
దీదీతో బీజేడీని ముడిపెట్టడం తగదన్న ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్
భువనేశ్వర్ : గత ఏడాదిగా బీజేడీ, తృణమూల్ కాంగ్రెస్ల మధ్య ఎలాంటి సంప్రదింపులూ లేవని ఒడిషా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో రాజకీయంగా కలిసి నడవాలని తాను భావించడం లేదన్నారు. సీబీఐ వ్యవహారశైలిపై తాము ఒడిషాలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగానే వ్యాఖ్యలు చేశామని, సీబీఐ వృత్తిపరమైన విధులు నిర్వహించాలని, రాజకీయేతంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించామని ఆయన చెప్పుకొచ్చారు.
సీబీఐ తీరుపై తమ వైఖరిని తృణమూల్తో, మరో ఇతర రాజకీయ పార్టీతో ముడిపెట్టరాదని బీజేడీ పేర్కొంది. కాగా బీజేడీ ప్రకటనను ఒడిషాలో సీబీఐ పాత్ర పరిధిలో చూడాలని బీజేపీ వ్యాఖ్యానించడం గమనార్హం. సీబీఐ వ్యవహారంపై బీజేడీ చేసిన ప్రకటన నేపథ్యంలో తమ పార్టీని తృణమూల్ సహా ఇతర పార్టీలకు వత్తాసు పలికినట్టుగా చూడటం వాస్తవవిరుద్ధమని, తప్పుదారిపట్టించడమేనని బీజేడీ ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది.