
సాక్షి, విజయవాడ : జమ్మూ కశ్మీర్ ప్రజల్ని గత ప్రభుత్వాలు కేవలం ఓట్లు కోసం మాత్రమే వాడుకున్నాయని రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు విమర్శించారు. రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీలు కలిసివచ్చి ఆర్టికల్ 370 బిల్లు రద్దుకు సహకారం అందించడం గొప్ప విషయమని తెలిపారు. రామయ్యపట్నంలో పోర్టు నిర్మాణం విఝయంలో ఏపీ ప్రభుత్వం లిఖిత రూపంలో కేంద్రాన్ని కోరితే పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు తాను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకోకుండా, ప్రజల కోసం చాలా కష్టపడ్డానంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. గతంలో సాధ్యం కావు అని చెప్పిన విషయాలనే జగన్ ప్రభుత్వం మళ్లీ అడగడం విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు. ఎన్ఎంసీ బిల్లు విషయంలో అపోహలు వద్దని, బిల్లు విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే చర్చల ద్వారా నివృత్తి చేసుకోవచ్చని వెల్లడించారు. యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోదని జీవిఎల్ స్పష్టం చేశారు.