
ప్రతీకాత్మక చిత్రం
ఆగ్రా : హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్రవాహనదారులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు వింత శిక్షలను విధిస్తున్నారు. ఎన్ని ఫైన్లు విధించినా ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో మార్పురాకపోవడంతో ఆగ్రా పోలీసులు వినూత్న కార్యాచరణను రూపోందించారు. హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ వారిని, బైక్ తో సహా 500 మీటర్లు(అరకిలోమీటర్) నడవాలని సూచిస్తున్నారు. ఈ విధానంపై ఇప్పటికే పలు ప్రచార కార్యక్రమాలను చేపట్టిన పోలీసులు గత బుధవారం నుంచి అమల్లోకి తెచ్చారు.
ఈ చర్యతో వారి ఆరోగ్యం బాగుండటమే కాకుండా బైకర్స్లో మార్పు వస్తుందని, ఇది శిక్ష కాదని ఆగ్రా సీనియర్ ఎస్పీ అమిత్ పథక్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటికే హెల్మెట్ ధరించినవారికే పెట్రోల్ పోయాలని ఆదేశించిన పోలీసులు.. రోడ్డుభద్రతా ప్రమాణాలపై పాఠశాల, కాలేజీల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఆగ్రాలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ప్రమాదాలను తగ్గించేందు పోలీసులు కృషి చేస్తున్నారు.