
హిందూపురం: వచ్చే శాసన సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 150 సీట్లు ఖాయమని, టీడీపీ 20 సీట్లకే పరిమితం కాబోతుందని హిందూపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ జోస్యం చెప్పారు. హిందూపురంలో ఇక్బాల్ విలేకరులతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ ఎందుకు నిలబెట్టుకోలేదో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసును విచారిస్తోన్న ఎన్ఐఏను చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డబ్బుతో టీడీపీ నేతలు గెలవాలని అనుకుంటున్నారని చెప్పారు.
ఏపీలో వైఎస్ జగన్ ప్రభంజనం ఉందని జాతీయ సర్వేలు చాటి చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదని తెలిపారు. చంపుతానంటూ భయపెడుతున్న బాలకృష్ణపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూపురం ప్రజల దాహార్తి తీర్చలేని అసమర్థుడు బాలకృష్ణ అని విమర్శించారు. బాలకృష్ణ పీఏల పెత్తనంతో హిందూపురం ప్రజలు విసిగిపోయారని అన్నారు. హిందూపురంలో వైఎస్సార్సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమావ్యక్తం చేశారు.