
సాక్షి, వైఎస్సార్ జిల్లా : అవినీతిని ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిని ఎందుకు ప్రశ్నించడంలేదని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య నిలదీశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ వైఫల్యాలను చెప్పకుండా ప్రతిపక్ష పార్టీని విమర్శించడం ఏంటని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వైఫల్యంపై అధికార పార్టీని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ల చీకటి ఒప్పందం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు, పవన్ల మధ్యవర్తిగా లింగమనేని రమేష్ పనిచేస్తున్నారన్నారు. తన వరకు మాట్లాడుకొని 2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేయలేదని, ఈ సారి రహస్య ఒప్పందాలతో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతుందంటున్న పవన్.. కేసీఆర్ ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలు, అవినీతి అన్ని పవన్కు తెలుసనని, అయినప్పటికీ అతను ప్రశ్నించడం లేదని విమర్శించారు. మరోసారి మోసం చంద్రబాబు, పవన్లు కుట్ర చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. (జనసేన కోసం టీడీపీ అభ్యర్థుల మార్పులు!)