
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 20న ప్రారంభించే పీఎం గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకం వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు. వలస కూలీలు స్వస్ధలాలకు తరలివెళ్లిన ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పథకం కింద పెద్ద ఎత్తున ఉపాథి అవకాశాలు సమకూర్చనున్నారు. బిహార్లోని ఖగారియా జిల్లాలో ఈనెల 20న ప్రజా పనుల పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు.
లాక్డౌన్ అనంతరం వలస కూలీలు స్వస్ధలాలకు తిరిగివెళ్లిన బిహార్, జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్ధాన్లోని 116 జిల్లాల్లో ఈ పథకం కింద మొత్తం 25 పనులను చేపడతారని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 125 రోజుల్లో 50,000 కోట్ల రూపాయలతో వలస కూలీలను మమేకం చేస్తూ ఈ పనులను చేపడతారు. వలస కూలీలతో చేపట్టే ఈ పనుల ద్వారా భారీఎత్తున ప్రజా ఆస్తులు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు.