
న్యూఢిల్లీ: రైల్వేల్లో ఉద్యోగ నియామక పరీక్షలకు ఫీజును పెంచలేదని ఆ శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. గతంలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ తదితర కొన్ని వర్గాల అభ్యర్థులను ఉచితంగా పరీక్షలకు అనుమతించేవారు. జనరల్ కేటగిరీ అభ్యర్థుల నుంచి రూ.100 వసూలు చేసేవారు. అయితే ఫీజు లేకపోవడంతో చాలా మంది కేవలం దరఖాస్తు చేసి కనీసం పరీక్షకు కూడా హాజరు కావడం లేదని తాము గుర్తించామనీ, కాలక్షేపం కోసం కాకుండా నిజంగా ఉద్యోగం కోరుకునేవారే దరఖాస్తు చేసేలా చర్యలు తీసుకున్నామని గోయల్ చెప్పారు.
అందులో భాగంగానే గతంలో ఫీజు మినహాయింపు ఉన్న వర్గాల అభ్యర్థుల నుంచి ఈసారి రూ.250, జనరల్ అభ్యర్థుల నుంచి రూ.500 ఫీజు తొలుత వసూలు చేయాలని తాము నిర్ణయించామన్నారు. పరీక్షకు హాజరైన వారిలోని మినహాయింపు ఉన్న వర్గాలకు వారు కట్టిన మొత్తం ఫీజును, జనరల్ అభ్యర్థులకు రూ.400ను వెనక్కు ఇస్తామన్నారు. అందువల్ల ఇది ఫీజు పెంపు కిందకు రాదని గోయల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment