
న్యూఢిల్లీ: టీమిండియా అల్రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అతడే అత్యుత్తమ ఫీల్డర్ అని కితాబిచ్చారు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీమిండియాలో అందరు ఆటగాళ్లు ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో రాజీపడటం లేదని దీంతో ఫీల్డింగ్ ప్రమాణాలు చాలా మెరుగుపడ్డాయని తెలిపారు. అయితే ప్రస్తుతం టీమిండియాలో, అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో మంది బెస్ట్ ఫీల్డర్లు ఉన్నప్పటికీ జడేజానే అందరికంటే అత్యుత్తమని అభిప్రాయపడ్డారు. ('జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్.. ఇక్కడితో వదిలేయండి')
‘ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో రవీంద్ర జడేజానే అత్యుత్తమ ఫీల్డర్. అంతేకాకుండా అతడు జట్టుకు అవసరమైన నాణ్యమైన ఆల్రౌండర్. అవసరమైన సమయంలో బ్యాట్తో రాణించి మెప్పించగలడు.. బంతితో మాయ చేయగలడు.. అదేవిధంగా మెరుపు ఫీల్డింగ్తో మ్యాచ్ను మనవైపు తిప్పగలడు. ఇక ఔట్ఫీల్డ్, కవర్స్లో అతడిని మించిన ఫీల్డర్ మరోకరు ఉండరు. గల్లీ, స్లిప్లో అతడు ఎక్కువగా ఫీల్డింగ్ చేయడు. అయినా బ్యాట్స్మన్ కొట్టిన బంతిని ఏ ఫీల్డింగ్ పొజిషన్ నుంచైనా వికెట్లపైకి నేరుగా విసరగల సామర్థ్యం అతడికి ఉంది. ఇక క్యాచ్లు అందుకోవడంలో అతడివి సేఫ్ హ్యాండ్స్. బంతి అతడి చేయి దాటి పక్కకుపోదు. బహుశా అందుకే అనుకుంటా జడేజా బెస్ట్ పీల్డర్ అని కీర్తింపబడుతున్నాడు’ అని గంభీర్ పేర్కొన్నారు. (నా ఆట అప్పుడు మొదలవుతుంది!)