భారత టెకీలే టార్గెట్...
న్యూఢిల్లీః ఇమిగ్రేషన్ విధానాలపై అమెరికాలో ఇటీవల జరిగిన సమీక్షా భేటీలో భారతీయ కంపెనీలు, ఉద్యోగులను టార్గెట్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది. యూఎస్ టెక్నాలజీ కంపెనీలు, అక్కడి నిరుద్యోగులు, నిపుణులు హాజరైన ఈ సమావేశంలో భారత అవుట్సోర్సింగ్ కంపెనీలు ఇమిగ్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వలస పద్ధతులను అనుసరిస్తున్నారని ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. హెచ్1బీ వీసాదారులకు కంపెనీలు ఎంత చెల్లిస్తున్నాయి, వేతన వ్యత్యాసాల వివరాలపైనా కొందరు అక్కడి అధికారుల దృష్టికి తీసుకువచ్చారని, సమావేశమంతా భారత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సాగిందని చెబుతున్నారు.
ఈ వీసాలకు దరఖాస్తు చేసుకుంటున్న వారిలో చాలా మందికి అవసరమైన నైపుణ్యాలు లేవని హెచ్1బీ, ఎల్ 1 వర్కర్లను ఇంటర్వ్యూ చేసే అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. టెక్నాలజీ కంపెనీలో పనిచేసే మరో అమెరికన్ భారత ఉద్యోగులపై అసహనం వెళ్లగక్కాడు. వీసా ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, వీటికి చెక్ పెట్టేందుకు వీసా ఫీజును భారీగా పెంచాలని అమెరికాకు సలహా ఇచ్చాడు. ఇమిగ్రేషన్ విధానాలపై అత్యంత గోప్యంగా సాగే సమీక్షా సమావేశం వివరాలు బయటకు పొక్కడంపై అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.