
శ్రీహరికోట (సూళ్లూరుపేట)/ టీ.నగర్ (చెన్నై): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం రాత్రి 11.37 గంటలకు పీఎస్ఎల్వీ– సీ 44 (పీఎస్ఎల్వీ– డీఎల్) ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించనున్నారు.
కాగా, ఈ ఏడాది అంతరిక్షంలోకి 17 శాటిలైట్స్ను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఇస్రో ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల కోసం కొత్త పథకం రూపొందించామన్నారు. దీని ప్రకారం 8, 9 తరగతులకు వెళ్లే విద్యార్థుల్లో జిల్లాకు ముగ్గురిని ఎంపికచేసి అంతరిక్షానికి సంబంధించిన శిక్షణ అందిస్తామన్నారు.