
అరటన్ను మహిళకు సుష్మా వరం
దాదాపు అరటన్ను బరువుతో మంచానికే పరిమితమైన ఓ ఈజిప్టు మహిళకు భారత్లో చికిత్స పొందేందుకు అనుమతి లభించింది.
న్యూఢిల్లీ: దాదాపు అరటన్ను బరువుతో మంచానికే పరిమితమైన ఓ ఈజిప్టు మహిళకు భారత్లో చికిత్స పొందేందుకు అనుమతి లభించింది. ఈజిప్టులోని భారత రాయబార కార్యాలయం ఆమెకు వీసా మంజూరు చేసింది. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఉదారత వల్లే ఆమెకు ఈ వీసా దక్కింది. ఎమాన్ అహ్మద్(36) ఈజిప్టులోని అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన మహిళ. ఆమె ప్రస్తుతం 500 కేజీల బరువుంది. స్థూలకాయం కారణంగా పాఠశాలకు వెళ్లే సమయంలోనే బరువు పెరగడం ప్రారంభమైంది. దీంతో చదువు మధ్యలోనే ఆపేసింది. అయితే, ఆమెకు ముంబయిలోని వైద్యులు చికిత్స చేసేందుకు ముందుకొచ్చారు.
ఆమెకు వీసా ఇచ్చి ముంబయిలో చికిత్స పొందేందుకు అవకాశం ఇవ్వాలని బేరియాట్రిక్ సర్జన్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన సుష్మా ‘ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఆమెకు మేం తప్పకుండా సహాయం చేస్తాం’ అంటూ ట్వీట్ చేశారు. ఆ మాట ప్రకారమే మంగళవారం భారత రాయబార కార్యాలయం ఎమాన్కు వీసా మంజూరు చేసింది. దీంతో త్వరలోనే ఆమె భారత్కు వచ్చి ముంబయిలో చికిత్స పొందనుంది. ప్రస్తుతం సుష్మా స్వరాజ్ మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిందే.