
గాంధీనగర్: కరోనా లక్షణాలు ఉన్న ఓ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహా, ఇతర మంత్రులను కలిశాడు. అనంతరం కొద్దిసేపటికే అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం గుజరాత్లో చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేద్వాలా అహ్మదాబాద్లోని జమల్పూర్ ఖాదియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయన గ్యాసుద్దీన్ షైఖ్, శైలేష్ పార్మర్ అనే మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి గాంధీనగర్లోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్, హోంమంత్రి ప్రదీప్ సిన్హా జడేజా, ఇతర అధికారులు పాల్గొన్నారు. (లక్షణాలు లేకున్నా పాజిటివ్)
అనంతరం రాత్రి సమయంలో ఎమ్మెల్యే ఇమ్రాన్కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించారని అధికారులు చెప్తుండగా, మాస్కులు కూడా తీసేసి కనిపించారని పలువురు పేర్కొంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా భేటీ అవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత రెండు రోజుల నుంచి కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని సీఎంతో భేటీకి ఎలా అనుమతించారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గుజరాత్లో ఇప్పటివరకు 617 కేసులు నమోదవగా 26 మంది మృతి చెందారు. (దూరాన్నీ.. భారాన్నీ తొక్కిపడేశాడు)
Comments
Please login to add a commentAdd a comment