమైన నిబంధనల మార్పు రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ.. గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మందికి ఉపాధినిస్తుంది. 2026 నాటికి 2.5 రెట్లు వృద్ధి చెందుతుంది’’అని టీమ్లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్కోటిల్ తెలిపారు. 2026 నాటికి గేమింగ్ పరిశ్రమ రూ.38,097 కోట్లకు చేరుతుందని టీమ్లీజ్ అంచనా వేసింది. ఆదాయం పరంగా భారత్ గేమింగ్ పరిశ్రమ అంతర్జాతీయంగా ఆరో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా ఈ విపణి విలువ రూ.17,24,800 కోట్లుగా ఉంది. -
ఫ్రెషర్ల నియమాకాలపై కంపెనీల్లో సానుకూలత
ముంబై: ఫ్రెషర్లకు ఉపాధి కల్పించే విషయంలో కంపెనీల్లో సానుకూల ధోరణి 61 శాతానికి పెరిగింది. టెక్నాలజీ, డిజిటల్ సేవలకు డిమాండ్తో సంస్థలు మరింత మంది ఫ్రెషర్లను తీసుకోవాలని అనుకుంటున్నట్టు టీమ్లీజ్ ఎడ్యుటెక్ కెరీర్ అవుట్లుక్ నివేదిక తెలిపింది. దీంతో ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాలు గతేడాది జూన్–డిసెంబర్ కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలానికి మూడు రెట్లు అధికంగా ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయ భాగం ఆరంభంలో నిపుణులను ఆకర్షించడం ప్రముఖ కంపెనీలు, వ్యాపారవేత్తలకు ప్రాధాన్య అంశంగా మారినట్టు తెలిపింది. 865 చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీలపై టీమ్లీజ్ ఈ సర్వే నిర్వహించింది. ఐటీ 34 శాతం, ఈ కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్లు 23 శాతం, టెలీ కమ్యూనికేషన్స్ 22 శాతం, ఇంజనీరింగ్ రంగం 20 శాతం మేర గతేడాది ఇదే కాలంతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది ద్వీతీయ ఆరు నెలల కాలంలో ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాల పరంగా.. బెంగళూరు 25 శాతం, ముంబై 19 శాతం, ఢిల్లీ 18 శాతం వృద్ధిని చూపించనునన్నట్టు అంచనా వేసింది. -
అందరికీ ఉపాధి: పీపుల్స్ కమిషన్ కీలక నివేదిక
న్యూఢిల్లీ: ప్రభుత్వం పని చేసే హక్కును తీసుకురావాల్సిన అవసరం ఉందని, అందరికీ ఉపాధి కల్పించేందుకు వీలుగా జీడీపీలో ఏటా 5 శాతం చొప్పున (సుమారు రూ.13.52 లక్షల కోట్లను) కేటాయించాలని ఓ సంస్థ సూచించింది. దేశ్ బచావో అభియాన్ ఏర్పాటు చేసిన ‘పీపుల్స్ కమిషన్ ఆన్ ఎంప్లాయిమెంట్, అన్ఎంప్లాయిమెంట్’ ఈ నివేదికను విడుదల చేసింది. ఏవో నామమాత్రపు నిధుల కేటాయింపులతో పూర్తి స్థాయి ఉపాధి కల్పన అసాధ్యమని అభిప్రాయపడింది. చట్టంలోనూ, సామాజిక-రాజకీయ, ఆర్థిక విధానాల్లోనూ గణనీయమైన మార్పులు అవసరమని పేర్కొంది. దేశ పౌరులకు తగినంత ఉపాధి కల్పించేందుకు ‘రైట్ టు వర్క్’ చట్టాన్ని తేవాలని కోరింది. దేశంలో పనిచేసేందుకు 21.8 కోట్ల మంది సిద్ధంగా ఉన్నారంటూ.. వీరికి ఉపాధి కల్పించేందుకు జీడీపీలో ఏటా 5 శాతం నిధుల కేటాయింపు అవసరాన్ని ప్రస్తావించింది. అలాగే, ఏటా ఒక శాతం చొప్పున ఐదేళ్లపాటు పెంచుతూ వెళ్లాలని సూచించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని పొందుతున్న వారిని ఈ గణాంకాల నుంచి మినహాయించింది. ఉపాధి కల్పన పెరిగితే అది పెద్ద ఎత్తున ఉత్పత్తికి దారితీస్తుందని, తద్వారా డిమాండ్ బలోపేతం అవుతుందని సూచించింది. ప్రస్తుతం దేశంలో 30.4 కోట్ల మందికే సరైన ఉపాధి ఉన్నట్టు తెలిపింది. -
గ్రామ స్వరాజ్యం.. మహిళలకే పెద్దపీట.. రాష్ట్రంలో 4,30,684 సంఘాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామస్వరాజ్య లక్ష్య సాధనలో గ్రామీ ణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద, ఇతర వర్గాల మహిళలు సొంతంగా తమ కాళ్లపై నిలబడడంతో పాటు ఒక సంఘటిత శక్తిగా ఎదిగేందుకు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని వారితో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఘాలు మహిళలను పొదుపు వైపు మళ్ళించి, ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తోడ్పతున్నాయి. మెరుగైన స్వయం ఉపాధి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 4,30,648 సంఘాలు ఉండగా, వాటిలో 46,09,843 మంది సభ్యులున్నారు. ఈ సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో అనేకమంది మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ప్రజలు రోజూ ఉపయోగించే వస్తువులను స్థానికంగా ఉత్పత్తి చేయడంలో శిక్షణనిచ్చి వారిని తయారీరంగం వైపు మళ్ళి స్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు 32 జిల్లా, 553 మండల, 17,980 గ్రామ సమాఖ్యలు పనిచేస్తున్నాయి. మహిళలు తమకున్న నైపుణ్యాలతో రకర కాల వస్తువులను తయారు చేస్తున్నారు. వీటి విక్రయానికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మేళాలు ఏర్పా టు చేస్తున్నారు. బంగ్లాదేశ్ సహా వివిధ దేశా ల్లో నిర్వహించిన ప్రదర్శనలకు రాష్ట్ర మహిళలు హాజరయ్యారు. సెర్ప్ ద్వారా రూ.65 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రాష్ట్రంలో గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంస్థ (సెర్ప్) ద్వారా 2022–23లో ఈ సంఘాలకు రూ.15 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ కల్పన లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు 32 జిల్లాల్లోని మహిళా సంఘాలకు నిర్దేశిత బ్యాంక్ లింకేజీ లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందించే చర్యలు ఊపందుకున్నాయి. ఇప్పటికే రూ.6,887 కోట్ల మేర లింకేజీ కల్పించారు. 2023 మార్చి 31 లోగా ఈ లింకేజీలు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. సెర్ప్ ద్వారా గత 8 ఏళ్లలో (2014–15 నుంచి 2021–22 వరకు) రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ కలి్పంచినట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్లిప్కార్ట్, ప్లాంట్ లిపిడ్స్తో సెర్ప్ ఒప్పందం మహిళా సంఘాల ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో విస్తృత మార్కెటింగ్ అవకాశాల కల్పనకు ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, ప్లాంట్ లిపిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లతో సెర్ప్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 140 రకాల ఉత్పత్తులు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆన్లైన్లో విక్రయానికి వీలు కుదిరింది. ఇలాంటి ఎంవోయూ కుదరడం దేశంలోనే మొదటిసారి. కాగా దీనివల్ల స్థానికంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. ఈ ఏడాది రూ. 500 కోట్ల వ్యాపార లక్ష్యంగా నిర్దేశించారు. మహిళా సంఘాలకు చెందిన ఎండుమిర్చి ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఈ ఏడాది రూ.200 కోట్ల వ్యాపారం లక్ష్యంగా ప్లాంట్ లిపిడ్స్తో ఒప్పందం కుదిరింది. చదవండి: వానాకాలం సీఎంఆర్పై నీలినీడలు -
సృజన: తెలుగింటి బార్బీ
పట్టులంగా, ఓణీ కట్టిన బొమ్మలు కాళ్లకు పారాణి, నుదుటన బాసికం కట్టిన బొమ్మలు, పసుపు కొట్టే బొమ్మలు.. పందిట్లో బొమ్మలు, అమ్మవారి బొమ్మలు, అబ్బురపరిచే బొమ్మలు.. చిందేసే బొమ్మలు.. చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనిపించే బొమ్మలు ..,ఎవ్వరి చూపులనైనా కట్టిపడేసేలా ఉండే బొమ్మలేవీ అంటే.. అవి దివ్య తేజస్వి చేతుల్లో రూపుదిద్దుకున్న అందమైన బొమ్మలై ఉంటాయి. వెస్ట్రన్ బార్బీ డాల్ను ఇండియన్ డాల్గా మార్చేసి, వాటిని మన సంప్రదాయ వేడుకలకు అనువుగా మార్చేసింది హైదరాబాద్ ఎఎస్రావు నగర్కు చెందిన దివ్య తేజస్వి. అమ్మాయి పుట్టుక నుంచి షష్టిపూర్తి వరకు ప్రతి వేడుకను బొమ్మల్లో అందంగానూ, అర్థవంతంగానూ చూపుతూ పది మందికి ఉపాధి కల్పిస్తోంది. భర్త ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉంటున్న దివ్య ఈ అందమైన బొమ్మల రూప కల్పన గురించి అడిగితే ఒక చిన్న ఆలోచన తన జీవితాన్ని ఎలా నిలబెట్టిందో, పదిమందికి ఆదాయవనరుగా ఎలా మారిందో నవ్వుతూ వివరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘దసరా వచ్చిందంటే బొమ్మల కొలువు గురించి ఆలోచన చేయకుండా ఉండరు. అలాగే, ఒక బొమ్మనైనా ఇంటికి తెచ్చుకుంటారు. నేను ఇంట్లోనే బొమ్మల తయారీ మొదలుపెట్టాను. పాప ముచ్చట తీర్చిన బొమ్మ అమ్మానాన్నలది వెస్ట్ గోదావరి. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డాం. బయోకెమిస్ట్రీ చేశాను. జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం చేసేదాన్ని. పెళ్లయ్యాక మా వారి ఉద్యోగరీత్యా బెంగుళూరు వెళ్లాను. అక్కడ టీచర్గా ఉద్యోగంలో చేరాను. మాకు ఓ పాప. హ్యాపీగా గడిచిపోతున్నాయి రోజులు అనుకున్న సమయంలో కరోనా మా జీవితాలను దెబ్బతీసింది. మా ఉద్యోగాలు పోయాయి. అద్దె కట్టడానికి కూడా కష్టంగా ఉన్న రోజులు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. ఓరోజు మా పాప తన బొమ్మకి డ్రెస్ వేసివ్వమంటే, నా చీర అంచుతో చీరకట్టి, అలంకరించి ఇచ్చాను. దాన్ని ఫొటో తీసి ఇన్స్టా పేజీలో పెట్టాను. ఆర్డర్లు తెచ్చిన బొమ్మలు నేను పెట్టిన బొమ్మ ఫొటో నచ్చి అమెరికా నుంచి ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేశారు. ‘నాకు ఆ బొమ్మ చాలా నచ్చింది. మా అమ్మాయి ఓణీ ఫంక్షన్ ఉంది. వచ్చినవారికి రిటన్గిఫ్ట్ ఇవ్వాలి. నాకు అలాంటి బొమ్మలు ఒక పదిహేను కావాలి. చేసిస్తారా..’ అంది. నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వేసింది. ఆ నెల రెంట్ ఇవ్వకుండా ఓనర్తో మాట్లాడి, ఆ డబ్బుతో బార్బీ బొమ్మలు, వాటికి కావల్సిన మెటీరియల్ తీసుకొచ్చాను. వ్యాపారం అనుకోలేదు. కానీ, ముందు గణేషుడి బొమ్మ తయారు చేశాను. ఆ ముద్దు వినాయకుడిని చూసి ఆ రోజు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఇక వెస్ట్రన్ కల్చర్తో ఉండే బార్బీ బొమ్మను తెలుగింటి సంప్రదాయం అద్దుకునేలా తయారు చేయడానికి చాలా ప్రయోగాలే చేయాల్సి వచ్చింది. జుట్టు రంగు, స్కిన్కలర్, కళ్లు.. వీటితో పాటు డ్రెస్సింగ్.. చాలా సమయమే తీసుకుంది. కానీ, ఒక్కో బొమ్మ తయారు చేసి, అనుకున్న సమయానికి పంపాను. ఆ ఆర్డర్ తర్వాత మరో ఆర్డర్ వచ్చింది. అలా వచ్చిన డబ్బుతో ఇంటి అద్దె కట్టాం. సందర్భానికి తగిన కానుకలు మా అమ్మనాన్నలకు నేను, చెల్లి సంతానం. మా చిన్నప్పుడు మేం ఆడుకోవడానికి మా అమ్మ క్లాత్తో బొమ్మలు కుట్టి, చీరలు కట్టి, వాటికి పూసలతో అలంకారం చేసేది. నాకు అదంతా గుర్తుకువచ్చింది. మన సంప్రదాయాల్లో ఎన్నో పండగలు ఉన్నాయి. వాటిని ఉదాహరిస్తూ బొమ్మలు తయారు చేసేదాన్ని. మొదట్లో అంతగా గుర్తింపు లేదు కానీ మెల్ల మెల్లగా గుర్తింపు రావడం మొదలైంది. పుట్టుక నుంచి షష్టిపూర్తి వరకు అమ్మాయి పుట్టిన నాటి నుంచి ప్రతీది వేడుకలాగే సాగుతుంది ఆమె జీవితం. ఒక ఆర్డర్ అయితే వాళ్లమ్మాయి మొదటి రోజు స్కూల్కి వెళుతోంది, ఆ రోజును పురస్కరించుకుని బొమ్మ కావాలని అడిగారు. ఉయ్యాల నుంచి విద్యాభ్యాసం, ఓణీ ఫంక్షన్, పెళ్లి, సీమంతం, గృహప్రవేశం, షష్టిపూర్తి ... వరకు ఇలా ప్రతి దశలోనూ జరిగే వేడుక సందర్భాన్ని తీసుకొని, దానికి అనుగుణంగా బొమ్మల సెట్స్ను తయారుచేయడం ప్రారంభించాను. ఆర్డర్లు పెరుగుతున్నాయి. నాతోపాటు నాకు తెలిసిన స్నేహితులు జత కలిశారు. ఆర్డర్లు పెరుగుతున్న కొద్దీ వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకరు డ్రెస్ కుడతారు, మరొకరు హెయిర్ బ్లాక్గా రావడానికి, ఇండియన్ స్కిన్ కలర్కి తేవడానికి, కళ్లు డిజైన్ చేయడానికి కష్టపడతారు. మొదట్లో నాకు ఒక్క బొమ్మ చేయడానికి రోజు మొత్తం పట్టేది. ఇప్పుడు 2–3 గంటలు పడుతుంది. నేను చేసిన విధానం నేర్పించి, నా పనిలోకి తీసుకున్నవారిలో కాలేజీ అమ్మాయిలు, గృహిణిలు ఉన్నారు. వాళ్ల ఇంటి వద్దే వర్క్ చేసిచ్చేవారున్నారు. హైదరాబాద్లో ఉన్న మా అమ్మ, చెల్లెలు కూడా ఈ బొమ్మల తయారీలో భాగమయ్యారు. మా అమ్మ, మా చెల్లెలు బొమ్మలకు జడలు, పువ్వులు కుట్టి, పంపుతారు. మా వారు షాపింగ్ చేసుకొస్తారు. ఆన్లైన్లో చూసి, నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిలు అలంకరణలో మార్పులు చేర్పులు, ప్యాకింగ్లో సాయం చేస్తుంటారు. మా చెల్లెలు ‘లలిత డాల్స్’ అనే పేరుతో ఉన్న ఇన్స్టా పేజీలో ఫొటోలన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇలా కొందరి చేయూతతో నా బొమ్మలు మరింత అందంగా రూపుకడుతున్నాయి. బడ్జెట్కు తగినట్టు.. ఒక బొమ్మ రూ. 200 నుంచి ధర ఉంది. వెడ్డింగ్ సెట్ అయితే రూ. 15000 వరకు ఉంటుంది. తక్కువ ధరలో సెట్ కావాలంటే అందుకు తగినట్టు కస్టమైజ్ చేసి ఇస్తున్నాను. ఇది దసరా సమయం కాబట్టి, అమ్మవారి బొమ్మలు, బతుకమ్మ ఆడుతున్న మహిళల బొమ్మల సెట్.. తయారుచేశాను. హైదరాబాద్లోని ఎఎస్రావునగర్లో ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టాం. అమ్మాయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలతో పాటు పౌరాణిక గాధలు కూడా ఈ బొమ్మల ద్వారా చూపుతున్నాను’’ అని వివరించింది ఈ కళాకారిణి. – నిర్మలారెడ్డి -
కాంబోడియా వస్తున్నారా.. జర జాగ్రత్త!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి, పర్యాటకం నిమిత్తం కాంబోడియాను సందర్శించాలనుకునేవారు కన్సల్టెన్సీ లేదా సంస్థ లేదా కంపెనీ నేపథ్యాన్ని సరిచూసుకోవాలని కాంబోడియాలోని భారత దౌత్యకార్యాలయం సూచించింది. కరీంనగర్కు చెందిన ఆరుగురు యువకులు ఉపాధి కోసం కాంబోడియాకు వెళ్లి అక్కడ సైబర్ స్కాంలకు పాల్పడే చైనా వారి చేతిలో బందీలుగా మారిన విషయం తెలిసిందే. వారిని కాపాడాలంటూ ఎంపీ బండి సంజయ్ విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఆయన ఫిర్యాదుకు ఈ నెల 19న ‘కొలువని చెప్పి.. స్కాం కేఫ్లో ఖైదు చేసి’అన్న శీర్షికన ప్రచురితమైన ‘సాక్షి’కథనాన్ని జోడించారు. కాంబోడియా రాజధాని పెనామ్ పెన్లోని భారత రాయబార కార్యాలయం దీనిపై స్పందించి గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాంబోడియాకు వస్తున్న భారతీయులు మానవ అక్రమ రవాణా, ఇతర అసాంఘిక ముఠాల చేతుల్లో ఇబ్బందులు పడుతున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించింది. భారత్ నుంచి వచ్చే నిరుద్యోగులు టూరిస్టు వీసాలపై ఉపాధి కోసం పంపించే ప్రయత్నాలను ప్రోత్సహించవద్దని స్పష్టం చేసింది. -
India Ideas Summit: వృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయం
న్యూఢిల్లీ: దేశాభివృద్ధి, ఉపాధి కల్పనే కేంద్రం ముందున్న ప్రధాన లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం దారికొస్తోందని, దీనిపై దీర్ఘకాలంపాటు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండబోదని కూడా ఈ సందర్భంగా విశ్లేషించారు. రికార్డు గరిష్ట స్థాయిల నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వృద్ధి, దేశ సంపద ఫలాలు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వం ముందున్న ప్రాధాన్యతా అంశంగా పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీని కట్టడే లక్ష్యంగా మే నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 1.4 శాతం (ప్రస్తుతం 5.4 శాతానికి పెరుగుదల) పెంచిన నేపథ్యంలో సీతారామన్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. రెపో రేటు పెంపునకు తక్షణం ఇక ముగింపు పడినట్లేనా అన్న సందేహాలకు ఆమె ప్రకటన తావిస్తోంది. ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’లో ఈ మేరకు ఆమె చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► రిటైల్ ద్రవ్యోల్బణం కొద్ది నెలలుగా దిగివస్తోంది. దీనిని మనం నిర్వహించగలిగిన స్థాయికి తీసుకురాగలుగుతున్నాం. ఇప్పుడు ప్రధాన ప్రాధాన్యతలు ఉపాధి కల్పన, వృద్ధికి ఊపును అందించడం. (ఆర్బీఐ కఠిన పాలసీ విధానం, సరఫరాల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యల నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెల జూలైలోనూ తగ్గి 6.71 శాతానికి చేరింది. ఏప్రిల్లో 7.79 శాతం, మేలో 7.04 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో 7.01 శాతానికి దిగివచ్చింది. నిజానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే ఏడు నెలలుగా 6 శాతం ఎగువనే కొనసాగుతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1 శాతం, 6.4శాతం, 5.8శాతాలుగా నమోదవుతాయని ఆర్బీఐ పాలసీ అంచనావేసింది. 2023– 24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5 శాతానికి ఇది దిగివస్తుందని భావించింది. ► అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు రేట్ల పెంపు వైఖరి నుండి ఉద్భవిస్తున్న అస్థిరతను ఎదుర్కొనే విషయంలో రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. భారత్ ద్రవ్య విధానాన్ని పెద్ద అవాంతరాలు లేదా తీవ్ర ఒడిదుడుకులు లేకుండా నిర్వహించగలమన్న ఆర్బీఐ అధికారులు విశ్వసిస్తున్నారు. ► కోవిడ్–19 కాలంలో కేంద్రం ఆర్థిక నిర్వహణ పటిష్టంగా ఉంది. లక్ష్యంతో కూడిన ఆర్థిక విధానంతో భారత్ డబ్బును ముద్రించకుండా సవాళ్లతో కూడిన సమాయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. ► రష్యా–ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభ వల్ల ముడి చమురు, సహజ వాయువు లభ్యతపై అనిశ్చితి కొనసాగుతోంది. ► చెల్లింపులకు సంబంధించి సాంకేతికతతో సహా అన్ని ఆర్థిక అంశాలకు సంబంధించి భారత్– అమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. భారత్, అమెరికాలు కలిసి పని చేస్తే, మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో 30 శాతానికి చేరుకుంటాం. రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచ జీడీపీలో 30 శాతం వాటాను అందిస్తాము. ఈ పరిస్థితి భారత్–అమెరిలను ప్రపంచ వృద్ధికి ఇంజిన్గా మారుస్తుంది. ► భారత్ డేటా డేటా గోప్యత, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్రం కొత్త డేటా గోప్యతా బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ► అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతల ను తీసుకోనుంది. డిసెంబర్ 1నుంచి 2023 న వంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల స మయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెడుతుంది. ఐఎంఎఫ్ కోటా సమీక్ష సకాలంలో జరగాలి... కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని సీతారామన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్ షేర్కు సంబంధించిన అంశం. ప్రస్తుతం ఐఎంఎఫ్లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం. ఐఎంఎఫ్ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్ 15వ తేదీలోపు ముగియాలి. వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దుబాటు జరగాలని, వాటి ఓటింగ్ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్ డిమాండ్ చేస్తోంది. జీ20 బాధ్యతలు స్వీకరించనున్న భారత్తో పలు అంశాలపై చర్చించడానికి దేశంలో పర్యటిస్తున్న ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివాతో సమావేశం అనంతరం కోటా అంశంపై సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాదే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ రవిశంకర్ వెల్లడి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఈ ఏడాదే ‘పైలెట్ బేసిస్’తో ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ టీ రబీ శంకర్ ప్రకటించారు. దీనివల్ల అంతర్జాతీయంగా వివిధ దేశాలతో ఆర్థిక లావాదేవీల మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఆయా అంశాలకు సంబంధించి సమయం, వ్యయం రెండూ తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. 2022–23 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయికి సమానమైన డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ విడుదల చేస్తుందని చెప్పారు. ‘‘జీ–20, అలాగే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వంటి సంస్థలతో ఇప్పుడు ఎదుర్కొంటున్న చెల్లింపుల సమస్యను పరిష్కరించడానికి సీబీడీసీ అంతర్జాతీయీకరణ చాలా కీలకమని మనం అర్థం చేసుకోవాలి’’ అని ఇండియా ఐడియాస్ సమ్మిట్లో టీ రబీ శంకర్ అన్నారు. -
టీడీపీ సర్కార్ నిర్వాకాలు: షి‘కారు’ వెనుక డీలర్లతో డీల్!
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఎస్సీ యువతకు ఉపాధి పేరుతో కేటాయించిన వాహనాలు, యంత్రాలను పక్కదారి పట్టించిన వ్యవహారంలో తవ్వేకొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నిరుద్యోగ ఎస్సీలకు దక్కాల్సిన కార్లను టీడీపీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలు కాజేసినట్లు ఇటీవల విజిలెన్స్ నిగ్గుతేల్చిన సంగతి తెలిసిందే. టీడీపీ పెద్దల సిఫారసు ఉన్నవారికే వాహనాలు ఇచ్చేలా ముందస్తు ఒప్పందాలు జరిగాయి. ఎస్సీ కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ వారికి లబ్ధి చేకూర్చారు. ఇదిలా ఉండగా వాహనాలు సరఫరా చేసే డీలర్లతో టీడీపీ పెద్దలు కుదుర్చుకున్న డీల్ తాజాగా బహిర్గతమైంది. నిబంధనలకు విరుద్ధంగా ఇండెంట్ పెట్టిన వాహనాలన్నింటికీ డీలర్లకు ముందుగానే అడ్వాన్సులు చెల్లించారు. అయితే డీలర్లు ఆ మేరకు వాహనాలను సరఫరా చేయలేదు. ఏళ్ల తరబడి వాహనాలు ఇవ్వకుండా, ప్రభుత్వానికి నగదు తిరిగి చెల్లించకుండా డీలర్ల వద్దే డబ్బులు ఉండటాన్ని గమనిస్తే బినామీల బాగోతం, అక్రమ వ్యవహారాలు తేటతెల్లమవుతున్నాయి. సబ్సిడీ రుణాలంటూ గొప్పలు.. ఎస్సీ యువతకు ఉపాధి కోసం వాహనాలు / యంత్రాలు సమకూర్చి సబ్సిడీ రుణాలు ఇచ్చినట్లు గత సర్కారు గొప్పలు చెప్పుకుంది. నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్ఎఫ్డీసీ), నేషనల్ సఫాయి కర్మచారీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్కేఎఫ్డీసీ) ద్వారా వివిధ పథకాల కింద 2017–18 నుంచి 2018–19 వరకు సబ్సిడీపై వాహనాల కోసం రూ.వందల కోట్ల నిధులు కేటాయించారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలకే లబ్ధి చేకూర్చేలా గత సర్కారు పెద్దలు డీలర్లతో గుట్టు చాటుగా వ్యవహారాన్ని నడిపించారు. ఐదు పథకాలు.. పథకం ప్రకారం! వాహనాలు అందకుండానే గత సర్కారు డీలర్లకు ముందే చెల్లింపులు జరపడం అక్రమాలను బలపరుస్తోంది. ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ ద్వారా ఐదు పథకాల కింద లబ్ధిదారులకు ఇన్నోవాలు, ఇతియోస్, ట్రాక్టర్లు, ఈ ఆటోలు, మెకనైజ్డ్ డ్రెయిన్ క్లీనింగ్ మెషిన్లు(ఎండీసీఎం) ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇందుకోసం టీడీపీ సర్కారు డీలర్లకు రూ.365,67,29,910 అడ్వాన్సులుగా చెల్లించింది. ఆ మొత్తంలో రూ.298,00,01,285 విలువైన యూనిట్లను డీలర్లు సరఫరా చేశారు. మరో 5,467 యూనిట్లు (వాహనాలు, యంత్రాలు) ఇవ్వకపోవడంతో డీలర్ల వద్దే రూ.67,67,28,625 మేర డబ్బులు ఉండిపోవడం గమనార్హం. ఇందులో రూ.23.05 కోట్లకుపైగా ఇవ్వాల్సిన రాధా మాధవ్ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ (విజయవాడ) ఇటీవల బోర్డు తిప్పేసింది. మరో మూడు కంపెనీల పేరుతో తప్పుడు చిరునామా ఇచ్చారు. వాహనాలు ఇవ్వకుండా ముఖం చాటేసిన సదరు డీలర్ ఏకంగా రూ.41.67 కోట్లకు పైగా ఎగ్గొట్టేందుకు దారులు వెతుకుతున్నాడు. మరో కంపెనీ పేరుతో అడ్వాన్సులు తీసుకున్న ఓ మహిళ నుంచి రూ.2.93 కోట్లు వసూలు చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఎన్ని నోటీసులు పంపినా స్పందన లేదు. డీలర్ల నుంచి రాబట్టేందుకు సన్నద్ధం టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పొందిన డీలర్లు ఆ మేరకు వాహనాలు ఇవ్వకపోవడం, అడ్వాన్సులు తిరిగి వెనక్కు చెల్లించకపోవటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్కు చెందిన దాదాపు రూ.67.67 కోట్లు నాలుగేళ్లుగా డీలర్ల వద్దే ఉండటంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొద్ది రోజుల క్రితం ఆయా డీలర్లతో సమావేశం నిర్వహించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఒప్పందం ప్రకారం వాహనాలు ఇవ్వాలని లేదంటే డబ్బులైనా తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు. అయితే అప్పటి ధరల ప్రకారం వాహనాలు ఇవ్వలేమని, పెరిగిన ధరల ప్రకారం తీసుకునేందుకు అంగీకరిస్తే పరిశీలిస్తామని రాధా మాధవ్ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్(విజయవాడ) ప్రతినిధులు పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు మూడు కంపెనీల పేరుతో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అడ్వాన్సులు తీసుకుని చేతులెత్తేయడంతో అతడితో తమకు సంబంధం లేదని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళ కూడా తప్పించుకుని తిరుగుతోంది. దీంతో మరోసారి ఆ డీలర్లను పిలిచి మాట్లాడాలని, అప్పటికీ దారికి రాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. -
బందరు పోర్టుతో ఉద్యోగాలే ఉద్యోగాలు
-
దళారుల చేతిలో మోసం
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎనిమిది మంది దళారుల చేతిలో మోసపోయారు. వారి మాటలు విని ఓ కంపెనీలో వెల్డింగ్ పనులు చేసే నిమిత్తం ఒమన్ దేశానికి వెళ్లారు.. అక్కడకు వెళ్లాక అసలు అలాంటి కంపెనీయే లేదని తెలియడంతో లబోదిబోమంటున్నారు. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన తామాడ కృష్ణారావు(తోటపల్లి), కీలు మాణిక్యరావు(తేరపల్లి), కర్ని లోకనాథం(గోపీనాథపురం), కంచిలి మండలానికి చెందిన పి.రవికుమార్, గున్నా గోపాల్(పెద్దపాలేరు), సోంపేట మండలానికి చెందిన సీల వాసుదేవరావు(బి.రామచంద్రపురం), సంతబొమ్మాళి మండలానికి చెందిన కల్గి నాయుడు(గోవిందపురం), మందస మండలానికి చెందిన తలగాన నీలకంఠం(బాలాజీపురం)లు ఈ ఏడాది మేలో విశాఖపట్నంలోని కార్తికేయ కన్సల్టెంట్ కంపెనీ ద్వారా ఒమెన్కు వెళ్లారు. రెండేళ్ల పాటు వెల్డింగ్ పనులుంటాయని చెప్పారని, మంచి జీతాలొస్తాయని నమ్మించడంతో ఒక్కొక్కరూ రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకూ చెల్లించారు. తీరా చూస్తే దళారులు చెప్పిన కంపెనీ ఆ దేశంలోనే లేదు. చివరకు ఒంటెలకు కాపలా కాస్తూ రోజులు గడుపుతున్నామని, మూడు నెలలుగా ఉపాధి లేక, కడుపు నిండా తిండి లేక ఇబ్బందిపడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న పాస్ పోర్టు, వీసాలు నకిలీవంటూ అక్కడి పోలీసులు తీసుకెళ్లారని అక్కడ నుంచి బంధువులకు సమాచారం అందజేశారు. క్షేమంగా ఇంటికి తీసుకొస్తాం..: మంత్రి అప్పలరాజు ఉపాధి కోసం వెళ్లి ఒమన్ దేశంలో చిక్కుకుపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు హామీ ఇచ్చారు. జరిగిన విషయాన్ని బాధితుల బంధువులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన శుక్రవారం పలాసలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బాధితులతో ఫోన్లో మాట్లాడారు. ఒమన్లో వారు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని, క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత తీసుకుంటుందని ధైర్యం చెప్పారు. ఇండియన్ ఎంబసీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. బాధితుల తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. చదవండి:గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు -
‘డబుల్’తో సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో జీహెచ్ఎంసీకి ఎలాంటి సంబంధం లేదని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అందిన 7.09 లక్షల దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నాయని, కులం, మతం, వయసు, ఓటరు గుర్తింపు కార్డు వివరాల సేకరణ మాత్రమే జీహెచ్ఎంసీ చేపట్టిందని ఆమె తెలిపారు. ఆయా వివరాలను సేకరించి పూర్తి సమాచారంతో సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు. కమిషనర్ లోకేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేయర్ ప్రసంగంలో ప్రధాన అంశాలివీ.. మురికి వాడల్లోని పేద నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రయోగాత్మకంగా శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్లో ఏడాదికి 600 మందికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు పెంచేందుకు త్వరలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం. నగరంలోని అన్ని కాలనీల్లో నూరు శాతం పచ్చదనం లక్ష్యం సాధించేందుకు, దాని ద్వారా సెల్ఫ్హెల్ప్ గ్రూపుల్లోని మహిళలకు ఆదాయం లభించేందుకు తొలిదశలో 3 వేల కాలనీల్లో మొక్కల పెంపకం బాధ్యతల్ని అప్పగించాం. ప్రజల రక్షణ కోసం 1456 మురికివాడలు, 975 పార్కుల్లో రూ. 20 కోట్లతో దాదాపు 8వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు, సహాయ పరికరాలను 4,749 మందికి త్వరలో పంపిణీ చేస్తాం. నగరంలోని 185 చెరువుల్ని దశలవారీగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టాం. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు ప్రస్తుతమున్న రెండింటికి తోడు మరో రెండు చారి్మనార్, సికింద్రాబాద్ల వైపు ఏర్పాటు కానున్నాయి. ఎస్సార్డీపీ ద్వారా 16 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్లు, 6 ఆరోఓబీలు, ఆర్యూబీలు అందుబాటులోకి వచ్చాయి. మరో 18 çపనులు పురోగతిలో ఉన్నాయి. వాటిలో వీలైనన్ని పనుల్ని డిసెంబర్లోగా పూర్తిచేస్తాం. రహదారుల నిర్వహణలో భాగంగా రూ.409 కోట్లతో 1,740 పనులు పూర్తయ్యాయి. సీఆర్ఎంపీ ద్వారా ఇప్పటి వరకు 678.41 కి.మీ రోడ్ల రీకార్పెటింగ్కు రూ.783.16 ఖర్చయింది. రెండు దశల్లో రూ. 49.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 34 ఆధునిక వైకుంఠ ధామాల్లో 28 పూర్తయ్యాయి. (చదవండి: కంటోన్మెంట్ విలీనంపై.. తేలేదెప్పుడు?) -
జూలైలో పుంజుకున్న ఉపాధి కల్పన
కోల్కతా: ఈ ఏడాది జూన్ నెలలో నిరుద్యోగ రేటు తగ్గిపోగా.. జూలైలో ఈ ధోరణి తిరిగి సానుకూలంగా మారినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ తెలిపింది. జూలై 12 నుంచి చూస్తే మూడు రోజుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చి 7.29 శాతానికి చేరుకుందని పేర్కొంది. ఈ నెల 12న 7.33 శాతంగా ఉండగా, 13న 7.46 శాతం, 14న 7.29 శాతంగా ఉన్నట్టు వివరించింది. ఈ ఏడాది జూన్ నెలలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.80 శాతంగా ఉందని సీఎంఐఈ అంతకుముందు నెలవారీ నివేదికలో పేర్కొనడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో 7.30 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.03 శాతం ఉన్నట్టు తెలిపింది.1.3 కోట్ల మందికి ఉపాధి కల్పన నష్టం జరిగిందని, సాగు రంగంలో పనులు లేకపోవడం వల్లేనని పేర్కొంది. తాజా గణాంకాలపై ఆర్థికవేత్త అభిరూమ్ సర్కార్ స్పందిస్తూ.. రుతువుల వారీగా ఏజెన్సీ సేకరించే గణాంకాల్లో లోపాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చన్నారు. -
తాజా సర్వే: ఈ యువతకు ఏమైంది? పెళ్లి వద్దంటున్నారు!
ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలని పెద్దలు అంటారు. ఉద్యోగం వచ్చి కెరీర్లో స్థిరపడ్డాకే పెళ్లి అనే భావన మన దగ్గర పెరిగి చాలాకాలం అయ్యింది. ఇప్పుడు పెళ్లే వద్దనుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం గమనించాల్సిన సంగతి. ‘జాతీయ గణాంకాల సంస్థ’ తాజా నివేదిక ప్రకారం మన దేశంలో 15– 29 ఏళ్ల మధ్య ఉండే యువత పెళ్లి తలంపునే చేయడం లేదు. అంటే 29 వరకూ పెళ్లి మాట ఎత్తడం లేదు. ఉద్యోగాలు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా ‘చేసుకోవచ్చులే’ అనో మనసులో మాట చెప్పకుండా దాటవేయడమో చేస్తూ... తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నారు. ‘గుండెల మీద కుంపటి’ అనేది చాలా చెడ్డ పోలిక. గతంలో ఈ పోలికను పెళ్లి కాని ఆడపిల్లల విషయంలో తెచ్చేవారు. దానికి కారణం 1980ల ముందు వరకూ కట్నాలు తీవ్ర ప్రాధాన్యం వహించడం. ఆడపిల్లల్లో చదువు తక్కువగా ఉండి మధ్యతరగతి దగ్గర తగినంత డబ్బు లేకపోవడం. ఈ పరిస్థితి మెల్లగా మారింది. చదువులు, ఉద్యోగాలు ఇవన్నీ ప్రాధాన్యంలోకి వచ్చాయి. ‘కట్నాలు’ క్రమంగా ‘లాంఛనాలు’గా మారాయి. మంచి సంబంధం కుదిరితే ఇచ్చిపుచ్చుకోవడాలు రెండో ప్రాధాన్యంలోకి వస్తున్నాయి. కనుక ఈ మాట మెల్లగా కనుమరుగైంది. అయితే ఈ మాట మళ్లీ ఉనికిలోకి వస్తుందా అనిపిస్తోంది– కాకుంటే ఈసారి ఆడపిల్లలు మగపిల్లల విషయంలో. గతంలో ‘పెళ్లి చేయలేక’ ఈ మాట అనేవారు. ఇప్పుడు పిల్లలు ‘పెళ్లి చేసుకోక’ ఈ మాట అనాల్సి రావచ్చు. ఏ మాటా చెప్పరు! ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ఏదో ఒక ఉపాధి, ఉద్యోగం దొరుకుతున్నది. సంపాదనలో పడుతున్నారు. అయినా సరే పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. అసలు చేసుకుంటారో లేదో చెప్పడం లేదు. దాంతో తల్లిదండ్రులు అయోమయంలో ఉంటున్నారు. తీవ్ర ఆందోళన కూడా చెందుతున్నారు. ‘బాగా స్థిరపడి చేసుకోవడం’ అనే భావన గతంలో ఉన్నా ఈ ‘స్థిరపడటం’ అనే మాటకు అంతుపొంతు లేకుండా ఉంది. అబ్బాయిలు ‘ఏదో ఒక ఉద్యోగం వస్తే చేసుకుంటాను’ అనేది పోయి ‘ఈ స్థాయి వరకూ వచ్చాక చేసుకుంటాను’ అనుకుంటున్నారు. అమ్మాయిలు ‘మంచి సంబంధం ఏదో ఒకటి’ అనుకోవడం లేదు. చాలా ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు. దాంతోపాటు అసలు సమాజంలో ‘పెళ్లి’కి సంబంధించిన సకారాత్మక (పాజిటివ్) దృష్టి వ్యాప్తి చెందుతోందా నెగెటివ్ దృష్టి వ్యాప్తి చెందుతోందా కూడా గమనించాలి. ‘పెళ్లి ఒక జంజాటం’, ‘గొడవలు ఉంటాయి’, ‘తల్లిదండ్రులతో అత్తామామలతో సమస్యలు’, ‘అడ్జస్ట్మెంట్ సమస్యలు’, ‘విడాకుల భయం’, ‘చేసుకున్న భాగస్వామితో కంపాటబులిటీ ఉండకపోతే అన్న సందేహం’ ఇవన్నీ యువతలో పెళ్లి గురించి వైముఖ్యం పెంచుతున్నాయేమో గమనించాలి. రోజు రోజుకూ పెరిగిపోతున్న ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’... ధరలు... ఇంటి అద్దెలు... ఫ్లాట్ల విలువలు... వీటిని చూసి సంసారాన్ని ఈదగలమా అని అనిపిస్తూ ఉంటే గనక ఆ దడుపుకు మంత్రం పాలనా, పౌర వ్యవస్థలు కనిపెట్టాల్సిందే. నూటికి 23 శాతం జాతీయ గణాంకాల సంస్థ తాజా అధ్యయనం ప్రకారం నేటి యువతలో (15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వరకు) పెళ్లి మాట ఎత్తనివారి సంఖ్య 2019 నాటికి 23 శాతం ఉంది. 2011లో వీరి శాతం 17 మాత్రమే. బాల్య వివాహాలు తగ్గడం ఈ అధ్యయనంలో కనిపించినా తరుణ వయసు వచ్చాక కూడా పెళ్లి మాట ఎత్తకపోవడం పట్టించుకోవలసిన విషయంగా అర్థమవుతోంది. అబ్బాయిల్లో 2011లో నూటికి 20 మంది పెళ్లి మాట ఎత్తకపోతే 2019లో 26 మంది పెళ్లి ప్రస్తావన తేవడం లేదు. అమ్మాయిల్లో 2011లో నూటికి 11 మంది పెళ్లి చేసుకోకపోతే 2019లో నూటికి 20 మంది పెళ్లి పట్ల నిరాసక్తిగా ఉన్నారు. సగటున చూస్తే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి నూటికి 23 మంది 29 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్ల్లోనో ఒక వీధిలోనో 100 మంది యువతీ యువకులు ఉంటే వారిలో 23 మంది అవివాహితులుగా కనిపిస్తూ ఉంటారు. ఆ ఇళ్ల తల్లిదండ్రులు, ఆ అవివాహితులు నిత్యం ‘పెళ్లెప్పుడు’ అనే మాటను ఎదుర్కొనాల్సిందే. కశ్మీర్ మొదటి స్థానంలో దేశం మొత్తం గమనిస్తే పెళ్లి కాని యువతీ యువకులు అత్యధికంగా ఉన్న ప్రాంతం జమ్ము అండ్ కశ్మీర్. దీని తర్వాత ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబు రాష్ట్రాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ దాదాపు 30 ఏళ్ల వరకూ పెళ్లిళ్లు జాప్యం అవుతున్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో ఈ శాతం తక్కువగా ఉంది. అంటే కొంచెం ఆలస్యమైనా చేసుకుంటూ ఉన్నారు. అయితే మొత్తంగా దేశంలో చూసినప్పుడు 25 నుంచి 29 మధ్య చేసుకునేవారి సంఖ్య గతంలో బాగున్నా ఇప్పుడు బాగా తగ్గింది. అంటే అమ్మాయిలలో 50 శాతం మంది, అబ్బాయిల్లో 80 శాతం మంది 25 దాటి 29 సమీపిస్తున్నా పెళ్లి మాట ఎత్తడం లేదు. నిపుణులు కారణాలు శోధించి పరిష్కారాలు వెతక్క తప్పని స్థితి ఇది. అవసరం ఏముంది అనేవారే ఎక్కువ పెళ్లి విషయంలో ఇప్పుడు అబ్బాయిలే కాదు, అమ్మాయిల మైండ్ సెట్లోనూ మార్పులు వచ్చాయి. నిన్నటి తరం ‘డిగ్రీ చేస్తే చాలు’ అనుకునేవారు. ఇప్పుడు అలా కాదు పై చదువులకు విదేశాలకు వెళుతున్నారు. ‘ముందు సెటిల్ అవాలి, తర్వాతనే పెళ్లి’ అంటున్నారు. గతంలో పిల్లలకు వయసు వచ్చింది త్వరగా పెళ్లి చేయాలని అనుకునేవారు పేరెంట్స్. పిల్లలు కూడా పెద్దల నిర్ణయానికి తలవంచేవారు. ఇప్పుడు పెళ్లి నిర్ణయాన్ని పిల్లలకే వదిలేస్తున్నారు పెద్దలు. దీంతో తమకు సెట్ అయ్యే మ్యాచ్ దొరకాలని పిల్లలు చూస్తున్నారు. దాదాపు ఇప్పుడంతా మప్పై ఏళ్ల వరకు పెళ్లి ఆలోచనలు చేయడంలేదు. పెళ్లి అంటే ‘ఇప్పుడే అవసరం ఏముంది’ అంటున్నారు. అంత తొందర పడి మరొకరి మాట వినాలనేం ఉంది అనుకుంటున్నారు. ఈ ధోరణి ముందు ముందు ఇంకా పెరుగుతుంది. అంతేకాదు, డిస్టర్బ్డ్గా ఉన్న జంటలను చూసి, అంత కష్టం ఎందుకులే అనుకుంటున్నవారిని ఎక్కువ చూస్తున్నాం. ఇలా చాలా కారణాల వల్ల పెళ్లి వయసుకు పెద్ద గ్యాప్ వచ్చేసింది. – ప్రొ. పి.జ్యోతి రాజా, సైకాలజిస్ట్, లైఫ్స్కిల్స్ ట్రెయినర్ -
ఫ్రెషర్లకు గుడ్ న్యూస్, భారీగా పెరగనున్న నియామకాలు!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఉపాధి కల్పన ఊపందుకోనున్నట్లు టీమ్లీజ్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ నివేదిక అంచనా వేసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో ఉద్యోగ నియామకాల్లో 61 శాతం వృద్ధి నమోదయ్యే వీలున్నట్లు పేర్కొంది. ఇందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) దోహదపడనున్నట్లు తెలియజేసింది. పీఎల్ఐకింద పబ్లిక్ పెట్టుబడులు పెరగనుండటంతో క్యూ2లో భారీ సంఖ్యలో ఉద్యోగులను ఎంపిక చేసుకోనున్నట్లు టీమ్లీజ్ నిర్వహించిన సర్వేలో కంపెనీలు వెల్లడించాయి. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నమోదైన 54 శాతంతో పోలిస్తే ఉపాధి కల్పనకు పెరిగిన ఆసక్తి 7 శాతం అధికమని టీమ్లీజ్ తెలియజేసింది. నగరాల స్పీడ్ త్రైమాసికవారీగా చూస్తే రానున్న కాలం(క్యూ2)లో మెట్రోలు, టైర్–1 నగరాలలో ఉద్యోగ కల్పన ఆసక్తి 6 శాతం పుంజుకుని 89 శాతానికి చేరినట్లు నివేదిక తెలియజేసింది. ఇక టైర్–2 నగరాలలో మరింత అధికంగా 7 శాతం బలపడి ఉపాధి కల్పనాసక్తి 62 శాతాన్ని తాకింది. టైర్–3 పట్టణాలలో ఇది 3 శాతం పెరిగి 37 శాతమయ్యింది. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి నామమాత్ర వృద్ధితో కొత్త ఉద్యోగాల సృష్టికి 2 శాతమే ఆసక్తి కనబడింది. ఈ సర్వేకు టీమ్లీజ్ 14 నగరాలు, పట్టణాల నుంచి 23 రంగాలను పరిగణించింది. 900 చిన్న, మధ్యతరహా, భారీ కంపెనీలను ఎంపిక చేసుకుంది. సర్వీసులు భేష్ ఉపాధి కల్పనకు సై అంటున్న సర్వీసుల రంగంలో బెంగళూరు(97 శాతం), ముంబై(81 శాతం), ఢిల్లీ(68 శాతం) ముందు నిలిచాయి. ఇక తయారీ రంగంలో అయితే ఢిల్లీ(72 శాతం), ముంబై(59 శాతం), చెన్నై(55 శాతం) జాబితాలో చోటు సాధించాయి. పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పనకు సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నట్లు టీమ్లీజ్ సహవ్యవస్థాపకుడు రితుపర్ణ చక్రవర్తి తెలియజేశారు. పీఎల్ఐ పథకంలో భాగంగా పబ్లిక్ పెట్టుబడులు ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 2.65 లక్షల కోట్ల ముందస్తు సహాయక ప్యాకేజీ.. పర్యాటకం, విమానయానం, హౌసింగ్ తదితర పలు రంగాలకు మద్దతివ్వనున్నట్లు పేర్కొన్నారు. వెరసి ఉద్యోగావకాశాల పట్ల సానుకూల థృక్పథం నెలకొన్నట్లు వివరించారు. రానున్న త్రైమాసికాలలోనూ హైరింగ్ సెంటిమెంటు 70 శాతం మార్క్ను దాటగలదని అంచనా వేశారు. మహమ్మారితో చెక్ కోవిడ్–19 కేసులు పెరగడం, లేదా ఆంక్షల అమలుతో కొన్ని సంస్థలు అప్పుడప్పుడూ ఉపాధి కల్పనను నిలిపి వేస్తున్నట్లు చక్రవర్తి తెలియజేశారు. అయితే మొత్తంగా ఇందుకు అనుకూల వాతావరణమే ప్రస్తుతం నెలకొని ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. పరిమాణంరీత్యా చూస్తే చిన్న సంస్థలు అత్యధికంగా 47 శాతం(6 శాతం ప్లస్), మధ్యతరహా, భారీ కంపెనీలు 69 శాతం(4 శాతం అప్) హైరింగ్కు ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. మధ్య, సీనియర్ స్థాయిలతో పోలిస్తే ప్రారంభస్థాయి ఉపాధి కల్పన వేగమందుకోగా.. తదుపరి జూనియర్ స్థాయికి డిమాండ్ ఉన్నట్లు తెలియజేసింది. మార్కెటింగ్ విభాగంలో ఉపాధి కల్పనాసక్తి 10 శాతం పెరిగి 63 శాతానికి, ఐటీలో 8 శాతం పుంజుకుని 90 శాతానికి చేరింది. -
ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో జోరుగా కొలువులు!
