
న్యూ ఇయర్ లో భారత్ కు ఇస్రో బహుమానం:ప్రధాని
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో భారత్ కు ఇస్రో బహుమతిని ఇచ్చిందని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. దేశీయ క్రయోజనిక్ ఇంజిన్ తో ఇస్రో చేపట్టిన జీ శాట్-14 ఉప గ్రహం కక్ష్యలోకి చేరడంతో అమెరికా, రష్యా,ఫ్రాన్స్, చైనా, జపాన్ ల సరసన భారత్ చేరడం గర్వంగా ఉందని ప్రధాని తెలిపారు. జీఎస్ఎల్వీ డి-5 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ట్విట్టర్లో ప్రధాని అభినందనలు తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ మరో ముందడుగు వేసిందన్నారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జిఎస్ఎల్వి(జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్)-డి5 రాకెట్ సాయంత్రం 4:18 గంటలకు నింగికెగిసింది. ఇది జిశాట్ 14వ ఉపగ్రహాన్ని తీసుకువెళ్లింది. భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో కీలక ప్రయోగం ఇది. రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లిన తరువాత శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు.
ఈ ప్రయోగాన్ని గతేడాది ఆగస్టు 19ననే చేపట్టాల్సి ఉండగా, రాకెట్ రెండో దశలో ఇంధన లీకేజీ కారణంగా ఆఖరి గంటలో వాయిదా పడింది. ఇస్రో ఇంతవరకూ ఏడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టగా రెండు మాత్రమే విజయవంతమైయ్యాయి. ఈ ప్రయోగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడంతో సంబరాలు జరుపుకున్నారు.