
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఐఎస్ఐ(ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్) మాజీ చీఫ్ అసద్ దురాణి రచించిన ‘ది స్పై క్రానికల్: రా, ఐఎస్ఐ అండ్ ది ఇల్యూషన్ ఆఫ్ పీస్’ పుస్తకం వివాదస్పదమవుతోంది. ఈ నెల 28న పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్క్వార్టర్స్లో హాజరు కావాల్సిందిగా పాకిస్తాన్ ఆర్మీ అసద్కు సమన్లు జరిచేసింది. పుస్తకంలో ఆయన పొందుపర్చిన విషయాలు ‘వైలెటింగ్ ది మిలటరీ కోడ్ ఆఫ్ కండక్ట్’ కిందకు వస్తాయని పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. ఈ నెల 28న జనరల్ హెడ్క్వార్టర్స్కు రావాల్సిందిగా అసద్కు గత శుక్రవారం సమన్లు జారీ చేసినట్టు వెల్లడించారు.
ఇండియాస్ రిసెర్చ్ అండ్ అనాలసీస్ వింగ్ మాజీ చీఫ్ ఏఎస్ దులట్తో కలిసి అసద్ ది స్పై క్రానికల్ పుస్తకాన్ని రచించారు. ఇద్దరు రచయితలు ఇండియా, పాకిస్తాన్కు సంబంధించిన విషయాలను చర్చిస్తున్నట్టు పుస్తకంలో పొందుపర్చారు. అయితే పుస్తకంలో పేర్కొన్న విషయాలు ఆర్మీ నిబంధనలు ఉల్లఘించేలా ఉన్నాయని పాకిస్తాన్ ఆర్మీ అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా అసద్కు సమన్లు జారీ చేసింది.
పుస్తకంలో పేర్కొన్న ముఖ్యమైన, వివాదస్పదమైన అంశాలు ఇవి.. అమెరికా బలగాలు ఉగ్రవాద సంస్థ అల్ ఖైయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ను హతమార్చెందుకు చేసిన ఆపరేషన్ పాకిస్తాన్కు తెలిసే జరిగిందని పుస్తకంలో పేర్కొన్నారు. భారత్కు చెందిన కులభుషన్ జాదవ్కు సంబంధించిన విషయాలను కూడా పేర్కొన్నారు. కశ్మీర్లో జరుగుతున్న అల్లర్లలో పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు కూడా పుస్తక సహా రచయిత అసద్ ఓ ప్రముఖ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.