
జైపూర్: గల్వాన్ లోయ ఘర్షణలో అమరులైన 20 మంది వీరజవాన్లకు నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. రాజస్తాన్లోని ఆజ్మీర్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం అమరవీరులకు నివాళులు అర్పించేందుకు సంతాప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్న క్రమంలో ఫొటో దిగాలనే ఆత్రుతతో ఒకరి మీద మరొకరు తోసుకోవడంతో వారు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు పరస్పరం కొట్టుకోవడంతో అక్కడ ఆందోళన పరిస్థితి నెలకొంది. (మరో కాంగ్రెస్ సీనియర్ నేతకు కరోనా)
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు కార్యకర్తల మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నట్లు సమాచారం. అంతేగాక కరోనా నేపథ్యంలో కార్యకర్తలు కనీస సామాజిక దూరం కూడా పాటించకపోవడం గమనార్హం. కాగా జూన్ 15న లడక్లోని గల్వానా లోయ వద్ద చైనా దళాలతో జరిగిన ఘర్షణలో భారత సైనికులు 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో బీహార్, పంజాబ్, చత్తిస్ఘడ్, అస్సాం, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సైనికులతో పాటు తెలంగాణకు చెందిన కమాండర్ కల్నల్ సంతోష్బాబు ఉన్నారు. (కాంగ్రెస్పై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు)