సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్కు పిల్లనిచ్చిన మామ పాకాల హరినాథరావు ఎస్టీ సర్టిఫికేట్తో ప్రభుత్వ ఉద్యోగం పొందారని, గిరిజనుడి అవకాశాలను కొల్లగొట్టిన ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై టీఆర్ఎస్ పెంపుడు నేతలు కాదు.. మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ స్పందించాలని అన్నారు.
ఎస్టీ సర్టిఫికెట్తో 35 ఏళ్ల ప్రభుత్వ సర్వీసు చేయడంతోపాటు ఇప్పుడు పెన్షన్ కూడా కేటీఆర్ మామ తీసుకుంటున్నారని చెప్పారు. ఈ విషయంలో చర్యలు తీసుకొని సీఎం కేసీఆర్ ప్రజలకు విశ్వాసం కల్పించాలని కోరారు. దీనిపై తాను ఫిర్యాదు చేసినా కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎస్టీ పేరుతో కేసీఆర్ వియ్యంకుడు ఉద్యోగాన్ని చేసింది ముమ్మాటికీ నిజమని, ట్విట్టర్ లో పలికే కేటీఆర్ కు తన మామ చేసిన మోసం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వియ్యంకుడిని కాపాడాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కోర్టులో ప్రభుత్వం బట్టలూడదీస్తామని, కాంగ్రెస్ పార్టీ దీనిని వదిలిపెట్టబోదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment