
నాలుగేళ్ల తర్వాత... నేడు హైదరాబాద్లో సైనా మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: ఐబీఎల్లో హైదరాబాద్ అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నగరానికి చెందిన స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మంగళవారం సొంత ప్రేక్షకుల నడుమ బరిలోకి దిగనుంది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగే మ్యాచ్లో హైదరాబాద్ హాట్ షాట్స్, బంగా బీట్స్ జట్లు తలపడనున్నాయి. 2009 ప్రపంచ చాంపియన్షిప్ తర్వాత సైనా ఒక మేజర్ టోర్నీలో సొంత ప్రేక్షకుల సమక్షంలో ఆడనుండటం ఇదే తొలిసారి. అందులోనూ ఒలింపిక్స్లో కాంస్యం సాధించాక సైనా మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం ఉండటంతో సహజంగానే ఎక్కువ మంది దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. మంగళవారం జరిగే మ్యాచ్ కోసం ప్రేక్షకులకు మొత్తం 2800 టికెట్లు అందుబాటులో ఉంచారు. ఇందులో శనివారంనాటికే 2600 అమ్ముడుపోగా, ఆదివారం మిగతా టికెట్లు ప్రేక్షకులు కొనేసుకున్నారు. దాంతో సైనా మ్యాచ్ చూడాలంటే ఇప్పుడు ఎవరికీ టికెట్లు అందుబాటులో లేవు.
హాట్షాట్స్ సెమీస్ హైదరాబాద్లోనే...: పాయింట్ల పట్టికలో స్థానాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ ఆడే సెమీఫైనల్ మ్యాచ్ను నగరంలోనే నిర్వహించనున్నారు. హైదరాబాద్ తొలి రెండు స్థానాల్లో నిలిస్తే... మూడు, నాలుగు స్థానాల్లో నిలచిన జట్లలో ఒక జట్టును డ్రా ద్వారా నిర్ణయించి హాట్షాట్స్తో ఆడిస్తారు. కాబట్టి నగర ప్రేక్షకులు వరుసగా రెండు రోజులు సైనా మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడొచ్చు.
హైదరాబాద్ హాట్షాట్స్ ్ఠ బంగా బీట్స్
రాత్రి గం. 8 నుంచి ఈఎస్పీఎన్లో లైవ్