చెన్నై: ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఇది గత రెండేళ్లలో సగటున 108 శాతం మేర పెరిగింది. సీఐఈఎల్ హ్యూమన్ రిసోర్సెస్ సర్వీసెస్ అధ్యయన నివేదికలో ఈ అంశం వెల్లడైంది. ఈవీ రంగంలో అత్యధికంగా ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగాల కల్పన ఉంటోంది. ఆ తర్వాత స్థానంలో ఆపరేషన్, సేల్స్, క్వాలిటీ అష్యురెన్స్, బిజినెస్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్ తదితర విభాగాలు ఉన్నాయి. సీఐఈఎల్ నిర్వహించిన ‘ఈవీ రంగంలో తాజా నియామకాల ధోరణులు – 2022‘ అధ్యయనంలో 52 కంపెనీలకు చెందిన 15,200 మంది ఉద్యోగు లు పాల్గొన్నారు. ‘ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లడంపై భారత్ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ప్రయత్నంలో నిలదొక్కుకుంటే 2030 నాటికి దేశీయంగా ఈవీ విభాగం పరిమాణం 206 బిలియన్ డాలర్లకు చేరుతుంది‘ అని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. వృద్ధి ఇదే స్థాయిలో ఉంటే ఇంజినీర్లకు ఉద్యోగావకాశాలు కూడా భారీగానే ఉండగలవని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు .. ♦ఎలక్ట్రిక్ వాహనాల విభాగం నియామకాల్లో 62 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూఢిల్లీ (12 శాతం), పుణె (9 శాతం), కోయంబత్తూర్ (6 శాతం), చెన్నై (3 శాతం) ఉన్నాయి. ♦ గడిచిన ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు 2,236 మంది ఉద్యోగులను తీసుకున్నాయి. ♦కంపెనీల్లోని అన్ని విభాగాల్లోనూ మహిళలకు ప్రాతినిధ్యం లభిస్తోంది. కైనెటిక్ గ్రీన్, మహీంద్రా ఎలక్ట్రిక్, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్, ఓబీఈఎన్ ఎలక్ట్రిక్, యాంపియర్ వెహికల్స్ సంస్థల్లో టాప్ మేనేజ్మెంట్ స్థానాల్లో కూడా మహిళలు ఉన్నారు. తమిళనాడులోని రాణిపేట్లో ఉన్న ఓలా ఈ–స్కూటర్ ఫ్యాక్టరీని మొత్తం మహిళలే నిర్వహిస్తున్నారు. -
చిన్న సంస్థలకు ఈ–కామర్స్తో దన్ను
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి, మార్కెటింగ్ వ్యయాలను తగ్గించుకోవడానికి, కొత్త మార్కెట్లలో విస్తరించడానికి ఈ–కామర్స్ ఎంతగానో తోడ్పడుతోందని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ తెలిపారు. చిన్న వ్యాపారాలు తమ మేనేజ్మెంట్ నైపుణ్యాలను, టెక్నాలజీని మరింతగా మెరుగుపర్చుకోవాలని ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన భారతీయ ఎంఎస్ఎంఈల సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఎంఎస్ఎంఈలు దేశీయంగా ఉపాధి కల్పనలోనూ, తయారీ కార్యకలాపాలను విస్తరించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో వాటిపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వర్మ చెప్పారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ చేయూత.. కరోనా మహమ్మారి కష్టకాలంలో కూడా చిన్న పరిశ్రమలు ఎదురొడ్డి నిల్చాయని మంత్రి తెలిపారు. కొన్ని యూనిట్లు ఆర్థిక కష్టాలతో మూతబడే పరిస్థితికి వచ్చినా ప్రభుత్వం జోక్యం చేసుకుని తగు తోడ్పాటునివ్వడంతో గట్టెక్కాయని ఆయన చెప్పారు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకే కేంద్రం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ను (ఈసీఎల్జీఎస్) ఆవిష్కరించినట్లు మంత్రి వివరించారు. దీని కింద చిన్న సంస్థలకు రూ. 3.1 లక్ష కోట్ల మేర నిధులను కేటాయించినట్లు ఎంఎస్ఎంఈ శాఖ కార్యదర్శి బీబీ స్వెయిన్ తెలిపారు. డీ2సీ మార్కెట్ నివేదిక ఆవిష్కరణ.. కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రాక్సిస్, షిప్రాకెట్, సీఐఐ సంయుక్తంగా రూపొందించిన భారత డీ2సీ మార్కెట్ నివేదికను మంత్రి ఆవిష్కరించారు. దీని ప్రకారం ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని నేరుగా కస్టమర్లకు పంపే చాలా మటుకు డీ2సీ (డైరెక్ట్ టు కస్టమర్స్) సంస్థలకు ఢిల్లీ, బెంగళూరు, ముంబై ప్రధాన సరఫరా, డిమాండ్ హబ్లుగా ఉంటున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో నిత్యావసరాలు మొదలైన ఉత్పత్తుల మార్కెట్ పరిమాణం 571 బిలియన్ డాలర్లుగా, ఆభరణాల మార్కెట్ 82 బిలియన్ డాలర్లు, దుస్తులు.. పాదరక్షలు 81 బిలియన్ డాలర్లు, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 9.4 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. -
శతమానం భారతి: లక్ష్యం 2047 ఉపాధి
జనాభా అధికంగా ఉండే భారత్ వంటి దేశాల్లో ఉపాధి అవకాశాల కొరత సాధారణమే కానీ.. అయితే అసాధారణ స్థాయిలో నిరుద్యోగం పెను భూతంలా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. స్వాతంత్య్రానంతర కాలంలో ఉపాధి నైపుణ్యాలు లేనప్పటికీ పారిశ్రామికీకరణకు అప్పటికింకా మనం దూరంగా ఉన్నందు వల్ల సంప్రదాయ ఉపాధి అవకాశాలతోనే దేశంలోని యువత సరిపెట్టుకుంటూ వచ్చింది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలకమైనవి మూడు రంగాలు. ఒకటి వ్యవసాయం. రెండు పరిశ్రమలు. మూడు సేవలు. మూడింట్లో కూడా వ్యవసాయమే దేశ జనాభాలో ఎక్కువ శాతానికి జీవనోపాధిని కల్పిస్తోంది. స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు అయినా, నేటికీ వ్యవసాయ రంగం కల్పిస్తున్నంతగా పరిశ్రమలు, సేవల రంగాలు ఉపాధిని ఇవ్వడం లేదు! దీనికి ఒక కారణం నైపుణ్యాల లేమి. ఉపాధికి అవసరమైన విద్యను భారత్ తన యువతరానికి ఇవ్వలేక పోతోందన్న విమర్శ ఒకటి ఉంది. దేశంలో వెయ్యి వరకు విశ్వవిద్యాలయాలు, దగ్గరదగ్గర 50 వేల కాలేజ్లు ఉన్నాయి. అంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఉన్నత విద్యావ్యవస్థ అనుకోవాలి. అయితే అసోచామ్ నివేదిక ప్రకారం ఈ విద్యాలయాల్లోంచి ఏటా 50 లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులై వస్తుండగా, వారిలో కేవలం 25 శాతమే ఉపాధి పొందుతున్నారు. ఈ నివేదికను ఆధారంగా చేసుకుని వచ్చే 25 ఏళ్లల్లో కనీసం 50 శాతం విద్యార్థులైనా వృత్తి విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని జాతీయ విద్యావిధానం సూచించింది. -
రియల్టీ: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం
కరోనాతో కుదేలైన దేశ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోందా? రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాన్ని కూడా అధిగమించి పురోగమిస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవునని చెప్పవచ్చు. అలాగే కాదని కూడా! ఏళ్లుగా ఆగిన నిర్మాణాలు మళ్లీ గాడిన పడటం శుభ సూచకమైతే కొత్త వెంచర్లకు పెద్దగా డిమాండ్ లేకపోవడం, పూర్తయిన వాటిల్లోనూ అమ్మకాలు మందగతిన సాగుతూండటం ఇబ్బంది పెట్టే అంశం! అయితే కరోనా బారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో త్వరలో అన్నీ సర్దుకుంటాయన్న ఆశాభావం కనిపిస్తోంది. కంచర్ల యాదగిరిరెడ్డి దేశ ఆర్థిక వ్యవస్థ చురుకుదనానికి, పురోగతికి ప్రధాన సూచికల్లో రియల్ ఎస్టేట్ రంగం ఒకటి. అది పురోగమిస్తోందంటే స్టీలు, సిమెంటు వంటి కీలక పరిశ్రమలూ వృద్ధి బాటలో ఉన్నట్టే. కూలీలు, మేస్త్రీలు, అనుబంధ వృత్తుల వారికి భారీగా ఉపాధి లభిస్తుంది కూడా. దేశం మొత్తమ్మీద సుమారు ఏడు కోట్ల మందికి రియల్ ఎస్టేట్ ఉపాధి కల్పిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ రంగం ద్వారా 2018లో 7.6 కోట్ల మందికి ఉపాధి లభిస్తే తర్వాత క్రమేపీ తగ్గుదల నమోదైంది. 2019లో 6.21 కోట్లకు పరిమితమైంది. 2020లో కరోనా, లాక్డౌన్ తదితర కారణాలతో 21 లక్షల మందికి పని లేకుండా పోయింది. గతేడాది రియల్టీ ఉపాధి 5.37 కోట్లకు తగ్గింది! ఏడు నగరాలు, రూ.4.48 లక్షల కోట్లు! ఈ ఏడాది మే ఆఖరు నాటికి దేశం మొత్తమ్మీద ఏడు ప్రధాన నగరాల్లో 4.8 లక్షల యూనిట్ల నిర్మాణం స్తంభించిపోయి ఉంది. వీటి విలువ రూ.4.48 లక్షల కోట్లు. 2021 ఆగస్టు నుంచి ఈ మే దాకా దేశవ్యాప్తంగా 1.49 లక్షల యూనిట్ల నిర్మాణం పూర్తయింది. వీటిలో లక్షకు పైగా యూనిట్లు ఎన్సీఆర్, ముంబై మెట్రో రీజియన్లలోవే! 15,570 యూనిట్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని బెంగళూరు మూడో స్థానంలో నిలిచింది. అయ్యో హైదరాబాద్ మిగతా ప్రాంతాల్లో రియల్టీ పుంజుకుంటున్న సంకేతాలుంటే హైదరాబాద్లో మాత్రం అంత సానుకూల పరిస్థితులు లేకపోవడం విశేషం. బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు హంగూఆర్భాటాలతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నా కొనుగోలుదారుల నుంచి స్పందన లేదు. ‘‘మేమెప్పుడు కొత్త ప్రాజెక్టు ప్రారంభించినా రోజుకు సగటున పది నుంచి 12 ఫ్లాట్లు బుక్కయేవి. కానీ ఇప్పుడు వారమంతా కలిపి పది బుకింగులే గగనంగా ఉంది’’ అని నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎండీ అన్నారు. కొత్త ప్రాజెక్టు ప్రకటన ఇచ్చిన వెంటనే రోజుకు 25 నుంచి 30 బుకింగ్లు చేసే వాళ్లమని, ఇప్పుడు నెలంతా కలిపినా అన్ని చేయలేకపోతున్నామని మరో ప్రముఖ కంపెనీ వర్గాలు వాపోయాయి. మంచి శకునములే... గతేడాది చివరి వరకూ రెండు, మూడో దశల కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న భారత్ ఈ ఏడాదే కాస్త తెరిపిన పడింది. రియల్టీ రంగంలోనూ ఇదే ధోరణి కన్పిస్తోంది. 2014, అంతకుముందే మొదలై పలు కారణాలతో 5.17 కోట్ల యూనిట్ల (అపార్ట్మెంట్లు/విల్లాల) నిర్మాణాలు ఆగిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ గత ఐదు నెలల్లోనే వీటిల్లో 37 వేల యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకుని అమ్మకాలకు సిద్ధమవడం మారిన పరిస్థితికి సూచికగా నిలుస్తోంది. పూర్తయిన యూనిట్లలో 45 శాతం (16,750) ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోనే ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై, పరిసరాల్లో 5,300, బెంగళూరులో 3,960 యూనిట్ల నిర్మాణం పూర్తయింది. హైదరాబాద్లో మాత్రం 11,450 పెండింగ్ యూనిట్లకు కేవలం 1,710 యూనిట్ల నిర్మాణమే పూర్తయింది. చెన్నైలో అతి తక్కువ పెండింగ్ యూనిట్లు (5,190) ఉండగా వాటిలోనూ 3,680 యూనిట్ల నిర్మాణం ఈ ఏడాది జనవరి, మే మధ్య పూర్తయింది! ‘‘పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డెవలపర్లు పట్టుదలతో ఉన్నారు. ఇన్పుట్ ధరలు బాగా పెరిగినా, ఇతర ప్రతిబంధకాలున్నా గత ఐదు నెలల్లో వేల యూనిట్ల నిర్మాణం పూర్తవడం శుభ పరిణామం. మధ్య తరగతి కుటుంబాలకు గూడు కల్పించే లక్ష్యంతో 2019లో కేంద్రం రూ.25 వేల కోట్లతో మొదలు పెట్టిన ఫండ్, నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ సాయంతో నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి’’ – ప్రశాంత్ ఠాకూర్, సీనియర్ డైరెక్టర్, హెడ్ రీసెర్చ్, అనరాక్ గ్రూప్ -
అయినా మోదీని నమ్మడం చాలా కష్టం: కేటీఆర్
