
జింబాబ్వే సంచలన విజయం
బంగ్లాదేశ్తో టి20 సిరీస్ సమం
మిర్పూర్: బంగ్లాదేశ్తో రెండో టి20... చివరి ఓవర్లో జింబాబ్వే విజయానికి 18 పరుగులు కావాలి. తొలి బంతికే ప్రధాన బ్యాట్స్మన్ వాలర్ వెనుదిరిగాడు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నెవెల్లే మద్జివా (19 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. నాసిర్ హొస్సేన్ వేసిన తర్వాతి మూడు బంతుల్లో 6, 2, 4 పరుగులు తీసిన అతను, ఐదో బంతికి మరో భారీ సిక్సర్ బాది జింబాబ్వేకు ఈ టూర్లో తొలి విజయాన్ని అందించాడు.
జింబాబ్వే సంచలన విజయంతో సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఆదివారం షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో జింబాబ్వే మూడు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులు చేసింది. అనాముల్ హక్ (51 బంతుల్లో 47; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. పన్యాగర 3, మద్జివా, క్రీమర్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత జింబాబ్వే 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు చేసింది. వాలర్ (27 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అమిన్ హుస్సేన్కు 3 వికెట్లు దక్కాయి. వాలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.