
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ ఈ మూడున్నరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగుల్లో పెరిగిపోతున్న అసహనాన్ని గమనించి ప్రభుత్వం ఉత్తుత్తి నోటిఫికేషన్లతో మాయ చేస్తోందని విమర్శించారు. మఖ్దూంభవన్లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. నోటిఫికేషన్లతో ఎర చూపుతున్నారు తప్పితే ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయడం లేదని విమర్శించారు. అలాగే ఐటీ సెక్టారులో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో వెల్లడించాలన్నారు. సామాజిక తెలంగాణ, సమగ్ర అభివృద్ధి కోసం సీపీఐ చేపట్టిన పోరుబాట యాత్ర విజయవంతమైందని, ప్రజల నుంచి అనేక ఆకాంక్షలు వ్యక్తమయ్యాయని తెలిపారు.