
న్యూఢిల్లీ: ప్రపంచ వన్డే క్రికెట్లో ఏదొక రోజు 400 వ్యక్తిగత స్కోరును చూస్తామని అంటున్నాడు భారత దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్. ప్రస్తుతం క్రికెటర్లు పరిస్థితులకు తగ్గట్టు తమను మలుచుకుంటున్న తరుణంలో వన్డే క్రికెట్లో క్వాడ్రాపుల్ సెంచరీ సాధ్యమేనన్నాడు. ' నేను ఆడే రోజుల్లో ఆటకు నేటితరం ఆటకు చాలా మార్పులు వచ్చాయి. మేము ఆడే రోజుల్లో 35 బంతుల్లో సెంచరీ అనేది ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు అది సాధ్యమైంది. ఈతరం క్రికెటర్ల మైండ్సెట్లో భారీ మార్పులు కనబడటమే ఇందుకు కారణం.
ఆ క్రమంలోనే వన్డేల్లో ఇక్కడ ట్రిపుల్ సెంచరీనే కాదు.. 400 వ్యక్తిగత స్కోరును కూడా చూస్తాం. ఇక్కడ టెస్టు క్రికెట్ను ఉదాహరణగా తీసుకోండి. మా రోజుల్లో ఆట ముగిసే సమయానికి 280 పరుగుల్ని ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పడు ఆ పరుగులు 20 ఓవర్లలోనే వస్తున్నాయి. అంటే క్రికెట్ చాలా మారిపోయింది. ఏదొక రోజు 400 వ్యక్తిగత స్కోరును చూస్తాం. ఆ రోజు ఎంతో దూరంలో లేదు' అని వన్డేల్లో వ్యక్తిగత ట్రిపుల్ సెంచరీ సాధ్యమేనా? అన్న ప్రశ్నకు కపిల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. మరొకవైపు అన్ని ఫార్మాట్ల క్రికెట్లో టీమిండియా ఆధిపత్యం కనబరచడంపై కపిల్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇది భారత క్రికెట్కు శుభపరిణామంగా అభివర్ణించాడు.