
పర్వేజ్ ముషారఫ్
వాషింగ్టన్: అమెరికాపై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తీవ్రంగా మండిపడ్డారు. తమ దేశాన్ని అమెరికా అవసరానికి వాడుకోని వదిలేస్తోందని దుయ్యబట్టారు. అణు ఆయుధాల విషయంలో కూడా భారత్, పాకిస్తాన్ మధ్య పక్షపాతం చూపుతోందని ఆరోపించారు. ‘వాయిస్ ఆఫ్ అమెరికా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్తో కలిసి అమెరికా పనిచేస్తోందన్నారు. అణు కార్యక్రమాలను నియంత్రించమని చేయమని ఏ దేశం ఇండియాను అడగడంలేదని మండిపడ్డారు.
భారత్ను ఎదుర్కొనడానికే పాకిస్తాన్ అణు దేశంగా మారిందని పేర్కొన్నారు. పాక్, భారత్ మధ్య శాంతికి నరేంద్ర మోదీ కృషి చేయడం లేదని లేదని దుయ్యబట్టారు. ‘నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్ ప్రధానులు అటల్ బిహార్ వాజ్పేయి, మన్మోహన్ సింగ్లతో మాట్లాడాను. వివాదాలను పరిష్కరించడానికి వారు, నేను కృషి చేశామ’ని ముషారఫ్ వెల్లడించారు.
అమెరికా-పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎందుకు ఈ స్థాయిలో దిగజారాయని ముషారఫ్ను అడిగినపుడు ఆయన స్పందిస్తూ.. యుద్ధ కాలం నుంచి భారతదేశానికి అమెరికా బహిరంగంగానే మద్దతు పలుకుతోందన్నారు. ఇప్పుడు కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా అమెరికా తనంతట తాను భారతదేశం వైపు మొగ్గుతోందన్నారు. దీని వల్ల పాకిస్థాన్పై ప్రత్యక్ష ప్రభావం పడుతోందన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో భారతదేశం పాత్రను ఐక్యరాజ్యసమితి పరిశీలించాలని కోరారు. దేశ ద్రోహం కేసు ఎదుర్కొంటున్న ముషారఫ్ ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment