
తమిళనాట వి‘జయ’విహారం
సాక్షి, చెన్నై: తమిళనాడులో వి‘జయ’విహారం. మొత్తం 39 లోక్సభ స్థానాలకు గానూ 37 సీట్లను గెలుచుకుని ఏఐఏడీఎంకే పార్టీ జయకేతనం ఎగరవేసింది. ఒక స్థానంలో బీజేపీ, మరో స్థానంలో పీఎంకే గెలుపొందాయి. అంటే, వచ్చే అయిదేళ్లపాటు తమిళనాడు నుంచి డీఎంకే లేదా కాంగ్రెస్ పార్టీలకు లోక్సభలో ప్రాతినిధ్యం ఉండదు. 2009 ఎన్నికల్లో డీఎంకే 18 స్థానాలు గెలుచుకోవడం గమనార్హం. ఈ విజయంతో ఏఐఏడీఎంకే లోక్సభలో బీజేపీ, కాంగ్రెస్ల తరువాత మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. రాష్ట్రంలో ఈ పార్టీ 44.4% ఓట్లను సాధించింది. ‘ఇది మునుపెన్నడూ లేని, సాటిలేని, చారిత్రాత్మక విజయం. ఎలాంటి పొత్తులు పెట్టుకోకుండా ఈ విజయం సాధించాం’ అని విజయానంతరం పార్టీ అధినేత్రి జయలలిత వ్యాఖ్యానించారు. దేశ ప్రధాని కానున్న మోడీకి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్, డీఎంకేలు పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలయ్యాయి.