
నిజమే.. కేజ్రీవాల్కు రూ.2 కోట్లు ఇచ్చాను!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్కు రెండు కోట్ల లంచం ఇచ్చారన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన పారిశ్రామికవేత్త శర్మ స్పందించాడు. తాను కేజ్రీవాల్కు రెండు కోట్లు ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే పార్టీకి విరాళంగా తాను డబ్బు ఇచ్చినట్లు గురువారం తెలిపాడు. కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీకి 2014 మార్చి నెల 31వ తేదీన డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లింపులు జరిగాయని ఈ విషయం కపిల్ మిశ్రా సహా కీలక నేతలు అందరికీ తెలుసని చెప్పారు. ఆప్ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలు అవాస్తవాలని కొట్టిపారేశాడు.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఓ పారిశ్రామికవేత్తతో రూ.2 కోట్లు లంచం తీసుకున్నారని, తనతో అందుకు తగిన ఆధారాలున్నాయని కపిల్ మిశ్రా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. డొల్ల కంపెనీల పేరుతో లంచం తీసుకున్నారని కేజ్రీవాల్పై కపిల్ మిశ్రా ఆరోపణలు చేయడం చూసి చూసి విసుగుచెంది మరోసారి పార్టీ విరాళం వివరాలను వెల్లడించాల్సి వచ్చిందన్నాడు. పొగాకు వ్యాపారం చేసే తాను ఢిల్లీ అభివృద్ధికి తోడ్పుడుతుందని భావించి ఆ సమయంలో ఆప్కు ఫండ్ ఇచ్చినట్లు శర్మ వివరించాడు.
ఆప్ సీనియర్ నేతలు అశిష్ ఖేతన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, దుర్గేష్ పాఠక్, సత్యేంద్ర జైన్ల విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను వెల్లడించాలన్న డిమాండ్తో కపిల్ మిశ్రా మే10 నుంచి ఆరు రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. కేజ్రీవాల్కు మంత్రి సత్యేంద్రజైన్ రూ.2 కోట్ల లంచం ఇచ్చారనిచ రూ.400 కోట్ల మంచినీటి ట్యాంకర్ల కుంభకోణంలోనూ దర్యాప్తు నివేదికలను కేజ్రీవాల్ తొక్కిపెట్టారని ఆరోపింస్తూ ఢిల్లీ సీఎంపై సీబీఐ, సీబీడీటీ ఆఫీసుకు నేరుగా వెళ్లి కపిల్ మిశ్రా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.