
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పరిపాలన, అభివృద్ధి వికేంద్రికరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజధాని రైతులపై వరాల జల్లు కురిపించిన వైఎస్ జగన్కు శ్రీదేవి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉండవల్లి సమక్షంలో రాజధాని రైతులు ,రైతుకూలీలు వైఎస్ జగన్ ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. రాజధాని రైతులకు సీఎం జగన్ అండగా నిలిచారని తెలిపారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో జరిగేది రాజధాని మార్పు కాదు అభివృద్ధి వికేంద్రీకరణ అని ఆమె స్పష్టం చేశారు.(‘సీఎం జగన్కు గిరిజనుల తరుపున ధన్యవాదాలు’)
గత ప్రభుత్వం రాజధాని రైతులకు రూ. 2500 పెన్షన్ ఇచ్చి మోసం చేసిందని, కానీ మా ప్రభుత్వం మాత్రం భూముల లేని రాజధాని రైతులకు ఐదువేలు పెన్షన్ ఇస్తూ వారికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో పట్టా భూముల కన్నా అసైన్డ్ భూములు కలిగిన రైతులకు ఎక్కువ అన్యాయం జరిగిందని మండిపడ్డారు. రాజధాని భూతల స్వర్గం అంటూ చంద్రబాబు ప్రజలందరిని భ్రమలోకి నెట్టారని, చివరకు అమరావతిని భ్రమరావతి చేశారని ఎద్దేవా చేశారు.
రాజధాని పేరిట వందల కోట్లు తిన్న చంద్రబాబు నాయుడు.. ఇసుక ,వరదలు, డ్రోన్ అంటూ రాద్దాంతం చేసి నేడు అమరావతితో రాజకీయ లబ్ధి కోసం తాపత్రయ పడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో రాజధాని పేరుతో లేనివి ఉన్నట్లుగా చూపి గ్రాఫిక్స్ పాలన అందించారన్నారు. చంద్రబాబు బినామీల కోసం ధర్నాలు చేస్తున్నారని, బినామీల భూములు కోసం రైతుల ముసుగులో అరాచాలకు పాల్పడుతున్నారని శ్రీదేవి మండిపడ్డారు. చంద్రబాబు సూట్లు వేసుకుని విదేశీ పర్యటనలు చేసి ఎమ్వోయూలు అంటూ హడావిడి చేశారే తప్ప ఒక్క విదేశీ పెట్టుబడి నోటును తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు.
(టీడీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ రాజీనామా)
చంద్రబాబు అసెంబ్లీలో కక్ష పూరిత చర్యలకు దిగుతున్నారని, రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అసైన్డ్ భూముల రైతులకు న్యాయం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ ఒక్కరేనని తెలిపారు. తుళ్లూరును కార్పొరేషన్ గా చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్య,వైద్యంతో పాటు ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాలు, అమ్మ ఒడి,నాడు నేడు, మధ్యాహ్న భోజనం పథకoలో నూతన మెనూ విధానాలతో సీఎం ప్రజలకు మరింత చేరువయ్యారని ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment