
సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో కరోనా వైరస్ ప్రకంపనలు కొనసాగుతుండగా మరోవైపు ముంబైలోషాకింగ్ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ కారిడార్ లో మృతదేహాలు స్ట్రెచర్లపై పడి ఉన్నాయి. ఈ దిగ్భ్రాంతికరమైన ఫోటోను బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇదీ ముంబైలోని కేఈఎం ఆసుపత్రి అంటూ ట్వీట్ చేశారు. అయితే ఆసుపత్రిలో ఈ కారిడార్ ప్రస్తుతం వినియోగంలో వుందా లేక ఖాళీగా ఉన్న ప్రదేశమా అనేది స్పష్టతలేదు. దీనిపై ఆసుపత్రి వర్గాలు అధికారికంగా స్పందించాల్సి వుంది. (ఉబెర్ : ఇండియాలో 600 మంది తొలగింపు)
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, మహారాష్ట్రలో ఇప్పటివరకు 52,667 కోవిడ్-19 కేసులు, 1695 మరణాలు నమోదయ్యాయి. వీటిల్లో సుమారు 40 వేలకు పైగా కేసులు ఆర్థిక రాజధాని, 'డ్రీమ్స్ సిటీ' ముంబైలో నమోదైనవే. ఇక్కడ వెయ్యికి పైగా మరణాలతో దేశంలోనే భారీగా ప్రభావితమైన నగరంగా ముంబై నిలిస్తే.. రెండవదిగా ఉన్న పూణే నగరంలో 5319 మంది ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. (కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు )
కాగా గతంలో కూడా నితేష్ రాణా ఇలాంటి ఒక షాకింగ్ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కరోనా మృతదేహాల మధ్య కరోనా ఐసోలేషన్ వార్డును నిర్వహిస్తున్న తీరుపై ఆయన మండిపడిన సంగతి తెలిసిందే.
This is KEM hospital Mumbai ! pic.twitter.com/5KQQcCrYCH
— nitesh rane (@NiteshNRane) May 26, 2020