హైదరాబాద్: రాబోయే 18 నెలల్లో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మోదీ సర్కార్ ప్రకటనపై సానుకూలంగా స్పందించినట్లే స్పందించి.. తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈ మేరకు వరుసగా ట్విటర్లో ట్వీట్లు చేశారాయన. తెలంగాణలో ప్రైవేట్ రంగంలో 16 లక్షల ఉద్యోగాలు కల్పించాం. ఈ ఎనిమిదేళ్లలో పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో, దేశంలోని యువతకు తాము వాగ్దానం చేసిన 16 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు లభిస్తాయో ప్రధాని మోదీ తెలియజేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ.. సాపేక్షంగా చిన్న రాష్ట్రం. గత ఎనిమిదేళ్లలో 1,35,000 ఉద్యోగాలను భర్తీ చేశాం. మరో 1 లక్ష ఉద్యోగాల నియామకం మొదలైంది. అదే నిష్పత్తిలో.. 2014 నుండి 140 కోట్ల భారత జనాభా కోసం మోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలను సృష్టించింది? నిరుద్యోగ సమస్య మీద ప్రతిపక్ష పార్టీలు, దేశంలోని నిరుద్యోగ యువత తెస్తున్న భారీ ఒత్తిడికి ధన్యవాదాలు. ప్రధాని మోదీ రాబోయే 18 నెలల్లో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. అది స్వాగతించాల్సిన నిర్ణయమే! అదే సమయంలో, అనేక హామీలు నెరవేర్చని కారణంగా ఆయన్ని నమ్మడం కష్టం అని కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు. Thanks to the huge pressure exerted by the opposition parties and the unemployed youth of the country, PM Modi announced to fill 10 lakh govt jobs in the next 18 months. Welcome the decision! At the same time, it's difficult to trust him as there were many unfulfilled promises — KTR (@KTRTRS) June 15, 2022 -
ఏడాదిన్నరలోనే 10 లక్షల ఉద్యోగాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని పేర్కొన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో మానవ వనరుల లభ్యతపై మంగళవారం మోదీ లోతుగా సమీక్ష జరిపారు. అనంతరం అన్ని శాఖలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు’’ అని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్టు ట్వీట్ చేసింది. 2020 మార్చి 1 నాటికి కేంద్రంలో 40.78 లక్షల ఉద్యోగాలు మంజూరు చేయగా 31.91 లక్షల మంది ఉద్యోగులే ఉన్నారు. 21 శాతానికి పైగా ఖాళీలున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ పే అండ్ అలవెన్స్ నివేదిక తెలిపింది. ప్రధాని తాజా ఆదేశాలతో ప్రభుత్వ శాఖల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. వివిధ శాఖలు తమ వద్ద ఉన్న ఖాళీల సంఖ్యను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. యువతలో కొత్త ఆశలు: అమిత్ షా ప్రధాని ఉద్యోగాల ప్రకటన నిరుద్యోగ యువతలో కొత్త ఆశల్ని, కొంగొత్త ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘యువత సాధికారత సాధిస్తేనే మోదీ కలలుగంటున్న నూతన భారత్ ఆవిష్కృతమవుతుంది. అందుకే యుద్ధప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ఆదేశాలిచ్చారు’’ అని చెప్పాన్నారు. నిరర్ధక హామీలు: రాహుల్ మోదీ 10 లక్షల ఉద్యోగాల ప్రకటనను ఉత్తుత్తి మాటలుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. ‘‘ఎనిమిదేళ్ల క్రితం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతను మోసగించారు. ఇప్పుడూ అదే తరహాలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటున్నారు’’ అని ట్వీట్ చేశారు. ‘‘మోదీవి మాయ మాటలు. ఉద్యోగాలు కల్పించడం ఆయనకు చేతకాదు. వాటిపై వార్తలు పుట్టించడంలో మాత్రం దిట్ట’’ అంటూ ఎద్దేవా చేశారు. 30 లక్షల కేంద్ర ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఎన్నాళ్లిలా మాటలతో బురిడీ కొట్టిస్తారని ప్రశ్నించారు. మోదీ ప్రకటనల ప్రధాని మాత్రమేనని సీపీఎం, బీఎస్పీ దుయ్యబట్టాయి. ఎందుకీ జాబ్ మేళా? ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలివ్వడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. కరోనా దెబ్బకు రెండేళ్లుగా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నిరుద్యోగం నానాటికి పెరిగిపోతూండటంతో యువతలో అసంతృప్తి కట్టలు తెంచుకుంటోంది. ఆర్థిక రంగమూ క్షీణిస్తోంది. ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠం అధిరోహించాలని ఆశపడుతున్న మోదీ ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. తాజా ప్రకటన అందులో భాగమేనంటున్నారు. వామ్మో నిరుద్యోగం కరోనా, లాక్డౌన్ దెబ్బతో 2022 ఏప్రిల్ నాటికి దేశంలో నిరుద్యోగిత 8.1 శాతానికి చేరింది. ఉద్యోగార్థుల సంఖ్య 1.3 కోట్లు దాటింది. ఎంబీఏలు, గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు చిన్నా చితక పనులు చేస్తున్నారు. నైపుణ్యమున్నవాళ్లు విదేశీ బాట పట్టారు. దాంతో 2017–2022 మధ్య దేశంలో ఉత్పాదక రంగ కార్మికుల సంఖ్య 46 నుంచి 40 శాతానికి పడిపోయింది. దేశంలో 90% ఉపాధి అవకాశాలు అసంఘటిత రంగంలోనే ఉన్నాయి. దేశంలో కరోనా మొదటి వేవ్లో 12.2 కోట్లు, రెండే వేవ్లో కోటి మందికి పైగా రోడ్డున పడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, విభాగాల్లో ఉద్యోగుల కొరతతో పనులు స్తంభిస్తున్నాయి. కత్తి మీద సామే! ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల భర్తీ కష్టమేనని నిపుణులంటున్నారు. దీనికి తోడు ఏటా 1.2 కోట్ల మంది గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నందున 2030 నాటికి 9 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి వస్తుందని మెకెన్సీ గ్లోబల్ నివేదిక వెల్లడించింది. వచ్చే ఆరేళ్లలో 6 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుందని ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. 2005లో 35 శాతమున్న మహిళా ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 21 శాతానికి తగ్గింది. వారికీ ఉద్యోగాలు కల్పించాల్సిన పరిస్థితి ఉంది. మోదీ ప్రకటన వెనక ఈ కారణాలన్నీ ఉన్నాయంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ చదవండి: (Corona Virus: 50 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య) -
చదువుకున్నంత మాత్రాన పని చేయాలనేం లేదు
ముంబై: చదువుకున్నంత మాత్రాన మహిళలను ఉద్యోగం చేసి తీరాలని ఒత్తిడి చేసే అధికారం ఎవరికీ లేదని ముంబై హైకోర్టు పేర్కొంది. పని చేయాలా, ఇల్లు చక్కదిద్దుకోవడానికే పరిమితం కావాలా అన్నది పూర్తిగా ఆమె ఇష్టమేనని న్యాయమూర్తి జస్టిస్ భారతీ డాంగ్రే స్పష్టం చేశారు. ఓ విడాకుల కేసులో భార్యకు మనోవర్తి చెల్లించాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఓ వ్యక్తి పెట్టుకున్న రివిజన్ పిటిషన్ను శుక్రవారం ఆమె విచారించారు. డిగ్రీ చేసిన తన మాజీ భార్యకు సంపాదించుకునే సామర్థ్యముంది గనుక మనోవర్తి చెల్లించాలన్న ఆదేశాలు సరికాదన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చారు. ‘‘ఈ రోజు నేను న్యాయమూర్తిని. రేపు బహుశా ఇంట్లో కూర్చోవాల్సి రావచ్చు. న్యాయమూర్తిగా పని చేయగల సామర్థ్యముంది గనుక అలా ఊరికే ఉండొద్దని చెప్తారా మీరు?’’అని ప్రశ్నించారు. తన భార్యకు స్థిరమైన ఆదాయ వనరు ఉన్నా ఆ వాస్తవాన్ని దాచిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై వచ్చే వారం తదుపరి విచారణ జరగనునుంది. -
హాయిగా ఊళ్లోనే ఉపాధి... ఇక ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా...
కూలీలకు ఉన్న ఊళ్లోనే ఉపాధి పనులను ప్రభుత్వం కల్పిస్తోంది. తద్వారా పొట్ట చేతపట్టుకుని నగరాలకు వలస వెళ్లే బాధ తప్పింది. మండు వేసవిలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం వేళల్లో మాత్రమే పని చేసేలా వెసులుబాటు కల్పించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూలీల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఉపాధి కూలీల జీవనానికి భరోసా ఇచ్చింది. లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరింది. అధికార యంత్రాంగం నిర్విరామ కృషి ఫలితంగా ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. పారదర్శకంగా పనులు చేపడుతూ కూలీల జీవనానికి భరోసా ఇచ్చింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్థానం దక్కడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జరిగిన పనులు, లబ్ధిదారులకు అందుతున్న నగదుపై నిర్వహించిన సోషల్ ఆడిట్లో ఏపీ పనితీరును కేంద్రం ప్రశంసించింది. కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పథకాన్ని క్షేత్రస్థాయిలో ఈ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లోని 31 మండలాల్లో ఉపాధి హామీ పనులు పక్కాగా సాగుతున్నాయి. మూడేళ్లలో 5.5 లక్షల పనిదినాలు జిల్లా వ్యాప్తంగా 1,50,682 కుటుంబాల నుంచి 74,059 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. 2019 ప్రారంభం నుంచి ఈ ఏడాది జూన్ 10 వరకు 5,43,81,511 పనిదినాలను కల్పించారు. ఇందుకు గాను రూ.1971.31 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 2021–22లో 20,393 కుటుంబాలు 100 రోజులపాటు పనులకు హాజరయ్యారు. ఇక 2022–23 ఏడాది ఏప్రిల్ వరకు 13.19 శాతం వరకు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కూలీలకు రోజువారి వేతనం సగటున రూ.251 అందుతోంది. ఉపాధి పనుల్లో జాబ్కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలన్నదే ప్రభుత్వ ఆశయం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్నా వారికి కనీసం వంద పనిదినాలు కల్పిస్తారు. పల్లెల్లో పచ్చదనం ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనుల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచే పనులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కలు నాటేందుకు గోతులు తీయటం నుంచి మొక్కలు నాటి వాటి సంరక్షణ వరకు అన్నీ కూలీలే పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల చాలా గ్రామాల్లో పచ్చదనం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక పనిచేసిన వెంటనే కూలీలకు సకాలంలో వేతనాలను చెల్లిస్తున్నారు. మెరుగైన వసతులు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మెరుగైన వసతులు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశంలో నీడ, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో గ్రామీణ ప్రజలు ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. కలెక్టర్ హరి నారాయణన్ క్షేత్రస్థాయిలో అమలవుతున్న ఉపాధి హామీ పనులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ పనుల్లో పారదర్శకతను అమలు చేస్తున్నారు. పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పిస్తున్నారు. వారి జీవనోపాధికి తోడ్పాటునందిస్తున్నారు. ఆదుకున్న ఉపాధి ఎండలు మండిపోతున్నాయి. పనులు చేయలేకపోతున్నాము. ఇదే సమయంలో ఉపాధి పనులు కల్పించడంతో పట్టణాలకు వలస వెళ్లాల్సిన బాధ తప్పిపోయింది. ప్రభుత్వం ఉదయం 10 గంటల్లోపే పనులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అనంతరం పశుపోషణతో మెరుగైన జీవనం సాగిస్తున్నాం. –కుప్పయ్య, గొల్లపల్లె యాదమరి మండలం రోజుకు రూ.250 పనులు లేని కాలంలోనే రోజుకు రూ.250 సంపాదించుకునే ఉపాధిని ప్రభుత్వం కల్పించింది. నిత్యం పట్టణానికి వెళ్లే అవస్థ తప్పింది. ఇంటి దగ్గర పశువులను చూసుకునే వారు లేక ఇబ్బందులు పడుతున్నాను. ఉపాధి పనుల వల్ల కూలీ వస్తోంది. మిగిలిన సమయంలో సొంతపనులూ చేసుకుంటున్నాం. – నాగమ్మ, విజయపురం పని కల్పించటమే ధ్యేయం జిల్లా వ్యాప్తంగా అడిగిన వారందరికీ పని కల్పించేలా చర్యలు చేపట్టాము. ఉపాధి పనుల్లో జిల్లాను రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాం. అడిగిన వారికి జాబ్కార్డులను ఇస్తున్నాము. వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలీలకు వసతులు కల్పిస్తున్నాము. – హరి నారాయణన్, కలెక్టర్, చిత్తూరు జిల్లా (చదవండి: పవన్ కల్యాణ్ జనసేన జనం కోసమా.. చంద్రబాబు కోసమా..?) -
పిట్టిగుంట.. ఉద్యోగులే ఇంటింటా!
