
సాక్షి, సినిమా: సూపర్స్టార్ రజనీకాంత్కు నోటీసులు జారీ చేయాలని చెన్నై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే చెన్నై, షావుకార్పేటకు చెందిన సినీ ఫైనాన్సియర్ ముకున్చంద్ బోద్రా చెక్కు మోసం కేసు వ్యవహారంలో నటుడు ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజా, నటుడు రజనీకాంత్లపై చెన్నై హైకోర్టులో చాలా రోజుల కిందట పిటీషన్ దాఖలు చేశారు. అందులో తాను రజనీకాంత్ హామితో దర్శకుడు కస్తూరిరాజాకు ఫైనాన్స్ చేశాననీ, అయితే ఆయన తన వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదనీ, ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యిందనీ పేర్కొన్నారు.
అందుకు రజనీకాంత్ బాద్యత వహించాలని కోరారు. దీంతో తన నుంచి డబ్బు లాగడానికే ముకున్ చంద్బోద్రా ఆరోపణలు చేస్తున్నారని రజనీకాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో బోద్రా రజనీకాంత్పై అసత్య క్రిమినల్ కేసును జార్జ్టవున్ మేజిస్టేట్ కోర్టులో వేశారు. అయితే ఈ కేసు విచారణకు బోద్రా వరుసగా హాజరు కాలేదని మేజిస్టేట్ కోర్టు కేసును కొట్టివేసింది.
కాగా ఈ కేసును విచారించిన న్యాయమూర్తి తాను రజనీకాంత్ అభిమానినని చెప్పడంతో తనకు న్యాయం జరగదని భావించి విచారణకు హాజరు కాలేదనని చెప్పారు. తన పిటీషన్ను వేరే కోర్టుకు మార్చమని మేజిస్టేట్ కోర్టుకు విన్నవించుకున్నా నిరాకరించి పిటీషన్ను కొట్టివేశారని తెలిపారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బోద్రా చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ శుక్రవారం న్యాయమూర్తి ఎంవీ. మురళీధరన్ సమక్షంలో విచారణ వచ్చింది. ఈ కేసులో నటుడు రజనీకాంత్ బదులు పిటీషన్ దాఖలు చేయాల్సిందిగా ఆయనకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment