
పీఓకే నుంచి వలస వచ్చిన కుటుంబాలకు రూ 5.5 లక్షల పరిహారం చెల్లించనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు.
సాక్షి, న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి జమ్ము కశ్మీర్ మినహా ఇతర రాష్ట్రాలకు వలస వచ్చిన 5300 కుటుంబాలను జమ్ము కశ్మీర్ నిర్వాసితుల జాబితాలో చేర్చి వారికి రూ 5.5 లక్షల పరిహారం అందిస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజ్ కింద ఆయా కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఈ కుటుంబాలు జమ్ము కశ్మీర్ మినహా ఇతర రాష్ట్రాల్లో స్ధిరపడటంతో వారి పేర్లు నిర్వాసితుల జాబితాలో లేవని వారి పేర్లను చేర్చడం ద్వారా గతంలో జరిగిన చారిత్రక తప్పిదాన్ని తమ ప్రభుత్వం సవరిస్తోందని చెప్పుకొచ్చారు. జమ్ము కశ్మీర్ అభివృద్ధి కోసం ప్రకటించిన ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజ్ను కశ్మీర్లో పలు ప్రాజెక్టుల అమలుకు వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజ్ కింద పీఓకే నుంచి వలసవచ్చిన కుటుంబాలకు ప్రభుత్వం రూ 5.5 లక్షల పరిహారం సమకూరుస్తోంది. కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం మంత్రి జవదేకర్ ఈ విషయం వెల్లడించారు.