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. మహా పురుషులవుతారు...అనేందుకు శ్రీ అవధూత కాశినాయన మండలం లోని పిట్టిగుంట గ్రామం నిదర్శనం. ఒకరిని చూసి మరొకరు ఉన్నతంగా ఉండేందుకు పోటీ పడ్డారు. గ్రామాన్ని ఉద్యోగుల ఖిల్లాగా మార్చేశారు. సాక్షి ప్రతినిధి, కడప : శ్రీ అవధూత కాశినాయన మండలం రంపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టిగుంట గ్రామం ఉన్నత చదువులు, ఉద్యోగాలకు నిలయంగా మారింది. ఆది నుంచి చైతన్యవంతమైన గ్రామంగా పేరు గడించింది. 80 కుటుంబాలు ఉన్న ఆ గ్రామంలో ఇంటికో ఉద్యోగి ఉన్నారు. కొన్ని ఇళ్లలో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు. ఉపాధ్యాయులు మొదలుకొని ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, సైంటిస్టులు, ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఇక సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు పుట్టినిల్లు. మహిళలు సైతం ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగాలు చేస్తూనే మరోవైపు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. విద్య, ఉద్యోగం, అభివృద్ధిపైనే చర్చ 1960లోనే ఈ గ్రామం నుంచి బుసిరెడ్డి జానకిరామిరెడ్డి తొలి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆ తర్వాత 15 మంది ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. ఒకవైపు గురువులుగా విద్యాబోధన చేస్తూనే మరోవైపు వ్యవసాయానికి వారు అ«ధిక ప్రాధాన్యత ఇచ్చారు. పల్లెలోనే ఉంటూ వ్యవసాయాన్ని కొనసాగించారు. గ్రామంలో గురువులు ఎక్కువగా ఉండడంతో వాతావరణమే మారిపోయింది. గ్రామం రచ్చబండ వద్ద ఇతరత్రా పనికిరాని చర్చలు కాకుండా విద్య, ఉద్యోగాలు, అభివృద్ధిపైనే చర్చలు నడిచేవి. అక్కడి ఉపాధ్యాయులు విద్యకు గల ప్రాధాన్యతను నిత్యం తెలియజెప్పేవారు. దీంతో అందరూ తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించారు. గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి చెన్నైలో సైంటిస్టుగా పనిచేస్తున్నారు. దశరథరామిరెడ్డి చిత్తూరుజిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)గా ఉన్నారు. రాజశేఖర్రెడ్డి రైల్వేశాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా సేవలు అందిస్తున్నారు. పీహెచ్డీలు, ఎంబీఏ, ఏజీబీఎస్సీలు చేసిన వారు చాలామంది వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పలువురు రైల్వే, ఆర్మీ, పోలీసు ఉద్యోగాల్లోనూ ఉన్నారు. ∙ప్రస్తుతం పిట్టిగుంటలో 21 మంది ప్రభుత్వ ఉపా« ద్యాయులు, 10 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులు, మరో 31 మంది వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆరుగురు ప్రైవేటు విభాగంలో ఉన్న త ఉద్యోగాలు చేస్తున్నారు. 37 మంది సాఫ్ట్వేర్ ఇంజిర్లుగా పనిచేస్తున్నారు. 80 కుటుంబాలు ఉన్న పిట్టిగుంటలో ప్రస్తుతం మొత్తం 105 మంది ఉద్యోగులు ఉండడం గమనార్హం. క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పిట్టిగుంట ఉద్యోగులకు నిలయంగా మారింది. వ్యసనాలకు దూరం వ్యసనాలను దరిచేరనివ్వని గ్రామంగా పిట్టిగుంటకు పేరుంది. ప్రధానంగా ఇక్కడి వారు మద్యానికి దాదాపు దూరంగా ఉంటారు. దీని ప్రభావాన్ని ఆ గ్రామం మీద పడనీయలేదు. ఇతర వ్యసనాలకు సైతం గ్రామస్తులు దూరంగా ఉంటారు. ఇంటికి ముగ్గురు ఉద్యోగులు.. పిట్టిగుంట గ్రామంలో ఇంటికి ఇద్దరు, ముగ్గురు ఉన్న కుటుంబాలు ఉన్నాయి. 1960లో గ్రామంలో తొలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు జానకిరామిరెడ్డి ముగ్గురు కుమారులు ప్రభుత్వ ఉద్యోగులే. ఒక కుమారుడు దశరామిరెడ్డి చిత్తూరు జిల్లా పంచాయతీ అధి కారి (డీపీఓ)గా పనిచేస్తున్నారు. మరో కుమారుడు జయరామిరెడ్డి హైస్కూలు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. మరో కుమారుడు భాస్కర్రెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ∙రిటైర్డ్ ఉపాధ్యాయుడు పెద్ద పుల్లారెడ్డి కుమారుడు శ్రీనివాసులురెడ్డి చెన్నైలో బాబా ఆటమిక్ రీసెర్చి సెంటర్లో సైంటిస్టుగా ఉన్నారు. మరో కుమారుడు రఘురామిరెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ∙రైతు సుబ్బరామిరెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నత ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఒక కుమారుడు శివశంకర్రెడ్డి ఎంఏ ఎంఈడీ పూర్తి చేసి లెక్చరర్గా పనిచేస్తుండగా, మరో కుమారుడు రాజశేఖర్రెడ్డి రైల్వేశాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. ఇలా పలు కుటుంబాల్లో ఇద్దరు నుండి ముగ్గురు వరకు ఉద్యోగులుగా ఉండడం గమనార్హం. వ్యవసాయమే ప్రాణం ప్రతి ఇంటా ఉద్యోగులు ఉన్నా గ్రామస్తులు వ్యవసాయాన్ని పక్కన పెట్టలేదు. ఉద్యోగిగా విధి నిర్వహణ పూర్తి కాగానే ఖాళీ సమయాల్లో పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఉల్లి, పత్తి, మిరప, కూరగాయలు ఇతర పంటలను ఇక్కడి రైతులు విరివిగా పండిస్తారు. ఊరు వాతావరణమే ఉన్నత స్థాయికి దోహదపడింది మా గ్రామ వాతావరణమే మేము ఉన్నత స్థాయికి చేరేందుకు దోహాదపడింది. మాకు చిన్న నాటి నుంచే చదువు ప్రాముఖ్యత తెలిసి వచ్చింది. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివారు. ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. – దశరథరామిరెడ్డి , (చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి), పిట్టిగుంట విద్యతోనే ఉన్నత స్థాయికి విద్యతోనే మనిషి ఉన్నత స్థాయికి చేరుకోగలడు. నేను కష్టపడి చదివాను. 2012 నుంచి చెన్నైలోని బాబా ఆటోమిక్ రీసెర్చి సెంటర్లో సైంటిస్టుగా పనిచేస్తున్నాను. – శ్రీనివాసులరెడ్డి , పిట్టిగుంట గ్రామం కష్టపడేతత్వం కలిగి ఉండాలి కష్టపడేతత్వం ఉంటే మనిషి ఏమైనా సాధించగలడు. మా గ్రామంలో చాలామంది ఉన్నత చదువులు చదివారు. నేను ఎంటెక్ పూర్తి చేశాను. ప్రిన్సిపాల్గా సేవలు అందిస్తున్నాను. – బి.వెంకట రమణారెడ్డి (ప్రిన్సిపాల్), పిట్టిగుంట ఆది నుంచి మా గ్రామస్తులది కష్టపడే మనస్తత్వం. చదువు ప్రాధాన్యత తెలుసు. అందుకే పెద్దలు మమ్మల్ని చదివించి ఉపాధ్యాయులను చేశారు. మా తర్వాత కూడా చాలా మంది ఉపాధ్యాయులయ్యారు. మా ఊరిని చూస్తే గర్వంగా ఉంది. – బి.పుల్లారెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, పిట్టిగుంట -
India: మహిళల్లో 32 శాతం మంది ఉద్యోగులు
న్యూఢిల్లీ: మన దేశంలో పెళ్లయిన మహిళల్లో, 15–49 ఏళ్ల లోపు మహిళల్లో 32 శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఏదో ఒక ఉపాధి పొందుతున్నారు. ఇదేవర్గం మహిళల్లో 83 శాతం మంది సంపాదనపరులే. 15 శాతం మందికి ఎలాంటి సంపాదన లేదు. 2019 నుంచి 2021 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5లో ఈ విషయం తేటతెల్లమయ్యింది. 15–49 ఏళ్ల మహిళల్లో గతంలో 31 శాతం మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 32 శాతానికి చేరింది. దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని సర్వే తెలిపింది. చదవండి: (తండ్రి మైనపు విగ్రహం పక్కనే.. డాక్టర్ అపూర్వతో యతీష్ వివాహం) -
నర్సరీలతో ఉపాధి... ఒక్కో నర్సరీకి రూ. 6 లక్షలు
కడప సిటీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది కొత్తగా నర్సరీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు తోడ్పాటు కల్పిస్తున్నారు. అలాగే నిర్మాణాత్మక పనులకు కూడా నిధులు కేటాయిస్తున్నారు. దీంతోపాటు నీటి సంరక్షణ పనులకు కూడా ప్రభుత్వం ఉపాధి హామీలో నిధులు కేటాయిస్తోంది. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పండ్ల తోటల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. పూర్తి ఉచితంగా సన్న, చిన్నకారు రైతులు సాగు చేసేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే 11 రకాల పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది కొత్తగా సన్న, చిన్నకారు రైతులు మరింత ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఉపాధి హామీ పథకానికి అవసరమైన మొక్కలను పెంచేందుకు నర్సరీల అవసరం ఏర్పడింది. ఈ నర్సరీలను పెంచేందుకు రైతులకే అవకాశం కల్పించారు. ఒక్కో నర్సరీకి రూ.6 లక్షలు నర్సరీ ఏర్పాటుకు ఏడాదికి రూ. 6 లక్షల నిధులు ఉపాధి హామీ పథకం నుంచి రైతులకు అందుతాయి. 50 వేల మొక్కలను సంబంధిత రైతు నర్సరీలో పెంచాల్సి ఉంటుంది. ఒక్కో మొక్కకు నెలకు రూపాయి చొప్పున కేటాయిస్తారు. దీంతో నెలకు రూ. 50 వేల ఆదాయం సమకూరుతుంది. అటవీ ఉత్పత్తులైన కానుగ, వేప, నీరుద్ది, నెమలినార, నిద్రగన్నేరు, నేరేడు, టేకు, ఎర్రచందనం, మునగ మొక్కలను పెంచాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఆరుచోట్ల నర్సరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. సిద్దవటం మండలం జేఎంజే కళాశాల ఎదురుగా ఉన్న మూలపల్లె గ్రామంలో, చెన్నూరు మండలం బయనపల్లె, కమలాపురం మండలం నసంతపురం, వీఎన్ పల్లె మండలం గోనుమాకులపల్లె గ్రామాల్లో నర్సరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అలాగే చక్రక్రాయపేట మండలం గంగారపువాండ్లపల్లె, సుండుపల్లె ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాలో ఉపాధి హామీ పథకం అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో నర్సరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రైతులకు వరం సన్న, చిన్నకారు రైతులకు మరొక వరం లాంటి అవకాశం వచ్చింది. ఆసక్తిగల రైతులు నర్సరీలు పెంచేందుకు ముందుకు రావాలని ఉపాధి హామీ అధికారులు సూచించారు. ఉపాధి హామీ పథకం కింద రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన మొక్కలను సేకరించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని రైతులకు ఇచ్చి నర్సరీల ద్వారా అటవీ జాతి మొక్కలను పెంచేందుకు అవకాశం కల్పించారు. పొలం ఉన్నా.. లేకున్నా.. సన్న, చిన్నకారు రైతులకు నర్సరీల ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. నీటి సౌకర్యం కలిగి ఉండాలి. అలాగే ఒకవేళ పొలం లేకున్నా స్థలం, నీటి సౌకర్యం ఉంటే నర్సరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆసక్తిగల రైతులు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఉపాధి సిబ్బందిని కలిసి వివరాలు తెలుసుకోవచ్చు. మొక్కలు, సంబంధిత బ్యాగులు, పొలాన్ని చదును చేయడం, స్టంప్స్ (పెద్ద కర్రలు)తోపాటు పాటిమిక్చర్ (ఎరువు, ఇసుక, ఎర్రమట్టి)ను కూడా ఉపాధి హామీ పథకం కిందనే ఉచితంగా అందజేస్తారు. నర్సరీలతో మరింత ఉపాధి రైతులకు నర్సరీల ద్వారా మరింత ఉపాధి లభించే అవకాశం ఉంది. ఒక్కో నర్సరీకి రూ. 6 లక్షల నిధులు అందుతాయి. నెలకు రూ. 50 వేలు ఆదాయం పొందవచ్చు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – యదుభూషణరెడ్డి, డ్వామా పీడీ, కడప -
పల్లె జనం పట్టణ బాట
సాక్షి, అమరావతి: పల్లె జనం పట్టణ బాట పడుతున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం గ్రామీణులు పట్టణాలకు వలస వెళ్తున్నారు. దీంతో దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల (హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్) మంత్రిత్వ శాఖ 2021–22 వార్షిక నివేదికలో వెల్లడించింది. గ్రామాల్లో విద్యా సౌకర్యాలు మెరుగుపడుతుండటంతో చదువుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. వారంతా ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్తున్నారు. చదువుకోని వారు కూడా ఉపాధిని వెదుక్కుంటూ పట్టణాలకు చేరుతున్నారు. చదువుకొని, నైపుణ్యం కలిగిన వారు ఉద్యోగాలు చేసుకొంటూ పట్టణాల పరిధిలో నివాసం ఉంటుంటే.. సాంకేతిక నైపుణ్యాలు లేని వారు ఏదో ఒక పని చేసుకొంటూ పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీంతో ఆ గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరిగి, అతి తక్కువ కాలంలోనే అవి పట్టణాల్లో అంతర్భాగమవుతున్నాయి. తద్వారా పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన బాధ్యత కూడా స్థానిక సంస్థలకు పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్రాలు అమలు చేసే వివిధ పట్టణాభివృద్ధి, నివాస పథకాలు, పట్టణ జీవనోపాధి మిషన్ వంటి కార్యక్రమాలు కూడా పట్టణీకరణకు బాటలు వేస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది. పేదరికం తగ్గుతుందనడానికి ఇదో సూచన భారతదేశంలో పట్టణీకరణ ముఖ్యమైన ప్రక్రియగా మారిందని, ఇది జాతీయ ఆర్థిక వృద్ధితో పాటు తగ్గుతున్న పేదరికానికి ముఖ్యమైన సూచనగా ఉందని ఆ నివేదిక తెలిపింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడిప్పుడే పట్టణీకరణను సంతరించుకుంటున్నాయని, దీనివల్ల పట్టణీకరణ మరింత పెరుగుతుందని అభిప్రాయపడింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాలు విస్తరిస్తాయని తెలిపింది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ఎజెండా అయిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్–2030 (ఎస్డీజీ) కూడా ఇదే అభిప్రాయాన్ని చెబుతున్నట్టు పేర్కొంది. జీడీపీలో 60 శాతం పట్టణాలదే దేశంలో 10 లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు 53కు చేరుకుంటాయని నివేదిక తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 377 మిలియన్లు (37.71 కోట్ల మంది) అంటే దేశ జనాభాలో 31.16 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2031 నాటికి ఈ సంఖ్య 60 కోట్లకు చేరుతుందని అంచనా. అంతేగాక పట్టణాలు గ్రోత్ ఇంజన్లుగా పనిచేస్తున్నాయని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతం కంటే ఎక్కవ వాటాను పట్టణ జనాభా అందిస్తుండడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. 2001లో దేశంలో 5,161 పట్టణాలు ఉండగా.. 2011 నాటికి వాటి సంఖ్య 7,933కి పెరిగిందని, 2050 నాటికి దేశ జనాభాలో 50 శాతం పట్టణాల్లోనే ఉంటుందని పేర్కొంది. కాగా భారతదేశ జనాభా 2050 నాటికి 164 కోట్లకు చేరుకుంటుందని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో అంతర్భాగమైన స్వతంత్ర జనాభా, ఆరోగ్య పరిశోధన కేంద్రం ‘ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’ (ఐహెచ్ఎంఈ) అంచనా వేసింది. ఈ లెక్కల ప్రకారం మరో 30 ఏళ్లకు భారతదేశ పట్టణ జనాభా 82 కోట్లకు చేరుకుంటుంది. పట్టణాల ముందు సవాళ్లూ ఉన్నాయ్.. వేగవంతమైన పట్టణీకరణ తాగు నీరు, పారిశుద్ధ్యం, పట్టణ రవాణా వంటి సేవలను మెరుగుపరచడం వంటి అనేక సవాళ్లను స్థానిక సంస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. దీంతో పాటు పట్టణ పేదరికాన్ని తగ్గించడం, మురికివాడల వ్యాప్తి నివారణ వంటివీ చేపట్టాల్సి ఉంటుంది. పాక్షిక పట్టణీకరణ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే ఈ తరహా సమస్యలు ఎదురవుతున్నాయి. నీటి సరఫరా, మురుగునీరు, డ్రైనేజీ నెట్వర్క్, ఘన/ద్రవ వ్యర్థాల నిర్వహణ సౌకర్యాలు, రహదారులు, ప్రజా రవాణా, వీధి దీపాలు, పాదచారుల మార్గాలు వంటి ప్రజా భద్రతా వ్యవస్థలు వంటి ప్రాథమిక సేవలు, జనాభా పెరుగుదలకు అనుగుణంగా భూమి, నివాస సౌకర్యాలు కల్పించడం సాధ్యపడటంలేదని తేల్చింది. -
ఉపాధి హామీలో రికార్డు
ఏలూరు (టూటౌన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వం ముందు చూపుతో లక్ష్యాలకు మించి పనులను కల్పించి ఉపాధి హామీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో జిల్లాలో అత్యధిక పనిదినాలు కల్పించడంతో పాటు అత్యధిక నిధులు ఖర్చు చేశారు. 170.63 లక్షల పనిదినాలు కల్పన లక్ష్యం కాగా 171.14 లక్షల పనిదినాలు కల్పించారు. మొత్తంగా రూ.653.79 కోట్లు ఖర్చు చేయగా కూలీలకు వేతనాలుగా రూ.365.89 కోట్లు అందించారు. మెటీరియల్ చెల్లింపుల కోసం రూ.287.90 కోట్లను వెచ్చించారు. 15 ఏళ్ల ఉపాధి హామీ చరిత్రలో ఇది ఆల్టైమ్ రికార్డు అని అధికారులు చెబుతున్నారు. కరోనా సెకండ్వేవ్ సమయంలో పేదలకు ఉపాధి హామీ పథకం బాసటగా నిలిచింది. 1.50 కోట్ల పనిదినాల లక్ష్యం : 2022–23లోనూ కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని అధికారులు ప్రణాళికలు రచించారు. వేసవితో పాటు ఏడాది పొడవునా పనులు చూపేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 1.50 కోట్ల పనిదినాలు కల్పించడం ద్వారా కూలీలకు వేతనాలుగా రూ.320 కోట్ల వరకూ అందించేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి హమీ నిధులతో చేపట్టారు. ఆయా పనులు వివిధ పనుల్లో ఉన్నాయి. దీంతోపాటు కొత్తగా పనులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరోనా వంటి విపత్కర సమయం లోనూ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. లక్ష్యానికి మించి.. 2021–22లో ఉపాధి హామీలో లక్ష్యానికి మించి పనులు కల్పించడంతో పాటు అత్యధికంగా కూలీలకు వేతనాలు చెల్లించారు. ఉమ్మడి జిల్లాలో 5.70 లక్షల కుటుంబాలకు చెందిన 9.99 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు 171.14 లక్షల పనిదినాలు కల్పించారు. 27,619 కుటుంబాలకు వంద రోజుల పనులు కల్పించారు. సగటున రోజుకు రూ.220.49 వేతనంగా అందించారు. అభివృద్ధికి బాటలు : ఉపాధి హామీ పథకంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం, జగనన్న లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు ఉపాధి నిధులు వెచ్చిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జగనన్న లేఅవుట్లలో రూ.124 కోట్లతో 1,318 పనులు పూర్తి చేశారు. మొక్కలు, తోటల పెంపకానికీ నిధులు అందించారు. ఇనిస్టిట్యూషన్ ప్లాంటేషన్లో భాగంగా 118 ప్రభుత్వ సంస్థల్లో 7,231 మొక్కలు నాటారు. 1,090 జలసంరక్షణ పనులు పూర్తి చేశారు. అడిగిన అందరికీ పని ఉపాధి హామీ పథకంలో అడిగిన ప్రతిఒక్కరికీ పనులు కల్పించే విధంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నాం. 2022–23లోనూ లక్ష్యానికి మించి పనులు చేపట్టేలా కృషిచేస్తున్నాం. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పరిధిలో పనులనూ సత్వరం పూర్తి చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. – డి.రాంబాబు, పీడీ, డ్వామా, ఏలూరు -
మహిళల వద్దకే ఉద్యోగాలు
పదహారు శాతం అంటే... ప్రపం చంలో ఏ దేశంతో పోల్చి చూసినా భారతదేశంలో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం అత్యల్పమనే! ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కోవిడ్కు ముందు ఈ శాతం 21గా ఉండేది. ఇందులో ఉన్న మరింత ప్రతికూలత ఏమిటంటే... ఉద్యోగాలలో మహిళల భాగస్వామ్యం ప్రాంత, వర్గ తారతమ్యం లేకుండా రెండిటిలోనూ ఒకే విధమైన అనిమిత్తతతో ఉండటం. గ్రామీణ ప్రాంతాల్లో కొంత నయం. పట్టణాల్లోనైతే ఉద్యోగ పంతం పట్టింపు లేనట్లే ఉంటుంది. ఇక సంపన్న స్థాయిలో వివాహిత మహిళల్లో 6.5 శాతం మాత్రమే ఉద్యోగాలలో కనిపిస్తుండగా ఈ శాతం అవివాహిత మహిళల్లో 15 శాతంగా ఉంది. ఈ స్వల్పశాతాలకు అనేకానేక కారణాలు దోహదం చేస్తుండవచ్చు. అందుకే దీన్నొక సమష్టి సమస్యగా చూడాలి తప్ప వ్యక్తిగత స్థాయిలో పరిష్కారానికి ప్రయత్నించలేం. ఎవరో కొంతమంది ప్రతిభావంతులైన, అవకాశాలున్న మహిళలు ఉద్యోగాలలోకి రావడం వల్ల మహిళా ఉద్యోగ భాగస్వామ్యంలో మెరుగుదల, పెరుగుదల ఏమీ కనిపించవు. సాధారణంగా ఉద్యోగ రంగంలో మహిళలు తక్కువగా కనిపించడానికి వ్యక్తిగత, సామాజిక, కుటుంబపరమైన కారణాలు అనేకం అవరోధంగా ఉంటాయి. మహిళలకు ఉద్యోగావకాశాలను, అనుకూలతలను కల్పించేందుకు పైస్థాయిలో ఎన్ని నిర్ణయాలు జరిగినప్పటికీ... పైన పేర్కొన్న అవరోధాల వల్ల వీటి ప్రభావం తక్కువగానే ఉంటుంది. మరేం చేయాలి? ‘వండర్ గర్ల్స్’ చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ పరిస్థితిని మార్చగల కొన్ని పరిష్కార మార్గాలైతే కనిపించాయి. మొదటిది, ఉద్యోగాల ఉన్నతస్థాయిలలో ఆదర్శ ప్రాయంగా వెలుగొందుతున్న మహిళల నుంచి సమాజానికి ప్రేరణను అందించడం. అంటే వారి గురించి విస్తృతంగా తెలియబరచడం. సామర్థ్యాలను నిరూపించుకుంటూ విజయ పథంలో దూసుకువెళుతున్న మహిళామణుల గురించి పాఠశాల స్థాయి బాలికలకు, బాలురకు తెలిసే అవకాశం తక్కువ. పాఠ్యాంశాలలోనే ఆ మహిళల గురించి తెలియజేయడం వల్ల పిల్లల్లో లక్ష్యాలు ఏర్పడతాయి. ఈ విషయంలో తల్లిదండ్రుల చేయూత కూడా ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థినులలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అబ్బాయిలకు మహిళపట్ల గౌరవ భావం ఏర్పడుతుంది. అమ్మాయిల్ని ఉద్యోగాలకు ప్రోత్సహించే వాతావరణం కుటుంబాలలో ప్రారంభం అవు తుంది. రెండోది, సంరక్షణ రంగంలో మౌలిక సదుపాయాలను నిర్మించడం. సంరక్షణ అనే ప్రాథమిక మూలస్తంభం మీదనే మన ఆర్థికవ్యవస్థ నిలబడి ఉంది. శిశు సంరక్షణ, వృద్ధుల సంరక్షణ అనేవి శ్రమ, ప్రయాసలతో కూడినవి కనుక ఆ రంగం సహజంగానే మహిళలపై ఆధారపడవలసి వస్తుంది. డిగ్రీ వరకు చదువుకున్నప్పటికీ నాలుగు కోట్ల మంది భారతీయ మహిళలు సంరక్షణ రంగంలోనే పనిచేస్తున్నారు. సంరక్షణ రంగం ఆధునికం అయితే... ఇతర రంగాలలో మహిళల ఉద్యోగ భాగస్వామ్యం మెరుగయ్యే అవకాశం తప్పక ఉంటుంది. మూడు, విధాన నిర్ణయాలు అనేవి స్త్రీ పురుష సమానత్వ దృక్కోణంలో మాత్రమే జరగాలి. దేశంలో మహిళల, ఆర్థిక రంగ స్థితిగతులపై సామాజిక శాస్త్రవేత్త దీపా నారాయణ్, భట్టాచార్య కలిసి ఇటీవల ఒక నివేదికను వెలువరించారు. సామాజిక అధ్యయనాలపై విస్తృత చర్చ, అవగాహన కల్పన జరగాలని ఆ నివేదికలో వారు సూచించారు. విధాన నిర్ణయాలు చేసేటప్పుడు అధికారంలో ఉన్నవారు... చర్చల్లో వెల్లడైన అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసు కోవాలని పేర్కొన్నారు. నాలుగోది, ఇంజనీరింగ్ విద్యలో ప్రస్తుతం ఉన్న లింగ వ్యత్యాసాన్ని తగ్గించేలా ఒక సమానత్వ వారధిని నిర్మించడం. పాఠశాల స్థాయిలో విద్యార్థినులు గణితం, సైన్సు సబ్జెక్టులలో ప్రతిభను కనబరుస్తున్న వాస్తవాన్ని విస్మరించకుండా... ఉన్నతస్థాయి ఇంజనీరింగ్ విద్య కోసం వారికి అవసరమైన ఆర్థిక వనరులను కల్పిస్తే సమానత్వ వారధి నిర్మాణానికి ఎంతో కాలం పట్టదు. ఐఐటీ సీట్ల కోసం లక్షల మందితో పోటీ పడాలి. తల్లిదండ్రులు లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. ఆడపిల్ల దగ్గరికి వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా ఆమెకు ఎంత ప్రతిభ ఉన్నా ఐఐటీకి వెళ్లే దారిలో వెనుకబడిపోతోంది. తనయుళ్లతో సమానంగా కూతుళ్లకూ డబ్బును ధారపోసి కోచింగ్ ఇప్పించే తల్లిదండ్రులెందరు?! అమ్మాయిని, అబ్బాయిని సమానంగా చూసినప్పుడు, చదివించినప్పుడు దీర్ఘకాలంలోనే అయినా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తప్పక కుదుట పడతాయి. ఐదు, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా పట్టణ ప్రాంత సదుపాయాలను వృద్ధి చేయడం. కార్యాలయాలు నగరానికి దూరంగా ఎక్కడో శివార్లలో ఉంటే అంత దూరం వెళ్లలేని యువతులు తమలో ఎంత నైపుణ్యం ఉన్నా దగ్గరల్లోని ఉద్యోగానికే మొగ్గు చూపుతారు. ఈ కారణంగా శివార్ల ఉద్యోగ కేంద్రాలకు నైపుణ్యాల కొరత ఏర్పడటమే కాకుండా, అక్కడికి వెళ్లలేని మహిళల సామర్థ్యాలు తక్కువ ప్రతిఫలంతో వృధా అయే ప్రమాదం ఉంటుంది. (క్లిక్: జాతీయ సంక్షోభంగా నిరుద్యోగం) ఆరు, ఉద్యోగాలకు అవసరమైన డిజిటల్ శిక్షణను పొందేందుకూ మహిళలకు భద్రమైన వాతావరణం కల్పించాలి. డిజిటల్ విద్యను నేర్పించే వారు మహిళా అధ్యాపకులై ఉండటం అత్యవసరం. పెద్ద ఎత్తున్న శిక్షణ తీసుకోవడానికి మహిళలు ముందుకు వచ్చేందుకు అవసరమైన ‘సేఫ్ డిజిటల్ స్పేస్’ను నగరాలు అందుబాటులోకి తేవాలి. (క్లిక్: ‘ఫ్యామిలీ డాక్టర్’ అవసరం) స్వీడన్ సంగీత పరిశ్రమకు ప్రసిద్ధి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గేయ రచయితలకు, ఆల్బమ్ నిర్మాతలకు నెలవు. ఆ ప్రాముఖ్యాన్ని నిలుపుకోవడం కోసం అక్కడి ప్రభుత్వం... సామాన్యులు కూడా సంగీతం వైపు ఉత్సాహంగా అడుగులు వేసేందుకు అవసరమైన సబ్సీడీలను ఇవ్వడమే కాకుండా, పాఠశాల విద్య తర్వాత సంగీత సాధనకు ఉచిత ప్రభుత్వ సంగీత పాఠశాలను నిర్మించింది. ఇక్కడ మనం స్వీడన్ను ఆదర్శంగా తీసుకోవచ్చు. ఉద్యోగ రంగానికి చేరువవడంలో భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సమస్యలకు పరిష్కారాలను అన్వేషించవచ్చు. ప్రజల్ని, ఫలితాల్ని మలిచేది వ్యవస్థే కదా! (క్లిక్: బాధ్యత అనుకుంటేనే ఫలం, ఫలితం!) - వర్ష అడుసుమిల్లి ‘వండర్ గర్ల్స్’ వ్యవస్థాపకురాలు -
జయమ్మ విజయం.. కట్టె గానుగ ద్వారా తీసిన నూనె విదేశాలకు..
‘‘ఒక చోటే ఉంటున్నాం. చేసిన పనే చేస్తున్నాం. ఎదుగూ బొదుగు లేకుండా.. గానుగెద్దు జీవితంలా గడిపేస్తున్నాం..’’ అని చాలా మందిలో ఒక అసంతృప్తి ఉంటుంది. ఆరుపదుల వయసు దాటిన జయమ్మ జీవితంకూడా గతంలో ఇదే విధంగా ఉండేది. కానీ, గానుగ చక్రం పట్టుకొని ఆరుపదుల వయసులో విజయం వైపుగా అడుగులు వేస్తోంది జయమ్మ. చదువు లేకపోయినా, వయసు కుదరకపోయినా నవతరానికీ స్ఫూర్తిగా నిలుస్తున్న కోట్ల జయమ్మ స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా, గండీడ్ మండలం, జక్లపల్లి గ్రామం. గానుగ నూనె వ్యాపారాన్ని అంచెలంచెలుగా వృద్ధి చేస్తూ తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తుంది. ఆరోగ్యదాయిని పేరుతో ప్రాచీనకాలం గానుగ నూనె ప్రాచుర్యాన్ని ఎల్లలు దాటేలా చేస్తోంది. జయమ్మది వ్యసాయ కుటుంబం. భర్త పిల్లలతో కలిసి పొలం పనులు చేసుకోవడంతో పాటు పాల ఉత్పత్తిని కొనసాగించేది. జయమ్మ నాలుగేళ్ల క్రితం రొమ్ము క్యాన్సర్బారిన పడింది. జబ్బు నుండి కోలుకునే క్రమంలో తనకు కలిగిన ఆలోచనను అమలులో పెట్టిన విధానం గురించి జయమ్మ ఇలా చెబుతుంది.. ‘‘పట్నంలో క్యాన్సర్కి చికిత్స చేయించుకున్నాను. డాక్టర్లు పదిసార్లు్ల కీమోథెరఫీ చేయాలన్నారు. ఈ సమయంలో ఓ డాక్టర్ గానుగ నూనె వాడమని, ఆహారంలో మార్పులు కూడా చేసుకోమని చెప్పాడు. దీంతో మహబూబ్నగర్లో కరెంట్ గానుగ నుండి వంట నూనెలు తెచ్చి వాడుకునేవాళ్లం. అప్పుడే వచ్చింది ఆలోచన మేమే గానుగను ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని. కరెంట్తో నడిచేది కాకుండా ఎద్దులతో తిరిగే కట్టె గానుగ గురించి వెతికాం. మైసూరులో ఉందని తెలిసి, అక్కడికెళ్లి చూశాం. అలా మూడేళ్ల క్రితం ఎద్దుల కట్టె గానుగను ఏర్పాటు చేసి, నూనె తీయడం ప్రారంభించాం. పల్లి, కొబ్బర, ఆవిసె, కుసుమ, నువ్వులతో నూనె తీయడం ప్రారంభించాం. ఏడాది పాటు శిక్షణ... గానుగ ఏర్పాటు చేసిన తర్వాత పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం వాళ్లు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో, నేను చేస్తున్న పని వివరించాను. ఎలాగైనా అందరికీ మంచి గానుగ నూనె అందించాలి అని చెప్పాను. ఏడాది పాటు నెలకు కొన్ని రోజుల చొప్పున మార్కెటింగ్ గురించి కూడా శిక్షణ ఇచ్చారు. అప్పటి వరకు మా చుట్టుపక్కల వారికే గానుగ నూనె అమ్మేదాన్ని. శిక్షణ తర్వాత మరో ఐదు గానుగలను ఏర్పాటు చేశాను. 15 లక్షల రూపాయల పెట్టుబడితో షెడ్డు నిర్మించి కట్టెగానుగలను ఏర్పాటు చేసి నూనె ఉత్పత్తి పెంచాను. ఇతర రాష్ట్రాల నుంచి... వివిధ రకాల నూనెలను గానుగ ద్వారా తీసేందుకు అవసరమైన ముడి సరుకులకు ఒరిస్సా, కర్ణాటక నుంచి కూడా తెప్పిస్తాను. ప్రతి నెల ఆరు టన్నుల పల్లీలు, రెండు టన్నుల కొబ్బరి, మూడు టన్నుల కుసుమ, రెండు టన్నుల నువ్వులు తీసుకుంటున్నాను. వీటిలో గడ్డి నువ్వులు ఒరిస్సా నుండి, కుసుమ, కొబ్బరి కర్ణాటక నుండి, పల్లీలు, నువ్వులు మహబూబ్నగర్ నుండి దిగుమతి చేసుకుని నూనె తీస్తున్నాను’ అని వివరించింది జయమ్మ. కార్యక్రమాల ఏర్పాటు... గానుగలను ఏర్పాటు చేసిన తర్వాత 4 సార్లు 170 మందికి గానుగ నూనె తయారీపై శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది జయమ్మ. వారందరికీ వసతి, భోజన సదుపాయాలను కల్పించింది. ఆరోగ్యదాయిని పేరుతో వివిధ జిల్లాల్లో కొత్తగా ఎనిమిది గానుగలను ఏర్పాటు చేసేందుకు సహకరించింది. దీంతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడ ఆరోగ్యదాయిని పేరుతో చేపడుతోంది. పాఠశాలకు వాటర్ ఫిల్టర్, పుస్తకాలు, కరెంటు సౌకర్యం కల్పించడం వంటివి కూడ చేపడుతూ జయమ్మ ఆదర్శంగా నిలుస్తుంది. ‘మరో నాలుగు గానుగలు ఏర్పాటు చేసి అమెరికాకు కూడా ఇక్కడి నూనెలు ఎగుమతి చేస్తా. కల్తీ నూనెలకు అడ్డుకట్ట వేసి స్వచ్చమైన నూనెను అందిచడమే లక్ష్యం’ అంటూ గానుగల నిర్వహణ చూడటంలో మునిగిపోయింది జయమ్మ. విదేశాలకు ఎగుమతి ‘ఇప్పుడు మా ఊరు జక్లపల్లి నుండి కట్టె గానుగ ద్వారా తీసిన నూనె విదేశాలకు కూడా ఎగమతి అవుతుంది. హైద్రాబాద్లోని ఓ సంస్థ సహకారంతో దుబాయ్, సింగపూర్, మలేషియాలకూ పంపుతున్నాం. మూడు నెలలకొకసారి దాదాపు 4 వేల లీటర్ల నూనెను ఎగుమతి చేస్తున్నాం. గానుగ తీసిన పిప్పిని పశువుల దాణాగా వాడుతున్నాం. పశువుల దాణాకు ఇక్కడ మంచి గిరాకీ ఉంది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు కొరియర్ ద్వారా స్వచ్ఛమైన కల్తీలేని నూనెను పంపుతున్నాం. మా కుటుంబ సభ్యులతో పాటు మరో 15 మంది ఈ నూనె వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నారు’ అని వివరించింది జయమ్మ. చేతి నిండా పని గానుగ ఏర్పాటైనప్పటి నుండి ఇక్కడ పనిచేస్తున్నా. అంతకు ముందు వ్యవసాయ పనులకు వెళ్లేదాన్ని. కొన్నాళ్లు పని ఉండేది. కొన్నాళ్లు ఖాళీగా ఉండేదాన్ని. ఈ గానుగలు వచ్చాక చేతి నిండా పని దొరుకుతుంది. పని కోసం వెదుకులాడే అవసరం లేకుండా పోయింది. – లక్ష్మి, జక్లపల్లి – బోయిని గోపాల్, గండీడ్, మహబూబ్నగర్, సాక్షి -
5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా...ఉపాధి బడ్జెట్!: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మనీష్ సిసోడియా శనివారం ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎనిమిదో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అంతేగాదు ఆయన 2022-23 ఏడాదికిగానూ రూ.75,800 కోట్ల బడ్జెట్ను సమర్పించారు. 2014-15లో రూ.30,940 కోట్లుగా ఉన్న బడ్జెట్ కంటే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ. ఈ ఏడాది బడ్జెట్ను 'ఉపాధి బడ్జెట్'గా సిసోడియా అభివర్ణించారు. ఈ మేరకు అసెంబ్లీలో మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ‘‘ఇది మేం ప్రవేశపెడుతున్న ఎనిమిదో బడ్జెట్. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏడు బడ్జెట్లు... ఢిల్లీ పాఠశాలలను మెరుగుపరిచాయి. అందరికీ విద్యుత్ అందుబాటులోకి వచ్చించి. పైగా మెట్రోను కూడా విస్తరించాం." అని చెప్పారు. గత ఏడేళ్లలో ఆప్ ప్రభుత్వం లక్షా 78 వేల మంది యువతకు పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించిందని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఇలా చేయడంలో విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్ సమావేశానికి పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా కూడా హాజరవ్వడం విశేషం. ఉద్యోగాలు కల్పించనున్న రంగాలు: రిటైల్ రంగం ఆహారం, పానీయాలు, లాజిస్టిక్ అండ్ సప్లై చైన్, ప్రయాణం అండ్ పర్యాటకం, వినోదం నిర్మాణం రియల్ ఎస్టేట్ పర్యావరణ హితమైన శక్తి ముఖ్యాంశాలు 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూ.69,000 కోట్లు కాగా 2022-23 బడ్జెట్ గతేడాది కంటే 9.86 శాతం ఎక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి ఇది వరుసగా ఎనిమిదో బడ్జెట్. 2022-23 బడ్జెట్ని "రోజ్గర్ బడ్జెట్" అని సిసోడియా అన్నారు. ఢిల్లీ వాసులకు హెల్త్ కార్డులు అందజేయనున్నారు. ఇది ఓటర్ ఐడీతో లింక్ చేయబడుతుంది. ఈ పథకానికి రూ.160 కోట్లు కేటాయించారు. ఇది ఢిల్లీ వాసులకు మెరుగైన ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. పర్యాటకుల సంఖ్యను పెంచే లక్ష్యంతో సిసోడియా బడ్జెట్లో 'ఢిల్లీ షాపింగ్ ఫెస్టివల్'ను సూచించారు. ఢిల్లీలోని ఈ ఐకానిక్ మార్కెట్లను తిరిగి అభివృద్ధి చేసి ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీని కోసం బడ్జెట్లో 100 కోట్లను కేటాయించారు. వచ్చే 5 ఏళ్లలో కేవలం 5 మార్కెట్లలోనే కనీసం 1.5 లక్షల కొత్త ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు షాపింగ్ ఫెస్టివల్స్ పర్యాటకుల సంఖ్యను సుమారు 4 లక్షలకు పెంచుతుంది. దీంతో హోటళ్ళు, రెస్టారెంట్లు, టూరిజం ఇతర వ్యాపారాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుడమే కాకుండా ఈ రంగాల్లో పనిచేస్తున్న 12 లక్షల మంది జీవితాలపై అనుకూలమైన ప్రభావం చూపుతుందన్నారు -
గ్రూప్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
-
కిషన్రెడ్డికి తప్ప.. తెలంగాణలో ఉద్యోగాలేవీ?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ అమలులో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ ఎ.రేవంత్రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కిషన్రెడ్డికి కేంద్ర మంత్రి పదవి తప్పితే ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. ‘ఏటా 2 కోట్ల చొప్పున మోదీ సర్కార్ ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలివ్వాలి. ఈ మేరకు తెలంగాణలో 50 లక్షల ఉద్యోగాలు రావాలి. కానీ తెలంగాణలో కిషన్రెడ్డికి మంత్రి పదవి తప్పితే ఎవరికీ ఉద్యోగం రాలేదు’అని పేర్కొన్నారు. బుధవారం కేంద్ర రవాణా, రహదారుల శాఖ పద్దులపై చర్చలో రేవంత్రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన సునిశిత విమర్శలు చేశారు. దేశంలోని నిరుపేదలకు ఇళ్లిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పినా ఇంతవరకు అది నెరవేరలేదన్నారు. దేశ వ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలు నిర్మిస్తామని చెప్పినా.. ఎక్కడా ఆ సిటీలు కనిపించడం లేదన్నారు. రహదారుల నిర్మాణం లేదు.. జాతీయ రహదారుల నిర్మాణంలో, వాటి నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రేవంత్ విమర్శించారు. భారతమాల కింద 34,800 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టినా ఇంతవరకు 7వేల కిలోమీటర్ల నిర్మాణాలు మాత్రమే పూర్తి చేశారని, మిగతా 80 శాతం నిర్మాణాలు ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్–విజయవాడ హైవే ఆరులైన్ల నిర్మాణం, హైదరాబాద్–బెంగళూర్ 8 లైన్ల నిర్మాణం, హైదరాబాద్–బీజాపూర్, హైదరాబాద్–మన్నెగూడ, మహబూబ్నగర్–చించోలి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. -
ఆర్బీఐలో భారీగా కొలువులు.. ప్రారంభ జీతమే రూ.45వేలు..
బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసుకొని.. బ్యాంక్ కొలువుల కోసం ఎదురు చూస్తున్న యువత కోసం దేశ అత్యున్నత బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 950 అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఎల్పీజీ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి. మొత్తం పోస్టుల సంఖ్య: 950. వీటిలో హైదరాబాద్ కార్యాలయానికి సంబంధించిన ఖాళీలు 40, ముంబయి కార్యాలయంలో 128 ఖాళీలు, చండీగఢ్ కార్యాలయంలో 78 ఖాళీలు, కాన్పూర్ అండ్ లక్నో కార్యాలయంలో 131 పోస్టులు, నాగ్పూర్ 56 ఖాళీలు, న్యూఢిల్లీలో 75 ఖాళీలు తదితరాలు ఉన్నాయి. క్లరికల్ స్థాయి పోస్టు ఆర్బీఐ అసిస్టెంట్.. అనేది క్లరికల్ స్థాయి పోస్ట్. ఆయా రాష్ట్ర రాజధానులలో ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో వివిధ రకాల బాధ్యతలను వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇందులో రసీదుల సేకరణ, లెడ్జర్ నిర్వాహణ, బ్యాలెన్స్ ట్యాలీ తదితర పనులను చేస్తారు. అంతేకాకుండా డేటాఎంట్రీ, రోజువారీ లావాదేవీల నమోదు, వచ్చిన ఈ–మెయిల్స్కు రిప్లై ఇవ్వడం, కరెన్సీ ఇష్యూ అండ్ సర్క్యులేషన్, వెరిఫికేషన్ ఆఫ్ బ్యాంకింగ్ డాక్యుమెంట్స్, గవర్నమెంట్స్ ట్రెజరీ పనులకు హాజరుకావడం, ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ... టీం వర్క్గా విధులను నిర్వహించాల్సి ఉంటుంది. అర్హతలు ఆర్బీఐ అసిస్టెంట్పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు డిగ్రీ పాసైతే సరిపోతుంది. దీంతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్ర /కేంద్రపాలిత ప్రాంత భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. ►వయసు: ఫిబ్రవరి 1, 2022 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనాలు ఆర్బీఐ అసిస్టెంట్స్కు మూల వేతనం రూ.20,700 వరకూ అందుతుంది. దీంతోపాటు హెచ్ఆర్ఏ, డీఏ, సీసీఏ, ట్రాన్స్పోర్ట్ తదితర అలవెన్సులను అదనంగా పొందవచ్చు. దీంతో ప్రారంభం నుంచే నెలకు రూ.45వేల వరకూ అందుకునే అవకాశం ఉంటుంది. మూడేళ్ల అనుభవం తర్వాత శాఖాపరమైన పరీక్షల ద్వారా పదోన్నతులు పొందొచ్చు. చదవండి: (రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభావం మనపై ఎంత?) ఎంపిక ప్రక్రియ ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మూడు దశల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆన్లైన్లో ఉంటాయి. ప్రిలిమ్స్లో ప్రతిభ చూపిన వారిని షార్ట్లిస్ట్ చేసి.. మెయిన్స్ నిర్వహించారు. ఈ దశను దాటితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. మెయిన్లో సాధించిన మెరిట్ ప్రకారం తుది ఎంపిక చేసి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్ పరీక్ష ఇలా ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ పద్దతిలో నిర్వహిస్తారు. మూడు విభాగాల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్–30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ–35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలకు 35 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గో వంతు మార్కులను కోత విధిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. మెయిన్ ఎగ్జామ్ ఈ పరీక్షలో ఐదు విభాగాల నుంచి 200 మార్కులకు 200 ప్రశ్నలుంటాయి. రీజనింగ్–40, ఇంగ్లిష్ లాంగ్వేజ్–40, న్యూమరికల్ ఎబిలిటీ–40, జనరల్ అవేర్నెస్–40, టెస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ల నుంచి 40 చొప్పున ప్రశ్నలను అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తారు. పరీక్ష సమయం 135 నిమిషాలు. ఎల్పీటీ మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్పీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధిత రాష్ట్రంలోని అధికారిక భాషలో నిర్వహిస్తారు. స్థానిక భాషలో ప్రావీణ్యంలేని అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అనర్హులు. సిలబస్ విశ్లేషణ ►రీజనింగ్: పజిల్– వెన్డయగ్రమ్, అనాలజీ, కోడింగ్–డీకోడింగ్, వెర్బల్ రీజనింగ్, సిరీస్, వర్డ్ ఫార్మేషన్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, బ్లడ్ రిలేషన్, నాన్–వెర్బల్ రీజనింగ్, సిలోజిం తదితర టాపిక్స్ ఉంటాయి. ►న్యూమరికల్ ఎబిలిటీ: డేటా ఇంటర్ప్రిటేషన్, నంబర్ సిరీస్, సగటులు, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, సిప్లిఫికేషన్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్, మెన్సురేషన్,స్పీడ్,డిస్టెన్స్ అండ్ టైమ్,ఎస్ఐ అండ్ సీఐ, జామెట్రీ నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ►ఇంగ్లిష్ లాంగ్వేజ్: రీడింగ్ కాంప్రహెన్షన్, ఇడియమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఎర్రర్ డైరెక్షన్, సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ►జనరల్ అవేర్నెస్: హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, స్టాటిక్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, సైన్స్, స్పొర్ట్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్, పీపుల్ ఇన్ న్యూస్, అవార్డ్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ ►కంప్యూటర్ నాలెడ్జ్: ఎంఎస్ ఆఫీస్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్ మేనేజ్మెంట్, సిస్టమ్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ, ఇంటర్నెట్ అండ్ వెబ్ ముఖ్యమైన సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ►దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 08, 2022 ►ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2022 మార్చి 26–27 ►మెయిన్ పరీక్ష: మే, 2022లో ఉంటుంది. ►వెబ్సైట్: www.rbi.org.in -
‘కేంద్ర’ ఉద్యోగాల భర్తీపై స్పష్టత: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. అధికారుల ప్రాథమిక గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 15 లక్షల ఉద్యోగ ఖాళీలున్నట్టు తెలిసిందన్నారు. ఇందులో వివిధ మంత్రిత్వ శాఖల్లో 8.72 లక్షలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో మరో 6.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాస్తవ ఖాళీల సం ఖ్యను బహిర్గతం చేసి వాటి భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని విమ ర్శించారు. ప్రస్తుత ఖాళీలను పక్కాగా ప్రక టించి వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేస్తే నిరుద్యోగులకు లాభం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల వారికి అవకాశాలు దక్కుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ప్రధాని మోదీకి ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు.