
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నకాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ అధికారులు, చట్టబద్దమైన సంస్థలు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యాయని ధ్వజమెత్తింది. ఇది దేశంలోని అన్ని పార్టీలకు సిగ్గు చేటైన విషయమని మండిపడింది. వరుసగా మూడోరోజుకూ పరిస్థితి మరింత విషమంగా పరిణమించడంతో ఎన్జీటీ ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ విషయంలో పార్టీలు తమ తరువాతి తరానికి అందిస్తున్న అంశం చాలా సిగ్గు చేటైన విషయమని పేర్కొంది. డిల్లీ నగరాన్ని వణికిస్తున్న వాతావరణ కాలుష్య భూతం వ్యవహారంలో అందరి బాధ్యత ఉందంటూ మొట్టికాయలేసింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. నిబంధనలు ఉల్లంఘించినవారికి జారీ చేసిన ఛలాన్లు జారీ చేయాలని, నిర్మాణ స్థలాల్లో తక్షణమే పనులను నిలిపివేయాలని తెలిపింది. అంతేకాదు వర్షం కృత్రిమంగా హెలికాప్టర్ల ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఇంత జరుగుతున్నా బహిరంగంగా జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలు కూడా నిలువరించలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితిని చక్కదిద్దుతున్నామన్న వాగ్దానాలే తప్ప ఒరిగిందేమీ లేదని మండిపడింది. అలాగే ఢిల్లీ వాతారణ కాలుష్యంపై పొరుగు రాష్ట్రాల వైఖరిని కూడా ఎన్జీటీ తప్పుబట్టింది. ప్రస్తుత ఆందోళన కర పరిస్థితిపై మీ స్పందన ఏంటని ప్రశ్నించింది.
కాగా కాలుష్య స్థాయి ప్రమాద స్థాయిని మించి నమోదవుతోందని తాజా రిపోర్టులు వెల్లడించాయి. ఈ రోజుకూడా మరింత భయానక పరిస్థితికొనసాగనుందని హెచ్చరించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావద్దని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment