‘100 శాతం ఉద్యోగాలు కన్నడిగులకే’.. పోస్టు డిలీట్‌ చేసిన సీఎం | Karnataka CM Siddaramaiah Posts On 100% Quota Bill, Deletes Later | Sakshi
Sakshi News home page

‘గ్రూపు సీ, డీ ఉద్యోగాలన్నీ కన్నడిగులకే’.. పోస్టు డిలీట్‌ చేసిన సీఎం

Published Wed, Jul 17 2024 3:50 PM | Last Updated on Wed, Jul 17 2024 4:10 PM

Karnataka CM Siddaramaiah Posts On 100% Quota Bill, Deletes Later

ప్రైవేటు రంగంలో స్థానికులకు రిజర్వేషన్‌ తప్పనిసారి చేస్తూ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కొత్త బిల్లును ఆమోదించింది.  అయితే కేబినెట్‌ ఆమోదించిన ఈ బిల్లుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఆయన ట్వీట్‌ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరిశ్రమల్లోని గ్రూప్‌ సీ, డీ గ్రేడ్‌ ఉద్యోగాల్లో వంద శాతం కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించిందని సీఎం పేర్కొన్నారు.

కన్నడిగులు తమ రాష్ట్రంలో సంతోషంగా జీవించేందుకు అవకాశం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్ధేశ్యమని సీఎం పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగానికి వారు దూరం కాకూడదని తెలిపారు. కన్నడిగుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. అయితే పోస్టుపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో.. తరువాత ఆయన దానిని డిలీట్‌ చేశారు. అనంతరం మళ్లీ సరిచేసి ట్వీట్‌ చేశారు.

 తాజాగా దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లోని నాన్‌ మెనేజ్‌మెంట్‌ ఉద్యోగాల్లో స్థానికులకు (కన్నడిగులకు) 70 శాతం.. మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాల్లో 50 శాతం స్థానికులకు రిజర్వేషన్‌ అమలు చేయనున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌ లాడ్‌ పేర్కొన్నారు. అయితే బిల్లులో గ్రూప్‌ సీ, డీ పోస్టుల్లో మొత్తం 100 శాతం స్థానికులకే కేటాయిస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు.

అదే విధంగా ఉద్యోగానికి అర్హతలు, నైపుణ్యం ఉన్న స్థానికులు లేకపోతే.. కంపెనీలు.. ఇతర రాష్ట్రాల వారిని నియమించుకోవచ్చిని పేర్కొన్నారు. ‘ఉద్యోగానికి తగిన నైపుణ్యాలు కలిగిన కన్నడిగులలో లేకపోతే వాటిని అవుట్‌సోర్సింగ్ ఇవ్వవచ్చు.  నైపుణ్యం కలిగిన కార్మికులలను వెలికి తీసీ..స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చే చట్టం తీసుకురావడానికి  ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు. 

అయితే రాష్ట్రంలో ప్రతిభకు కొదవలేదని మంత్రి వెల్లడించారు. "కర్ణాటకలో తగినంత నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ ఉందని.. చాలా ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయన్నారు.  కన్నడిగులకు 70 శాతం పని ఇవ్వాలని తాము  కంపెనీలను  అడుగుతున్నామని ఒకవేళ ఇక్కడ తగిన  ప్రతిభ లేకపోతే బయట నుంచి తీసుకోవచ్చని అన్నారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు పారిశ్రామిక వేత్తలు తప్పుబడుతున్నారు. ఈ బిల్లు వల్ల అనేకమంది ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో  ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. కర్ణాటకలో ఐటీ సహా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో ఇక ఇతర రాష్ట్రాలవారికి ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

ఈ బిల్లు వివక్షాపూరితమైనది, తిరోగమనపూరితమైనది,  ఫాసిస్ట్ బిల్లు అంటూ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఛైర్మన్ మోహన్‌దాస్ పాయ్ ఎక్స్‌లో అన్నారు. మరోవైపు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తూనే.. స్థానికుల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌డం మంచిదే అని, కానీ నైపుణ్యం ఉన్న వారిని ఇతరులను ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎవరు స్థానికులు?
కర్ణాటకలో జన్మించినవారు.. 15 ఏళ్లుగా ఆ రాష్ట్రంలోనే నివసిస్తున్నవారు.. కన్నడ భాషలో మాట్లాడే, చదివే, రాసే నైపుణ్యం ఉండి.. రాష్ట్ర నోడల్‌ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షలో నెగ్గినవారిని స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. కన్నడం ఓ భాషగా ఉన్న ఎస్‌ఎ్‌ససీ సర్టిఫికెట్‌ను ఉద్యోగార్థులు కలిగి ఉండాలి. లేదంటే ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీ నిర్వహించే కన్నడ ప్రావీణ్య పరీక్షలో పాసవ్వాలి. అర్హతలున్న స్థానిక అభ్యర్థులు దొరక్కపోతే.. చట్ట నిబంధనల సడలింపునకు ప్రైవేటు పరిశ్రమలు, సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. తగు విచారణ తర్వాత ప్రభుత్వం సముచిత ఉత్తర్వులు జారీచేస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement