
న్యూఢిల్లీ : కరోనా కష్టకాలంలో వైద్యులు అందిస్తున్న సేవలను హోం మంత్రి అమిత్ షా అభినందించారు. వారికి అన్ని రకాలుగా భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్తో కలిసి అమిత్ షా దేశంలోని ప్రముఖ వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఏ) ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వం వైద్యులకు మద్దతుగా ఉంటుందన్నారు. ఇలాంటి సమయాల్లో ఎలాంటి నిరసనలు చేయరాదని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరాడుతున్న సమయంలో డాక్టర్లు నిరసనలు తెలిపితే ప్రజల్లోకి చెడు సందేశం వెళ్తుందన్నారు.
కాగా, కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లపై దేశంలోని పలు చోట్ల దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అద్దె ఇళ్లలో ఉంటున్న కొందరు వైద్యులపై యజమానులు వేధింపులకు దిగుతున్నారు. అలాగే కరోనా రెడ్ జోన్లలో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిపై కూడా పోకిరిలు దాడులకు తెగబడుతున్నారు. దీంతో పలు చోట్ల డాక్టర్లపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దేశంలోని వైద్యులు అందరూ బుధవారం వైట్ కోట్ ధరించి క్యాండిల్ వెలిగించి నిరసన తెలపాలని ఐఎంఏ పిలుపునిచ్చింది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే అని పేర్కొంది. ఈ క్రమంలోనే వైద్యులకు, వైద్య సిబ్బందికి మనో ధైర్యం కలిగించేలా అమిత్ షా వారితో మాట్లాడినట్టుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment