
ఆనందీ బెన్ పటేల్
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ స్థానంలో గుజరాత్ ఉక్కు మహిళగా పేరు గాంచిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆనందీ బెన్ పటేల్ పేరు దాదాపు ఖరారైంది.
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ స్థానంలో గుజరాత్ ఉక్కు మహిళగా పేరు గాంచిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆనందీ బెన్ పటేల్ పేరు దాదాపు ఖరారైంది. కొత్త ముఖ్యమంత్రిగా ఆమె పేరును రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వెలువడితే గుజరాత్కు ఆమే తొలి ముఖ్యమంత్రి అవుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడంతోపాటు ఆమె అనేక సహసోపేతమైన పనులు చేశారు. దాంతో ఆమెకు గుజరాత్ ఉక్కు మహిళగా పేరొచ్చింది. మోడీ ప్రధాన మంత్రి అయితే కేబినెట్లో సీనియర్ మంత్రి అయిన ఆనంది బెన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది.
గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రిగా ఆనంది బెన్ పటేల్ సమర్ధురాలని అందరి అభిప్రాయం. మంత్రిగా అపార అనుభవం కలిగిన ఆనందిబెన్ సీఎం పదవికి అర్హురాలుగా మెజార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. విద్యా, రెవెన్యూ, మహిళా, శిశు సంక్షేమ తదితర కీలక శాఖలను ఆమె సమర్థవంతంగా నిర్వహించారు. ఇటీవల కాలంలో మోడీ దేశ రాజకీయాలపై దృష్టిపెట్టడంతో రాష్ట్రంలో పరిపాలనాపరమైన కీలక బాధ్యతలను ఆమే నిర్వహించారు. మంత్రులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడంతోపాటు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అనేక మంది పోటీపడినప్పటికీ బిజెపి అధిష్టానం ఆనంది బెన్ సమర్థతను గుర్తించి సీఎం పదవికి ఎంపిక చేసింది.
గుజరాత్ మెహసాన జిల్లాలోని ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో 1941లో ఆనంది బెన్ జన్మించారు. 1965లో భర్త మఫత్ లాల్ పటేల్తో కలిసి అహ్మదాబాద్లో స్థిరపడిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అయితే చాలా కాలం క్రితం ఆమె భర్త నుంచి విడిపోయారు. ఎంఎస్సి,బిఇడి చదివి, టీచరుగా పనిచేస్తూ మోడీ ప్రోత్సాహంతో ఆమె రాజకీయాల్లో వచ్చారు. 1987లో ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. బిజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పని చేశారు. 1994లో రాజ్యసభ వెళ్లారు. 1994 నుంచి ఎమ్మెల్యేగా ఎంపికవుతూ వచ్చారు. గుజరాత్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మహిళా నేత ఆనందీ బెన్ ఒక్కరే.