![Sakshi Malik Cried During The WFI Meeting](/styles/webp/s3/article_images/2019/09/26/Sakshi-Malik.jpg.webp?itok=XpRIfqcc)
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిస ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్ మొత్తంగా ఐదు పతకాలు సాధించింది. ఇందులో ఒక రజతం, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. ఇది వరల్డ్ రెజ్లింగ్ వేదికపై భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. దీపక్ పూనియా రజతం సాధించగా, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్, రవి కుమార్, రాహుల్ అవేర్లు కాంస్యాలు సాధించారు. అయితే ఈ ప్రదర్శన భారత రెజ్లింగ్ సమాఖ్య( డబ్యూఎఫ్ఐ)కు సంతృప్తినివ్వలేదు. ఎంతోమంది భారత స్టార్ రెజర్లు కల్గి ఉన్నప్పటికీ స్వర్ణం సాధించకపోవడంపై డబ్యూఎఫ్ఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానంగా బజరంగ్ పూనియా సెమీ ఫైనల్ పోరు వివాదంగా ముగిసి అతను కాంస్యం సాధించినా దాన్ని పెద్దగా లెక్కల్లోకి తీసుకోలేదు. దీనిపై బజరంగ్ పూనియా కోచ్ షాకో బెన్టినిడిస్ను నిలదీశారు డబ్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ షరాన్ సింగ్.
బజరంగ్ పూనియా తన కాలిని సరిగా మూవ్ చేయలేకపోవడాన్ని ప్రశ్నించారు. అతని లెగ్ మూమెంట్స్ అంతంగా మాత్రంగానే ఉన్నాయని, ఇది ప్రత్యర్థికి ఈజీగా పట్టు చిక్కడానికి వీలు కల్పింస్తుందంటూ బ్రిజ్ భూషణ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతీ ఈవెంట్లోనే ఇదే తరహా తప్పిదాలు చేస్తున్నా కోచ్గా మీరు ఏమీ చేస్తున్నారని నిలదీశారు. ఇక మహిళల విభాగంలో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గ్రీకో రోమన్ కేటగిరీలో ఉన్న సాక్షిని తీర్చిదిద్దడంలో కోచ్ విఫలం కావడాన్ని బ్రిజ్ భూషణ్ నిలదీశారు. సాక్షితో పాటు కోచ్ను ‘మీరు అసలు ఇక్కడకి ఎందుకు వచ్చారు. ఈ విభాగంలో ఇక నుంచి మిమ్మల్ని పంపకూడదనే ఆలోచనలో ఉన్నాం’ అని బ్రిజ్ భూషణ్ హెచ్చరించారు. దాంతో సాక్షి మాలిక్ ఒక్కసారిగా కన్నీట పర్యంతమయ్యారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే సాక్షి మాలిక్ కన్నీళ్లు పెట్టుకోవడంతో డబ్యూఎఫ్ఐ వైఖరిపై విమర్శలు వినిపిస్తున్నాయి. రెజ్లర్లపట్ల ఇలా ప్రవర్తించడం తగదని బ్రిజ్ భూషణ్ వైఖరిని తప్పుబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment