
లక్నో : తనకు లోక్సభ టికెట్ రాకపోవడం వెనుక పెద్ద కుట్ర జరిగిందని బీజేపీ దివంగత ఎంపీ హకుం సింగ్ తనయ మ్రిగాంకా సింగ్ ఆరోపించారు. బీజేపీ నినాదం బేటీ బచావో.. బేటీ పడావోను ఉటంకిస్తూ.. ‘ నన్ను ఎన్నికల బరిలో నిలవకుండా చేసేందుకు కొంతమంది కుట్ర పన్నారు. బేటీ హఠావో.. అస్థిత్వ మిటావో (కూతుళ్లను తొలగించండి.. వారి వారసత్వాన్ని పూర్తిగా తుడిచేయండి) అనే నినాదంతో సదరు వ్యక్తులు ముందుసాగుతున్నారు’ అని బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా 2018లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ హుకుం సింగ్ మరణించడంతో యూపీలోని కైరానా నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మ్రిగాంక సింగ్ను బీజేపీ ఎన్నికల బరిలో దింపగా ఆమె ఓడిపోయారు. ఎస్పీ, బీఎస్పీ మద్దతుతో పోటీ చేసిన రాష్ట్రీయ లోక్దళ్(ఆరెల్డీ) అభ్యర్థి తబస్సుం బేగం చేతిలో పరాజయం చవిచూశారు. ఈ క్రమంలో కైరానాతో పాటు గోరఖ్పూర్, ఫుల్పూర్ ఉపఎన్నికల్లో ఓటమి చెందడంతో 2014 లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మ్రిగాంకను కాదని.. 2019 ఎన్నికల్లో కైరానా నుంచి ప్రదీప్ చౌదరికి బీజేపీ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో మ్రిగాంక మంగళవారం మాట్లాడుతూ... ‘ అవును నాకు టికెట్ రాలేదు. 2018 ఉపఎన్నికల్లో బీజేపీకి 46శాతం ఓట్లు వచ్చాయి. కాబట్టి నాకు మరోసారి అవకాశం ఇస్తారని భావించాను. కానీ అలా జరగలేదు. నా తండ్రి 45 ఏళ్లుగా కైరానాలో చురుగ్గా పనిచేశారు. కానీ నేను అలాచేయలేకపోయానని బాధ పడుతున్నా. నాకు టికెట్ రావడం వెనుక కొంతమంది ప్రమేయం ఉంది అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment