ధోని పోరాడినా... | Delhi win big despite Dhoni 70 | Sakshi
Sakshi News home page

ధోని పోరాడినా...

Published Thu, Dec 24 2015 1:05 AM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

ధోని పోరాడినా... - Sakshi

ధోని పోరాడినా...

 జార్ఖండ్‌కు తప్పని ఓటమి విజయ్‌హజారే సెమీఫైనల్లో ఢిల్లీ

 బెంగళూరు:
విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో మహేంద్రసింగ్ ధోని (108 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత పోరాటం జార్ఖండ్‌ను పరాజయంనుంచి తప్పించలేకపోయింది. ఢిల్లీతో బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ 99 పరుగుల తేడాతో ఓడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 50 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది.
 
  నితీశ్ రాణా (76 బంతుల్లో 44; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా, పవన్ నేగి (16 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చివర్లో చెలరేగాడు. జార్ఖండ్ ఎక్స్‌ట్రాల రూపంలో 29 పరుగులు ఇవ్వడం విశేషం. అనంతరం జార్ఖండ్ 38 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. ధోని మినహా మిగతా ఆటగాళ్లంతా ఘోరంగా విఫలమయ్యారు. 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు దిగిన ధోని తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఇషాంత్ శర్మ వేసిన ఒకే ఓవర్లో అతను 2 సిక్సర్లు, ఫోర్ బాదాడు. అయితే ఇతర బ్యాట్స్‌మెన్‌నుంచి అతనికి సహకారం అందకపోవడంతో ఢిల్లీ సునాయాసంగా సెమీస్ చేరింది.
 
 యువరాజ్ విఫలం: సెమీస్‌కు హిమాచల్
 ఆలూరు: మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ 5 వికెట్లతో పంజాబ్‌ను ఓడించి సెమీస్‌లోకి అడుగు పెట్టింది. ముందుగా పంజాబ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. మన్‌దీప్ సింగ్ (145 బంతుల్లో 119; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా, గుర్‌కీరత్ సింగ్ (35) ఫర్వాలేదనిపించాడు. ఈ టోర్నీలో నిలకడగా రాణించి భారత జట్టుకు ఎంపికైన యువరాజ్ సింగ్ (16 బంతుల్లో 5) క్వార్టర్స్‌లో మాత్రం విఫలమయ్యాడు. అనంతరం హిమాచల్ 49.2 ఓవర్లలో 5 వికెట్లకు 266 పరుగులు చేసింది. రాబిన్ బిస్త్ (135 బంతుల్లో 109 నాటౌట్; 9 ఫోర్లు) శతకం సాధించగా, రిషి ధావన్ (41), నిఖిల్ గంగ్తా (39) అండగా నిలిచాడు. గురువారం జరిగే క్వార్టర్స్‌లో  తమిళనాడుతో యూపీ, విదర్భతో గుజరాత్ తలపడతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement