
నిబంధనల ఉల్లంఘన, ప్రకటనల ద్వారా మోసాలకు పాల్పడుతున్న యాప్లపై శోధన దిగ్గజం గూగుల్ మరోసారి వేటు వేసింది. మొబైల్ ప్రకటన మోసాలను ఎదుర్కునే ప్రయత్నంలో గూగుల్ తన గూగుల్ ప్లే స్టోర్ నుండి వందలాది యాప్లకుచెక్ పెట్టింది. ఈ మేరకు గూగుల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ భద్రతా చర్యల్లో భాగంగా కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో దాదాపు 600 అనువర్తనాలను గూగుల్ ప్లే స్టోర్ నుండి తీసివేసామని వెల్లడించింది.
తమ ప్రకటనల మోనిటైజేషన్ ప్లాట్ఫామ్లైన గూగుల్ యాడ్మాబ్, గూగుల్ యాడ్ మేనేజర్ నుండి నిషేధించామని ప్రకటించింది. భంగపరిచే ప్రకటనల తీరును తాము అనుమతించమని కంపెనీ బ్లాగ్ పోస్ట్లో యాడ్ ట్రాఫిక్ క్వాలిటీ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ పెర్ బిజోర్కే తెలిపారు. విఘాతకరమైన ప్రకటనలతో సహా, అనవసర ట్రాఫిక్ను సృష్టిస్తున్న యాప్లను నిరోధించడంతో పాటు, వినియోగదారులు, ప్రకటనదారులకు భరోసా కల్పించేలా తమ ప్లాట్ఫాంపై తగిన విధానాలను అభివృద్ధికి, రూపకల్పనకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలలో పెట్టుబడులు పెడుతూనే వుంటామన్నారు. యూజర్ బ్రౌజర్లో ఊహించని రీతిలో ఈ ప్రకటనలు పాప్ అప్అవుతూ అంతరాయం కలిగిస్తున్నాయని తెలిపింది. వాస్తవానికి వినియోగదారు యాప్లో చురుకుగా లేనప్పుడు కూడా ఒక విధమైన విఘాతకర ప్రకటనలనుహానికరమైన డెవలపర్లు మొబైల్స్లో అందిస్తున్నారని గూగుల్ ఆరోపించింది. తొలగించిన యాప్లు 4.5 బిలియన్లకు పైగా డౌన్లోడ్ అయినట్టు తెలిపింది. ప్రధానంగా ఇంగ్లీష్ మాట్లాడే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్లు ఉన్నట్టు తెలిపింది. ఈ యాప్ల డెవలపర్లు ప్రధానంగా చైనా, హాంకాంగ్, సింగపూర్, భారతదేశంలో ఉన్నారని వివరించింది. అయితే తొలగించిన అప్లికేషన్ల వివరాలను మాత్రం గూగుల్ వెల్లడించలేదు.