ఇది కూడా తెలియదా వీవీ అలియాస్‌ జేడీ..? | VV Lakshmi Narayana Submit Fake Stamp Papers to Election Commission | Sakshi
Sakshi News home page

జేడీ స్టాంప్‌

Published Wed, Apr 10 2019 1:33 PM | Last Updated on Tue, Apr 16 2019 11:49 AM

VV Lakshmi Narayana Submit Fake Stamp Papers to Election Commission - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఔను... సరిగ్గా ఊహించిందే జరుగుతోంది. ఎన్నికల ముందే జనసేన విశాఖ అభ్యర్థి జేడీ అలియాస్‌ వీవీ లక్ష్మీనారాయణ ముసుగు ఒక్కొక్కటీ తొలగిపోతోంది. తానో మేథావిలా బిల్డప్‌ ఇస్తూ బాండ్‌ పేపర్‌ హామీలంటూ హడావుడి చేసిన జేడీ యవ్వారం చూసి న్యాయ నిపుణులు నవ్వుకుంటున్నారు. చట్ట ప్రకారం చెల్లని బాండ్‌ పేపర్లను తెరపైకి తీసుకువచ్చి ప్రేలాపనలు చేయడం ఒక్క జేడీకే చెల్లిందని విమర్శిస్తున్నారు. ఎంపీ అభ్యర్ధిగా తాను ఇచ్చే హామీలు ఇవేనంటూ కొన్నింటిని పేర్కొంటూ వంద రూపాయల బాండ్‌ పేపర్‌ మీద సంతకం పెట్టి మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా చీప్‌ పబ్లిసిటీ ఎపిసోడ్‌ అంటూ ఇప్పటికే మేథావులు, విద్యావంతులు తేలిగ్గా తీసిపారేయగా..., ఇప్పుడు న్యాయవాదులు జేడీ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపరు ఎందుకు ఉపయోగిస్తారు..? అన్న చిన్న విషయంపై ఒక మాజీ సీబీఐ అధికారికి పరిజ్ఞానం లేకపోవడం ఏమిటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. మేనిఫెస్టో అమలు చేసేది ఒక్క శాసనసభకు పోటీ చేసేవారికి తప్ప, ఒక ఎంపీ చేయాల్సిన అవసరం లేదన్నది జగమెరిగిన సత్యం. మేనిఫెస్టోకు సంబంధించి చాలా వరకు అంశాలు రాష్ట్ర నాయకత్వం పరిధిలోనే ఉంటుందనేది తెలియని విషయం కాదు.. అంతేగాని ఒక ఎంపీ.. రాష్ట్ర నాయకుడు కాదు, అతను మేనిఫెస్టోను అమలు పరిచేదీ లేదు. మేనిఫెస్టోలో ఉన్న అంశాల్ని రా>ష్ట్ర నాయకులు, రాష్ట్రాన్ని పాలించే వారికి మాత్రమే అమలు చేసే అధికారం ఉంటుందన్నది చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు.

ఒక ఎంపీ అభ్యర్థి మేనిఫెస్టోకి సంబంధించి ఎటువంటి ప్రసంగాలు, సలహాలు, ప్రభుత్వం పై ఒత్తిడి చేయడం చేయకూడదన్న విషయాన్ని ఒక ఐపీఎస్‌ అధికారిగా తెలియక పోవడం విడ్డూరంగా ఉంది. విశాఖపట్నం ఎంపీగా జనసేన తరుపున పొటీ చేస్తున్న సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వి.వి.లక్ష్మీనారాయణ తాను అమలు చేసే పథకాలంటూ వంద రూపాయల నాన్‌ జ్యుడిషయల్‌ స్టాంప్‌ పేపర్‌పై తయారు చేసి చూపడం పట్ల పలు వర్గాల ప్రజలు, న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


లక్ష్మీనారాయణ బాండ్‌పేపర్‌లో జనసేన పేరులేని వైనం

సుప్రీంకోర్టు ఏం చెప్పింది..?
చాలా మంది పార్టీ సభ్యులతో సహా వ్యక్త పరిచే అభిప్రాయం ఏమిటంటే రాజకీయ పార్టీల మేనిఫెస్టో చట్టపరంగా అమలు చేయాల్సిన అవసరం లేదని మిథిలేష్‌ కుమార్‌ పాండే వెర్సస్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఆ వ్యాజ్యం దాఖలు చేసిన ఫిర్యాది.. ఒకే ఒక ఆధారంపై.. అదీ ఎలక్షన్‌ మేనిఫెస్టో తప్ప మరొక సాక్షాన్ని ఫిర్యాదులోగాని, వాదనలలో గాని వినిపించలేదు. అసలు ఫిర్యాదు ఏమిటంటే.. మేనిఫెస్టోలో సంబంధిత పొలిటికల్‌ పార్టీకి పరిపూర్ణమైన మెజారిటీ రాని పక్షంలో వేరే ఏ ఇతర పార్టీల మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదనీ,  మేనిఫెస్టోలో సూచించిన విధంగా ఆ పార్టీ ఎన్నికలకు ముందు ఏ పార్టీ మద్దతు తీసుకోకూడదు అన్నది వాజ్యం సారాంశం. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న వాఖ్యలు ఇలా ఉన్నాయి.
రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ది పీపుల్‌ యాక్ట్‌ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు అమలు చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఏ రకమైనæ హామీలు ఇవ్వాలి, ఇవ్వకూడదు అనే అధికారం కోర్టు పరిధిలో లేదు.
1982 ఆల్‌ ఇంగ్లండ్‌ లా జర్నల్‌ ప్రకారం బ్రూవేల్‌ లండన్‌ బరో కౌన్సిల్‌ వెర్సెస్‌ గ్రేటర్‌ లండన్‌ కౌన్సిల్‌ కేసులో లార్జ్‌ డెనింగ్‌ చెప్పిన విధంగా మేనిఫెస్టోలో రాజకీయ పార్టీలు ఓట్లు పొందడానికై విడుదల చేసిన మేనిఫెస్టోని ప్రధాన అజెండాగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
మేనిఫెస్టో ఒక బాండులా సంతకం చేసి, సీలు చేసి ఇచ్చినా సరే ఇది వరలో లేనివి చెప్పినా సరే, వాగ్దానాలు, గతంలో చేసిన ప్రస్తావనలు ఉన్నా అవేవీ పరిగణనలోకి రావు. ఓటర్లలో అతి తక్కువ మంది ఎన్నికల మేనిఫెస్టోలు చదువుతారు. ఎక్కువ మంది పత్రికలు, టీవీల ద్వారా వివరాలు తెలుసుకుంటారు. చాలా మందికి మేనిఫెస్టోలో విషయాలపై అవగాహన ఉండదు. ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు వెళ్లినప్పుడు మేనిఫెస్టోపై అవగాహన ఉండి ఓటు వేయరు. ఎక్కువ మంది పార్టీ పరంగానే ఓటు వేస్తారు. మేనిఫెస్టో వల్ల ఏమీ కాదన్న విషయంలో ఎలాంటి సందేహంలేదు.
చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఫలానా పార్టీకి ఓటు వేస్తారు. ఏ ఒక్కరు కూడా అభిమానానికి వ్యతిరేకంగా ఓటు వేయరు. ఏ ఒక్క రాజకీయపార్టీ కూడా ఎలాంటి శాసనాధికారానికి కట్టుబడి ఉండవు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వారు ఏ ఒక్క ప్రస్తావన, వాగ్దానమైనా ఖచ్చితంగా అవసరాన్ని బట్టి స్వీకరించాలి. మేనిఫెస్టోలో ఉన్నవాటికి కట్టుబడివున్నామని కాకుండా పార్టీ వల్ల ఏమౌతుందో, పరిస్థితులను బట్టి చెయ్యాల్సి ఉంటుంది. అది ఆచరణ యోగ్యమై నిష్పక్ష పాతంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇవీ మార్గదర్శకాలు
చట్టప్రకారం నాన్‌ జ్యుడీషల్‌ స్టాంప్‌ పేపర్‌ ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే వాడాలి.
ఏపీ స్టాంప్స్‌ యాక్ట్, ఇండియన్‌ స్టాంప్‌ యాక్ట్‌లోని క్లాజు ప్రకారం ఓటరుకి వారి హక్కుల సాధించుకునేందుకు మేనిఫెస్టోపై కోర్టుకు వెళ్లే హక్కులేదు.
ఇప్పుడు నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌ ఎలాంటి సందర్భాల్లో వినియోగిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
చట్ట ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆర్ధిక ఒప్పందాలు, పరస్పర అవగాహన ఒప్పందాలు కోర్టులో చెల్లుబాటు అయ్యే విధంగా నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపులు పనిచేస్తాయి.
ఇందులో వాది, ప్రతివాదులు, మేజర్‌ అవ్వని వారు, మానసికంగా పరిపక్వత లేనివారు, చట్టప్రకారంగా చెల్లుబాటు కానివారు, దివాలా తీసినవారు, మానసిక వికలాంగులు ఉన్నారు.
ఆర్థిక పరమైన లావాదేవీలు, నిబంధనలు ఉన్నప్పుడు మాత్రమే నాన్‌జ్యుడీషియల్‌ స్టాంపు చెల్లుబాటు అవుతుంది.
ఇద్దరు, అంతకంటే ఎక్కువమంది వ్యక్తులు పరస్పర అవగాహనతో ఒక పనిని చేయుటకుగాని, చేయకుండా ఉండేందుకు గాని, ఆర్థిక లావాదేవీలతో కూడిన ఆ లావాదేవీల విలువ రూపాయల్లో గాని, వాటిని సమానమైన గుణిజాలతో కూడినదై ఉండాలి.
ప్రస్తుతం కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, చదువుకున్న ఎంపీ అభ్యర్ధులు చేస్తున్న విధానాలతో నాన్‌ జ్యుడీయల్‌ స్టాంపుపై ఉన్న అనర్హత పై చిక్కు ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.

మీరిచ్చిన బాండ్‌లో రెండో పార్టీ ఎవరు.?
రాజకీయ నాయకులు ఇచ్చే బాండ్‌ పేపర్‌పై రెండో పార్టీ ఎవరన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎవరూ రెండో పార్టీ కాదు. ఇండియన్‌ కాంట్రాక్ట్‌ యాక్ట్‌ ప్రకారంగా పూర్తిగా అపరిచితులైన వ్యక్తులతో కాంట్రాక్ట్‌లు చేసేవి, ఇందులో ఎవరితోనైతే అగ్రిమెంట్‌ చేసుకుంటున్నామో వారి చిరునామా వివరాలు లేకపోతే ఆ ఒప్పందం చెల్లదు.
లావాదేవాలు నిమిత్తమై చెప్పిన ప్రతిఫలం ఈ కాంట్రాక్ట్‌లో ఎక్కడా ఉండదు.
ఇలాంటి సందర్భంలో రూ.100 నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌ విలువ ఎలా నిర్ణయిస్తారు.?
దీనిని సుప్రీంకోర్టులో ఒక కేసు మిథిలేష్‌ కుమార్‌ పాండే వెర్సస్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాలో చెప్పిన విధంగా ఇలాంటి  కాంట్రాక్టులు, మేనిఫెస్టోలు చెల్లనే చెల్లవు.

ఆర్థిక లావాదేవీలకే బాండ్‌ పేపర్లు
రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ది పీపుల్‌ యాక్ట్‌ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు అమలు చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఏ రకమైనæ హామీలు ఇవ్వాలి, ఇవ్వకూడదు అనే అధికారం కోర్టు పరిధిలో లేదు. నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపరు ఇద్దరు, అంతకంటే ఎక్కువమంది వ్యక్తులు పరస్పర అవగాహనతో ఒక పనిని చేయుటకుగాని, చేయకుండా ఉండేందుకు గాని, ఆర్థిక లావాదేవీలతో కూడినదై ఉండి,  ఆ లావాదేవీల విలువ రూపాయల్లో గాని, వాటిని సమానమైన గుణిజాలతో కూడినదై ఉండాలి. కానీ పార్టీలు మేనిఫెస్టోలు బాండ్‌ పేపర్‌ మీద చేయటం సరికాదు. మేనిఫెస్టో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఒక మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ ఆ పార్టీకి అనుగుణంగా మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది.  రాజకీయ పార్టీల మేనిఫెస్టో చట్టపరంగా అమలు చేయాల్సిన అవసరం లేదని మిథిలేష్‌ కుమార్‌ పాండే వెర్సస్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 
– ఎన్‌.ఎస్‌.వి.రెడ్డి, సీనియర్‌ న్యాయవాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement