
సాక్షి, చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన గురువారం పెద్దూరులో తనను కలిసి మద్దతు తెలిపిన ప్రజలతో మాట్లాడారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే అత్యధికంగా బీసీలు ఉన్నారని, వారందరికీ చంద్రబాబు ఏం చేశారని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనే బీసీలకు మేలు జరుగుతుందన్నారు.
వైఎస్ఆర్సీపీ గెలుపు కుప్పం నుంచే మొదలు కావాలని, కుప్పం పార్టీ సమన్వయకర్త చంద్రమౌళికి ఓటు వేసి గెలిపిస్తే కేబినెట్లో కూర్చోబెట్టి చంద్రబాబు కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ నవరత్నాలు పేదల జీవితాల్లో వెలుగు నింపుతాయన్నారు. పాదయాత్ర అనంతరం సెప్టెంబర్లో బస్సుయాత్ర మొదలు అవుతుందని, ఆ సందర్భంగా కుప్పం వచ్చి ప్రతి మండలంలోనూ పర్యటిస్తానని ఆయన తెలిపారు.
మరోవైపు ప్రజా సంకల్పయాత్రకు పెరుగుతున్న ఆదరణ చూసి సర్కార్లో అలజడి మొదలైంది. చంద్రబాబు సొంత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజా సంకల్పయాత్రలో విశేష ఆదరణ పెరుగుతుండటంతో ప్రభుత్వం నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. డోన్ కెమెరాలను, బాడీ కెమెరాలను పెట్టి ప్రతీ అడుగును చిత్రీకరించేందుకు నిఘా ఏర్పాటు చేశారు.పాదయాత్రకు సంబంధించి ఎవరెవరు వైఎస్ జగన్ను కలుస్తున్నారనే విషయాలను తెలుసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment