
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో అత్యంత విలువైన ఆటగాళ్లలో అజింక్యా రహానే ఒకరు. కాగా, ఇటీవల కాలంలో రహానే తన ఫామ్ ను కోల్పోయి సతమవుతున్నాడు. ప్రధానంగా శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్లో రహానే తీవ్రంగా నిరాశపరిచాడు. ఇది భారత జట్టును ఇది కలవరపెడుతోంది. ఇదిలా ఉంచితే, రహానే ఫామ్పై ఇద్దరు భారత మాజీ క్రికెటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ట్విట్టర్ వేదికగా వినోద్ కాంబ్లి, ఆకాశ్ చోప్రాలు రహానే ఫామ్పై తమ మాటలకు పదునుపెట్టారు. ముఖ్యంగా లంకేయులతో మూడో టెస్టులో రహానే మూడో స్థానంలో రావడంపై వీరిమధ్య మాటల యుద్దం కొనసాగింది.
ఆకాశ్ చోప్రా: రహానే మూడో స్థానంలో రావడం నిజంగా మంచిపనే. రహానేను మూడో స్థానంలో పంపడం భారత్కు కలిసొస్తుంది. దక్షిణాఫ్రికా విమానం ఎక్కే ముందు రహానే ఈ స్థానంలో కొన్ని పరుగులైనా చేయగలడు.
వినోద్: మిస్టర్ చోప్రా, అతనెలా పరుగులు చేయగలడు? మీరు చెప్పగలరా?
వినోద్: మిస్టర్ చోప్రా, అతను పరుగులెలా చేస్తాడు? మీ దగ్గర పరిష్కారం ఉందా? నాకు చెప్పండి
వినోద్: మిస్టర్ చోప్రా శుభోదయం. నా పాత ట్వీట్కు దయచేసి బదులివ్వండి. క్రికెట్ ప్రపంచం మొత్తం దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటోంది.
ఆకాశ్: శుభోదయం. మీరు బాగున్నారని అనుకుంటున్నాను... క్రికెట్ ప్రపంచమంతా తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు మీ దగ్గర రుజువులు ఉన్నాయా?
వినోద్: ఆకాశ్ చోప్రా.. నా అసలు ప్రశ్నకు మీరింకా జవాబు ఇవ్వలేదు. అతడు ఎక్కడ, ఎలా పరుగులు చేస్తాడు?
ఆకాశ్: ఇక్కడ ట్వీట్లు చేసుకునే బదులు చర్చకు పిలుపునిచ్చి వాదన చేసుకుందాం. నా నంబర్ ఎక్కడ తీసుకోవాలో మీకు తెలుసనుకుంటా!
వినోద్: ఈ ఆకాశ్ చోప్రా ఎవరు?, క్రికెట్ గురించి అవగాహన లేదా? అతనికి దేవుని ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ..