
రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏజీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ని ఈనెల 14న (వేలంటైన్స్ డే) విడుదల చేస్తున్నారు. ‘ఇది కుటుంబ కుట్రల చిత్రం’ అనే ట్యాగ్ లైన్తో వర్మ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వటమే కాదు.. చాలామందిలో చెమటలు పుట్టిస్తోంది. ‘‘పదవులు పోయినా, ప్రాణాలు పోయినా, అయిన వారు వద్దన్నా లక్ష్మి పార్వతి చేయి వదలని ఎన్టీఆర్ ప్రేమను చూపించబోతున్నారు ఆర్జీవీ. ఎన్టీఆర్ లోలోపల ఒక నిర్వీర్యమైన ప్రేమకథను ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారాయన.
లక్ష్మి కోసం అన్నీ పణంగా పెట్టి పోరాడిన ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య అతి రహస్య బంధం ఏంటి? విడదీయరాని ఆ పవిత్ర బంధం ఎంటి?.. ఇలాంటి అంశాలు కొందరికి రుచించకపోయినా, అవి తెలుగు ప్రజల గొంతుల్లోకి దిగాల్సిన అవసరముంది. అందుకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆయన కుటుంబ సభ్యులకు, నమ్మకంగా లేని అనుచరులకు, వెన్నుపోటు పొడిచిన కుట్ర దారులకు ఈ సినిమా ముందుపోటులా ఉంటుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్లోని మంచి విషయాలే కాదు.. తన సొంత ఫ్యామిలీ వాళ్లు చేసిన చెప్పుకోలేని పనులను కూడా అడ్డుకోలేని ఎన్టీఆర్ అమాయకత్వాన్ని చూపెట్టబోతోంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: రమ్మీ, సంగీతం: కల్యాణ్ కోడూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి.