![ఉన్నతాధికారుల మౌనం భయపెడుతోంది](/styles/webp/s3/article_images/2017/09/3/41444465898_625x300.jpg.webp?itok=CSgRT7C8)
ఉన్నతాధికారుల మౌనం భయపెడుతోంది
న్యూఢిల్లీ: దేశంలో చెలరేగుతున్న మతవిద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్న రచయితలు, మేధావుల సంఖ్య పెరుగుతోంది. నయనతార సెహగల్, అశోక్ వాజ్పేయి, కె. సచ్చిదానందన్, కేరళ నవలా రచయిత్రి, ప్రముఖ కవి సారా జోసెఫ్ ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు తమ నిరసనను తెలియజేస్తున్నారు. దాద్రి హత్యోదంతంపై వారం రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడాన్ని ప్రముఖ మళయాల రచయిత్రి సారా జోసెఫ్ తప్పుబట్టారు. బాధలో ఉన్న బాధిత కుటుంబాన్ని ఓదార్చాల్సిన ప్రధాని ఒట్లను దండుకునే ప్రసంగాలు చేశారంటూ విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో కనీస హక్కులు కరువవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
మలయాళ కవి కె.సచ్చిదానందన్ అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మర్నాడే సాహు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. తాము ఏ తినాలో.. ఏం తినకూడదో నిర్ణయించుకునే శక్తి ప్రజలకే ఉండాలన్నారు. దేశంలో ప్రతిచోటా అసహనం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఏ రచయితా మౌనంగా ఉండలేడని వ్యాఖ్యానించారు. ఉన్నతాధికారుల మౌనం తనను బాగా భయపెడుతోందన్నారు. 2004లో అలహాయుద పెన్ మక్కల్ రచనకు గాను సారా జోసెఫ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి గత లోక్ సభ ఎన్నికల్లో త్రిశూల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.