
సాక్షి, అమరావతి: తన తండ్రి ఎన్టీ రామారావు తీయలేకపోయిన సినిమాలను తాను పూర్తి చేస్తానని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. గురువారం ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరం విజయకీలాద్రిపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... రామానుజచార్య సినిమా త్వరలో తాను చేస్తానని ప్రకటించారు. రామానుజచార్యులు.. ఆధ్యాత్మిక గురువే కాక గొప్ప సంఘసంస్కర్త అని, వేల సంవత్సరాల క్రితమే దళితులకు సమాజంలో సరైన గౌరవం కల్పించిన వ్యక్తి అని ప్రశంసించారు. రామానుజచార్యులపై పోస్టల్ స్టాంప్ విడుదల చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. విజయకీలాద్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆయనను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.